బాబా ప్రేమ, శ్రద్ధ(పర్యవేక్షణ) మానవ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లే వారి శక్తులు మానవుని యొక్క స్థాయి, పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనలో ఎవరూ ఒకేసారి డజను మందిపై ఆసక్తి చూపడం, వారి వ్యవహారాలను చూసుకోవడం చేయలేరు. అయితే, బాబా కోట్లాది మంది భక్తులు ఏ ఏ (దూర)ప్రాంతాల్లో ఉన్న ఎల్లవేళలా వాళ్లపై తమ దృష్టినుంచి వాళ్ళ అవసరాలను చూసుకుంటున్నారు. బాబా ఒక సందర్భంలో "నేను 4000 మందితో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక అంటువ్యాధి చెలరేగింది. భయపడుతున్న ఆ 4000 మందితో నేను, 'మిమ్మల్ని చావనిచ్చే కంటే నేను చనిపోతాను. మిమ్మల్ని మాత్రం చావనివ్వను' అని హామీ ఇచ్చాను" అని అన్నారు. ఈ విధమైన సర్వమూ తెలుసుకునే శక్తిని, రక్షించే శక్తిని మాత్రమే దైవమని(సర్వశక్తి, సర్వజ్ఞత మరియు సర్వవ్యాపకత) అంటారు. వేరే ఏ ఇతర పదం అందుకు సరిపోదు. ఒకే సమయంలో ప్రాపంచిక, పారమార్థిక సహాయాన్ని పొందుతున్న నానా, 'బాబా దైవం తప్ప మరొకటి కాదని, ఉపనిషత్తులలో చెప్పబడ్డ ఆ దైవం(బ్రహ్మం) అస్పష్టంగా ఉండి, మూర్తి రూపాలలో ఆరాధించినప్పటికీ ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండదని, దైవం సాయిబాబా వంటి సద్గురు రూపాన్ని తీసుకోనంతవరకు దైవమొక గుర్తించలేని సుదూర లేదా అనుభవంలో అనుభూతి చెందలేని విషయం(వస్తువు)' అన్న చాలా బలమైన అభిప్రాయాన్ని పొందాడు. అంతేకాదు, తన పూర్వ పుణ్యమే తనకు తాను అత్యంత శక్తిశాలి, పరమ ప్రేమమూర్తి అయినా సాయిబాబాగా వ్యక్తమైందని భావించాడు. సరే ఇక అందరినీ ప్రేమిస్తూ, జాగ్రత్తగా చూసుకొనే బాబా ఎలా, ఏ ఇతర మార్గాల్లో నానా ప్రాపంచిక, ఆధ్యాత్మిక సంక్షేమాన్ని చూసుకున్నారో తెలుసుకొనేందుకు మనం మరింత పరిశీలన చేద్దాం.
ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబంతో శిరిడీలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవించింది. వాళ్ళు బాబా అనుమతి తీసుకొని గ్రహణకాలంలో పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించడానికి శిరిడీ నుండి కోపర్గాఁవ్ వెళ్ళారు. గ్రహణం ప్రారంభవుతూనే ఒక మహర్(మహారాష్ట్ర, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్ కులస్తులు), "గ్రహణం విడిపోయేలోపు దానం చేయండి(దే ధాన్ సుటే గ్రహణ) అని అరుస్తూ వచ్చాడు. నానాసాహెబ్ అతనికి నాలుగు అణాలు(రెండు అణాల నాణేలు రెండు) ఇచ్చాడు. అదే సమయంలో మసీదులో బాబా తమ పక్కన కూర్చుని ఉన్న భక్తుడు నందూరామ్ మార్వాడికి రెండు అణాల నాణేలు రెండు చూపుతూ, "చూడు! ఈ నాలుగు అణాలు నానా నాకిచ్చాడు" అని అన్నారు. తర్వాత నానాసాహెబ్ కోపర్గాఁవ్ నుండి శిరిడీకి తిరిగి వచ్చినప్పుడు నందూరామ్ మార్వాడి అతనిని, "గ్రహణ సమయంలో మీరు ఎంత దానం చేశారు?" అని అడిగాడు. నానా, "నేను ఒక మహర్కి నాలుగు అణాలు ఇచ్చాను" అని బదులిచ్చాడు. అప్పుడు నందూరామ్ మార్వాడి ఆశ్చర్యంతో ఆ నాణేలు బాబా ఇక్కడ నాకు చూపించారు అని చెప్పాడు. అది విని నానా కూడా ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ద్వారా నానాసాహెబ్కు, ఇంకా ఇతర భక్తులకు శిరిడీ మసీదులో కూర్చొని ఉన్న బాబా తమ భక్తుల సంక్షేమం కోసం వివిధ రూపాలు ధరించి పలు ప్రాంతాలకు ఎలా ప్రయాణిస్తారో అర్థమైంది.
1906లో నానాసాహెబ్ చందోర్కర్కి పండరిపురంకి బదిలీ అయింది. నందుర్బార్లో ఉత్తర్వులందుకున్న వెంటనే నానా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత అతను నందుర్బార్ వదిలి పండరిపురం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అయితే, 'భూ వైకుంఠంగా పిలవబడే పండరిపురంలో ఉంటూ విఠలుని దర్శించుకోకుండా ఎలా ఉండాలి? కానీ, అలా విఠలుని దర్శించుకుంటూ ఉంటే బాబా పట్ల భక్తిని కోల్పోతానేమో!' అనే సందేహం అతనిని సంఘర్షణకు గురిచేసింది. ఏదేమైనా శిరిడీయే అతని ప్రథమ పండరీపురం కనుక, కుటుంబంతో ముందు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించి, ప్రణామాలర్పించి, వారి ఆశీస్సులు తీసుకొని పండరిపురం వెళ్లాలనుకొని సామానంతా సర్దుకొని త్వరగా బండిలో కూర్చున్నాడు. అతను శిరిడీ వస్తున్నట్టు ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు, కబురు కూడా పంపలేదు. అందువల్ల అతను వస్తున్నట్లు శిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నీంగావ్ గ్రామ శివారుకు వచ్చేసరికి శిరిడీలోని మశీదులో బాబా తమ వద్ద కూర్చొని ఉన్న మహాల్సాపతి, అప్పాశిండె, కాశీరాం మొదలగు భక్తులతో "పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనందరం కలిసి ఆనందంగా భజన చేద్దాం" అని
పండర్ పుర్లా జాయాచే జాయాచే|
తే తిథేంచ్ మజలా రాహ్యాచే॥
తిథేంచ్ మజలా రాహ్యాచే|
ఘర్ తే మాఝ్యా రాయాచే॥
'పండరిపురానికి వెళ్ళాలి. నేను అక్కడ ఉండాలి. నేను అక్కడే ఉండాలి. అది నా ప్రభువు ధామం' అన్న భజన గీతాన్ని బాబా స్వయంగా పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరినాథుని ప్రేమలో లీనమైపోయారు. అంతలో నానాసాహెబ్ తన కుటుంబ సమేతంగా శిరిడీ చేరుకొని బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి, "పండరీపురం వచ్చి ఉండమ"ని విన్నవించుకున్నాడు. అతను అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరిపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. అది విని తన మదిలోని సందిగ్ధతకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపే భజన గీతాన్నే బాబా ఆలపించారని నానా ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆనందంతో గద్గదుడై బాబా చరణాలపై శిరసు ఉంచాడు. బాబా ఆశీర్వాదాన్ని, ఊదీ ప్రసాదాన్ని తీసుకొని పండరిపురం వెళ్ళాడు.
1906లో నానాసాహెబ్ తన భార్యతో కలిసి పండరీపురం నుండి శిరిడీ వెళ్ళాడు. అప్పుడొకరోజు నానాసాహెబ్ భార్య బాబా దర్శనానికి వెళ్లినప్పుడు బాబా, "రా ఆజీబాయి(అమ్మమ్మ)" అని ఆమెని స్వాగతించారు. బాబా మామూలుగా ఆమెను 'ఆయీ'(అమ్మ) అని పిలిచేవారు. ఆరోజు మాత్రమే అలా ప్రత్యేకించి పిలిచారు. ఆ కొత్త పిలుపుకు ఆమె మురిసిపోయింది. ఆమె తిరిగి తన బసకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తన భర్త నానాసాహెబ్తో చెప్పింది. వెంటనే అతను బాబా మాటలలోని ప్రాముఖ్యతను గ్రహించి, "ఖచ్చితంగా మన అమ్మాయి ద్వారక బిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది" అని అన్నాడు. అదే నిజమని మరుసటిరోజే ఆ దంపతులకు ఒక ఉత్తరం వచ్చింది. బాబా నానాసాహెబ్ భార్యను 'ఆజీబాయి' అని పిలిచిన అదే సమయంలో పండరీపురంలో ఉన్న నానాసాహెబ్ కూతురు ద్వారక ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
నానాసాహెబ్ సలహామేరకు అతని భార్య నియమబద్ధంగా నామజపం చేస్తుండేది. ఒకరోజు ఆమె బాబా వద్ద కూర్చొని ఉన్నప్పుడు బాబా ఆమెతో, "అమ్మా! నువ్వు చాలా ధాన్యాన్ని విసురుతున్నావు, కానీ, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు" అని అన్నారు. ఆమెకు బాబా మాటలలోని అంతరార్ధమేమిటో అర్థం కాలేదు. ఆమె తిరిగి తన బసకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తన భర్త నానాసాహెబ్తో చెప్పింది. అప్పుడు అతను, "బాబా చెప్పింది నిజమే. నువ్వు చాలా జపం చేస్తున్నావు కానీ, నీ మనసు వందలాది విషయాల వైపు మళ్ళుతుంది. జపంతోపాటు స్వరూపానుసంధానం కూడా అవసరం. బాబా ఈ సలహా కేవలం నీకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది" అని వివరించాడు.
1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు, “క్రిందపడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుంది” అని అన్నాడు. అప్పుడు బాబా, "నాకు అద్దాలు అక్కరలేదు. నా అద్దాల విలువ నలభై రూపాయలు" అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థాన్ని నానాసాహెబ్ తన కుమార్తె మైనతాయితో ఇలా వివరించారు: “ ‘అద్దం’ అంటే ‘ఆత్మసాక్షాత్కారము’ అని, ‘నలభై రూపాయలు’ అంటే ‘నలభై సంవత్సరాలు’ అని. అంటే ‘బాబాకు నలభై సంవత్సరాల క్రితం ఆత్మసాక్షాత్కారమైంది’ ”.
అన్ని జీవులలో నేను ఉన్నానని గుర్తుంచుకో
తరువాయి భాగం త్వరలో..
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది. |
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|