సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వాసుదేవ్ సీతారాం రతన్‌జన్‌కర్ & మాలన్‌బాయి



సాయిలీల ద్వైమాసపత్రిక మే-జూన్ 2008 సంచికలో ప్రచురితమైన వాసుదేవ్ సీతారాం రతన్‌జన్‌కర్ లేఖ సారాంశం:

నేను సాయి గురించి, ఆయన లీలల గురించి మొట్టమొదట కుశాభావు (వేదశాస్త్ర సంపన్న కృష్ణనాథ్ బువా మీరజ్‌గావ్‌కర్ జోషీ) ద్వారా బహుశా 1908వ సంవత్సరంలో విన్నాను. భక్తులందరూ ఆయనను పూజకు ఆహ్వానించి సత్కరిస్తుండేవారు. గ్రామంలో ఈవిధంగా చాలారోజులు గడిచాయి. ఒకరోజు వేదశాస్త్ర సంపన్నులైన సీతారాంభట్‌జీ ఘాటేగారి ఇంట పూజకు ఏర్పాటు చేశారు. ఆయన నా మేనమామ అయినందున నేను ఆ పూజకు హాజరయ్యాను. సాయి కథలు వింటూ నాకు ఈ సాయి(అనగా బాబా భక్తుడైన కుశాభావు) మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా పూజ చేస్తే బాగుండుననిపించింది. మరుక్షణం ఆ మహరాజ్, “రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను” అని అన్నారు. నాకు ఒకేసారి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఆ ఆనందంలోనే పూజకు కావలసిన ఏర్పాట్లు ఏమేమి చేయాలో ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళి అందరికీ విషయం చెప్పాను.

మరుసటిరోజు తెల్లవారుఝామున మా అమ్మ గంగాబాయికి కలలో కాషాయవస్త్రాలు ధరించిన ఒక యోగి నేరుగా మా ఇంటికి వస్తూ కనిపించారు. ఆమె వారిని ఆహ్వానించి కూర్చోవడానికి ఆసనం చూపించింది. కానీ ఆయన కూర్చోక నిలుచొని ఉన్నారు. వారి పాదాలపై ఆమె తన శిరస్సు ఉంచింది. ఆమె తల వారి పాదాలు తాకిన మరుక్షణంలో ఆమెకు మెలకువ వచ్చింది. ఆమె తన స్వప్నవృత్తాంతాన్ని అందరికీ చెప్పింది. కానీ ఎవరూ ఆమె చెప్పినదానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అదేరోజు నేను మళ్ళీ మా మేనమామగారి ఇంట పూజకు వెళ్ళాను. మహరాజ్ అందరికీ తీర్థప్రసాదాలు పంచుతూ నాకు ఒక సాయిబాబా ఫొటో ఇచ్చి, ‘దీన్ని పూజలో పెట్టుకొని ప్రతిరోజూ పూజించు’ అని చెప్పారు. నేను ఆ ఫొటో తీసుకొని ఇంటికి వచ్చాక మా అమ్మకి వచ్చిన కల యొక్క ప్రాధాన్యతను అందరూ గ్రహించారు. తరువాత నేను మహరాజ్‌ని మధ్యాహ్న భోజనానికి మా ఇంటికి వచ్చి, మా ఇంటిలో పూజ చేయమని ఆహ్వానించాను. ఈ విధంగా నాకు సాయిబాబా గురించి తెలిసింది.

తరువాత బాబా ప్రసాదించిన అనుభవాలను భక్తులు ఎప్పటికప్పుడు చెప్పగా విని శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని, వారి ఆశీస్సులు పొందాలని నాకు కోరిక కలిగింది. అయితే రెండు, మూడు సంవత్సరాల తరువాతే (1912లో) నా కోరిక ఫలించింది. అప్పటి  బ్రిటిష్ చక్రవర్తి బొంబాయి వస్తున్నందువల్ల నేను బొంబాయి వెళ్లాల్సి ఉంది. సరిగ్గా అదేసమయంలో ఒకరోజు ఉదయం శ్రీశివదాస్ దాతే అనే అతను శిరిడీ వెళ్లేందుకు నాకొక టిక్కెట్ యిచ్చాడు. అది నాకు బాబా పంపిన ఆహ్వానంగా భావించి నేను నా బొంబాయి ప్రయాణాన్ని రద్దు చేసుకొని అదేరోజు సాయంత్రం శిరిడీ ప్రయాణమయ్యాను. అక్కడ నాకెన్నో అద్భుతాలు, సంకేతాలు అనుభవమయ్యాయి. బాబాపై కొన్ని కవితలు వ్రాయాలనిపించి ఒక ‘పద్యమాల’ కూడా రచించాను.

నేను చూసిన అద్భుత అనుభవాలలో స్వర్గీయ శ్రీమతి మాలన్‌బాయికి సంబంధించిన అనుభవం బాబా సర్వశక్తిమత్వానికి, వారి అపారమైన అనుగ్రహానికి గొప్ప ఉదాహరణ. శ్రీమతి మాలన్‌బాయి మా పిన్ని కూతురు. ఆమె స్వర్గీయ శ్రీదామోదర్ రంగనాధ్ జోషీ దేగావన్కర్ గారి కుమార్తె. ఆమె చాలాకాలం జ్వరంతో బాధపడింది. చివరికది క్షయవ్యాధిగా పరిణమించింది. ఎందరో వైద్యులకి చూపించి, ఎన్నో మందులు వాడినప్పటికీ ఎటువంటి గుణం కనపడలేదు. ఆఖరికి మేము మందులతోపాటు తనకి బాబా ఊదీ కూడా ఇవ్వడం మొదలుపెట్టాము. అయితే వ్యాధి బాధలతో విసిగిపోయిన మాలన్‌బాయి తనను బాబా దర్శనానికి తీసుకొని వెళ్లమని, అప్పుడే తనకు నయమవుతుందని చెప్పసాగింది. కానీ ఆమె కనీసం కూర్చోవడానికి కూడా శక్తిలేనంత బలహీనంగా ఉంది. అటువంటి స్థితిలో ప్రయాణం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ ఆమె పరిస్థితికి జాలిపడి వైద్యులు ఆమెను శిరిడీ తీసుకొని వెళ్ళడానికి ఒప్పుకొన్నారు. దానివల్ల ఆమెకి మానసికంగా కొంత ఉపశమనం చేకూరవచ్చని వాళ్ళ ఉద్యేశం. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఆమెను శిరిడీ తీసుకొని వెళ్లారు.

బాబా ఆమెను చూస్తూనే తిట్టిపోస్తూ, “ఆమెను దుప్పటి మీద పడుకోనివ్వండి. మట్టికుండలో నీళ్లు మాత్రమే త్రాగడానికి ఇవ్వండి” అని అన్నారు. “బాబా మాత్రమే తనకు నయం చేస్తారు” అని పదేపదే చెప్తూ ఆమె ఏడెనిమిది రోజులపాటు కేవలం నీళ్లు మాత్రమే త్రాగి బ్రతికి ఉంది. ఆ మరుసటిరోజు బాబా తాము సాధారణంగా నిద్రలేచే సమయం దాటినా నిద్రలేవలేదు. కాకడ ఆరతికని వచ్చిన భక్తులు సహనంతో వేచిచూస్తూ, బాబా ఎందుకు ఇంకా నిద్ర లేవడం లేదని ఆశ్చర్యపోసాగారు. మరోవైపు అక్కడ దీక్షిత్ వాడాలో ఉన్న మాలన్‌బాయి మరణించింది. బంధువులు ఆమె అంత్యక్రియలకి ఏర్పాట్లు చేయనారంభించారు. నేను, మా పిన్నమ్మ విచారంగా మాలన్‌బాయి ప్రక్కనే కూర్చొని ఉన్నాము. సాయిభక్తుడు సాఠేకాకా మమ్మల్ని ఓదారుస్తున్నాడు. హఠాత్తుగా మాలన్‌బాయిలో కదలిక వచ్చింది. ఆవలిస్తూ అప్పుడే నిద్రలేస్తున్నట్లు కళ్ళు తెరచి భయంభయంగా చుట్టూ చూడసాగింది. అక్కడున్న వారందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. ఆమె నెమ్మదిగా ఏదో చెప్పబోతుంటే అందరమూ శ్రద్ధగా ఆలకించసాగాము. ఆమె, “నల్లగా ఉన్న ఒక వ్యక్తి నన్ను తీసుకుపోతుంటే, భయంతో అరుస్తూ బాబాను సహాయం చేయమని అర్థిస్తున్నాను. అప్పుడు బాబా వచ్చి తమ సటకాతో ఆ వ్యక్తిని కొట్టి, అతని పట్టునుండి నన్ను రక్షించి చావడిలోకి తీసుకొని వెళ్ళారు” అని చెప్పింది. ఇంకా, చావడి ఎలా ఉంటుందో వివరంగా వర్ణించి చెప్పింది. విచిత్రమేమిటంటే ఆమె అప్పటివరకూ చావడిని చూడలేదు.

సరిగ్గా ఆమె లేచే సమయానికి చావడిలో నిద్రపోతున్న బాబా అకస్మాత్తుగా లేచి సటకాతో కొడుతూ మాలన్‌బాయి ఉన్న దీక్షిత్ వాడా వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటివరకూ బాబా ఇంకా నిద్రలేవకపోవడమేమిటని చర్చించుకుంటూ ఉన్న భక్తులంతా బాబా వెనుకనే పరుగెత్తుకుంటూ వచ్చారు. మరణించిందనుకున్న మాలన్‌బాయి చిత్రంగా తిరిగి బ్రతికిందన్న వార్తను బాబాతో చెప్పాలని వెళ్తున్న మాకు బాబా వాడా వద్దనే ఎదురయ్యారు. అవసరమైతే బాబా తమ భక్తుల మరణాన్ని కూడా తప్పిస్తారన్నదానికి నిదర్శనమీ అద్భుత లీల.

వాసుదేవ్ సీతారాం రతన్‌జన్‌కర్,
హైదరాబాద్ రెసిడెన్సీ.
ఇంటి నెంబరు.163.

సోర్స్: అంబ్రోసియా ఇన్ శిరిడీ.

6 comments:

  1. Very nice leela 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Saibaba is great.

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo