సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - నందూ మార్వాడీ


నందరామ్ మార్వారీ సంక్లేచ అలియాస్ నందూ మార్వాడీ పెద్ద భూస్వామి, వడ్డీ వ్యాపారి. అతను సున్నితమైన వ్యక్తిత్వం గలవాడు, దయగలవాడు. అతని తాతగారు రాజస్థాన్‌లోని ఖరాడే గ్రామం నుండి శిరిడీ వచ్చి స్థిరపడ్డారు. ఆ కుటుంబంలోని మగపిల్లలు బాల్యంలోనే మరణిస్తుండేవారు. అందువలన ఒకరోజు నందరామ్ అమ్మమ్మ బాబా వద్దకు వెళ్లి తన కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరింది. బాబా ఆమెకు మూడు మామిడిపండ్లు ఇచ్చారు. తరువాత ఆమెకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు.  'ఆమ్ర(మామిడిపండు) లీల' తరువాత ఆ కుటుంబంలోని మగపిల్లలందరూ సురక్షితంగా ఉన్నారు.

నందరామ్ 1866వ సంవత్సరంలో జన్మించాడు. శిరిడీలోనే పెరిగాడు. 1875లో నందరామ్ బాబాకి చేరువయ్యాడు. త్వరగానే తనలో బాబాపట్ల భక్తిప్రపత్తులు అంతకంతకూ పెరిగి ఎక్కువ సమయం బాబాతో గడుపుతుండేవాడు. నందరామ్ కుటుంబాన్ని బాబా ఎంతగానో ప్రేమించేవారు. బాబా భిక్ష తీసుకునే భాగ్యాన్ని పొందిన ఐదు ఇళ్లలో వీరి ఇల్లు ఒకటి. వీరి ఇల్లు ద్వారకామాయికి అతి సమీపంలో ఉన్నప్పటికీ, భిక్ష తీసుకునే క్రమంలో బాబా చివరిగా వీరి ఇంటికి వచ్చేవారు. నందరామ్ భార్య రాధాబాయిని బాబా "ఓ బోపిడీబాయి, భిక్షా దే!" అని పిలిచేవారు. ఆమె భిక్ష ఇవ్వడంలో ఆలస్యం చేస్తే బాబా ఆమెను తిడుతూ ద్వారకామాయికి తిరిగి వెళ్ళిపోయేవారు. ఆమెకు బాబాపట్ల పూర్ణమైన భక్తివిశ్వాసాలు ఉండేవి. బాబా తిట్లు మరోరూపంలో ఉన్న ఆశీస్సులని ఆమెకు బాగా తెలుసు. అప్పుడప్పుడు బాబా ఆమెతో పూరణ్ పోళీలు చేయమని, భోజనం(full meal) పెట్టమని అడిగేవారు. ఆమె అన్నీ తయారుచేసి, పళ్లెంలో వడ్డించి ద్వారకామాయికి తీసుకుని వెళ్ళేది. బాబా చాలా కొద్దిగా తిని, మిగతా ఆహారాన్ని అందరికీ పంచేవారు. ప్రతి దీపావళికి ఆమె ఐదు గజాల తెల్లని కాటన్ వస్త్రాన్ని తీసుకుని, బాబా కోసం కఫ్నీ కుట్టి, ఆయనకు సమర్పించేది. బాబా చాలా ఆనందంతో వెంటనే దాన్ని ధరించేవారు.

1911లో ప్లేగు చెలరేగి గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. నందరామ్ కళ్ళు కూడా జ్వరంతో ఎర్రబడ్డాయి. అతను కొంతమంది గ్రామస్థులను కలిసినప్పుడు వాళ్ళు, "జ్వరంతో మీ కళ్ళు ఎర్రబడ్డాయి, ఇది ప్లేగు వ్యాధికి మొదటి సంకేతం" అని అన్నారు. అతను ఆ మాటలు విని భయంతో వణికిపోయాడు. గ్రామస్థుల సలహాపై అతడు మారుతి ఆలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, 'తనని కాపాడమ'ని మారుతిని వేడుకున్నాడు. తరువాత శిరిడీ విడిచి రహతాకు సమీపంలో ఉన్న ఎక్రూఖా గ్రామానికి వెళ్లడం అతనికి మంచిదనిపించి గుర్రం తీసుకుని బాబా అనుమతికోసం ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా అతనితో, "నేను ఉన్నంతవరకు నిన్ను చావనివ్వను!" అని ఊదీ ఇచ్చారు. వెంటనే అతని జ్వరం తగ్గిపోయింది.

మరొకసారి ఒక భయంకరమైన అంటువ్యాధి గ్రామంలో ప్రబలింది. ఆ సమయంలో చక్కెర తీసుకోరాదని నమ్ముతారు. చక్కెర తీసుకున్న వాళ్ళు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. నందరామ్ కూడా ఆ వ్యాధి బారిన పడ్డాడు. వ్యాధి యొక్క మొదటి సంకేతాన్ని గమనించిన వెంటనే అతను నేరుగా ద్వారకామాయికి వెళ్లి, బాబా పాదాలను ఆశ్రయించాడు. బాబా తమ జేబులోంచి ఒక చక్కెర ప్యాకెట్ తీసి అతనికి ఇచ్చారు. బాబాపై అపారమైన నమ్మకంతో అతను ఆ చక్కరను ఒకేసారి తినేశాడు. మరుక్షణంలో అతను కోలుకున్నాడు.

నందరామ్‌ స్వీకరించడంలో కంటే ఇవ్వడంలో, మంచి చేయటంలో నమ్మకం కలిగి ఉండేవాడు. అతను చేసిన ఉత్తమమైన పని ఏమిటంటే, బూటీవాడాకు, ద్వారకామాయికి మధ్యనున్న భూమిని బాబాకోసం దానం చేయడం. ఈ పని దామూ అన్నా చేతులమీదుగా జరిగింది. తరువాత ఈ స్థలంలోనే సమాధి మందిర పొడిగింపు జరిగింది. అతను మారుతి, గణేశ మందిరాలను మరమ్మతులు చేయించి, నేలమీద బండలు పరిపించాడు.

నందరామ్ 1946, అక్టోబరు 13న మరణించాడు. అతని దాతృత్వాన్ని, సాంఘిక కార్యక్రమాలను అతని వారసులు కొనసాగిస్తున్నారు. అప్పట్లో నందరామ్ ఇల్లు ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక వాణిజ్య సముదాయం ఉంది. ద్వారకామాయి ఎదురుగా ఉన్న ఆ భవనాన్ని, దానిపై నందూ మార్వాడీ అన్న పేరును భక్తులు గమనించవచ్చు.

(ఈ వివరాలు నందరామ్ మనుమడు దిలీప్ సంక్లేచ రచయితతో పంచుకున్నారు).

సమాప్తం.

 Source: Ambrosia in Shirdi & Baba’s Gurukul by Sai Bhakta Vinny Chitluri 

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo