1. మనందరి క్షేమం కోరే ఆ సాయిబాబా ఉండగా మనకు భయమక్కరలేదు
2. ఉద్యోగంలో వచ్చిన చిక్కుల నుండి కాపాడిన బాబా
మనందరి క్షేమం కోరే ఆ సాయిబాబా ఉండగా మనకు భయమక్కరలేదు
నా పేరు రాధాకృష్ణ. మాది రాజమండ్రి. 'సాయి మహారాజ్ సన్నిధి'లో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు పంచుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఒకసారి మా అమ్మాయిని తన అత్తవారింటికి తీసుకుని వెళదామని అనుకున్నాను. రేపు ప్రయాణమనగా సంవత్సరంన్నర వయసున్న మా మనవడికి జ్వరమొచ్చి విరోచనాలు కూడా అయ్యాయి. అప్పుడు నేను, "ఓ సాయిబాబా! నా మనవడికి పూర్తి ఆరోగ్యం చేకూరి మా ప్రయాణం అనుకున్నట్లుగా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మరునాటి ఉదయానికి మా మనవడికి ఆరోగ్యం చేకూరడంతో మా అమ్మాయి అత్తవారింటి ప్రయాణం సాఫీగా జరిగింది.
మా చిన్నమ్మాయి చెన్నైలో బీటెక్ చదువుతుంది. తను 2022, సెప్టెంబర్ 16న బయలుదేరి తిరుపతి వచ్చింది. సెప్టెంబర్ 17న మా కుటుంబసభ్యులందరితో తిరుమలలో శ్రీవారిని, మంగాపురంలో శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని 18వ తేదీన మా అమ్మ, మా అబ్బాయితో కలిసి చెన్నై వెళ్ళింది. తరువాత అక్కడ హాస్టల్లో ఉండగా తనకి ప్రయాణ బడలిక వలన ఒళ్ళునొప్పులు, జ్వరం, జలుబు వచ్చాయి. నేను ఆ సాయిని తలుచుకుని, "అమ్మాయికి స్వస్థత చేకూరిస్తే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మా పాపకి ఆరోగ్యం కుదుటపడి కాలేజీకి వెళ్ళింది.
బాబా దయవల్ల మా అల్లుడికి బెంగుళూరు నుండి మాకు దగ్గరగా హైదరాబాద్కి బదిలీ అయింది. హైదరాబాద్ వచ్చాక ప్రయాణ బడలిక వలన మా అల్లుడికి ప్రక్కలో నొప్పి వస్తే నేను, "బాబా! అల్లుడికి ఆ నొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకోగానే మా అల్లుడికి నొప్పి తగ్గింది. ఇలా ఆ సాయి మహిమలు ఎన్నని చెప్పను? ఆయన అనుక్షణం మన వెంటే ఉంటారు అనడంలో సందేహం లేదు. అడుగడుగునా మనందరి క్షేమం కోరే ఆ సాయిబాబా ఉండగా మనకు భయమక్కరలేదు. "ధన్యవాదాలు బాబా. మనసున మిమ్మల్ని ధ్యానిస్తూ, మీరు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను తండ్రి".
ఒకసారి మా అమ్మాయి, అల్లుడు సంవత్సరం పదినెలల వయసున్న మా మనవడిని తీసుకుని హైదరాబాద్ నుండి వాడపల్లి ఏడువారాల శ్రీవెంకన్న మ్రొక్కు తీర్చుకునే నిమిత్తం, అలాగే అట్లతద్దె నోము నోచుకునేందుకు వచ్చారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగాక వాడపల్లి బ్రహ్మోత్సవాల సమయంలో అష్టోత్తరం, కళ్యాణం చేయని కారణంగా మా కుటుంబ సభ్యుల సమేతంగా శ్రీద్వారక తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణం కూడా జరిపించాము. తరువాత మా అమ్మాయివాళ్ళు రాత్రి ట్రైన్లో హైదరాబాద్కి ప్రయాణమవ్వాల్సి ఉండగా వాళ్ళు బయలుదేరడానికి ముందు మనవడికి ఒంట్లో బాగలేకపోయింది. ఆ కారణంగా ప్రయాణం వాయిదా వేయాలని అనుకున్నారు. అంతలో నేను, "బాబా! మనవడికి నయమైతే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. బాబా దయవల్ల ఒక అరగంటలో బాబు తేరుకున్నాడు. దాంతో వాళ్ళు హైదరాబాదు వెళ్లారు. వాళ్లతోపాటు మా అమ్మాయికి సహాయంగా ఉందామని తన అత్తగారు, తల్లి కూడా వెళ్ళారు. వాళ్ళు అక్కడికి చేరుకున్నాక బాబు జ్వరంతో బాధపడ్డాడు. డాక్టరు దగ్గరకి వెళితే చికెన్ పాక్స్ అని మందులిచ్చారు. ఆ విషయం తెలిసి నేను, "బాబా! మీ దయతో మా మనవడి ఆరోగ్యం నార్మల్ అయితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబుకి నయమైంది. అందరి సమస్యలు తొలగించే సాయి ఉండగా మనకు భయమేల? శ్రీసాయినాథుడు అండగా ఉంటే ఏ సమస్య అయిన తొలగిపోతుంది. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలను మరీ ఆలస్యం చేయకుండా పంచుకున్నాను తండ్రి. మీ అనుగ్రహాన్ని ఇలా తోటి భక్తులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
ఉద్యోగంలో వచ్చిన చిక్కుల నుండి కాపాడిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, సచ్చిదానంద సమర్థ సద్గురువు అయిన శ్రీసాయినాథ్ మహరాజ్కి పాదాభివందనాలు. నా పేరు జగదీశ్వర్. నేను ఆర్టీసీలో డిపో మేనేజర్గా పనిచేసి పదవివిరమణ చేశాను. నేను గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. నేను జగిత్యాల డిపోలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరుగా పని చేస్తున్నపుడు ఒక ఉద్యోగి రిజర్వేషన్ చార్ట్లో కలర్ జిరాక్స్ తీసిన టికెట్లు ఎంట్రీ చేస్తూ మోసం చేస్తుండేవాడు. అప్పట్లో అంతా మాన్యువల్ సిస్టం అయినందున అతను ఒరిజినల్ టికెట్లకు వే బిల్ ప్రకారం డబ్బులు కట్టి, కలర్ జిరాక్స్ టికెట్ల మొత్తాన్ని తన సొంతం చేసుకునేవాడు. వే బిల్ ప్రకారం అంతా సరిగానే ఉండేది. అందువల్ల అతను చేస్తున్న మోసం కొంతకాలం ఎవరికీ తెలియలేదు. ఒకసారి ఎవరో చేసిన ఫిర్యాదుతో కరీంనగర్ నుండి స్పెషల్ టీమ్ సమాచారం ఇవ్వకుండా వెళ్లి చెక్ చేయడంతో అతని వద్ద ఒరిజినల్ టికెట్లు, అదే నెంబర్లతో ఉన్న కలర్ జిరాక్స్ టికెట్లు దొరికాయి. అప్పుడు మొత్తం రిజర్వేషన్ చార్టులు తనిఖీ చేస్తే కొన్ని లక్షల రూపాయల్లో మోసం జరిగినట్టు తేలింది. దాంతో హైదరాబాదులోని అధికారులు సంబంధిత సూపర్వైజరుని సస్పెండ్ చేయమన్నారు. జరిగిన మోసంలో నా ప్రమేయం లేకపోయినప్పటికీ సూపర్వైజర్ క్యాడర్లో ఉన్నందుకు నన్ను బాధ్యుడిని చేసారు. ఆ మోసాన్ని తెలుసుకునే సిస్టం లేనందున నేను బాబాపై భారం వేసి ఊరకుండిపోయాను. బాబా దయవల్ల నాపై అధికారి మొత్తం వెరిఫై చేసి, "అటువంటి మోసాన్ని గుర్తించే సిస్టమ్ ఏదీ లేదు. సూపర్వైజర్ దానికి బాధ్యుడు కాడు" అని రిపోర్ట్ పంపడంతో నేను పనిష్మెంట్ నుండి తప్పించుకున్నాను. ఆ ఉద్యోగిని ఉద్యోగం నుండి తొలగించారు.
తర్వాత 2013లో నేను కరీంనగర్లో మేనేజరుగా పని చేస్తున్న సమయంలో హైదరాబాద్ మార్గంలో నడుస్తున్న మా డిపో ఏసీ బస్ ఒకటి మధ్యలో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణీకులు, వాళ్ళవాళ్ళ లగేజీతో సహా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆ ఘటనకు సంబంధిత డిపో మేనేజరునైన నన్ను, నా సుపీరియర్ చీఫ్ మెకానికల్ ఇంజనీరుని భాద్యులను చేసి మా ఇద్దరినీ సస్పెండ్ చేయాలని అప్పటి MD ప్రపోజల్ పెట్టారు. మేము రెగ్యులర్గా బస్సులు మెయిన్ టైన్ చేస్తూ పూర్తిగా చెక్ చేసిన తరువాతే పంపుతాం. కాబట్టి జరిగిన ప్రమాదంలో మా పొరపాటు ఏమీ లేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా సస్పెండ్ చేస్తారని అనుకున్నప్పటికీ 'బాబా ఉన్నార'న్న దైర్యంతో మేము ఉన్నాం. బాబా దయవల్ల హైదరాబాద్ నుండి వచ్చి చెక్ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు, 'జరిగిన ఘటనలో మానవ తప్పిదం ఏమీ లేదు. ఇంజన్కి సంబంధించి ఒక పార్ట్ డిఫెక్ట్ వల్ల ఓవర్ హీట్ అయి మంటలు చెలరేగాయ'ని నివేదిక ఇచ్చారు. దాంతో మా తప్పు ఏం లేదని మాకు కేవలం కౌన్సెలింగ్ చేసారు. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శరణం శరణం బాబా శరణం!!!

