సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1366వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో తీరిన ఆకలి - పారాయణ పూర్తి
2. హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించిన బాబా
3. బాబా దయతో అయిన ఇంటి రిజిస్ట్రేషన్

బాబా కృపతో తీరిన ఆకలి - పారాయణ పూర్తి


సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపులకు నమస్కారం. నా పేరు విజయ్‍చంద్ర. మాది ఏలూరు. లోగడ శ్రీసాయి నాపై చూపిన దయను మీతో పంచుకున్నాను. అది నా పూర్వజన్మ సుకృతం వలన లభించిన బాబా అనుగ్రహమని భావిస్తున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో అనుభవం పంచుకుంటున్నాను. ఈమధ్య నేను ఆఫీసు పని మీద నూజివీడు వెళ్ళాను. ఏలూరు నుండి నూజివీడు వెళ్లే దారిలో పోతురెడ్డిపల్లి దాటిన తరువాత రోడ్డుకి ఆనుకుని ఒక సాయిబాబా మందిరం ఉంది. నేను చాలాకాలం క్రితం ఆ మందిరంలో బాబా దర్శనం చేసుకున్నాను. అప్పుడు అక్కడున్న ఒక మాతృమూర్తి అకలితో ఉన్న నాకు అన్నం పెట్టింది. మేము బాబా లీలలు, మహిమలు, ఆయన చూపే దయ, ప్రేమ గురించి మాట్లాడుకుని చాలా ఆనందించాము. నాకు ఆ మందిరంలోని బాబాని, ఆయన సన్నిధిలో ఉండే ఆ మాతృమూర్తిని చూడాలనిపించి తిరుగు ప్రయాణంలో ఆ గుడికి వెళదామనుకున్నాను. నూజివీడు వెళ్లి అక్కడ పని చూసుకుని ముందుగా అనుకున్నట్లే దారిలో ఆ బాబా గుడికి వెళ్ళాను. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. గుడి తలుపులు దగ్గరగ వేసి ఉన్నాయి. ఆ మాతృమూర్తి అక్కడ కనిపించలేదు. సరే, నేను తలుపులు తీసి లోపలి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. అమ్మని చూస్తే, ఆకలి గర్తుకి వస్తుంది కదా! బాబాని చూస్తూనే నాకు ఆకలేసింది. అంతే, నేను ఊరుకోకుండా, "బాబా! నాకు అన్నం కావాలి" అని వేళకానివేళలో ఆయనని ఇబ్బందిపెట్టాను. అలా బాబాని అడిగి గుడి బయట ఉన్న వరండాలోకి వచ్చి కూర్చున్నాను. అంతలో ఒక వ్యక్తి వచ్చారు. నేను ఆయన్ని, "గతంలో ఇక్కడొక మామ్మగారు ఉండేవారు" అని ఆ మాతృమూర్తి గురించి అడిగాను. అందుకతను, "ఆమె ఇప్పుడు రావడం లేదు. నేనే ఈ గుడి వ్యవహారాలు చూస్తున్నాను" అని చెప్పి, "ఆమెతో ఏమైనా పని ఉందా?" అని అడిగారు. నేను, "లేదండీ, కొంతకాలం క్రితం బాబా దర్శనం కోసం వచ్చినప్పుడు బాబా కృపవల్ల ఆమె నా కడుపు నిండా అన్నం పెట్టింది. కొసరికొసరి వడ్డిస్తుంటే ఆమె ప్రేమకు నేను మైమరచిపోయాను. మళ్ళీ చాలాకాలం తర్వాత ఇప్పుడే వచ్చాను. ఆమెను ఒకసారి చూడాలనిపించి అడిగాను" అని అన్నాను. అప్పుడు ఆయన, "భోజనం ఉంది. తినేసి వెళ్ళండి" అని అన్నారు. ఆ సమయంలో భోజనం ఉండడం బాబా దయకాకపోతే మరేంటి? దర్శిస్తూనే, "బాబా! అన్నం కావాలి" అని అడిగిన నా ఆకలిని తీర్చిన ఆయన దయ, ప్రేమలను మీ అందరితో ఇలా పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".


నాకు ఎంతోకాలంగా శ్రీదేవీభాగవతం పారాయణ చేయాలని కోరిక. మూడు, నాలుగు సార్లు ప్రయత్నించి 4, 5 స్కందాలు పారాయణ చేశాక ఆపేసాను. ఎందుకంటే, ఎంత ప్రయత్నించినా అంతకుమించి ముందుకు వెళ్ళలేకపోయేవాడిని. అందువల్ల, "ప్లీజ్ బాబా! శ్రీదేవీభాగవతం పారాయణ పూర్తి చేసేటట్లు చూడండి" అని బాబాను విసిగిస్తుండేవాడిని. ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళినప్పుడు శ్రీదేవీభాగవత గ్రంధం నాకు లభించింది. నిజానికి అప్పటికే నా దగ్గర ఆ పుస్తకం ఉంది. కానీ మళ్లీ లభించడంతో 'ఇప్పుడు నాకు బాబా  దివ్యాశీస్సులు లభించాయి. ఇక తిరుగులేదు. నేను పారాయణ పూర్తి చేస్తాను' అని నాకు నమ్మకం కలిగింది. అంతేకాదు, 'ఇప్పుడు పూర్తి చేస్తావు. ఇంకా ఏడుపు ముఖం పెట్టకు' అని బాబా నాతో అన్నట్టు అనిపించింది. ఆయన ఆశీస్సులు మాటలా, మజాకా! నేను ఈసారి శ్రీదేవీభాగవతం పారాయణ ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేశాను. కాదు కాదు బాబా చేయించారు. "ధన్యవాదాలు బాబా". నా మనసులో ఉన్న మరో కోరిక తీరితే మళ్ళీ నా అనుభవంతో మీ ముందుకు వస్తాను.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సద్గురు శ్రీసాయినాథుని పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తూ, ఆ తండ్రి నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు సుగుణ. మేము హైదరాబాదులో ఉంటున్నాము. మావారి పేరు రాధాకృష్ణప్రసాద్. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బాబా దయతో 4 సంవత్సరాలు క్రితం మా అమ్మాయి వివాహం జరిగింది. మా అబ్బాయికి పెళ్ళి చేద్దామనుకునే లోపల తనే మాతో మాట్లాడుతూ, తాను ఒక అమ్మాయిని ప్రేమించాననీ, తననే పెళ్ళి చేసుకుంటాననీ, పెళ్ళి విషయంలో మమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు క్షమించమనీ కోరాడు. మేము తన ఇష్టాన్ని అంగీకరించాము. అయితే, తను ప్రేమించిన అమ్మాయి ఒక క్రిస్టియన్. తను హిందూమతంలోకి మారతానని అన్నది. ఈ విషయమై మేము ఒక బ్రాహ్మణుడిని సంప్రదించగా, ‘ఒక హోమం ద్వారా ఆ అమ్మాయిని హిందువుగా మార్చటానికి వీలవుతుంద’న్నారు. ఆ హోమం ఒక నది ఒడ్డున జరగాలని చెప్పి, ధర్మపురిలో గోదావరి నది ఒడ్డున హోమం చేయాలని నిర్ణయించి, హోమానికి ముహూర్తం పెట్టారు. అయితే ఆ సమయానికి భారీవర్షాలు కురవటంతో కార్యక్రమం వాయిదాపడింది. తిరిగి రెండవసారి మళ్ళీ ముహూర్తం పెట్టారు. ఈసారి అనుకోకుండా మైల రావటంతో కార్యక్రమం మళ్ళీ వాయిదాపడింది. మూడవసారి మళ్ళీ ముహూర్తం పెట్టారు. అప్పటికే రెండుసార్లు కార్యక్రమం వాయిదాపడటంతో ఈసారి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయమేసింది. అప్పుడే నేను బాబాని తలచుకుంటూ, 'సాయి మహరాజ్ సన్నిధి'లో ప్రచురించిన సాయిభక్తుల అనుభవాలు చదివాను. వెంటనే నేను కూడా బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈసారి ఏ అడ్డంకులూ రాకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా అనుగ్రహించండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన”ని కోరుకున్నాను. మరో 4 రోజుల పాటు భారీవర్షాలు కురవబోతున్నాయని ఆ రాత్రంతా సూచనలు వచ్చాయి. మేము మరునాడు ధర్మపురికి బయలుదేరుతామనగా ఆరోజు కూడా పెద్ద వర్షం పడింది. కానీ ఆ మరునాడు ఎండ వచ్చింది. అందరం కలిసి ధర్మపురికి బయలుదేరాము. అక్కడ విపరీతమైన ఎండ. బాబా కృపతో హోమం చక్కగా పూర్తయింది. మేము రెండు రోజులు ఉన్నామక్కడ. ఆ రెండు రోజులు హైదరాబాదులో భారీవర్షాలు కురిశాయి. ధర్మపురిలో వాన రాకుండా కాపాడి మమ్మల్ని అనుగ్రహించారు బాబా. ‘బాబాకు తమ భక్తులపై ఎంత దయ, అనుగ్రహమో!’ అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబా అనుగ్రహాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించి, అలౌకిక ఆనందం పొందాను. బ్లాగులో నా అనుభవం పంచుకుంటానని బాబాకి మాట ఇచ్చాను. కాబట్టి మీ అందరితో నా అనుభవాన్ని పంచుకున్నాను. శ్రీసాయిబాబా కృపాదృష్టి మనందరి మీదా ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


అనుక్షణం బాబా దృష్టిలో నేను ఉండాలని కోరుకుంటూ..  సుగుణ.


బాబా దయతో అయిన ఇంటి రిజిస్ట్రేషన్

సద‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై! సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర‌్వహిస‌్తున‌్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక‌్తుడిని. నా పేరు చంద్రశేఖర్. మాది పాతర‌్లగడ‌్డ(కాకినాడ రూరల్). ఈ బ‌్లాగు నిర‌్వహిస‌్తున‌్న సాయికి ధన్యవాదాలు. నేను ఇంతకుముందు సాయి నాకు చేసిన సహాయం గురించి ఈ బ‌్లాగులో పంచుకున‌్నాను. ఇప‌్పుడు సాయి నాకు చేసిన మరో సహాయం గురించి పంచుకుంటున్నాను. 2022, జూన్ నెలలో మా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళితే రిజిస్ట్రేషన్ అవ‌్వలేదు. అప‌్పటినుండీ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. చివరికి నేను, "బాబా! 2022, సెప్టెంబర్ నెలాఖరు లోపు మా స్థలం రిజిస్ట్రేషన్ అయ‌్యేలా చేస‌్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ‌్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప‌్లార‌్థించాను. మూడు నెలలుగా అవ‌్వని రిజిస్ట్రేషన్ బాబా దయవల్ల 2022, సెప‌్టెంబరు 29న ఎటువంటి ఇబ‌్బందులు లేకుండా అయింది. "ధన్యవాదాలు బాబా. దయతో నా మనస‌్సులో ఉన‌్న కోర‌్కెలు కూడా నెరవేరేలా చేయి తండ్రి".

సమర‌్థ సధ‌్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo