ఈ భాగంలో:
- శ్యామ్రావ్ రావూజీ శ్రోత్రి.
- శ్రీ దినకరరావ్ జయకర్.
- తుకారాం బర్కు.
శ్యామ్రావ్ రావూజీ శ్రోత్రి
సాయిభక్తుడు శ్యామ్రావ్ రావూజీ శ్రోత్రి కాయస్థ ప్రభు కులానికి చెందినవాడు. అతడు థానా జిల్లాకోర్టులో రికార్డు గుమాస్తాగా పనిచేశాడు. అతడు సాయిబాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి అంటే, 1909వ సంవత్సరంలో శిరిడీ వెళ్ళాడు. ఆ సమయంలో అతడు ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేసుకొని, ఆయనకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చున్నాడు. అంతలో అతని మనస్సులో ఒక ప్రశ్న తలెత్తింది. అతని మనసెరిగిన బాబా వెంటనే అతనిని ఆలయంలో పురాణం చదువుతున్న బాయి వద్దకు వెళ్ళమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం అతడు వెంటనే ఆలయానికి వెళ్ళాడు. అక్కడ యాభై సంవత్సరాల వయస్సున్న ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తోంది. శ్యామ్రావ్ అక్కడ కూర్చుని, ఓపికగా ఆమె చదువుతున్న పురాణాన్ని వినసాగాడు. ఆశ్చర్యకరంగా ఆమె చదువుతున్న భాగమే కొద్దిసేపటి క్రితం బాబా సమక్షంలో ఉన్నప్పుడు తన మనస్సులో మెదిలిన ప్రశ్నకు సమాధానమైంది. అది భక్తుల మనసెరిగి సమాధానమిచ్చే బాబా విశిష్ట పద్ధతి.
ప్రముఖ సాయిభక్తుడైన శ్రీశ్యామరావ్ జయకర్ కుమారుడే శ్రీదినకరరావ్ జయకర్. అతను ముంబైలోని విలేపార్లేలో నివాసముండేవాడు. అతడు సాయిబాబాను దర్శించి, ఆయన వద్ద కొంతకాలమున్న అదృష్టవంతుడు. అతడు తన స్మృతులలో ఇలా అన్నాడు: "ఒకసారి నేను ద్వారకామాయిలో సాయి సమక్షంలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ, కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తరువాత సాయిబాబా మసీదు అంచున నిలబడి, మరాఠీలో బిగ్గరగా, "జరా థావ్! (కొంచెం ఆగు)" అని కేకవేశారు. వెంటనే తుఫాను నిలిచిపోయింది. ఈ సంఘటన సాయిబాబా అష్టసిద్ధులు కలిగివున్నారని, ప్రకృతిపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉందని స్పష్టంగా తెలియజేసింది".
సాయిభక్తుడు తుకారాం బర్కు ఒక భూస్వామి. 1912వ సంవత్సరంలో మొదటిసారి గోదావరి కాలువల్లోకి నీటిని వదిలినప్పుడు అతడు ఉపాధి కోసం శిరిడీ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగాఁవ్ అనే గ్రామం వెళ్లేందుకు బయలుదేరాడు. అతడు కోపర్గాఁవ్ రోడ్డులో ఉన్నప్పుడు బాబా లెండీకి వెళ్తూనో, వస్తూనో అతనికి కనిపించారు. ఆయన అతని భుజంపై తమ చేయి వేసి, "వెళ్ళవద్దు!" అన్నారు. కానీ అతడు ఆయన సలహాను పట్టించుకోకుండా కరంజీగాఁవ్ వెళ్ళాడు. అక్కడికి చేరిన మరుసటిరోజు అతనికి జ్వరం వచ్చి, చాలాకాలంపాటు బాధపడ్డాడు. ఆ స్థితిలో జీవనోపాధి మాట అటుంచి, సహాయం కోసం ఆ గ్రామంలోని దూరపు బంధువుల దయపై అతడు ఆధారపడాల్సి వచ్చింది. అక్కడ జ్వరంతో 15 రోజులు బాధపడ్డాక తిరిగి శిరిడీ వెళ్లిపోవాలని అతనికి బలంగా అనిపించింది. శిరిడీ చేరుకున్నాక కూడా అతడు జ్వరంతో 45 రోజులు బాధపడ్డాడు. అప్పుడొకరోజు అతడు తన తల్లితో, బాబా వద్దకు వెళ్లి ఊదీ తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె బాబా వద్దనుండి ఊదీ తీసుకొచ్చి కొడుకుకి పెట్టింది. మరుసటిరోజు నుండి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది.
సమాప్తం.
Source: Devotees' Experiences of Shri Sai Baba, Part II , III by Late Shri.B.V.Narasimha Swamiji.