1. నమ్ముకున్న వారి భయంకరమైన బాధలను సునాయాసంగా దాటిస్తారు బాబా
2.బాబాకి చెప్పుకుంటే చాలు - సమస్యలు లేకుండా పోతాయి
నమ్ముకున్న వారి భయంకరమైన బాధలను సునాయాసంగా దాటిస్తారు బాబా
"శ్రీసాయినాథా! మీ దివ్య పాదపద్మములకు నమస్కారాలు. మీరు ఇచ్చిన సంతోషాన్ని బ్లాగులో పంచుకోవటం ఆలస్యమైనందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ... నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటున్నాను తండ్రి". సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తూ మన అందరికీ సాయిని ఇంకా ఇంకా దగ్గర చేస్తున్న బ్లాగు నిర్వాహకులకు సదా కృతజ్ఞతలు. నా పేరు రేఖ. ఇంతకుముందు నవగురువార వ్రతం చేస్తున్నప్పుడు సాయి నాకు ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని 'సాయి భక్తుల అనుభవమాలిక - 857వ భాగం'లో పంచుకుని ఎంతో ఆనందం పొందాను. ఇప్పుడు నవగురువార వ్రతం జరుగతున్నప్పుడు జరిగిన మరో అనుభవాన్ని చెప్తున్నాను. వ్రతం మధ్యలో ఉండగా ఒకరోజు మావారు స్వల్ప జ్వరంతో ఇంటికి వచ్చారు. బాగా అలసట తప్ప జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు ఏమీ లేకపోవటం వల్ల నేను పెద్దగా కంగారు పడలేదు. కానీ మరుసటిరోజు మావారికి ఏదో ఇబ్బందిగా అనిపించి హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళారు. అలా వెళ్లిన ఆయనకి సాయంత్రం వరకు సెలైన్ ఎక్కించారు. అప్పుడు మావారు ఫోన్ చేసి, "నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం" అని అన్నారు. సరేనని నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ వాళ్ళు మావారిని అన్ని రకాలుగా పరీక్షించి ఇంటికి పంపే సమయానికి మళ్ళీ మావారికి జ్వరం వచ్చింది. అప్పుడు కోవిడ్ టెస్ట్ చేస్తే, పాజిటివ్ వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో మాకు కోవిడ్ వస్తుందని మేము అస్సలు ఊహించలేదు. అయినా సరే, 'మనకి సాయి ఉన్నారు' అని నేను ధైర్యంగా ఉన్నాను. మావారు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండసాగారు. మరుసటిరోజు ఒక బాబా భక్తురాలి ద్వారా మావారికి వేయమని ఆయుర్వేద మందు నాకు అందింది. బాబానే ఆ మందు పంపారు అనుకున్నాను. అయితే అప్పటికే మావారికి మొదటి డోసు కోవిడ్ చికిత్స మొదలుపెట్టేసరికి ఆ ఆయుర్వేద ముందు నేను మా ఆయనకి వెయ్యలేదు. కానీ, బాబా పంపిన మందు అని నేను వేసుకున్నాను.
అదే సమయంలో చివరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న మా అమ్మాయికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించాము. సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తను కాలేజీలో పడిపోయింది. ఆ విషయం కాలేజీవాళ్ళు మావారికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన చూస్తే, ఐసోలేషన్లో ఉన్నారు. నాకు ఏ విషయంలోనూ పెద్దగా అవగాహన లేదు. అందువల్ల నాకు ఏ ఇబ్బందీ లేకుండా అన్నీ మావారే చూసుకుంటారు. అలాంటి నాకు ఆ పరిస్థితిలో చాలా భయం వేసింది. అట్టి స్థితిలో ఎవరికైనా తమ తల్లిదండ్రులు గుర్తు వస్తారు. నాకు తల్లీ, తండ్రీ ఇద్దరూ సాయిబాబానే. అందుచేత ఆయన్నే, "నన్ను వదలకండి సాయిదేవా! మీరే నాతో ఉండి ఈ కష్టం నుండి దాటించండి" అని వేడుకున్నాను. అంబులెన్స్ తీసుకుని వెళ్ళి, మా అమ్మాయిని కాలేజీ నుండి హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. అప్పుడు తనకి సెలైన్ పెట్టి, అన్ని టెస్టులు చేసి, "అన్నీ బాగున్నాయి, కానీ కోవిడ్ మైల్డ్ పాజిటివ్ ఉంది. కానీ అది వాక్సిన్ వల్ల అయుండొచ్చు. మందులు ఏమీ వద్దు. కేవలం విశ్రాంతి తీసుకుంటే చాలు" అని అన్నారు. కానీ ఆ సమయంలో మా అమ్మాయికి పరీక్షలు జరుగుతుండటం వలన ఏమి జరిగినా 'సాయిబాబా ఉన్నార'ని నేను కాలేజీ సార్కి ఫోన్ చేస్తే, "మేము తనకి తర్వాత పరీక్షలు పెడతాము. ప్రస్తుతం తనని విశ్రాంతి తీసుకోనివ్వమ"ని అన్నారు. అంతే, 'సాయి సాయి' అనుకోవటం తప్ప నాకు ఇంకో మాట లేదు. ఇకపోతే, అమ్మాయి కాలేజీలో పడిపోయిందని తెలిసినప్పటి నుండి నేను వీక్ అయిపోయాను. మరుసటిరోజుకి మరింత బలహీనపడిపోయాను. ఒళ్ళునొప్పులు, రుచి, వాసన కోల్పోయాను. దాంతో 'నాకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింద'ని నాకు అర్దం అయిపోయింది. కానీ అప్పటికే ఇంట్లో ఉండే ముగ్గురిలో, అనారోగ్యం పాలై, కోవిడ్ భయంతో ఉన్న ఇద్దరికీ నా సంగతి తెలిస్తే, వాళ్ళు మరింత భయపడతారని నా సంగతి ఎవ్వరికీ చెప్పక సాయికే చెప్పుకుని, "తండ్రీ! ఎట్లా మమ్మల్ని బయటపడేస్తారోగానీ నా జీవితం మీ చేతిలో ఉంది. నేను మిమ్మల్నే నమ్ముతున్నాను" అని ప్రార్థించాను. నా సాయి నవగురువార వ్రతం ఆపకుండా చేసుకునేలా శక్తిని, ధైర్యాన్ని నాకు ఇచ్చారు. పూజకి కావాల్సినవన్నీ బయటకి వెళ్లకుండా సాయి భక్తులైన మా బంధువులతో ఏర్పాటు చేయించి, పూజ ఎంతో ఘనంగా చేసుకునేలా అనుగ్రహించారు. అంతేకాదు ఆయన కరుణతో అందరం కోలుకుని భయంకరమైన బాధని చాలా తేలికగా సునాయాసంగా దాటాము. అయితే, మా కర్మలో భాగంగా మేము అనుభవించాల్సిన బాధ అంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. అదేమిటంటే...
నవగురువార వ్రతం ఆఖరివారం రేపు, ఆ మర్నాడు వరలక్ష్మీవ్రతం అనగా ఆరోజు మావారు బయటకి వెళ్లి, వస్తూ బంగారు వరలక్ష్మి ప్రతిమ నా చేతికి ఇచ్చి బాత్రూంకి వెళ్ళారు. అలా వెళ్లిన ఆయన కాళ్ళు కడుక్కుని, బయటకి వచ్చే క్రమంలో పడిపోయారు. అప్పుడు వచ్చిన పెద్ద శబ్దానికి ఏమి జరిగిందో క్షణకాలం నాకు అర్థం కాలేదు. మావారు నా చేతిలో పెట్టిన ప్రతిమ నా చేతిలోనే ఉంది. అంతలోనే ఆ ఘటన జరిగింది. నేను, మా అమ్మాయి లేపుతున్నా మావారు పైకి లేవలేకపోయారు. అతికష్టం మీద ఆయన్ని లేపి మంచం మీద పడుకోబెట్టి హాస్పిటల్కి ఫోన్ చేశాను. అంతసేపూ నేను 'సాయిరాం సాయిరాం' అని పైకి పెద్దగా అంటున్నానని తర్వాత మా అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. ఆ సమయంలో సాయి తప్ప నాకు ఇంకేమీ తెలియట్లేదు. "ఫ్రాక్చర్ ఏమి లేకుండా చెయ్యండి బాబా" అని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. 4గంటల తర్వాత వీల్ చైర్లో తీసుకెళ్తే తప్ప వెళ్లలేని స్థితిలో ఉన్నారు మావారు. ఆయన హాస్పిటల్లో వర్క్ చెయ్యటం వలన డాక్టర్లు మా ఇంటికే రావడం, స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చెయ్యటం జరిగింది. బాబానే వారందరిలో ఉండి మాకు సహాయం చేశారు. ఆ రాత్రి 10 గంటలవుతున్నా మావారి విషయంలో ఏ స్పష్టత లేకపోవడంతో మరుసటిరోజు నవగురువార వ్రత ఉద్యాపన చేయగలనని నేను అనుకోలేదు. సరిగ్గా అప్పుడే ఎక్స్-రే రిపోర్టు ఫ్రాక్చర్ ఏమీ లేదని వచ్చింది. అప్పుడు డాక్టరు, "ఫ్రాక్చర్ లేదు. 5 రోజులు విశ్రాంతి తీసుకుని, తరువాత బ్రేస్ పెట్టుకుని నడవొచ్చు" అన్నారు. బాబా మాపైన చూపిన ఆ ప్రేమ అద్భుతమైనది. అప్పుడు మావారు నాతో, "నువ్వు పూజ చేసుకో, నేను బాగానే ఉన్నాన"ని ధైర్యం చెప్పారు. దాంతో నేను ఒక్కదాన్నే స్వయంగా వండి 15 మందికి భోజనం ఏర్పాటు చేశాను. ఆ శక్తిని సాయే నాకు ఇచ్చారు. ఆయన కృపవలన ఎంతో బాగా పూజ పూర్తి చేసుకున్నాను. నవగురువార వ్రతం చేసిన ఆ తొమ్మిది వారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదుర్కునేందుకు కావల్సిన శక్తినిస్తూ, కర్మలో భాగంగా అనుభవించే బాధను సునాయాసంగా గట్టెక్కించి ఎంతో సంతోషాన్ని ఇచ్చారు సాయిబాబా. నా మీద వారు చూపించిన కరుణాకటాక్షాలను ఎంతని చెప్పగలను? కానీ నాకు తగినంత శక్తి లేని కారణంగా నేను సంపూర్ణంగా బాబా లీలను, వారి ప్రేమను వ్రాయలేకపోయాను. కానీ బాబా మనతో ఉన్నారనే నమ్మకం చాలు, మనం ఎటువంటి పరిస్థితి నుండి అయినా దాటి ముందుకు వెళ్లగలము అనటానికి నా జీవితంలో జరిగిన ఈ అనుభవం మీ అందరికీ తెలియజేసాను. ఎప్పటికీ సాయి మనతోనే ఉంటారు. అయితే మనం సాయిని దర్శించగలిగేది ఎప్పుడు అంటే, 'సాయితత్వం అర్థం చేసుకుని వారి నీడలో నడవగలిగినప్పుడు...' ఆ శక్తిని వారు మనకి ఇస్తారని నమ్మకంతో ఆయన నామస్మరణలో ఉందాము.
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
బాబాకి చెప్పుకుంటే చాలు - సమస్యలు లేకుండా పోతాయి
ముందుగా సాయిభక్తులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేనొక సాయిభక్తురాలిని. మనమందరం సాయి భక్తులమవడం నిజంగా మన అదృష్టం. బాబా నాపై చూపిన దయను నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. నేను నా గత అనుభవంలో మా అమ్మాయివాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు బాబాను వేడుకున్నంతనే ఫలించి అగ్రిమెంట్ అయ్యిందని తెలియజేసాను. బాబా అనుగ్రహం వల్ల ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇకపోతే, ఈమధ్య నా ఆరోగ్యం సరిగా లేకుంటే, డాక్టరుకి చూపించుకున్నాను. అప్పుడు డాక్టరు చెప్పిన టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే, ఆ టెస్టులు చేసిన ఆమె, "వెన్నెముకలో సమస్య ఉంద"ని చెప్పింది. నాకు భయమేసి, "బాబా! టెస్టు రిపోర్టులు మంచిగా ఉండి, నాకు ఏ సమస్య లేనట్లయితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవలన రిపోర్టులు బాగా వచ్చాయి. డాక్టరు, "సమస్య ఏమీ లేద"ని చెప్పారు. "చాలా సంతోషం బాబా".
ఈమధ్య ఒకసారి మా ఇంట్లో మా అమ్మాయి వెండి సామాన్లున్న కవరు కనిపించలేదు. ఇంట్లో అంతా వెతికినప్పటికీ ఆ వస్తువులు ఉన్న కవరు కనిపించలేదు. నేను అప్పుడప్పుడు బీరువాలో వస్తువులు బయటపెట్టి మర్చిపోతుంటాను. అలా ఆ వస్తువులు కూడా ఎక్కడైనా పెట్టి మర్చిపోయానేమోనని నేను చాలా కంగారుపడ్డాను. అప్పుడు, "బాబా! ఆ కవరు దొరికితే, నా ఆనందాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులందరితో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. నిజంగా బాబా ఎంతో దయామయులు. 5 నిమిషాల్లో ఆ కవరు బీరువాలోనే కనిపించింది. వాస్తవానికి అదేచోట నేను రెండు, మూడుసార్లు వెతికాను. అప్పుడు కనిపించని కవరు బాబాను తలుచుకోగానే కనిపించింది. ఇలా 20, 25 సంవత్సరాలుగా బాబా ఎన్నో కష్టాలు నుంచి, బాధల నుంచి కష్టం తెలియకుండా నన్ను కాపాడుతున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. సాయీ ఈ మధ్య మా పెద్దమ్మాయివాళ్ళు యు.కే. నుండి ఇండియాకి ప్రయాణమవబోతుండగా రెండు రోజుల ముందు టెస్టు చేయించుకుంటే, వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్లపై దయ చూపించు తండ్రి. నాకు చాలా దిగులుగా ఉంది. మీ కృపవలన వాళ్ళు క్షేమంగా ఇండియా వచ్చినట్లయితే నా సంతోషాన్ని మళ్ళీ తోటి భక్తులతో పంచుకుంటాను బాబా".