సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

డి.వి.సంభారే


శ్రీ డి.వి.సంభారే అలియాస్ కొలంబో ఒక గౌడ్ సారస్వత్ బ్రాహ్మణుడు. 1936, సెప్టెంబర్ 26న అతడు సాయిబాబాతో తనకున్న అనుభవాలను శ్రీబి.వి.నరసింహస్వామితో ఈ క్రింది విధంగా తెలియజేశారు:

ఒకసారి నేను ద్వారకామాయిలో కూర్చుని ఉన్నాను. బాబా చిలుం పీలుస్తూ, తమ దగ్గర కూర్చుని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. బీడీ తాగే అలవాటు ఉన్న నాకు ఒకటి, రెండుసార్లు ఆ చిలుం పీల్చాలని కోరిక కలిగింది. ఆ ఆలోచన నా మనస్సులోకి వచ్చిన మరుక్షణం బాబా, "అరే అబ్బాయీ, ఇలా రా! ఎందుకంత దూరంగా ఉన్నావు? దగ్గరకు రా! వచ్చి చిలుం పీల్చు!(అరే పోరా ఇకడేయే, లాంబ్, కశాలా వసలా? జవల్ యే, చిలిమ్ ధ్యా)" అని పిలిచి, చిలుం నా చేతికిచ్చారు. నేను కూడా అక్కడున్న వారితో చేరి కొన్నిసార్లు చిలుం పీల్చాను. నా కోరిక తెలుసుకుని నాకు చిలుం ఇచ్చిన బాబా కరుణకు, సర్వజ్ఞతకు నేను ఎంతో ఆనందించాను.

పొగ త్రాగే అలవాటుతోపాటు నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1917, ఫిబ్రవరి 1న నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నా ఛాతీపై కూర్చొని, "అబ్బాయీ! ఏమి చేస్తున్నావు? (పోరా, క్యా కర్తా?)" అని గద్దించారు. నేను త్రాగుడు మానేస్తానని బాబాకు వాగ్దానం చేశాను. మరుసటిరోజు నుండి నేను మద్యం మానేశాను. 1917, ఫిబ్రవరి 15న నాకొక తీవ్రమైన పరీక్ష ఎదురైంది. మా ఆఫీసు మేనేజర్ తన పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా విందు ఏర్పాటు చేసి, నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజర్ ఒక గ్లాసులో విస్కీ, సోడా పోసి నాకిచ్చి త్రాగమని బలవంతం చేశాడు. అటువంటి సందర్భంలో బాబా పేరును ప్రస్తావించడం ఇష్టంలేని నేను, మద్యపానం మానేయమని డాక్టర్ చెప్పారని విన్నవించుకున్నాను. కానీ మేనేజర్ నా అభ్యర్ధనను పట్టించుకోకుండా మద్యం త్రాగమని నన్ను బలవంతపెట్టాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మా మేనేజర్ వెళ్ళాడు. ఆ చీకటిలో నా పక్కన ఉన్న 'మిస్త్రీ' నా గ్లాసు తీసుకుని ఆ విస్కీ త్రాగేశాడు. తిరిగి వచ్చిన మేనేజర్ నా గ్లాసు ఖాళీగా ఉండటం చూసి తన కోరిక ప్రకారం నేను మద్యం త్రాగానని సంతృప్తి చెందాడు. ఈవిధంగా బాబా నన్ను రక్షించారు.

బాబా దక్షిణ అడగటంలో ఒక నీతి దాగి ఉండేది. ఉదాహరణకు, ప్రగల్భాలు పలకడం, దురాశ, నియమనిబంధనల(బాధ్యతలు) నుండి తప్పుకోవడం మొదలైనవాటిని రూపుమాపేవి. పైన పేర్కొన్న సంఘటన జరిగిన కొన్నినెలల తరువాత నేను శిరిడీలో ఉన్నాను. బాబా అందరినీ దక్షిణ అడుగుతున్నప్పటికీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా త్రాగుడు అలవాటు మానినందుకు బాబా నన్ను దక్షిణ అడగకుండా గౌరవించారని భావించి, వాడాకు వెళ్లి నా స్నేహితుల సమక్షంలో ప్రగల్భాలు పలికాను. అంతలో బాబా నన్ను ద్వారకామాయికి రమ్మని కబురుపెట్టడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను రెండు రూపాయల దక్షిణ కోరారు. నేను సమర్పించాను. ఆ సమయంలో ఒక భక్తుడు అక్కడ ఉన్నాడు. అతడు ముంబాయిలోని ముగాబత్ వద్ద ఉన్న ఒక ప్రెస్ యజమాని. అతడు బాబా దర్శనం కోసం శిరిడీ వచ్చాడు. అతడు బాబా దక్షిణ అడిగితే, తన వద్ద డబ్బు లేదని నిజాయితీగా చెప్పవచ్చనే ఉద్దేశ్యంతో తన వద్ద ఉన్న 18 రూపాయలు నా వద్ద దాచాడు. నేను 2 రూపాయల దక్షిణ ఇచ్చిన తరువాత బాబా అతని వైపు తిరిగి నన్ను చూపిస్తూ, "అతని వద్ద తీసుకుని రెండు రూపాయలు దక్షిణ ఇవ్వు" అని అడిగారు. తన ఉద్దేశ్యం బాబాకు తెలిసిపోయిందని అతడు గ్రహించి, నా వద్దనుండి డబ్బులు తీసుకుని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా సమాధి చెందడానికి  కొన్ని నెలల ముందు జరిగింది.

బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు మేము శిరిడీలో ఉన్నాము. ఒకరోజు సాయంత్రం మేము శిరిడీ విడిచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతికోసం వెళ్ళాము. అప్పటికి రాబోయే విపత్తు (బాబా సమాధి చెందడం) గురించి మాకు తెలియదు. కానీ, బాబాకు ఆ విషయం తెలుసు. ఆయన మాతో, "మీరు ముంబాయి నుండి వస్తున్నారు. మీరు నా మాటలు వింటూ ఉండాలి. నేనూ మీ మాటలు వినాలి. కానీ మీరు వెళ్ళిపోతున్నారు. (ఆయన తన మనస్సులో సంశయిస్తూనే) సరే, వెళ్ళండి. మీరు రేపు మధ్యాహ్నానికి మీ గమ్యాన్ని చేరుకుంటారు" అని అన్నారు. ఆ రాత్రే మేము కోపర్‌గాఁవ్‌లో రైలు ఎక్కాము. మన్మాడు మీదుగా మరుసటిరోజు ఉదయం 8 గంటలకు ముంబాయి చేరుకుంటామని మేము అనుకున్నాము. కానీ మన్మాడ్ చేరుకున్నాక ఇంజన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. మేము మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముంబాయి చేరుకున్నాము. బాబా చెప్పినట్లే జరిగింది. కొన్నిరోజుల తరువాత బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో అప్పుడు మాకు అర్థమైంది. అదే మేము చివరిసారిగా బాబాను దర్శించింది.

బాబా మహాసమాధి చెందిన తరువాత, సుమారు 14 సంవత్సరాల క్రితం, ఒక రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, "అబ్బాయీ, నువ్వు నన్ను నీ గురువుగా ఇతరులతో చెప్పుకుంటున్నావు. నేను నీకు ఏదైనా ఉపదేశమిచ్చానా?" అని అడిగారు. తరువాత నన్ను చేతులు కడుక్కుని రమ్మని ఆదేశించారు. తరువాత మరాఠీలో ఒక శ్లోకాన్ని చెప్పి వల్లెవేయమన్నారు. కలలో ఆ శ్లోకాన్ని నేను చాలా బాగా వల్లెవేశాను. ఆ విధంగా బాబా నాకు కలలో మంత్రోపదేశం చేశారని భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తరువాత ఆ మరాఠీ శ్లోకం నాకు ఏ మాత్రం గుర్తులేదు. ఇప్పటికీ నేను ఆ శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను.

రెండేళ్ల క్రితం నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా సంస్థ నిబంధనల ప్రకారం 55 సంవత్సరాలకు పదవీ విరమణ చేయాలి. నేను అందుకు సిద్ధపడుతూ ఉన్నాను. ఆ సమయంలో నాకొక కల వచ్చింది. కలలో కంపెనీ డైరెక్టర్ కనిపించి, కంపెనీ విడిచిపెట్టడం గురించి కలత చెందనవసరం లేదని చెప్పారు. ఆ తరువాత కంపెనీలో ఎవరూ నన్ను పదవీ విరమణ చేయమని అడగలేదు.

నాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాకు ఎన్నో కుటుంబ బాధ్యతలున్నాయి. కానీ నా వ్యవహారాలన్నీ బాబా చూసుకుంటున్నారు. నేను దేనికోసమూ ఆయనను ప్రార్థించను. నాకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. అది ఇవ్వడం ఆయన చేతుల్లో ఉంది, అదీ ఆయనకు ఇష్టమైతే. అడిగి ఆయనను ఇబ్బంది పెట్టకూడదని నేను భావిస్తున్నాను. మనకు ఏమి కావాలో ఆయనకు తెలియదా? అది తెలిసిన ఆయనను మనం ప్రార్థనలతో ఇబ్బంది పెట్టకపోతే మనకు మేలైనది ఇవ్వరా? కాబట్టి మనకు సంబంధించిన విషయాలను ఆయన ఇచ్ఛకు వదిలిపెట్టి సంతృప్తిగా ఉండగలిగితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము.

సమాప్తం.

Source: Devotees' Experiences of Sri Sai Baba Part II by Sri.B.V.Narasimha Swamiji

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo