1. బాబా సంరక్షణ
2. శ్రీసాయినాథుడు మన చెయ్యి ఎన్నడూ వదలరు
బాబా సంరక్షణ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, సచ్చిదానంద సమర్థ సద్గురువు అయిన శ్రీసాయినాథ్ మహరాజుకి పాదాభివందనాలు. నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో డిపో మేనేజర్గా పనిచేసి పదవీవిరమణ చేశాను. నేను బాబా భక్తుడిని. బాబా అనుగ్రహం వల్ల అనుక్షణం బాబా నామం నా నాలుకపై ఉంటుంది. ఇది బాబా నాకు ఇచ్చిన గొప్ప వరం. నేను గతంలో బాబా నాపై చూపిన కరుణాకటాక్షాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. 2012లో నేను మెదక్ డిపో మేనేజరుగా ఉన్నపుడు జూన్ 13, మధ్యాహ్నం భోజనం చేసి నా అఫీషియల్ వెహికల్కి రిపేర్ ఉండడం వల్ల డిపోలోని ఒక ఎంప్లాయ్ తాలూకు మారుతి-800 కారు తీసుకుని నా డ్రైవరుతో కలిసి రూట్ అబ్జర్వేషన్ కోసం కామారెడ్డి రూటులో వెళ్ళాను. ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాక హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిలోకి ప్రవేశించాము. కొద్ది దూరం వెళ్లిన తరువాత బహుశా డ్రైవరుకి నిద్ర కమ్మిందేమో, హఠాత్తుగా కారు రోడ్డు పక్కకి దిగి పల్టీలు కొట్టి ఒక గుంటలో పడిపోయింది. ఆ కారు స్థానికంగా గ్యాస్తో నడిచేలా ఏర్పాటు చేసినందువల్ల కారులో గ్యాస్ సిలిండరు ఉంది. అదృష్టవశాత్తూ ఆ సిలిండర్ బ్లాస్ట్ కాలేదు. కారు డోర్స్ కూడా తొందరగానే తెరచుకోవడంతో మేము కారులో నుండి బయటపడ్డాము. ఆ క్షణంలో బాబా రూపం నాకు కనిపించింది. ఆయన దయవల్లే నేను ఆ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడ్డానని అనుకున్నాను. డ్రైవరుకి ఏమీ కాలేదుగానీ నా ఎడమచేయి ఫ్రాక్చర్ అయింది. అందువల్ల నేను నాలుగు నెలలపాటు ఇంట్లోనే ఉండిపోయాను. కానీ అలా ఉండడం వల్లనే నేను కొన్ని చెడు విషయాల నుండి రక్షింపబడ్డానని నాకు తరువాత అర్థమైంది. ఇలాగే నా కుమారుని కూడా మూడుసార్లు ప్రమాదాల నుండి బాబా కాపాడారు.
2019లో ఒకసారి మేము మా అబ్బాయి మ్రొక్కు తీర్చుకోడానికని అప్పటికప్పుడు తిరుపతి వెళ్ళలనుకుని ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం మరియు రూముల కోసం చూస్తే, అందుబాటులో లేవు. అప్పుడు నేను సహాయం కోసం బాబాను ప్రార్థించి ఇతర మార్గాలలో ప్రయత్నం చేయగా చెన్నై-తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులకి తిరుపతి ప్రత్యేక దర్శనం అనుసంధానింపబడి ఉందని తెలిసింది. దాంతో ఆన్లైన్లో చెన్నై నుండి తిరుపతికి టికెట్లు బుక్ చేసుకున్నాం. రూమ్ కోసం తిరుపతి బస్సు స్టేషన్లో ఉన్న సూపర్వైజరుతో నేను జగిత్యాల DMగా పరిచయం చేసుకుని, "తిరుమలలో వసతి విషయంలో మాకు సహాయం చేయండి" అని రిక్వెస్ట్ చేశాను. అతను ప్రయత్నిస్తానని అన్నారు. ఇక మేము దేవుని మీద భారం వేసి తిరుపతి వెళ్ళాం. మేము అలిపిరి దాటి, కొద్దిగా ముందుకు వెళ్లేసరికి తిరుపతి బస్టాండ్ సూపర్వైజర్ కాల్ చేసి, "మీరు కొండపైకి వెళ్లి శ్రీపద్మావతి గెస్ట్హౌస్లో 'sl no.6' అని చెప్పండి. రూమ్ ఇస్తారు" అని అన్నాడు. మేము నేరుగా శ్రీపద్మావతి గెస్ట్హౌస్కి వెళ్లి, అతను చెప్పమన్నట్టే చెప్పాం. కేవలం 10 నిమిషాల్లో మాకు రూమ్ ఇచ్చారు. సాయంత్రం ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ల మీద ప్రత్యేక దర్శనం చేసుకున్నాం. అదేరోజు నా శ్రీమతి కుటుంబానికి ఆప్తమిత్రుడైన ఒకతను ఏదో విషయంగా ఫోన్ చేస్తే, "మేము తిరుపతిలో ఉన్నాం" అని చెప్పాం. వెంటనే అతను, "మీరు రేపు ఉదయం JEO ఆఫీసుకి వెళ్ళండి. మీకు సుప్రభాతసేవ టికెట్లు ఇవ్వమని చెపుతాను" అని చెప్పాడు. మేము మరుసటిరోజు ఉదయం JEO ఆఫీసుకి వెళితే, మరునాటి ఉదయం సుప్రభాతసేవ టికెట్లు ఇచ్చారు. మరొకరోజుకి రూమ్ పొడిగించుకుని ప్రశాంతంగా సుప్రభాతసేవలో పాల్గొన్నాము. ఇదంతా మేము ఊహించని బాబా కరుణ. ఆయన దయతో 2022, జూలైలో కూడా మాకు విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రసాదించారు.
.
నేను జీవితంలో ఒక్కసారైనా చార్ధాం యాత్ర చేయాలని అనుకునేవాడిని. నేను 2022, జనవరిలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఏప్రిల్లో మా చిన్న బావమరిది ఏదో ఫంక్షన్ విషయంగా మా ఇంటికి వచ్చాడు. మాటల్లో అతను హఠాత్తుగా నా శ్రీమతితో, "చిట్టీ! మేము మే 20న నా భార్య అక్కతో కలిసి చార్ధాం యాత్రకి వెళ్తున్నాము" అని చెప్పాడు. అప్పుడు మా పిల్లలు, "మీరు కూడా వాళ్లతో వెళ్ళండి" అని బలవంతపెట్టారు. వెంటనే ఆర్.వి ట్రావెల్స్లో డబ్బులు కట్టి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. మా యాత్రలో రెండోరోజు హరిద్వార్ నుండి ఉత్తరకాశీ వెళ్తున్నపుడు హరిద్వార్ దాటాక 15 కిలోమీటర్ల దూరంలో బస్సు క్లచ్ ఫెయిల్ అయి బస్సు బ్రేక్ డౌన్ అయింది. కొద్దిగా ముందుకు వెళ్తే, పూర్తిగా లోతైన ఘాట్ సెక్షన్ ఉంది. అక్కడ గనక బస్సు ఫెయిల్ అయుంటే చాలా దారుణం జరిగి ఉండేది. కానీ బాబా ముందుగానే సమస్య వచ్చేలా చేసి మమ్మల్ని కాపాడారు. బాబా దయవల్ల క్షేమంగా ప్రశాంతగా మా చార్ధాం యాత్ర పూర్తి చేసుకుని వచ్చాము. “మీ అనుగ్రహానికి శతకోటి ధన్యవాదాలు బాబా”.
2022, సెప్టెంబర్ నెలలో నా శ్రీమతి తన వస్త్ర వ్యాపారానికి సంబంధించిన ఒక బుక్ కోసం దాదాపు ఆరురోజులు ఎంతలా వెతికినా దొరకలేదు. నేను నా శ్రీమతి టెన్షన్ చూడలేక, "బాబా! బుక్ దొరికేలా చేయండి. మీ కరుణను బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. తరువాత రెండోరోజు నా శ్రీమతి చేతిలో ఆ బుక్ ఉండటం చూసి, "అరే.. ఆ బుక్ ఎక్కడ దొరికింది" అని అడిగాను. అందుకామె, "షాపు పక్క రూమ్లో ఉంద"ని చెప్పింది. అంతా బాబా కరుణాకటాక్షం. "బాబా! ఈమద్య నాకు, నా భార్యకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నా వయస్సు 61 సంవత్సరాలు. మనిషి సగటు ఆయుష్షు 80 సంవత్సరాలనుకుంటే మూడు వంతుల జీవితకాలం పూర్తయి చివరి వంతులో ఉన్నాను. దయచేసి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా కాపాడండి ప్రభూ".
2022, సెప్టెంబర్ 29న నా మనవరాలికి హై ఫీవర్తో వణుకు వచ్చింది. అప్పుడు, "బాబా! పాపకి తొందరగా తగ్గిపోవాలి. మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయతో రెండు రోజుల్లో పాపకి తగ్గిపోయింది. కానీ, మళ్ళీ వచ్చింది. డాక్టర్ 'యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్' ఉందని చెప్పి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమన్నారు. నేను, "బాబా! రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా చూసి తొందరగా నా మనవరాలు మామూలుగా అయ్యేలా అనుగ్రహించండి తండ్రి. మీ కరుణను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. అంతేకాదు, జ్వరం కూడా తగ్గిపోయి పాప మామూలుగా అయింది. ఇదంతా కేవలం బాబా కరుణాకటాక్షాల వల్లే. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక చేసిన తప్పులకు క్షమాభిక్ష ప్రసాదించండి బాబా. మీ కృపవలన కరీంనగర్లో మాకు ఒక సొంతిల్లు సమకూరింది. అలాగే మీ దయతో అబ్బాయి తిరుచ్చి NITలో బిటెక్(ECE) పూర్తిచేసి, ప్రస్తుతం USలో MS చేస్తున్నాడు. MS కోసం కోయారే బ్యాంక్ లోన్ సాంక్షన్ అయినప్పటికీ మీ దయవల్ల అదే యూనివర్సిటీలో అబ్బాయికి టీచింగ్ అసిస్టెంట్గా రావడంతో, ఫీజు రాయితీ(exemption) రావడమే కాకుండా, రెండు వేల డాలర్ల హానరోరియం(పారితోషకం) కూడా ఇస్తున్నారు. అలాగే చెన్నైలో MS( ENT) కోర్స్ చేస్తున్న చిన్న అమ్మాయికి ఎలాంటి అవరోధాలు కలగకుండా కోర్సు పూర్తయ్యేలా అనుగ్రహించు తండ్రి. అలాగే మా స్వంత ఊరిలో అపరిష్కృతంగా ఉన్న భూమి పంపకాలు తొందరగా పూర్తి అయ్యేలా అనుగ్రహించండి బాబా".
సాయి చరణం!!
సర్వదా శరణం శరణం!!!
శ్రీసాయినాథుడు మన చెయ్యి ఎన్నడూ వదలరు
సాయితండ్రికి, సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు గీత. మా అబ్బాయి రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టు కోసం 2022, మే 28న మొదటి దశ పరీక్ష వ్రాసాడు. అప్పుడు నేను, "బాబా! బాబు పరీక్షలో ఉత్తీర్ణుడై రెండో దశకు చేరుకుంటే, మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని ఆ దయామయుని వేడుకున్నాను. ఆయన దయవల్ల మా బాబు మొదటి రౌండు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ అనుభవాన్ని గతంలో మీతో పంచుకున్నాను. ఇకపోతే 2022, జూన్ 25న బాబు రెండో దశ పరీక్ష వ్రాసాడు. అప్పుడు కూడా నేను, "బాబా! బాబు 'పరీక్ష బాగా వ్రాసాన'ని చెబితే, బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అదేరోజు సాయంత్రం బాబు ఫోన్ చేసి నేను కోరుకున్నట్లే పరీక్ష బాగా వ్రాసానని చెప్పాడు. వెంటనే ఆ విషయాన్ని బ్లాగులో పంచుకోవడానికి మేటర్ ఫోన్లో టైప్ చేశాను. కానీ సాయితండ్రి కృపాకటాక్షాలను తుంచి ముక్కలుగా చేసి పలుమార్లు రుచి చూపిస్తున్నట్లు ఉంటుందేమోననిపించి ఆ ఉద్యోగానికి సంబంధించి అన్ని దశలు పూర్తయ్యాక సాయి కృపామృతభాండాన్ని పూర్తిగా మీతో పంచుకోవాలని ఆగిపోయి సాయి వర్షించే కృపామృతం కోసం సహనంతో ఎదురుచూసాను. ఆ తండ్రి దయవల్ల బాబు రెండవ దశలో కూడా ఉత్తీర్ణుడై తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి ఎంపిక అయ్యాడు. 2022, సెప్టెంబర్ 12వ తేదీన ముంబాయిలోని ఆర్.బి.ఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉండగా బాబు 11వ తేదీన ముంబాయి చేరుకున్నాడు. ఆ రాత్రి బాబుకి 4 సార్లు విరోచనాలయ్యాయి. ఆ విషయం తను నాతో ఫోన్లో చెప్పాడు. నేను దేవుడి గదిలో బాబా ముందు నిలబడి, "బాబా! బిడ్డ పెద్ద పరీక్షకు హాజరవుతున్నాడు. బాబు నోట్లో వేస్తున్నట్లుగా భావించి చిటికెడు ఊదీ నా నోట్లో వేసుకుంటాను. దయచేసి తనకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. ఆ దయామయుడు బాబు ప్రత్యక్షంగా ఊదీ తీసుకోకపోయినా, తనకి బదులు నేను తీసుకున్నా బాబుకి నయం చేశారు. ఇక బాబు ఏ ఇబ్బందీ లేకుండా ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఆ సాయితండ్రి కరుణ వల్ల అదేరోజు తనకి ఆ ఉద్యోగం వచ్చింది. బాబు తన మొదటి జీతం మా ఊరి శ్రీసాయినాథ్ మహరాజ్కి సమర్పించుకుంటానని అనుకున్నాడు. శ్రీసాయినాథుడు మన చెయ్యి ఎన్నడూ వదలరు. ఆయనను నమ్మిన వారి వెంట పరుగులు తీస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ మేలు ఎప్పుడూ మరువము తండ్రి. ఇలాగే మీ దయా వీక్షణలు మాపై సదా నిలుపు తండ్రి".