సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 383వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదిహేడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి నేను బాబాకి సమీపంలో కట్టడాకి వెలుపల నేలమీద కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో నాకొక ఆలోచన వచ్చింది, “అరె, ఈ నశ్వరమైన శరీరం కోసం బాగా కష్టపడి కఠినమైన సొలిసిటర్ పరీక్షను ఉత్తీర్ణుడినైనా సంపాదనకోసం మళ్ళీ కష్టాలు పడాలి. ఇదంతా ఎవరికోసం? ఇతరుల్లాగా కాకుండా నా కడుపునైతే కొద్ది కష్టంతోటే నింపుకోవచ్చు. భుక్తి సహజంగానే దొరకుతుంది" అని. మరుక్షణంలో బాబా, “చేయవలసినదంతా మిగతా వారికోసమే. మనకోసం ఏమీ చేయనవసరం లేదు" అని అన్నారు.


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి

- (3వ అధ్యాయం - 22శ్లో)

బాబా శ్రీమద్భగవద్గీతలోని తృతీయ అధ్యాయం యొక్క సారాంశాన్ని ప్రకటం చేయడానికి పైన చెప్పిన శ్లోకాన్ని చెప్పారు. ఇప్పుడనిపిస్తోంది, “నా స్వార్థ భావం కంటే అర్జునుడి భావం ఎంత ఉదాత్తంగా ఉంది! అతను గీత ప్రథమ అధ్యాయంలో భగవంతునితో చెపుతాడు కదా, "ఈ రాజ్య విలాసాలతోనూ, సుఖాలతోనూ నేనేం చేయాలి? ఇదంతా ఎవరికోసం చేయాలో వారందరూ ఆచార్యులూ, సోదరులూ, పుత్రులూ, పెద్దవారూ, మామలూ, బాబాయిలూ, మనుమలే. వారు వారి ప్రాణాలపైనా, ధనంపైనా ఆశను వదులుకొని యుద్ధం కోసం నా ఎదుట నిలబడి ఉన్నారు”. (శ్లో 33, 34) అర్జునుని ఈ విచారం ఎంత గొప్పదంటే ప్రాప్తించిందంతా కేవలం తన సుఖానికి కాదు, ఇతరుల సుఖం కోసమే. రాజ్య పదవిని వదిలిపెట్టి, భిక్షతో లభించే ఆహారంపై జీవిస్తానన్న అర్జునుని వైరాగ్యమూ, పరహితాలను సాధించాలన్న అభిలాషా ఎంతటివి! అందుకే పరమాత్మ కూడా అతన్ని అనేక పేర్లతో సంబోధిస్తూ ఉండేవాడు".


“భక్తో సిమే సఖా చేతీ, మే ప్రియోసి”

ఒకనాటి మధ్యాహ్నం వేళ, "మిగతావారంతా నిత్యమూ బాబాను పూజిస్తుంటారు. కానీ నేను ఏదో ఒక శుభప్రదమైన రోజు మాత్రమే ఆయన్ను పూజిస్తున్నాను. నేను కూడా రోజూ ఎందుకు పూజించకూడదు?" అన్న ఆలోచన నా మనస్సులో మెదిలింది. దాంతో పూజాసామగ్రి తీసుకొని బాబా వద్దకు వెళ్లి ఆయనకి చందనం అద్దే సమయంలో, “ఈరోజు నేను బాబాను పూజిస్తున్నాను, ఇదెంత మంచి పని!" అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే, బాబా దేహాన్ని విడిచిన తరువాత వారున్న సమయంలో వారిని పూజించలేకపోయానన్న పశ్చాత్తాపం కలగకుండా ఉండటానికే. ఈ ఆలోచన నా మనసులోకి రాగానే బాబా నవ్వుతూ, "అరే! నేను కేవలం ఈ శరీరాన్నేనా? నేను ఎప్పటికీ ఉంటాను. నేను ఉండనన్న చింతను ఎందుకు పెట్టుకుంటావు?" అన్నారు.

బాబా అప్పుడప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకసారి నేను ఆయనకు కొద్ది దూరంలో కూర్చున్నాను. అప్పుడు ఆయన నా టోపీ మీద తాంబూలం వేశారు. అప్పుడప్పుడు అత్యంత ప్రేమపూర్వకంగా దగ్గరకు తీసుకునేవారు. కొన్నిసార్లు చెక్కిలిని గిల్లేవారు. చెప్పలేనంత ప్రేమతో ప్రసాదం ఇచ్చేవారు. అందువల్ల భక్తులకు కూడా నామీద సద్భావం ఏర్పడింది.

మొదట్లో బాబా లెండీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కట్టడాకి వెలుపల టార్పాలిన్ మీదగానీనేల మీదగానీ నేను కూర్చొని ఉండేవాడిని. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఒక 14, 15 ఏళ్ళ అమ్మాయి రంగురంగుల పూలతో పూలగుత్తిని తయారుచేసి రోజూ బాబాకు ఇచ్చేది. దాన్ని తీసుకుని వాసన చూసి బాబా వెంటనే నాకు ఇచ్చేవారు. నేను దాన్ని తీసుకుని నా బసకు వెళుతూ ఉండేవాడిని. అక్కడ ఒక 7, 8 ఏళ్ళ పిల్ల ఆ గుత్తి ఇమ్మని నన్ను అడుగుతుండేది. ఆమెకు నేను దానిని ఇస్తుండేవాడిని. ఈ విధంగా 7, 8 రోజులు జరిగిన తరువాత, "బాబా ఇచ్చిన వస్తువును నేను గౌరవించటం లేదుదాన్ని ఎవరడిగితే వారికిచ్చేస్తున్నాను. అది తప్పు. బాబా చేతినుంచి వస్తువు ఎప్పుడూ లభించదు" అన్న ఆలోచన వచ్చింది నాకు. మర్నాడు బాబా వానన చూసి ఇచ్చిన పూలగుత్తిని నేను ఆమెకివ్వకుండా ఒక డబ్బాలో పెట్టాను. అది బాబాకి నచ్చలేదనుకుంటావారు మరుసటిరోజు నుంచి పూలగుత్తి నాకివ్వటం ఆపేశారు. ఆ పూలగుత్తినీబాబాగారి విరిగిన చిలుంనూ (దాన్ని బాబా 'నా నౌరంగీ చిలుంఅనేవారు) నేను చాలారోజుల వరకూ ఆ డబ్బాలో వారి జ్ఞాపకచిహ్నంగా భద్రంగా ఉంచుకున్నాను. ఈ సంఘటనతో నేనొకటి నేర్చుకున్నాను, 'బాబా ఏ అందమైన వస్తువును ఇచ్చినా దాన్ని దాచిపెట్టుకోకూడదు. ప్రేమతో అడిగిన వారికి సందేహించకుండా ఇచ్చేయాలి' అని.

బాబాకి పూజ చేసేటప్పుడు ఆయన పాదాలకు అద్దిన చందనం అంగవస్త్రానికి చాలా అంటుకుంటుండేది. బాబా ప్రసాదంగా భావించి దాన్ని నేను నావద్ద ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే ఆ అంగవస్త్రాన్ని రాధాకృష్ణమాయి అడిగితే ఆవిడకిచ్చేశాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo