సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

గోవింద్ జి. పన్సారే


1912వ సంవత్సరంలో గోవింద్ జి. పన్సారే మరాఠీ మాధ్యమంలో 7వ తరగతి చదువుతున్నాడు. అతడు తన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో అతడు తరచూ శిరిడీ సందర్శించే భగవంత్ ఆర్. క్షీరసాగర్ ఇంటికి వెళ్తుండేవాడు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విషయంలో తనకి అనుమానం ఉందని క్షీరసాగర్‌తో అన్నాడు. అప్పుడు క్షీరసాగర్, పరీక్షలో ఉత్తీర్ణత కోసం బాబాను ప్రార్థించి, ఆ కోరిక నెరవేరితే కోపర్‌గాఁవ్ నుంచి శిరిడీ నడిచి వస్తానని, ఆయన ముందు సాష్టాంగ పడతానని మ్రొక్కుకొమ్మని పన్సారేకి సలహా ఇచ్చాడు. తరువాత జరిగిన పరీక్షల్లో గణిత పరీక్ష వ్రాయడంలో ఘోరంగా విఫలమయ్యాడు పన్సారే. అయినప్పటికీ అతడు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అంతేకాదు, అతనికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అప్పుడతను, "బాబా ఏదో చేయడం వల్లనే నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఉద్యోగం కూడా పొందగలిగాను" అని భావించి వీలైనంత త్వరగా బాబాను దర్శించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతడు కొంతకాలంపాటు శిరిడీ వెళ్లలేకపోయాడు.

చివరికి 1914, జనవరి 18న పన్సారే శిరిడీ వెళ్ళగలిగాడు. తాను మ్రొక్కుకున్న విధంగా కోపర్‌గాఁవ్ నుండి నడుచుకుంటూ శిరిడీ వెళ్లి ద్వారకామాయిలో అడుగుపెట్టాడు. అతను ఆత్రంగా మశీదు మెట్లెక్కుతుండగా బాబా అతనిని చూస్తూ, "నువ్వెందుకు ఇక్కడకు రావడానికి అంత ఆత్రంగా ఉన్నావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఏ పని చేస్తావు?" అని అడిగారు. అతడు భక్తితో, "నేను షోలాపూర్ నుండి వచ్చాను, నాకు టీచర్‌ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను" అని అన్నాడు. అప్పుడు బాబా, "నీకు ఉద్యోగం నేను ఇవ్వలేదు. ఆ భగవంతుడే నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు" అని అన్నారు.

తరువాత 1915లో పన్సారే మళ్ళీ శిరిడీ సందర్శించాడు. ఆ సమయంలో బాబా అతని వద్ద ఉన్న డబ్బంతా దక్షిణగా తీసేసుకున్నారు. అతనికి జోగ్‌తో బాగా చనువు ఏర్పడింది. జోగ్ అతనితో కాసేపు తనవద్ద కూర్చుని, తను చేసే మతపరమైన గ్రంథ పఠనాన్ని వినమని చెప్తుండేవాడు. కానీ అతడు ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్లి బాబా దగ్గర కూర్చునేవాడు. ఒకరోజు బాబా అతనికి ఐదు పువ్వులిచ్చి వాటిని జోగ్‌కు ఇవ్వమని చెప్పారు. అప్పుడు జోగ్, "స్వర్ణకారుడు మీ చెవులను కుట్టే సమయం ఆసన్నమైంది. నువ్వు బాబా వద్ద నుండి ఊదీ స్వీకరించేటప్పుడు అది నీకు అర్థమవుతుంది" అన్నాడు. తరువాత బాబా అతనికి ఊదీ ఇస్తూ, "నువ్వు అతను చదివేది వినవు, నీకు నువ్వుగా చదవవు. మేల్కొన్న వెంటనే ఇక్కడకు వచ్చి కూర్చుంటావు" అని అన్నారు. అప్పటినుండి పన్సారే జోగ్‌ వద్ద కూర్చుని, అతను చేసే గ్రంథ పఠనాన్ని వింటుండేవాడు.

తరువాత పన్సారే శిరిడీ నుండి బయలుదేరే సమయం వచ్చింది. కానీ అతని వద్ద డబ్బులు లేవు. తనకు అప్పు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దాంతో అతను అలాగే డబ్బులు లేకుండానే శిరిడీ నుండి బయలుదేరాడు. టికెట్ లేకపోయినప్పటికీ అతడు ఎటువంటి సమస్య లేకుండా రైలులో ధోండ్ వరకు ప్రయాణించాడు. అక్కడ అతనొక స్నేహితుణ్ణి కలుసుకున్నాడు. ఆ స్నేహితుడు అతనికి రెండు రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బులతో అతను టికెట్ తీసుకుని రైలెక్కాడు. అతను రైలులోకి వెళ్ళగానే టికెట్ కలెక్టర్ అతని టికెట్ తనిఖీ చేశాడు. తరువాత పన్సారే బాబాపట్ల అంకితభావంతో ఉంటూ గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు.

సమాప్తం. 

రెఫ్: శ్రీసాయిలీలా పత్రిక
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo