- బాబా ఇచ్చిన బహుమతి
- పిలిచినంతనే నా బిడ్డను నిద్రపుచ్చారు బాబా
- బాబా చూపిన కరుణ
బాబా ఇచ్చిన బహుమతి
సాయిభక్తుడు రమేష్బాబు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
మనం నడిచే సాయి మార్గంలో ఎటువంటి విఘ్నములూ కలుగకుండా చూడమని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ, మన సద్గురు సాయినాథుని స్మరించే శక్తిని ఇవ్వమని సరస్వతీమాతను వేడుకొంటూ, మా ఇలవేల్పు అయిన లక్ష్మీనరసింహస్వామికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేని ప్రేమను చూపించే మన సద్గురువు సాయికి శతకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఈ జన్మలో నాకు సాయిని పరిచయం చేసిన మా గురువుగారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ... 2018వ సంవత్సరంలో నేను ఎప్పటికీ మరచిపోలేని విధంగా సాయి నాకు ప్రసాదించిన లీలను మీతో పంచుకుంటున్నాను.
ఈ కలియుగంలో అవతరించిన పిలిస్తే పలికే దైవం మన సద్గురు సాయినాథుడు నేటికీ ఎంతోమందికి ఎన్నో లీలలను చూపిస్తున్నారు. 2009వ సంవత్సరంలో సాయి ఆదేశం మేరకు సాయిసచ్చరిత్ర 1,008 సప్తాహాలు పారాయణ చేయాలని మా గురువుగారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు నన్ను ఆదేశించారు. సాయి ఆదేశానుసారం పారాయణలు ప్రారంభించాను. ఇటీవల 2020, అక్టోబరు ఒకటవ తారీఖున 400వ పారాయణ నాచే ప్రారంభింపజేసిన సాయినాథునికి శతకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను.
2018, అక్టోబరు 25, గురువారంరోజు ఉదయం సాయినాథుడు నాకు ధ్యానంలో దర్శనమిచ్చి, “ఈరోజు నీకు ఒక బహుమతి ఉంది” అని తెలియజేశారు. “ఈ దీనునికి ఏం బహుమతి ఇస్తారు సాయీ?” అని అడిగాను. అందుకు బాబా, “లేదు, నీకు ఈరోజు ఒక బహుమతి ఉంది” అన్నారు. అదేరోజు మధ్యాహ్నం నాకు తెలిసిన ఒక సాయిభక్తుడు (వెంకటేష్ గారు) ఫోన్ చేసి, “మీరేమైనా ఈ నెలలో శిరిడీ వెళ్తున్నారా?” అని అడిగారు. “ఒక వారంరోజులలో వెళ్తున్నాన”ని చెప్పాను నేను. అప్పుడాయన, “సాయికి కొంత డబ్బు ముడుపుగా తీసివుంచాను, ఆయనకు చేర్చండి” అని అడిగారు. ఆ ముడుపును ఆరోజు సాయంత్రం బాబా ఆలయ అర్చకుడైన ఆచార్యకు అందచేయమని ఆయనతో చెప్పాను.
తరువాత నేను (బాబా ఆదేశానుసారం) ఆలయ అర్చకుడు ఆచార్యకు ఫోన్ చేసి, “ఈరోజు శేజ్ ఆరతి తరువాత ఆ భక్తుడు ఇచ్చిన ముడుపును (సీల్డ్ కవర్) బాబా ధరించిన వస్త్రం లోపల బాబా ఒడిలో ఉండేలా పెట్టమ”ని చెప్పాను. అతను అలానే శేజ్ ఆరతి అనంతరం బయటికి కనిపించకుండా ఆ కవరుని బాబా ఒడిలో ఉంచి గుడికి తాళం వేసి వెళ్ళాడు. మరుసటిరోజు ఉదయం అతనే వచ్చి గుడి తాళం తీసి బాబా ఒడిలో వున్న పేపరు తీసి చూస్తే, ఆశ్చర్యం! ఆ ముడుపులో ఆ సాయిభక్తుడు ఉంచిన డబ్బులతో పాటు ఒక విదేశీనాణెం మరియు అప్పుడే ధునినుంచి తీసినట్టుగా వెచ్చగా ఉన్న బాబా ఊదీ (శిరిడీలోని ధుని ఊదీ) ఉన్నాయి. ఈ బాబా లీలను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇంతటి కరుణ చూపించిన సాయినాథుని ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మరుసటిరోజు ధ్యానంలో, “ఆ బహుమతికి కారణమేమిటి సాయీ?” అని సాయిని అడిగాను. “నీకు 1008 పారాయణలు చేయమని చెప్పాను కదా! 500 పారాయణల వరకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా నా ఆశీస్సులను ఈ రూపంలో ఇచ్చాను” అని సాయి తెలియజేశారు. ఎంతో ఆనందంగా సాయికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సాయి ఇంకా ఎన్నో అనుభవాలను నాకు ప్రసాదించారు. త్వరలోనే మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను.
బాబా చూపిన కరుణ
సాయిభక్తురాలు శ్రీమతి ఉమ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
2020, డిసెంబరు 7న నేను మావారి తెలుపురంగు టీ-షర్టులన్నీ వాషింగ్ మెషీన్లో వేసి ఆన్ చేశాను. కాసేపటి తరువాత బట్టలు ఆరేద్దామని తీసేసరికి తెలుపురంగు టీ-షర్టులన్నీ కాస్త పచ్చరంగులో ఉన్నాయి. వాటిని అలా చూసేసరికి నాకు చాలా భయమేసింది. ఎందుకలా జరిగిందా అని చూస్తే, వాటి మధ్యలో నా పచ్చరంగు చున్నీ ఒకటి ఉంది. దాన్ని నేను చూసుకోకుండా మెషీన్ ఆన్ చేసినందువల్ల చున్నీ తాలూకు పచ్చరంగు అంటుకొని టీ-షర్టులన్నీ అలా అయిపోయాయి. ఈ విషయం మావారికి చెప్తే ఏమంటారో ఏమిటోనని, మనసులోనే బాబాను తలచుకొని, "బాబా! ఈ బట్టలను మళ్ళీ వాషింగ్ మెషీన్లో వేస్తాను. వాటికి అంటుకున్న రంగు పోయేలా మీరే చేయాలి బాబా. టీ-షర్టులన్నీ మునుపటిలా తెల్లగా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకొని వాషింగ్ మెషీన్ ఆన్ చేసి గంట టైం పెట్టాను. గంట తర్వాత చూస్తే, టీ-షర్టులన్నీ మునుపటిలా తెల్లగా ఉన్నాయి. అది చూసి ఆనందంగా, "మేరే బాబా! మీరు చూపిస్తున్న కరుణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి" అని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.