1. సాయినాథుని కృప
2. సాయి కృపతో కుదిరిన ధ్యానం
3. పోగొట్టుకున్న వస్తువు కనపడేలా అనుగ్రహించిన బాబా
సాయినాథుని కృప
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడలో నివాసముంటున్నాము. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, సెప్టెంబరులో మా ఆడపడుచు భర్త చనిపోయారు. అతని అస్థికలు కాశీలో నిమజ్జనం చేసేందుకుగానూ మా ఆడపడుచు, వాళ్ళ అబ్బాయి, ఇంకా ఆమె తోడికోడలు కాశీకి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తర్వాత కొన్నిరోజులకి మా ఆడపడుచు తోడికోడలికి హఠాత్తుగా నడుమునొప్పి మొదలైంది. దాంతో ఆమె కనీసం నడిచే స్థితిలో కూడా లేకపోవడంతో ఆమెకి బదులు వదినకి తోడుగా నన్ను కాశీ తీసుకుని వెళ్లాలని అనుకున్నారు. అయితే ప్రయాణానికి వారముందనగా నాకు బాగా జలుబు చేసింది. నాకెప్పుడు జలుబు చేసినా ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోయేది. కానీ ఈసారి మందులు వాడుతున్నప్పటికీ వారం రోజులైనా తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ జలుబుతో నాకు చాలా భయమేసింది. పైగా పిల్లల్ని, మా వారిని వదిలి వెళ్లాల్సి ఉంది. అప్పుడు నేను, "బాబా! నాకు ఈ జలుబు తగ్గి, నేను కాశీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మాకు, ఇక్కడ ఉన్న మా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు తండ్రీ. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని 'అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని బాబాకి నమస్కరించుకున్నాను. తరువాత ప్రయాణానికి బయలుదేరే సమయానికి నాకు కొద్దిగా జలుబు ఉంది. అయితే, బాబా దయవల్ల మేము ఏసి కోచ్లో ప్రయాణం చేసినప్పటికీ నాకు ఏ ఇబ్బందీ కలగలేదు. ఇక్కడ ఉన్న పిల్లలు, మా వారు కూడా సంతోషంగా ఉన్నారు. మేము కాశీ వెళ్లేటప్పుడు అన్నిరకాల టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళాము కానీ, బాబా దయవల్ల వాటి అవసరమే మాకు రాలేదు. ఆయన మాకు తోడుగా ఉండి అన్నివిధాలా సహాయం చేశారు. సాయినాథుని కృపవలన మా కాశీయాత్ర చాలా బాగా జరిగింది. మేము కాశీయాత్ర ముగించుకుని 2021, అక్టోబర్ 23, శనివారం వచ్చాము. కానీ నా అనుభవాన్ని గురువారం బ్లాగుకి పంపాలని ఆగాను. ఆ ఆలస్యానికి బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను.
ఇంకో అనుభవం: 2021, మే నెలలో కరోనా వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 15రోజుల వ్యవధిలో వెంటవెంటనే మా అమ్మ, అత్తయ్యగారు, మామయ్యగారు, మా ఆడపడుచు ఒకరు చనిపోయారు. డాక్టర్లు ఆ విషయం నాకు చెప్పొద్దని చెప్పినందువల్ల మావాల్లు నాతో చెప్పలేదు. బాబా దయవల్ల నేను బ్రతికి ఇంటికి వచ్చిన కొన్నిరోజులకి వాళ్ళందరి మరణం గురించి నాకు తెలిసింది. అప్పటినుండి ఎవరికో ఏదో అయిపోతున్నట్లు నాకు చెడు కలలు వస్తుండేవి. అప్పుడు నేను, "బాబా! నాకు ఈ చెడు కలలు రాకుండా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులోని 'అనుభవమాలిక'లో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. బాబా నా కోరిక మన్నించారు, చెడు కలలు రావడం ఆగిపోయాయి. "ధన్యవాదాలు బాబా, నాకు చాలా సంతోషంగా ఉంది". ఇలాగే ఎప్పుడూ నా సాయినాథుని కృపాకటాక్షలు మనందరి మీద ఉండాలని బాబాను కోరుకుంటున్నాను. అలాగే తొందరలో కరోనాని నశింపజేసి ప్రపంచమంతా శాంతి సౌఖ్యాలతో ఉండేలా అనుగ్రహించమని సాయినాథుని మనసారా కోరుకుంటున్నాను. ఇలా మీ అందరితో నా అనుభవాలు పంచుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది.
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి కృపతో కుదిరిన ధ్యానం
సాయి కుటుంబసభ్యులందరికీ నమస్తే. నా అనుభవాన్ని పంచుకునే అవకాశాన్నిచ్చిన సాయిబాబాకు, ఈ బ్లాగుకు నా కృతజ్ఞతలు. నేనొక సాయిభక్తురాలిని. ఎవరూ నమ్మని విధంగా నా జీవితంలో నేను చాలా అనుభవాలను పొందాను. బాబా ఉనికిని చాలాసార్లు అనుభూతి చెందాను. కానీ బాబాతో నా అనుభవాలను ఏదైనా బ్లాగులో ఎలా పంచుకోవాలో నాకు తెలియదు. ఈమధ్యకాలంలోనే నేను సాయిబాబా భక్తుల అనుభవాలు చదవడం ప్రారంభించాను. కానీ ఇంత తొందరగా నా అనుభవాన్ని పంచుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితంలో ఊహించని తీవ్రమైన మార్పుల కారణంగా గత 6 సంవత్సరాల నుంచి నేను లోలోపలే బాధపడుతున్నాను, మానసిక సంఘర్షణకు గురవుతున్నాను. నేను మానసికంగా, శారీరకంగా చాలా బలహీనపడిపోయాను. ఆ క్రమంలో నేను ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకుని అన్నీ బాబాకు వదిలిపెట్టాను. నేను నా మనసుని శాంతింపజేయడం కోసం ధ్యానం చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నియంత్రించుకోలేని ఆలోచన వల్ల ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు. ఎక్కువ సమయం ధ్యానం చేయాలని ప్రయత్నించినప్పుడల్లా కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. దాంతో నేను ఈసారి బాబాను ప్రార్థించి, ఆయన నామజపాన్ని వింటూ ధ్యానం చేయడం ప్రారంభించాను. బాబా దయవల్ల నాకు ధ్యానం చక్కగా కుదిరి అద్భుతమైన అనుభవం అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఎల్లప్పుడూ నాతో ఉండండి. అందరినీ ఆశీర్వదించండి".
పోగొట్టుకున్న వస్తువు కనపడేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు మహేశ్వరి. ఈ బ్లాగు ద్వారా బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. సాయిబాబా వల్ల మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మేము ఈమధ్య కొత్త ఇంటికి వెళ్ళాము. బాబా అనుగ్రహంతో గృహప్రవేశం చాలా బాగా జరిగింది. మా సామాన్లన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ట్రాన్స్ పోర్టు ద్వారా కొత్త ఇంటికి తరలించాము. అన్ని వస్తువులు జాగ్రత్తగా వచ్చాయి. మేము ఆ సామాన్లన్నీ సర్దుకునేటప్పడు నేను ఒక విలువైన వస్తువుని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇల్లంతా చాలా వెతికానుకానీ అది కనపడలేదు. నేనెప్పుడూ ఏ వస్తువును పోగొట్టుకోనందున నాకు చాలా భయమేసింది. అప్పుడు నేను, "బాబా! నా చిన్నతనం నుంచి నేను ఏ వస్తువును పోగొట్టలేదు. అలాంటిదిప్పుడు ఇలా విలువైన వస్తువు పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అది నాకు ఎంతో ముఖ్యమైనది బాబా. మీరే ఎలాగైనా ఆ వస్తువు నాకు కనపడేటట్లు చూడండి తండ్రి. వస్తువు కనిపిస్తే, ఈ అనుభవాన్ని తోటి సాయిబంధువులతో మీ బ్లాగు ద్వారా పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన పదినిమిషాలకే ఆయన అనుగ్రహం వల్ల నాకు ఆ వస్తువు జాడ తెలిసింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అనుగ్రహం ఎల్లవేళలా మా కుటుంబం మీద ఇలాగే ఉండాలి".