సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సావిత్రీబాయి టెండూల్కర్ కుటుంబం


సావిత్రీబాయి టెండూల్కర్, ఆమె భర్త రఘునాథ్ టెండూల్కర్ ఇరువురూ శ్రీసాయిబాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు ముంబాయిలోని బాంద్రాలో నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులకు నలుగురు సంతానం. కుటుంబమంతా బాబాకు అంకిత భక్తులు. రఘునాథ్ టెండూల్కర్ పదునైన తెలివితేటలు, గంభీరమైన స్వభావం మరియు గొప్ప అభ్యాసశక్తి గల వ్యక్తి. వారి కుటుంబం వార్కరీ సంప్రదాయానికి చెందినవారు. కుటుంబమంతా మతపరమైన ఆచారవ్యవహారాలలో ఆసక్తి కలవారు. అయినప్పటికీ, ఆ కాలంలోనే సావిత్రీబాయి భావనలు చాలా ఉన్నతంగా ఉండేవి. ఆమె సుప్రసిద్ధ "శ్రీ సాయినాథ భజనమాల" అను గ్రంథమును మరాఠీ భాషలో 800 అభంగములు, పదములతో వ్రాసారు. ఈ పుస్తకానికి
ఆమె భర్త రఘునాథ్ టెండూల్కర్ సహ రచయితగా వ్యవహరించారు. ఈ పుస్తకంలో బాబా లీలలు, వారి దైవత్వానికి సంబంధించిన ఆమె అనుభవాలు ఉన్నాయి. మరో సాయి మహాభక్తుడు శ్రీ హరి సీతారామ్ దీక్షిత్ ఈ ప్రసిద్ధ భజనమాలకు ముందుమాట వ్రాశారు. ఇది దప్పికగొన్న సాయిభక్తులకు అమృతజల్లు వంటిది (చాప్టర్ 2, శ్రీ సాయి సచ్చరిత్ర). అంతేకాకుండా సావిత్రీబాయి టెండూల్కర్ శ్రీసాయిలీలా మ్యాగజైన్ కోసం అనేక కథనాలను రచించారు.

'వకుళ పుష్పముల'తో బాబాకు అర్చన:

వాళ్ళ ఇంటి ప్రాంగణంలో పెద్ద వకుళ పుష్పముల చెట్టు ఉండేది(ప్రాచీన భారతీయులు ఈ వృక్షాలను పవిత్రమైనవిగా, దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతిగా భావించేవారు. ఆలయాలలో దేవతారాధన కోసం ఎక్కువగా ఈ పువ్వులను ఉపయోగిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడు ఈ చెట్టు నీడనే వేణుగానం చేసేవాడట). ఆ చెట్టు మూడునెలలపాటు పుష్కలంగా పూలు ఇచ్చేది, మూడు నెలల తరువాత పూలు తగ్గిపోయేవి. ఈ పుష్పాలు ఉదయాన నేలపై రాలిపోతాయి. కానీ, గంటల తరబడి వాటి సువాసన అలానే ఉంటుంది. రాలిపడే ఆ పువ్వులు దాదాపు పదివేల దాకా ఉండేవి. సావిత్రీబాయి ఆ పూలను సేకరించి, వాటిని బాబాకు సమర్పించుకునేది. ఇది రోజువారీ వారి ఆచారంగా ఉండేది. ఆమె వద్ద ఒక చిన్న బాబా ఫోటో ఉండేది. ఆ ఫోటోకే ఆమె నిత్యం పూజచేసేది. ఆమె ముందుగా వకుళ పుష్పాలను పరుపులా ఒత్తుగా పరిచి దానిపై బాబా ఫోటో ఉంచి మురిసిపోయేది. శ్రద్ధగా ప్రతి పువ్వును పరిశీలించి మంచి మంచి పువ్వులతో మాలను కట్టి బాబాకు అలంకరించేది. మిగిలిన పువ్వులను నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్కటిగా బాబాకు సమర్పించుకునేది. అందువలన లెక్కలేనన్ని పువ్వులతో బాబా ఫోటో పూర్తిగా కప్పబడిపోయేది.

ఆమె ఒకసారి షిర్డీ వెళ్ళినప్పుడు బాబా వద్ద చాలామంది భక్తులు కూర్చుని ఉన్నారు. బాబా ఆమెను చూస్తూనే ప్రక్కనే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ తో, "గత మూడు నెలలుగా నేను షిర్డీలో లేను, ఈ తల్లి ఇంటిలో ఉన్నాను. ఈమె నన్ను వకుళపూలతో ముంచెత్తింది. వాటి పరిమళాల మత్తు నుంచి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నాను" అన్నారు. తన ఇంట చేసే పూజను బాబా స్వీకరించానని చెప్పడంతో ఆమె హృదయం ద్రవించిపోయి కన్నుల నిండా ఆనందభాష్పాలు నిండిపోయాయి. ఈ వివరాలను ఆమె రచించిన 'సాయినాథ భజనమాల' అను పుస్తకం రెండవ అధ్యాయంలో పొందుపరిచారు.

ఈ సందర్భంలోనే కాక సచరిత్రలో మరోచోట కూడా ఈ పువ్వుల ప్రస్తావన వస్తుంది. అది కూడా ఇక్కడ గమనిద్దాం. 1918 అక్టోబర్ 15న సాయిబాబా మహాసమాధి చెందారు. మరుసటిరోజు అక్టోబర్ 16 ఉదయాన పండరీపురంలో ఉన్న దాసగణుకి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, "మసీదు కూలిపోయింది, షిర్డీలోని నూనె వర్తకులు మరియు ఇతర వర్తకులు నన్ను ఎంతో కష్టపెట్టారు. అందుచే నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. ఆ విషయం నీకు తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాను. నీవు వెంటనే అక్కడికి వెళ్లి 'వకుళ పుష్పాల'తో నన్ను కప్పు" అని చెప్పారు. తెలవారుతూనే దాసగణుకు ఆ సమాచారం షిర్డీ నుండి అందింది. వెంటనే అతను తన శిష్యులతో కలిసి షిర్డీ చేరుకొని బాబాని సమాధి చేసేంతవరకు భజన, కీర్తనలు చేసాడు. బాబా ఆదేశానుసారం వకుళపుష్పమాలను బాబా సమాధి మీద ఉంచాడు. బాబా పేరు మీద అన్నసంతర్పణ కూడా చేసాడు.(సచ్చరిత్ర అధ్యాయం 42)

బాబు(బాపు) టెండూల్కర్ అలియాస్ మాధవరావ్ టెండూల్కర్:

సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ ల పెద్ద కుమారుడు బాబు(బాపు) టెండూల్కర్ అలియాస్ మాధవరావ్ టెండూల్కర్. అతడు 1898లో జన్మించాడు. అతను చిన్న వయస్సు నుండి చాలా చురుకుగా ఉండేవాడు. ఒకసారి సావిత్రీబాయి బాబుని షిర్డీ తీసుకొని వెళ్లి బాబా వద్ద విడిచిపెట్టింది. అదే బాబు మొదటిసారి షిర్డీ రావడం. అప్పుడు అతనికి కేవలం ఎనిమిదేళ్ల వయస్సు. బాబా భిక్ష కోసం వెళ్ళినప్పుడు, బాబు కూడా బాబాతో పాటు వెళ్ళేవాడు. అప్పుడు బాబు బాబా కన్నా ముందు పరుగుతీస్తూ భిక్షను సేకరించేవాడు. చివరిగా బాబా భిక్ష తీసుకొని తిరిగి మసీదు చేరిన తరువాత బాబా ఇచ్చే భిక్షా ప్రసాదాన్ని తీసుకొనే మొదటివ్యక్తి బాబునే. అలా రోజంతా బాబా సంరక్షణలో ఉన్న ఆ బిడ్డ ఎంతటి అదృష్టవంతుడో కదా!

అలా బాబు బాబా వద్ద ఉన్నప్పుడు ఒకసారి సావిత్రీబాయి షిర్డీ వచ్చే సమయానికి బాబు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. అతను ధుని దగ్గర ఒక మూలాన శోకిస్తూ మూలుగుతూ పడివున్నాడు. బిడ్డను అలా చూసి ఆమె, ‘ఏమిటి బాబా ఇదంతా?’ అని అడగగా, బాబా ప్రశాంతంగా, "చింతించకు తల్లీ, అతను పూర్తిగా కోలుకుంటాడు. అతనికి కొద్దిగా నీటిలో ఊదీ కలిపి ఇవ్వండి" అని చెప్పారు. ఆమె బాబా చెప్పినట్లుగా చేయగా ఆశ్చర్యకరంగా బాబు కొద్దిసేపటిలో కోలుకున్నాడు.

యుక్తవయస్సు వచ్చాక బాబు పాశ్చాత్య మెడికల్ విద్యలో పట్టభద్రుడయ్యేందుకు కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తుండేవాడు. ఆ రోజులలో విద్యుత్ ఉండేది కాదు, అయినప్పటికీ నూనె దీపాన్ని పెట్టుకొని ఆ వెలుగులో అర్ధరాత్రి వరకు బాబు చాలా కష్టపడి చదివాడు. అలా రాత్రింబవళ్ళు కష్టపడి చదివాడు. కానీ పరీక్షలు దగ్గర పడుతూ ఉండగా బాబు మనస్సు సందేహాలు, అనుమానాలతో నిండిపోయింది. అందువలన ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి పరీక్షలో ఉత్తీర్ణుడనవుతానా, లేదా? అని అడిగాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుస్తకాలు తిరగేసి, చేతివేళ్ళ మీద లెక్కలు వేస్తూ, నక్షత్రాలు, రాశిచక్రాలు, గ్రహాల స్థానాలను పరిశీలించి, చాలా దిగులుగా, ఆందోళనతో బాబు వైపు చూసి, "నీవు చాలా శ్రమపడి అధ్యయనం చేసావు, కానీ ఈ సంవత్సరం గ్రహస్థానాలు నీకు అనుకూలంగా లేవు. కానీ వచ్చే సంవత్సరం నీ గ్రహస్థితి బాగుంది. కావున రాబోయే సంవత్సరంలో నీవు నిస్సందేహంగా పరీక్షలో ఉత్తీర్ణుడవవుతావు" అని చెప్పాడు. అంతటితో బాబు పరీక్ష వ్రాసినా లాభంలేదని నిరాశతో ఆ సంవత్సరం పరీక్షలే వ్రాయనని పట్టుబట్టి కూర్చున్నాడు. కొన్ని రోజుల తరువాత బాబా దర్శనార్ధం సావిత్రీబాయి షిర్డీకి వెళ్లి బాబా దివ్య చరణాలపై ఆమె శిరస్సు ఉంచి నమస్కరించింది. బాబా వాళ్ళ కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఆమె బాబు వైద్య పరీక్షల గురించి జ్యోతిష్యుడు చెప్పిన వివరాలు చెప్పింది. బాబా ఆమెతో, "నిరాశ చెందవద్దు, ఆ జాతకాలను పక్కన పెట్టి, నా మాటల యందు విశ్వాసముంచి పరీక్షకు హాజరవ్వమని బాబుతో చెప్పు" అని చెప్పారు. ఆమె యింటికి వచ్చి బాబా సందేశాన్ని బాబుకు తెలియజేసింది. బాబా మాటల ద్వారా ప్రోత్సాహాన్ని పొంది, అతడు శ్రద్ధగా చదివి వ్రాత పరీక్షకు హాజరయ్యాడు. వ్రాత పరీక్షలు వ్రాసాడేగాని, పాస్ కాలేనన్న అనుమానంతో అతడు మౌఖిక(నోటి) పరీక్షకు హాజరు కాలేదు. కానీ బాబు తన వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని, అందువలన అతడు మౌఖిక పరీక్షకు హాజరు కావాల్సిందిగా స్వయంగా అతని పరీక్షల అధికారి ఒక విద్యార్థి ద్వారా కబురు పంపించాడు. బాబు తన స్నేహితుని ద్వారా ఆ వార్త విని చాలా సంతోషించాడు. వెంటనే అతను మౌఖిక పరీక్షకు హాజరై గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, బాబా కటాక్షముతో ఆ సంవత్సరం MBBS పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే - సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును; మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును. బాబా మాటయందు విశ్వాసంతో ఉండాలి, బాబా వాక్కుల ముందు జాతకములు, సాముద్రికములు ఏమీ పని చేయజాలవు(శ్రీసాయిసచ్చరిత్ర. అధ్యాయం 29). తరువాత బాబు మంచి డాక్టర్ గా గొప్ప ఖ్యాతి గడించాడు. ముంబాయి, వర్లీలో ఉన్న అతని క్లినిక్ 'సాయినాథ్ క్లినిక్' గా పిలవబడేది.

బాబా ఇచ్చిన జీవనభృతి:

రఘునాధ్ టెండూల్కర్ ముంబాయిలోని ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వయస్సు పైబడి ఉద్యోగ విధులు సక్రమంగా నిర్వర్తించడానికి శక్తిచాలక కొన్నిరోజులు సెలవు తీసుకున్నాడు. కానీ ఆ తరువాత కూడా తగిన శక్తి లేనందున రాజీనామా చేయతలచాడు. అతనికి నెలకు 150 రూపాయల జీతం వస్తూ ఉండేది. ఇప్పుడు రాజీనామా చేస్తే అందులో సగం అంటే కేవలం 75 రూపాయలు మాత్రమే పెన్షన్ అందుతుంది. ఆ మొత్తం తమ కుటుంబ అవసరాలకు సరిపోదని అతను ఆందోళన చెందాడు. ఆ సమయంలో ఒకరోజు సావిత్రీబాయికి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, "100 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నాకున్నది. ఇది నీకు సంతృప్తికరమేనా?" అని అడిగారు. అందుకు ఆమె, "బాబా! మేము మీపైనే ఆధారపడివున్నాము. మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే, నన్నెందుకు అడుగుతున్నారు?" అని బదులు చెప్పింది. అంతటితో కల ముగిసింది. తరువాత కంపెనీవారు కలలో బాబా చెప్పిన దానికన్నా పది రూపాయలు ఎక్కువగా అనగా 110 రూపాయల పెన్షన్ మంజూరు చేసారు. ఆవిధంగా బాబా టెండూల్కర్ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాబా తన బిడ్డలను, ఆశ్రితులను ఆదుకొనే విధానం వారివారి యోగ్యత, విశ్వాసములపై ఆధారపడి ఉంటుంది.

బాబా స్వహస్తాలతో ఇచ్చిన చిత్రపటం:

ఒకసారి బాబా తమ స్వహస్తాలతో సావిత్రీబాయికి తమ చిత్రపటాన్ని ప్రసాదించారు. ఆ ఫోటో ఇప్పటికీ ఆమె వారసుల వద్ద ఉంది. ఆ పటం పట్ల వాళ్ళకి ఎంత సెంటిమెంట్ అంటే బాబా చేతి ముద్రలు చెరిగిపోతాయేమోనని ఆ పటాన్ని తుడవడానికి కూడా భయపడి తుడవకుండా చాలా అపురూపంగా సంరక్షించుకుంటున్నారు.


శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 2,  అధ్యాయం 29, విన్నీ చిట్లురి గారు రచించిన బాబా'స్ ఋణానుబంద్)

9 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ఓం సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజు కి జై ......

    ReplyDelete
  3. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాద్ మహరాజ్ కి జై

    ReplyDelete
  4. Kothakonda SrinivasMay 2, 2021 at 9:05 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  5. ఓం సాయి రామ్ 🙏🏻🕉️

    ReplyDelete
  6. ఓం సాయిరాం నీ కరుణా కటాక్షం మాకు ఎంతో గొప్ప వరం..

    ReplyDelete
  7. సావిత్రి బాయి టెండూల్కర్ కుటుంబాన్ని దీవించిన విధంగా.. మమ్ములను కూడా మీ అమృతం లాంటి గొప్ప గొప్ప మహిమలు విశ్వ వ్యాప్తంగా ప్రచారం చేసుకునే గొప్ప సదవకాశం ను ప్రసాదించి .. మా అందరికి ఆయురారోగ్య అష్టఐశ్వర్యలు ప్రసాదించు సాయిదేవా..

    ReplyDelete
  8. మాకు వచ్చిన బాధలు కష్టాలు.. అన్నీ సాయిబాబాపై భక్తిప్రపత్తులను పెంచుకోవడానికే అని అర్థమైంది బాబా.. సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబాన్ని కాపాడిన విధంగా మా కుటుంబాన్ని కూడా మీ దివ్యమైన ఆశీస్సుల తో దీవించండి .. థాంక్యూ సాయినాథ.. ఇక చాలు దేవా. మేము అనారోగ్య ఆర్థిక భాధలు భరించలేక పోతున్నాము.. దయచేసి ఇక ఇప్పటి నుంచి మీ దివ్యమైన పాదాల పైన శ్రద్ధ భక్తులు రెట్టింపు అయ్యేలాగా మీ దయ తోని దివ్యమైన ఆశీస్సులు అందించి.. అన్నీ సెట్ చేసి.. మాకందరికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించు దేవా సాయినాథ.. మీరే దిక్కు మీరే సర్వస్వం.. సాయినాథా కరుణించు కాపాడు.. అమ్మానాన్న గురువుగారు దైవం అన్నీ మీరే సాయిరామ్ బాబా

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo