1915వ సంవత్సరంలో అబ్దుల్ ఖాదిర్ అనే అతను శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడొకరోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్, "నాకు సన్యాసి కావాలని ఉంది. నాకు 'సన్యాసం' (ఫకీరీ)' ఇవ్వండి" అని బాబాను అర్థించాడు. పిడికిలిలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిలిని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏదీ ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోను, ప్రవర్తనలోను మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ నైతిక సలహాలిచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థంకాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు, రాళ్ళతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. అతని ప్రవర్తన వలన అతని సంబంధీకులు విసుగుచెంది అతన్ని అసహ్యించుకోసాగారు. బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో ఒకటిన్నర నెల గడిపాక ఒకరోజు అబ్దుల్ ఖాదిర్ మసీదు మంటపం దగ్గర ఉన్నప్పుడు బాబా ఎదురుపడి, "లావ్ బలే ఇదర్” అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు శిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కి వెళ్ళి అక్కడ బాబాజాన్ సమాధి ఉన్న వేపచెట్టు ఎదురుగా బీడీకొట్టు పెట్టుకుని జీవనం సాగించాడు.
అబ్దుల్ ఖాదిర్ మదర్ఆలీకి గురువు. మదర్ఆలీ ఒక ఖాజా. అతను అప్పట్లో శిరిడీలో ఉండేవాడు. తరువాత కాలంలో అతడు ఏవలాలో ఉన్నాడు. అబ్దుల్ ఖాదిర్ ఇతర మహమ్మదీయులతో కలిసి ‘నమాజ్’, ‘అజర్’ చేసేవాడు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలూ నిర్వహించబడేది. ఉదయం వేళల్లో తబలా, సారంగీ మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపంలో 'తబోత్' నిర్మించమని ఆదేశించి, దాని నిర్మాణానికి అవసరమైన డబ్బులు కూడా ఇచ్చారు బాబా. తబోత్ నిర్మాణ సమయంలో మాంసం, కిచిడీ తయారుచేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తరువాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా 'ఫత్యా' చదవడంగానీ, ఇతరులచే చదివించడంగానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు, ముస్లింలందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికీ కొనసాగుతోంది. బాబా కూడా వారితో కలసి నమాజు చేసేవారు. “బాబా ధుని దగ్గర నిలుచుని నమాజు చేయడం స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరులవలె మోకాళ్ళపై కూర్చోవడంగానీ, వంగడంగానీ చేసేవారు కాదు” అని ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పాడు.
మహమ్మద్ ఖాన్
నేవాసాకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా శిరిడీ వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెరవెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు ఇతడు తెర ఎత్తి లోపలికి చూశాడు. ఆశ్చర్యమేమిటంటే, అతనికి బాబా కనిపించలేదు. అంతటితో అతనికి మతి చలించి వింతగా ప్రవర్తించసాగాడు. అతనిని తీసుకుని వెళ్ళటానికి నేవాసా నుండి అతని తమ్ముడు శిరిడీ వచ్చాడు. బాబా అతనికి ఊదీ ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు.
నూరుద్దీన్
ఒకసారి నూరుద్దీన్ అనే సైనికదళానికి చెందిన ఒక అశ్వసైనికుడు శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. వెంటనే తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరాడు. బాబా వెంటనే వెళ్లేందుకు అనుమతించక, "మరుసటిరోజు వెళ్ళమ"ని చెప్పారు. అందుకతను ‘తన దళం ముందుకు వెళ్తున్నందున తానక్కడ ఆగలేన’ని చెప్పాడు. బాబా అతని చేతిలో ఊదీ పెట్టి ఉర్దూలో ఏవో మాటలు అన్నారు. వాటి అర్థం ఏమంటే "గొయ్యి త్రవ్వు - ఊదీ తిను!” అని. అతను ఊదీ తీసుకుని గుర్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపర్గాఁవ్ వద్ద అతనికి శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యమొకటి కనిపించింది. అతను తన గమ్యం చేరుకున్నాడు. కానీ ఆ శవదృశ్యం మాత్రం అతనిని వీడిపోలేదు. ఆ శవదృశ్యం కనపడినరోజు అతను తృప్తిగా భోంచేసేవాడు. ఆ దృశ్యం కనపడనిరోజు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల భోజనం చేయలేకపోయేవాడు. దీనితో విసిగిపోయిన అతను తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. బాబా మాటలు విననందుకే తనకు ఈ దుస్థితి ప్రాప్తించిందని తెలుసుకుని తిరిగి శిరిడీ చేరి ఆరునెలల పాటు అక్కడ గడిపాడు. క్రమేణా అతను ఆ శాపం నుండి విముక్తుడయ్యాడు. తరువాత బాబా అనుజ్ఞ తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత అతను దెవ్లాలిలో కిరాణాకొట్టు నడుపుకుంటూ జీవనం సాగించాడు.
షేక్ అబ్దుల్లా
బాబా నాకు తెలిసిన ఇద్దరు మహమ్మదీయుల ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడ్డారు. వజాపూర్కి చెందిన షేక్ అబ్దుల్లా శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనితో వైరాగ్యంగా మాట్లాడుతూ, “మనం ఈరోజు చనిపోయినా, ఎల్లుండికి మూడవరోజు! ఇల్లు, భూములు, ఆస్తుల వల్ల మనకేమి ఉపయోగం?” అన్నారు. అబ్దుల్లా తిరిగి స్వగ్రామానికి వెళ్లి ఇంటిని, ఆస్తిని భార్యాబిడ్డలకి అప్పగించి విరాగియై వీధుల వెంబడి తిరగడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు సమాధుల వద్ద ఏదో గొణుగుకుంటూ గడిపేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదంటే ఆహార విషయం పట్టించుకోక పస్తుండేవాడు. ఈ విధంగా 10-12 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మరణించాడు. ఆ 12 సంవత్సరాలలో అతనికి అద్భుతశక్తులు ప్రాప్తించాయి. ఒకసారి ఇమాంభాయ్ చోటేఖాన్ పనిమీద వెళుతుంటే అబ్దుల్ అతన్ని ఆపి ఒక ప్రదేశం పేరు చెప్పి, ఆ ప్రదేశంలో పాముందని హెచ్చరించాడు. వెళుతున్నది పగటిపూటే కాబట్టి చోటేఖాన్ అతని మాటలు లక్ష్యపెట్టకుండా వెళ్ళాడు. కానీ చిత్రంగా అతను చెప్పిన ప్రదేశంలోనే పాము కనిపించింది. ఆ ఊరిలో అబ్బాస్ సేఠ్ అనే బీడీ వర్తకుడు ఒకడుండేవాడు. అతనొకసారి అబ్దుల్లాను, "ఎందుకిలా భార్యాబిడ్డలను వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నావు?" అనడిగాడు. అందుకు అబ్దుల్లా, “నువ్వు తెలుసుకుంటావులే!" అన్నాడు. “తెలుసుకునేదేముంది? ఇది నిజంగా పిచ్చే!" అన్నాడు అబ్బాస్ సేఠ్. అబ్దుల్లా పిడికిలి బిగించి అందులో ఉన్నదేదో అబ్బాస్పై విసురుతున్నట్లు విసిరి, “నువ్వూ అలాగే అయిపో!” అన్నాడు. అంతటితో అబ్బాస్ సేఠ్ భార్యాబిడ్డలను, వ్యాపారాన్ని అన్నింటినీ విడిచిపెట్టి పిచ్చివాడై వీధుల వెంబడి తిరగసాగాడు.
అన్వర్ ఖాన్
భోపాల్లో (వర్షడ్, బెహర్) అన్వర్ఖాన్ అనే ముస్లిం ఉండేవాడు. అతడొకసారి శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతను బాబాతో, “నాకు ఈ సంసారం వద్దు" అని చెప్పాడు. అతను చావడిలో 12 నెలలు నివసించాడు. బాబా అతనికి ఖురాన్ మొదటి అధ్యాయంలోనున్న "బిస్మిల్లా కుళియ హియో వల్కఫిరోనో నాబుడో మాబుదానా" అనే మంత్రాన్ని 101 మార్లు అర్థరాత్రి వల్లించమని ఆదేశించారు. తరువాత “దవూత్” వల్లించమన్నారు. బాబా అతనికి పేడా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్కు వెళ్ళమని ఆదేశించారు. అన్వర్ఖాన్ శిరిడీ నుండి బొంబాయి వెళ్ళాడు. అక్కడ కాశిం అనే హాజీ కలిసి ప్రయాణపు ఖర్చులిచ్చి అతనిని అరేబియా పంపాడు. అన్వర్ అరేబియా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు.
🙏🌺🙏ఏమిటి ఈ మానవాతీత లీల.. మన ఊహకు అందని ఈ చర్యలను లీల అంటున్నాం..వింటున్న కొద్దీ ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆత్రుత..సాయి సహచర్యం పొందిన ఆ నాటి భక్తుల జన్మ ధన్యం కదా.సాయిబాబా వారి స్పర్శనా.. దర్శన కలిగిన వారి జీవితాలను మనం ఏమని వర్ణించగలం...ఊహించుకొని తన్మయత్వం పొందడం తప్ప... సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై🙏🌺🙏
ReplyDeleteబాబా మీరే నన్ను కాపాడండి తల్లి తండ్రి గురువు దైవము అన్నీ మీరు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌷🌸🌷🙇🙇🙇🌷🌸🌷
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤
ReplyDeleteEntha baagunnayoo baba leelalu…..
ReplyDelete