సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2086వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వృత్తి జీవితం గురించి బాబా భరోసా
2. అడ్డంకులు తొలగించిన బాబా

వృత్తి జీవితం గురించి బాబా భరోసా

నా పేరు మాధవి. మేము యూఎస్ఏలో ఉంటాము. ఒకసారి మా బాబుకి ఒక వారం పాటు సెలవులు వచ్చాయి. అప్పుడు మేము మరో రెండు కుటుంబాలతో కలిసి గుడికి వెళ్లాలని ముందుగా ప్రణాళిక వేసుకున్నాము. ఆ సమయంలో నేను నా వృత్తి జీవితంలో చాలా క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాను. నా వృత్తి జీవితంలో వచ్చిన విరామాల వల్ల ఉద్యోగం సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం నాకు సవాలుగా మారాయి. నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి అన్ని విధాలా సాధ్యమైన అన్ని ప్రయత్నిస్తున్నప్పటికీ నేను చాలా నిరాశకు గురై ఉన్నాను. ఆ స్థితిలో నేను నా సర్వస్వాన్ని బాబా పాదపద్మాల వద్ద సమర్పించి, నా పరిస్థితిని సరిచేయమని ఆయన్నే ప్రార్థించాను. తర్వాత 'ఈ సెలవుల్లో గుడిని సందర్శించగలిగితే, అది నా వృత్తి విషయంలో ఆయన ఆశీర్వాదాలకు సంకేతంగా భావిస్తానని' నాకు నేను చెప్పుకున్నాను. అయితే దురదృష్టవశాత్తు సెలవుల్లో జ్వరమొచ్చి నేను అనారోగ్యం పాలయ్యాను. మా ప్రయాణ సమయానికి కోలుకుంటానని ఆశించాను కానీ, నాకు నయం కాలేదు. నేను మాత్రమే కాదు, నా భర్త, మాతోపాటు రావాలనుకున్న ఇతర కుటుంబసభ్యులు కూడా జబ్బునపడ్డారు. నాకు చాలా నిరాశ కలిగి, 'బహుశా నా వృత్తి విషయంలో బాబా నాకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదేమో' అని ఆలోచించడం మొదలుపెట్టాను.

మేము ప్రయాణం అనుకున్న రోజు నాకు కొంచెం నయంగా అనిపించింది. కానీ నా భర్తకు ఇంకా ఒంట్లో బాగోలేదు. కనీసం నాకైనా దగ్గరలోని గుడికి వెళ్ళే అవకాశం కల్పించమని బాబాను ప్రార్థించి నా భర్తను అడిగాను. అయన ఆరోజు డ్రైవ్ చేయలేనని చెప్పి, మరుసటిరోజు వెళ్దామని అన్నారు. అది విని నాకు, 'బహుశా నేను కోరుకున్నట్టు జరగాలని లేదేమో!, నా కర్మలో భాగంగా నేను ఈ దశను ఎదుర్కోవలసిందేనేమో!' అని బాధగా అనిపించింది. ఏదేమైనా విషయాన్ని బాబాకు అప్పగించి ఊరుకున్నాను. కానీ ఒక అనూహ్య సంఘటన జరిగింది. సాయంత్రం సుమారు 5:30 గంటలకు నా భర్త అకస్మాత్తుగా, "మనం గుడికి వెళదామా?" అని అడిగారు. నేను ఆయన ఆరోగ్యం బాగుందో, లేదోనని, "రేపు వెళ్లొచ్చు" అని అన్నాను. అందుకు ఆయన 'తాను బాగానే ఉన్నానని, కారు నడపగలనని' అన్నారు. బాబాపట్ల నాకు అపారమైన కృతజ్ఞతాభావం కలిగింది. ఆ క్షణంలో నాకు ఎంత సంతోషం కలిగి ఉంటుందో మీరు ఊహించగలరనుకుంట! 

తర్వాత మేము గుడికి బయలుదేరుతుండగా, బాబా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉండాలని నా మనసులో ఒక చిన్న కోరిక మెదిలింది. ఒక క్షణం పాటు ఆ కోరిక నా మదిలో బలంగా ఉన్నప్పటికీ, అంత బలంగా కోరుకోవడం అత్యాశ అవుతుందేమోనని కూడా అనుకున్నాను. ఆ ఆలోచనలతోనే నేను గుడికి ప్రయాణం సాగించాను. మేము గుడికి వెళ్లేసరికి బాబా పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమిచ్చారు. ఆయనను ఆ విధంగా చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. నేను బాబాను, "నేను నా వృత్తి జీవితంలో విజయం సాధించాలి. ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించండి" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఇంటికి తిరిగి వచ్చాక అంతకంటే అందమైన సంఘటన జరిగింది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా గుడిలో బ్రహ్మదేవునిగా ఏదో వ్రాస్తూ కనిపించారు. నేను నిద్రలేచినప్పుడు నాకు ప్రగాఢమైన శాంతి, ఆనందం అనుభవమయ్యాయి. బాబా నా విధి వ్రాతను మార్చి వ్రాస్తున్నారని, ఆ విధంగా నాకు ఆయన భరోసా ఇస్తున్నారని నేను నమ్మాను. ఆరోజు నుండి నా వృత్తి జీవితం గురించి నాకు ఆందోళన లేదు. నేను ఇంకా పూర్తిగా స్థిరపడకపోయినప్పటికీ నేను నా వంతు కృషి చేస్తూ ఉంటాను, మిగిలినది బాబా చూసుకుంటారని నాకు పూర్తి విశ్వాసముంది. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఈ జన్మలోనే కాకుండా ప్రతి జన్మలోనూ మాతో ఎల్లప్పుడూ ఉండండి".

అడ్డంకులు తొలగించిన బాబా

సాయిభక్తులకు నా నమస్కారం. నా పేరు ఈశ్వరి. మాది శ్రీకాకుళం. బాబాపట్ల నాకు పూర్తి విశ్వాసం. నా బాధల్లో, కష్టాల్లో తోడుగా ఉంటానని ఆయన ఎన్నోసార్లు నాకు నమ్మకం కలిగించారు. ఒకసారి మేము తిరుపతి వెళ్లే ప్రయాణం పెట్టుకున్నాం, దర్శనం టికెట్లు, రానూపోనూ ట్రైన్ టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నాము. అయితే అనుకోకుండా దర్శనంకి వెళ్లేరోజు నా నెలసరి సమయం అయింది. అందువల్ల, "నెలసరి ముందుగా రావాల"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అద్భుతం జరిగినట్టు ఏడు రోజుల ముందే నెలసరి వచ్చేసింది. నేను మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకే సమస్య లేదు అనుకునేలాగా మావారికి ఆడిట్ అని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మేము ప్రయాణం పెట్టుకున్న రోజే ఆడిట్ అని చెప్పడంతో మావారు టెన్షన్ పడ్డారు. నేను మనసులో, 'ఆడిట్ మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత పెడితే బాగుంటుంది' అనుకొని బాబాను తలుచుకున్నాను. ఆరోజు రాత్రి మావారికి 'ఆడిట్ పోస్ట్ పోన్ అయింద'ని మెసేజ్ వచ్చింది. ఇదంతా బాబా వల్లే జరిగిందని నాకు తెలుసు గనక మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

సాయిభక్తుల అనుభవమాలిక 2085వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతా బాబా దయ
2. బాబా ఊదీ అనుగ్రహం

అంతా బాబా దయ

సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు కోమలవల్లి. 2026, ఫిబ్రవరిలో నేను విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడ్డాను. గొంతు నుంచి మాటలు కూడా రాలేదు. మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు డాక్టరుకి చూపించుకుంటే, మూడు రోజులకు మందులిచ్చారు. కానీ ఆ మందులు అయిపోయినా నాకు తగ్గలేదు. మా అమ్మవాళ్ళు, "వచ్చి చూపించుకొని వెళ్ళు" అన్నారు. కానీ మావారు హాస్పిటల్‌కి వెళ్తానంటే అరుస్తారు. నా పరిస్థితి చూస్తే,  గొంతునొప్పి, దగ్గు వలన ఏమీ తినలేకపోయేదాన్ని. కేవలం వేడి నీరు మాత్రమే తాగగలిగేదాన్ని. రాత్రిపూట విపరీతమైన దగ్గు, ముక్కు నుండి శ్వాస ఆడక చాలా ఇబ్బందిపడేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నేను ఇంక భరించలేకపోయాను. నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగలేకపోయినా ఎంతవరకు భరించగలనో అంతవరకు భరిస్తాను, ఇక నావల్ల కాదన్నప్పుడు బాబా ఊదీయే నాకు ఔషధం. రాత్రి 1:30 ప్రాంతంలో బాబాను, "దగ్గు, గొంతునొప్పి తగ్గించి ప్రశాంతమైన నిద్రని ప్రసాదించు బాబా" అని వేడుకొని కొంచెం ఊదీ గొంతుకి రాసుకొని, మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. అయితే ఆ తర్వాత కూడా విపరీతంగా ఇబ్బందిపడి ఏడ్చేసాను. తెల్లవారుజామున 4:30 గంటలకు నిద్రపట్టింది. రాత్రి అంతలా ఇబ్బందిపడినా ఉదయం 6 గంటలకు నిద్ర లేచేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. వరసగా మూడురోజులు ఊదీ గొంతుకు రాసుకొని, కొద్దిగా నోట్లో వేసుకుంటుంటే, గొంతునొప్పి, దగ్గు పూర్తిగా తగ్గిపోయాయి. అంతా బాబా దయ.

2026, మార్చి 31న మా మామయ్యగారు చనిపోయారు. మేము 7వ రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అందుకోసం నేను స్కూల్లో ఏప్రిల్ 1వ తేదీన నాకు ఏప్రిల్ 6వ తేదీన సెలవు కావాలని అడిగాను. అయితే ఏప్రిల్ 2వ తేదీన హఠాత్తుగా మా తోడికోడలు ఫోన్ చేసి, "7వ రోజు కార్యక్రమం 5వ రోజు అంటే ఏప్రిల్ 4న పెట్టుకుందామ"ని అంది. ఆరోజు నా సహోద్యోగి సెలవు తీసుకుంటున్నందున నాకు సెలవు ఇవ్వరు. ఆ విషయం చెప్పినా మా తోడికోడలు ఒప్పుకోలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా కార్యక్రమం 7వ రోజు జరిగేలా చూడండి. నేను ఏం చెప్పినా మా తోడికోడలు ఒప్పుకోదు. నీదే భారం" అని బాబాను వేడుకున్నాను. ఆరోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాక మా తోడికోడలు, "కార్యక్రమం 5వ రోజు చేయకూడదు. కాబట్టి 7వ రోజు చేద్దామ"ని అంది. ఇదంతా బాబా దయ మాత్రమే. "శతకోటి ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 2084వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడుగడుగునా కాపాడుతున్న బాబా
2. సమస్యలేమీ లేకుండా అనుగ్రహించిన బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 2083వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ
2. సాయినాథుని కృపతో ఏదైనా జరుగుతుంది

బాబా దయ

సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక బాబా భక్తురాలిని. నాకు తండ్రి లేరు. "నాన్న బ్రతికుంటే, నాకు మంచి సలహాదారుగా ఉండేవారు కదా!" అని బాధపడుతుంటే, ఈ బ్లాగులో "నేనే నీకు తండ్రిని. నిన్ను నేను విడువను. దిగులుపడకు" అని వచ్చింది. అప్పటినుంచి ప్రతిక్షణం బాబానే తలుచుకుంటూ నా కోపాన్ని అధిగమించాను. "థాంక్యూ బాబా. సన్ను ఎన్నటికీ విడువకు బాబా".

ఒకసారి నేను, నాభర్త, పిల్లలు రోడ్డు దాటుతూ హఠాత్తుగా చూసేసరికి ఒక బస్సు దగ్గరగా వచ్చేసింది. నేను 'బాబా' అని అరిచేసాను. మా పెద్దబాబు ఒక్క అడుగు వేస్తే చాలా ప్రమాదం జరిగేది కానీ, బాబా కాపాడారు.

ఇంకోసారి మా చిన్నబాబుకి కడుపునొప్పి వచ్చి తట్టుకోలేక ఏడ్చాడు. డాక్టర్ దగ్గరకి వెళితే యూరిన్, కిడ్నీ టెస్టీలు వ్రాశారు. నాకు చాలా భయమేసి కన్నీళ్లతో, "బాబా! టెస్టీలు నార్మల్ రావాలి. నార్మల్ వస్తే మీ పేరు మీద అన్నదానంకు 1000 రూపాయలు ఇస్తాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల టెస్టులు నార్మల్ వచ్చాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయినాథుని కృపతో ఏదైనా జరుగుతుంది


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రవి. నేను నా కుటుంబంతో యుఎస్‌లో ఉంటున్నాను. 2026, ఫిబ్రవరిలో మా బాబాయ్ గారి అబ్బాయి వివాహం వైజాగ్‌లో జరిగింది. నేను ఒక నెల రోజులు సెలవు పెట్టి ఇండియా వెళ్లాలనుకున్నాను. అయితే మా పిల్లలు ఇక్కడ యుఎస్ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడి స్కూలు నిబంధనల ప్రకారం ఊరికే పది రోజులకు మించి సెలవు పెడితే, పిల్లల్ని స్కూలు నుంచి తొలగిస్తారు. అలాంటప్పుడు మళ్లీ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ వేస్తే, స్కూల్లో ఖాళీ ఉంటే వెంటనే సీటు వస్తుంది లేదంటే వచ్చేవరకు వేచి ఉండాలి. ఒక్కోసారి ఆ సంవత్సరం సీటు రాకపోవచ్చు కూడా. అందువల్ల నేను ఏం చేయాలని సందిగ్ధంలో పడ్డాను. అదే ఆలోచిస్తూ బాబాని అడిగితే, ఏది సరైనదో చెప్తారని(నాకు ఏ సంశయం వచ్చినా బాబాని అడిగి విసిగిస్తూ ఉంటాను), “బాబా! ఇండియాకి వెళ్ళమంటారా?, వద్దంటారా?” అని 'ఎస్', 'నో' చీటీలు వేసి అడిగాను. ఆయన 'ఎస్' అని ఇచ్చారు. దాంతో నేను నా భార్యతో “ఇంక బెంగలేదు, బాబా వెళ్ళమన్నారు. అంతా ఆయన చూసుకుంటారు” అని ధైర్యం చెప్పి అనుకున్నట్టుగా నెల రోజులు సెలవు పెట్టి కుటుంబంతో ఇండియా వెళ్ళాను. అక్కడంతా బాగా జరిగింది. ముఖ్యంగా శిరిడీలో బాబా దర్శనం నన్ను చాలా సంతోషపరిచింది. అంత సంతృప్తికరంగా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు వెళ్ళినా కాలేదు. నేను నాతోపాటు మా బాబాయ్ కొడుకు పెళ్లి శుభలేఖ తీసుకొని వెళ్లి బాబా సమాధి దగ్గర పెట్టి, “బాబా! మీరు వచ్చి వధూవరులను ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ బాగా జరిగేలా చూడండి” అని ప్రార్థించాను. మా బాబాయ్ మేము హైదరాబాద్ నుంచి వైజాగ్‌లో ఆడపెళ్ళివారింట జరిగే పెళ్లికి వెళ్లేందుకు ఒక బస్సు మాట్లాడారు. ప్రయాణం రోజు సాయంత్రం బస్సు రాగానే పెళ్లి సామాన్లు తీసుకొని బస్సు ఆగిన చోటకి  వెళితే, బస్సు ముందు భాగంలో 'నేను ఉన్నాను” అంటూ బాబా విగ్రహ రూపంలో పలకరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటినుంచి వైజాగ్‌లో పెళ్ళై తిరిగి వచ్చేవరకు అడుగడుగునా సాయి ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూనే ఉన్నారు(ఆ ఫోటోలు కింద జతపరుస్తున్నాను. చూసి ఆనందించండి). ఉదాహరణకి ఒక చోట కాఫీ కోసం బస్సు ఆపితే, అక్కుడున్న హోటల్ పేరు “సాయికృష్ణ”, వైజాగ్ చేరుకున్నాక బస్సు నిలిపిన స్థలానికి ఎదురుగా 'సాయిబాబా స్పిరిట్యువల్ సెంటర్(Saibaba spiritual center)' అని, ఇలా ఎన్బెన్నో. బాబా చూపిన ప్రేమ, దయ, కరుణలకి ఉబ్బితబ్బిబ్బయిపోయాను.


మేము ఇండియా నుంచి తిరిగి యుఎస్ వెళ్ళాక చూస్తే, నేను భయపడినట్లే మా పిల్లల్ని స్కూలు నుంచి తొలగించారు. దాంతో నేను ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ వేసాను. బాబా దయవల్ల మా అమ్మాయికి వెంటనే సీటు వచ్చింది. కానీ అబ్బాయికి వెయిటింగ్ లిస్ట్ అన్నారు. మూడు వారాలు గడిచినా అందులో ఏ మార్పు లేదు. బాబా ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకున్నప్పటికీ ఇంకా వేచి చూద్దామని నేను అంటుండేవాడిని. కానీ స్కూల్ ప్రిన్సిపాల్ "ఈ సంవత్సరం సీటు రావడం కష్టమేమో!" అనడంతో నా భార్య బాబు ఇంట్లో ఖాళీగా ఏమీ చేయకుండా ఉంటే సమయం వృధాగా పోతుందని దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూలులో అప్లికేషన్ సబ్మిట్ చేసి, జాయిన్ చేద్దాం అంది. నేను సరేనన్నాను. బాబు ఒక వారం ఆ ప్రైవేట్ స్కూలుకి వెళ్ళాక మరుసటి సోమవారం ఉదయాన్నే పాత స్కూల్ ఆఫీస్ నుంచి ఎవరో అప్లికేషన్ విత్ డ్రా చేసుకోవడం వల్ల ఒక వేకెన్సీ ఏర్పడిందని ఫోన్ వచ్చింది. అది విని మా ఆనందానికి అవధులు లేవు. అప్పటివరకు ఏ మార్పులేని వెయిటింగ్ లిస్ట్ నెంబర్ అడ్మిషన్‌కి వచ్చిందంటే అది ఆ సాయినాథుని కృపవల్లనే. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది.  నేను బాబా మా శ్రద్ధ-సబూరిలు పరీక్షించటానికి మా బాబు స్కూల్ అడ్మిషన్ ఆలస్యం చేశారనుకున్నాను. ఇంకొక్క రెండు రోజులైతే ప్రైవేట్ స్కూలులో తర్వాత నెల ఫీజు కట్టాల్సి వచ్చేది. బాబా దయతో అలా జరగనివ్వలేదు. ఇంకో విషయం ఏమిటంటే, సాధారణంగా ఇక్కడ స్కూలు మానేయాలంటే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. కానీ బాబా దయవల్ల మా పిల్లలు అదివరకు ఆ స్కూలులో చదివిన కారణంగా ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పరిస్థితి అర్థం చేసుకుని మా బాబుని విత్ డ్రా చేయడానికి ఒప్పుకున్నారు. బాబా ప్రేమతో పిలిస్తే చాలు, పరుగుపరుగున తమ భక్తులకోసం వస్తారు. "ధన్యవాదాలు బాబా. నేను, నా కుటుంబం మిమ్మల్ని తలుచుకుంటూ మీకు సేవ చేసుకునేలా ఆశీర్వదించండి".

ఓం శ్రీసాయినాథాయ నమః


సాయిభక్తుల అనుభవమాలిక 2082వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిలవగానే సహాయం చేస్తారు బాబా
2. బాబా కరుణ ఎంతో  గొప్పది



సాయిభక్తుల అనుభవమాలిక 2081వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎప్పుడూ మనతో ఉన్నారు - సరైన సమయంలో సహాయం చేస్తారు!  
2. శ్రీసాయి కృప


శ్రీసాయి కృప

నా పేరు జగదీశ్వర్. మా చిన్నమ్మాయికి 2026, ఏప్రిల్ 2న పెళ్లి నిశ్చయమైనది. మొదట నాకు ఆ సంబంధం విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండటం వల్ల నేను ఒప్పుకోలేదు. కానీ మా అమ్మాయి అతనితోనే తన పెళ్లి జరగాలని పట్టుబట్టింది. నాకు ఏం చేయలో అర్థం కాలేదు. కొన్నిరోజులు తర్వాత ఒకరోజు రాత్రి నేను పడుకున్నాకనో, మేలుకొని ఉన్నానో తెలియదు కానీ, నాకు తెలుస్తుంది. నేను చాలా బాధతో, "బాబా! ఏమిటి ఇలా అవుతుంది?" అని అన్నాను. అప్పుడు బాబా, "అంత మంచి జరుగుతుంది. ఇది నా నిర్ణయమే" అన్నారు. నేను, "బాబా! మీరు అలానే అంటారు. నాకు ఏదైనా నిదర్శనం చూపించండి" అని అడిగాను. వెంటనే బాబా, "సరే, పొద్దున్న నీకు గ్రీన్ కలర్ డ్రెస్లో దర్శనమిస్తాను" అని అన్నారు. నేను, "గ్రీన్ కలరా?" అని అడిగితే, "అవును" అని అన్నారు బాబా. మర్నాడు ఉదయం యధాలాపంగా వాట్సాప్ చూస్తుంటే, 'శిరిడీ సాయి లైవ్ దర్శన్' గ్రూపులో బాబా ఉదయం గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. ఇది నిజమా అన్న గందరగోళంలో ఉండిపోయాను. తర్వాత నేను బాబాకు మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకొని, "బాబా! మంచి-చెడు మీకు తెలుసు కదా. మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే జరపండి" అని వేడుకున్నాను. తర్వాత ఫిబ్రవరి 20న అమ్మాయి నిశ్చితార్థం ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. "బాబా! అమ్మాయి పెళ్లి ఏప్రిల్ 2న. మీ ఆశీస్సులు ఇవ్వండి. అలాగే మా అబ్బాయి నిశ్చితార్థం మార్చి 21న, పెళ్లి ఏప్రిల్ 29న, రిసెప్షన్ మే 3న ఏలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చేసి మీ ఆశీస్సులు ఇవ్వండి".

ఇకపోతే, రెండు పెళ్లిళ్ల నిమిత్తం మా పెద్దమ్మాయి, మనుమరాలు పోలాండ్ నుండి వచ్చారు. 2026, మార్చి నెల మొదటివారంలో మా మనుమరాలు ఆడుకుంటుంటే డోర్ కర్టెన్ తట్టుకొని బొక్కబోర్ల పడింది. నేను తనని లేపి చూస్తే, తన నోరు అంతా రక్తం కనిపించింది. నాకు చాలా భయమేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాబా ఊదీ తెచ్చి పాప నుదుటన పెట్టి, కొంచం నోట్లో వేసాను. కొద్దిసేపటి తరువాత నోరు అంత కడిగి చూస్తే, కొద్దిగా చిగురుకి దెబ్బ తగిలింది తప్ప ఇంకేమీ లేదు. నొప్పి కూడా ఏం లేదు. "ధన్యవాదాలు బాబా".

మా చిన్నమ్మాయి పెళ్లి సందర్బంగా, హైదరాబాద్లో ఉన్న అబ్బాయి వాళ్ళకి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి 2026, ఏప్రిల్ 13, శుక్రవారం తెల్లవారుజామున లేచి తయారవవుతుంటే, హఠాత్తుగా నా భార్యకు 3 సార్లు వాంతులు, నీళ్ల విరోచనాలు అయ్యాయి. ఏం చేయాలో తోచక ఒక సెస్టిల్ టాబ్లెట్ వేసి పూజ గదిలోకి వెళ్లి బాబా ఊదీ తీసుకొచ్చి నా భార్య నుదుటన పెట్టి, మరి కొంచెం ఊదీ తన నోటిలో వేసాను. విచిత్రంగా మంత్రం వేసినట్టు వాంతులు, విరోచనాలు ఆగిపోయాయాయి. మర్నాడు వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి వచ్చాము.

బాబా సాయి చరణం సర్వదా శరణం శరణం.

శ్రీసాయిలీల పత్రిక - 1931, 4వ సంచికలోని వివరాలు


శ్రీసాయినాథుని దివ్య ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
"బాబా! మీ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ప్రారంభమై 7ఏళ్ళు పూర్తయి 8వ ఏట అడుగుడిన సందర్భంగా సదా మీ ప్రేమను ఆస్వాదిస్తూ, మీ లీలలను పంచుకుంటూ, మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి"

బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించి, వారి అనుగ్రహానికి పాత్రుడైన భక్తుడు పూణే నివాసి శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే 1931, మే 9న శ్రీసాయిలీల పత్రికకు పంపిన లేఖలోని కొన్ని వివరాల తెలుగు అనువాదం:  


శ్రీసాయిలీల గ్రంథ రచయితకు నా వినమ్ర నమస్కారాలు. శ్రీవారికి(శ్రీసాయిబాబా) సంబంధించిన మరికొన్ని దివ్య లీలలు ఇటీవల నాకు స్ఫురించినందున, అవి మరింత విస్తృతంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వాటిని మీకు తెలియజేస్తున్నాను. ఇది 15 సంవత్సరాల కిందట(1916లో) జరిగింది. ఒకరోజు ఉదయం బాబా బాపుసాహెబ్ జోగ్, తదితర భక్తులతో సంభాషిస్తూ ఇలా అన్నారు, "కాకా(దీక్షిత్) తీవ్ర జ్వరంతో బాధపడుతూ చాలా అనారోగ్యంగా ఉన్నాడు. నేను లేకుండా అతను మందులు తీసుకోడు. కాబట్టి నేను పార్లే వెళ్ళాలి. కానీ బాపుసాహెబ్, నువ్వు 'అతనినే ఇక్కడికే రమ్మని' కబురు పంపు" అన్నారు. ఈ సంభాషణ జరిగిన రోజు, భావుసాహెబ్‌కు(కాకాసాహెబ్ దీక్షిత్) జ్వరం వచ్చి ఐదవరోజు. అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ తన సాధారణ అలవాటు ప్రకారం ఊదీ, ఊదీ తీర్థం తప్ప మరే ఇతర మందులు అసలు తీసుకోలేదు. మర్నాడు బాపుసాహెబ్ ద్వారా శ్రీసాయి పిలుపు అతని ఇంటి ముంగిట చేరింది. ఆ కబురు అందిన వెంటనే అతను మరునాడు సాయంత్రం శిరిడీకి బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా తన ప్రయాణ విషయంలో తన భార్య దివంగత శ్రీమతి బాబిబాయిసాహెబ్ ఎటువంటి ఆందోళనకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో పార్లే నుంచి శిరిడీకి తనతోపాటు నన్ను కూడా తీసుకెళ్తానని ఆమెకు తెలియజేసారు. 


మేము బయలుదేరడానికి నిర్ణయించిన రోజు ఉదయం, భావుసాహెబ్ వద్ద నుండి నాకు ఒక ఆకస్మిక పిలుపు వచ్చింది. ఆ పిలుపు అతని ఆరోగ్యానికి సంబంధించి నా మనసులో ఆందోళన కలిగించింది. దాంతో నేను వెంటనే ఆయన బంగళాకు బయలుదేరాను. నేను వెళ్ళిన సమయానికి భావుసాహెబ్ ఇంకా నిద్రలేవలేదు. అందువల్ల నేను నేరుగా బాబీని కలిసి మాట్లాడాను. ఆమె నాకు మొత్తం పరిస్థితి వివరించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి భావుసాహెబ్ నిద్రలేచారు. నేను వెంటనే ఆయనను కలిసి ఈ విధంగా సూచించాను, "నేను మీతో తోడుగా ఉన్నంతవరకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని బాబీబాయికి పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, ఆమెను, వంటమనిషిని మన వెంట తీసుకువెళ్లడం చాలా వివేకవంతమైన పని అవుతుంది. ఎందుకంటే, మనం శిరిడీ చేరుకున్న తర్వాత, బాబా మనల్ని అక్కడ ఎన్ని రోజులు ఉంచుకోవాలని నిర్ణయిస్తారో చెప్పలేము కదా!" అని. నా సూచన ఆయనకు సబబుగా అనిపించింది. అదే రోజే సాయంత్రం మేము బొంబాయి నుంచి శిరిడీకి బయలుదేరాము. మా రైలు మన్మాడ్ వద్ద ఆగినప్పుడు స్త్రీల బోగిలో కేవలం ఇద్దరు స్త్రీలు మాత్రమే ఉండడాన్ని గమనించిన కొంతమంది బ్రిటిష్ సైనికులు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో నేను అక్కడ లేకపోయి ఉంటే, నిజంగా ఒక అత్యంత భయంకరమైన సంఘటన జరిగి ఉండేది. ఎందుకంటే, ఆ సమయంలో శారీరక బలహీనత కారణంగా భావుసాహెబ్‌కు, అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం, చక్కదిద్దడం పూర్తిగా అసాధ్యమై ఉండేది. చివరగా, మేము క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. మేము శిరిడీలో అడుగుపెట్టగానే పార్లేలో భావుసాహెబ్‌ను పట్టిపీడించిన జ్వరం తగ్గిపోయింది, తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు.


ఒకసారి ఒక శ్రీమంతురాలైన ముస్లిం స్త్రీ శిరిడీ వచ్చింది. ఆమె క్రమం తప్పకుండా కొంత ధనాన్ని వెంట తీసుకొని వరుసగా మూడురోజలు మసీదుకు వెళ్ళి బాబాను దర్శించింది. కానీ, బాబా ఆమెను దక్షిణ అడగలేదు. నాల్గవ రోజు ఆ మహిళ బాబాతో, "బాబా! నేను మిమ్మల్ని నా గురువుగా చేసుకోవాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. కాబట్టి దయచేసి నా దక్షిణను స్వీకరించి, నాకు ఆధ్యాత్మిక ఉపదేశం చేయండి" అని విన్నవించుకుంది. ఆమె మాటలు విన్న బాబా, "గురువును గుర్తించాలి, చేసుకోకూడదు. నువ్వు ఈ మట్టికుండని గురువుగా ఆరాధించు. నీ సంకల్పం నెరవేరుతుందో, లేదో చూడు" అని బదులిచ్చారు.

సాయిభక్తుల అనుభవమాలిక 2080వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే దిక్కు - ఆయన లేకపోతే ఏమైపోతామో!
2. ఊహించని విధంగా అనుగ్రహించిన బాబా

బాబానే దిక్కు - ఆయన లేకపోతే ఏమైపోతామో!  

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు లలిత. నాకు ఇద్దరు మగపిల్లలు. మొదటి బాబు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ గర్భస్రావమై గర్భం నిలువలేదు. ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ అప్పుడు కూడా గర్భస్రావం అయ్యింది. ఇంకా నేను బాబాని, "బిడ్డ పుడితే మీ పేరు పెట్టుకుంటాను. అలాగే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవల్ల కొన్నాళ్ళకి నేను మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంటుండేది. 2 నెలల తర్వాత కొంచెం బ్లీడింగ్ అయ్యింది. దాంతో మళ్ళీ గర్భస్రావం అయిపోతుందెమోనని నాకు ఇంకా భయమేసి బాబా దగ్గర ఏడుస్తూ, "నా గర్భం నిలపమ"ని చాలా వేడుకున్నాను. "అన్నదానం చేయిస్తాన"ని కూడా మొక్కుకున్నాను. నేను యూకేలో ఉంటాను. ఇక్కడ అడిగిన వెంటనే స్కానింగ్ చేయరు. ఒక వారం తర్వాత ఎప్పుడో అప్పోయింట్మెంట్ ఇచ్చారు. నేను 'లోపల బేబీకి ఎలా ఉందో? ఏంటో?' అని భయంతో ఆ వారం రోజులు చాలా నరకం చూసాను. కానీ బాబా దయవల్ల స్కానింగ్లో బిడ్డ గుండె కొట్టుకుంటుందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని వచ్చింది. అప్పుడు నేను ఎలా ఫీల్ అయుంటానో వేరే చెప్పాలా? బాబాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. తర్వాత ఇంకోసారి కూడా కొంచం బ్లీడింగ్ కనిపించింది. బాబానే దిక్కని ఊదీ నీళ్లలో కలుపుకొని రోజూ తాగుతూ 'సాయి సచ్చరిత్ర', సాయిమహారాజ్ సన్నిధి బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుండేదాన్ని. దాంతో నాకు ఎంతో ఊరటగా, నమ్మకంగా ఉండేది. నా నమ్మకం వృధా కాలేదు. బాబా అడుగడుగునా నన్ను కాపాడుతూ నాకు ఆరోగ్యమైన బాబుని ప్రసాదించారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేముందు బాబుని చెకప్ చేసి, బాబు ఊపిరి ఎక్కువ సార్లు తీసుకుంటున్నాడని చెప్పి చాలా టెస్టులు చేసారు. ఆ సమయంలో నేను బాబా నామస్మరణ చేస్తూ, కాన్పుకోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడే నాతోపాటు తీసుకెళ్లిన బాబా ఊదీ ప్యాకెట్ నా బిడ్డ తల కింద పెట్టేదాన్ని. బాబా నా మీద దయ చూపారు. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. బాబా కృపవల్ల వారం తర్వాత నేను, నా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చాము. ఇప్పుడు నా బిడ్డకి ఐదో నెల. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బాబా లేకపోతే నాలాంటి వాళ్ళందరూ ఏమైపోతారో! ఆయనే అన్నిటికీ, అందరికీ దిక్కు. ఆయన ఊదీ ఎంతో అద్భుతమైనది. అత్యంత ఉత్తమ ఔషధం. ఆ ఊదీ నీళ్ళే ఇదివరకు నా అనారోగ్యాన్ని పోగొట్టి నాకు పునర్జన్మనిచ్చాయి. అందుకే నాకు బాబా ఊదీ అంటే చాలా నమ్మకం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. థాంక్స్ చెప్పుకోవడం తప్ప నేను ఏమి చేయలేను బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 2079వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా కృపాశీస్సులు


సాయిభక్తుల అనుభవమాలిక 2078వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. గురుదేవులు బాబా అనుగ్రహం
2. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు బాబా


మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు బాబా

సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గంగాధర. నేను శ్రీ శిరిడీ సాయిబాబా కృపకు పాత్రుడిని. నన్ను నేను 'భక్తుడి'ని అనడం కంటే 'బాబా కుమారుడి'ని అనడం నాకు ఎంతో సముచితం అనిపిస్తుంది. నా చిన్నతనంలోనే నా తండ్రి పరమపదించారు. ఆ సమయంలో నా జీవితం ఎంతో ఒంటరితనంతో నిండిపోయింది. 'నాకూ నాన్న ఉంటే బాగుండేది!' అన్న బాధ నా హృదయంలో ఎప్పుడూ ఉంటుండేది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక స్నేహితుడి ద్వారా నాకు బాబా పరిచయమయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు మా కుటుంబంలో అందరికీ బాబానే తండ్రి, తల్లి, గురువు, దైవం అన్నీ అయ్యారు. నిజంగా నా తండ్రి ఉన్నా కూడా ఇంతగా చూసుకునేవారు కాదేమో! అనేంతగా నా బాబా నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇక నా అనుభవానికి వస్తే..

ఒక మంచి కంపెనీలో పని చేస్తున్న నేను పని ఎంతైనా చేస్తాను కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ విషయంలో బలహీనుడిని. 2026, మార్చి 26న మా సీనియర్ సార్ సెలవు మీద వెళ్లాల్సి రావడంతో ఆయన పని నాకు అప్పగించారు. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే- పాన్ ఇండియా వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ముందు నేను ప్రెజంటేషన్ ఇవ్వాలని. ఇది విన్న వెంటనే నాకు చాలా భయమేసింది. ఆ సమయంలో బాబా భక్తుల అనుభవాలు చదువుతున్న నేను మనసులో, “బాబా! ఈ సమస్య నుంచి నన్ను రక్షించండి. ఈరోజు ప్రెజంటేషన్ నుంచి బయటపడేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహం కొద్ది నిమిషాల్లోనే ఆ సార్ నుంచి ఫోన్ కాల్ రూపంలో వచ్చింది. “ఈరోజు నేనే ప్రెజంట్ చేస్తాను” అని సార్ చెప్పారు. అంతే! నా టెన్షన్ మొత్తం పోయింది. నా మనసులో ఒకే మాట - “ధన్యవాదాలు బాబా". ఈ అనుభవం ద్వారా బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా సహాయం చేస్తారు, సమస్య చిన్నదైనా, పెద్దదైనా బాబాకు సమానమని, మనం కృతజ్ఞత కలిగి ఉండటం చాలా ముఖ్యమైన నేను తెలుసుకున్నాను. "బాబా! మీ దయతో నాకు మంచి స్కిల్స్ రావాలి. మీరు తప్పకుండా నెరవేర్చుతారని నమ్ముతున్నాను".

సాయి స్మరణం సంకట హరణం
బాబా శరణం భవ భయ హరణం

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo