తర్వాత శ్రీఅవస్థి సతారాలోని డోమిబూవా వద్దకు, ఆ తర్వాత పూణేలోని సోమవార్ ఆలయంలోని ధర్మశాలలో ఉంటున్న ఒక వృద్ధ మహాత్మురాలిని కలవడానికి వెళ్ళాడు. ఆ మహాత్మురాలి కొడుకుకి రెండు, మూడేళ్ల వయసున్నప్పుడు ఆవిడ భర్త చనిపోయాడు. దాంతో చిన్ననాటినుండి తాను చదువుతూ వస్తున్న తులసీదాస్ రామాయణాన్ని అనుసరించి సన్యసించాలని ఆవిడ అనుకుంది. హనుమంతుడు ఆవిడకు తన దర్శనభాగ్యాన్ని ప్రసాదించి అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆవిడ వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, సప్తాహాలు (ఏడు రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు) నిర్వహిస్తూ, వందలాది మంది బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేస్తూ పర్యటించింది. హరిద్వార్ నుండి కోయంబత్తూర్ చేరుకోవడానికి ఆవిడకు మూడేళ్లు పట్టింది. కోయంబత్తూరులో ఆవిడ ఒక హనుమంతుని ఆలయం వద్ద ఆశ్రయం పొంది తన దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించింది. ప్రజలు ఆవిడ పట్ల ఆకర్షితులయ్యారు. ఆవిడ గురువు కోయంబత్తూరు జిల్లాలోని వేలంకురిచిలో ఉండేవారు. ఆయన ఒక కాఫీ తోట యజమాని. కుటుంబసమేతంగా అక్కడ నివసించేవారు. శ్రీరాముని భక్తుడైన ఆయన తన నివాసానికి సమీపంలోనే ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. వృద్ధ మహాత్మురాలు ఆ గ్రామంలో ఆరునెలలపాటు గడిపిన తర్వాత, ఉత్తరప్రదేశ్లోని సరైసేట్రై/సరైరసి(సరైతరేసా)లో ఉన్న తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి దారిలో పండరీపురం దర్శించి అక్కడినుండి నేరుగా పూణే వచ్చింది.
అవస్థి ఒక యోగి భక్తుడైన తన స్నేహితునితో కలిసి ఆ మహాత్మురాలి దర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో అతను వివేకానందుని రాజయోగం అభ్యసిస్తున్నందున కుండలిని, అది వివిధ చక్రాల గుండా ప్రయాణించడం వంటి విషయాలపై ఆవిడను ప్రశ్నించాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు వెళ్లే సమయానికి ఆ మహాత్మురాలి చుట్టూ భక్తులు, పండితులు, నాస్తికులు, దూషించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆవిడతో మాట్లాడే అవకాశం తమకు చాలా తక్కువని భావించి దూరంగా కూర్చుని, ఒక నిర్ణిత సమయం వరకు చూసి ఆవిడతో మాట్లాడే అవకాశం లభించకపోతే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ సమయానికి సరిగ్గా 5 నిమిషాల ముందు ఆవిడ తమ చెంత ఉన్న జనసమూహాన్ని చెదరగొట్టడానికి చాలా తెలివైన ఉపాయం ఒకటి పన్నారు. ఆమె అకస్మాత్తుగా తన ముఖంపై ముసుగు వేసుకొని, "చనిపోతున్నాన"ని చెప్పి, అందరినీ వెళ్లిపొమ్మంది. దాంతో అందరూ వెళ్ళిపోయారు. సహజంగానే అవస్థి, అతని స్నేహితుడు కూడా వెళ్ళిపోవాలని అనుకున్నారు. కానీ వెళ్లేముందు నమస్కరించుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్ళసాగారు. వాళ్ళు ఆవిడను సమీపిస్తుండగా, ఆవిడ తన ముసుగు తీసేసి కూర్చుని, వాళ్ళను దగ్గరకు రమ్మని సైగ చేసారు. వాళ్ళు "మీ ఆరోగ్యం బాగోలేదు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టమ"ని అన్నారు. అందుకు ఆవిడ, "మీకోసమే అనారోగ్యం నటిస్తున్నాన"ని చెప్పి, తమకున్న శక్తులకు సాక్ష్యాన్ని చూపింది. అప్పుడు వాళ్ళు కుండలిని, చక్రాల చిత్రమున్న పుస్తకం ఆవిడకు చూపించి, ఆ విషయం గురించి తమకు భోదించగలరా అని అడిగారు. ఆవిడ ఆ పుస్తకాన్ని తిరిగిచ్చి, తమ గురు మహారాజ్ తనకి భక్తి మార్గాన్ని మాత్రమే చూపించినందువల్ల యోగ మార్గ విషయమై తాను ఎటువంటి సహాయం చేయలేనని చెప్పింది. వాళ్ళు ఆవిడ వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు కానీ, ఆమె నిరాడంబర సాధు ప్రవర్తనకు బాగా ముగ్ధులయ్యారు. కాబట్టి, అవస్థి సంధ్య సమయంలో ఆవిడ చెప్పే మాటలు వినడానికి వెళ్తూ జనసమూహానికి దూరంగా చీకటిలో ఒక మూలన కూర్చునేవాడు. ఆ సమయంలో అతని మనసులో పగటిపూట తాను చదువుకున్న విషయాలకు సంబంధించిన సందేహాల పరిష్కారం కోసం కొన్ని ప్రశ్నలు సాధారణంగా ఉండేవి. అతను వాటిని అడగకముందే ఆవిడ మాటల మధ్యలో విషయాన్ని మార్చి, అతని మనసులో ఉన్న ప్రశ్నలనే లేవనెత్తి సమీపంలో ఉన్న పెద్దలు, పండితుల ముందు ఆ ప్రశ్నలను ఉంచేది. వాళ్ళు ఆ ప్రశ్నల గురించి చర్చించి వారివారి సమాధానాలను ఇచ్చేవారు. వాటిని పరిశీలించి, తిరస్కరించిన మీదట ఆవిడ అవస్తేకు సంతృప్తినిచ్చే పరిష్కారాన్ని ఇచ్చేది. ఇంకా ఇదే ప్రశ్నను ఒకప్పుడు తన సద్గురువు కూడా అడిగి, దానికి సమాధానం చెప్పారని ఆవిడ చెప్పేది. ఆవిడ ఒక ఏకాంత సమావేశంలో అవస్థితో, 'కేవలం అతని కోసమే పూణేకి రావడమైందని, తన సద్గురువు తనకు ప్రత్యేక ఆదేశం ఇచ్చారని, హనుమంతుడికి, తన గురువుకి నిత్య పూజ చేసిన తర్వాత జపధ్యానాలు చేస్తున్నప్పుడు తన సద్గురువు నుండి తనకి సందేశాలు లభించాయ'ని చెప్పారు.
అవస్థికి ఆ మహాత్మురాలి దివ్య శక్తుల పట్ల చాలా గొప్ప గౌరవం ఏర్పడి తన స్నేహితులను తనతో పాటు వచ్చి ఆవిడను దర్శించి, ప్రణామాలు అర్పించేలా ప్రోత్సహించాడు. వాళ్ళు కూడా ఆవిడ ప్రసంగాలకు హాజరవుతూ ఆవిడకు సన్నిహితులయ్యారు. ఒకరోజు ఆవిడ స్నేహితుని ఇంటి వద్ద ఉన్న అవస్థికోసం కబురు పంపింది. దాంతో అతను తన స్నేహితుడు, అతని తమ్ముడు, వారిద్దరి భార్యలు కలిసి ఆవిడ వద్దకు వెళ్లారు. అప్పుడు ఆవిడ, తాము త్వరలో ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోతున్నామని, అవస్థి తదితరులు అంగీకరిస్తే, తమ గురు మహారాజ్ ఆదేశానుసారం కొన్ని మంత్రాలు, ఉపదేశాలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పింది. కానీ అవస్థికి తనకొక గురువు ఉండాలనే కోరిక లేదు, అదికాక తనకున్న షరతులు అంగీకరిస్తే తప్పా తాను మంత్రాన్ని అంగీకరించదలచుకోలేదు అతను. ఆవిడ అతనితో, తాను ప్రత్యేకంగా అవస్థిని కలవడానికే పూణే వచ్చానని, తన సలహాను అంగీకరించడంలో ఎలాంటి హాని లేదని చెప్పింది. అతను, 'తాను ఎలాంటి జపమాల ఉపయోగించనని, జపాల సంఖ్యను లెక్కించనని, జపం చేసే సమయం మరియు ప్రదేశం గురించి ఎలాంటి విధివిధానాలు పాటించనని, తన మనస్సు వేరే ఏ పనిలోనూ నిమగ్నమై లేనప్పుడు కేవలం మానసికంగా జపించుకుంటానని' అని షరతు విధించాడు. అందుకు ఆవిడ అంగీకరించి, అతనికి పంచాక్షరి ఉపదేశించి, "నేను నీకు గురువుగా ఉండబోను. ఎందుకంటే, నువ్వే నా గురువని భావిస్తున్నాన"ని చెప్పి అతన్ని సంతోషపెట్టింది. తర్వాత ఆమె అతనితోపాటు ఉన్న ప్రతి ఒక్కరికీ పంచాక్షరి మంత్రాలను ఇచ్చింది. అయితే పురుషులకు ఇచ్చేటప్పుడు దానికి ముందు 'హరి ఓం' అని చేర్చి, స్త్రీలకు ఇచ్చేటప్పుడు దానిని విడిచిపెట్టి ఇచ్చింది. ఆవిడ జపంలో, పంచాక్షరిలోని అక్షరాలకు ఒకదాని తర్వాత మరొకదానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి అక్షరాన్ని పంచభూతాలు మరియు ఐదుగురు అధిష్టాన దేవతలకు ప్రతీకలుగా చిన్న చిన్న మార్పులు చేసింది. జపంలోని మొదటి మూడు అక్షరాలపై మనస్సును కేంద్రీకరించాలని, ఆ తర్వాత కేవలం ప్రణవం (ఓంకార నాదం)మీద, చివరగా ఉచ్వాస, నిశ్వాసాలు(ప్రాణాయామం)పై దృష్టి పెట్టాలని ఆమె అవస్తేకు సూచించింది. ఇంకా ఆ అక్షరాల అధిదేవతల దర్శనం కోసం ఆత్రుత వద్దని, ముఖ్యంగా మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరించవద్దని, తన సూచనలను సాధ్యమైనంత శ్రద్ధగా పాటించమని చెప్పి తన కొడుకును చూడటానికి పూణే విడిచి వెళ్లిపోయింది. ఇదంతా 1898లో జరిగింది.
తర్వాత ఒకసారి అవస్థి ఎంతో ఇష్టపడే శాంతి అనే అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అతను ఆమెకోసం వెతుకుతుంటే, "మీరు దేనికోసం వెతుకుతున్నారు?" అని దూరం నుండి ఆ పాప అడిగింది. అతను, "శాంతికోసం" అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆమె, "శాంతి ఇలా వెతకడం వల్ల లభించదు గాని, ప్రశాంతంగా వేచి ఉండటం వల్ల దానంతట అదే వస్తుంది" అని బదులిచ్చింది. ఒకరోజు ఆ అమ్మాయి తండ్రి, అవస్థి, మరికొంతమంది దైవమూ, సాక్షాత్కారమూ గురించి చర్చించుకుంటుండగా ఆ అమ్మాయి అక్కడికి వచ్చి, "మీలో ఎవరైనా దేవుణ్ణి చూశారా?" అని అడిగింది. తర్వాత ఆ అమ్మాయి అవస్థిను సూటిగా, "మీకు సాక్షాత్కారం అయిందా?" అని అడగగా, "లేదు" అని సమాధానమిచ్చాడతను. తర్వాత ఒకరోజు అవస్థి తుకారాం రచనలను చదువుతుండగా, ఒక 'అభంగం'(భక్తి గీతం) కనిపించింది; అందులో తుకారాం అక్కడికక్కడే దీక్షను ప్రసాదించడం గురించి నొక్కి చెప్పడం చూసి అతను ఆశ్చర్యచకితుడై, నిశ్చలంగా ఉండిపోయాడు. ఆ సమయంలో అతనికి పక్కనే ఉన్న కిటికీ బయటనుండి భగవంతుండు 'లోపలికి రావాలా?' అని అడుగుతున్నట్లు అనిపించింది. అప్పుడు అతను దర్శనానికి తాను ఇంకా అర్హుడిని కాదని భావించి, 'వద్దు, వద్దు' అని అన్నాడు. దేవుడిని చూసి ఆ తీవ్రతను తట్టుకునే శక్తి తనకు లేదనిపించడంతో అతను పారాయణను ఆపివేశాడు. ఇకపై దేవుడిని ఇబ్బందిపెట్టనని ప్రమాణం కూడా చేసుకున్నాడు. అయితే శాంతి అతన్ని, తనకు సాక్షాత్కారం ప్రసాదించమని శ్రీరాముడిని ప్రార్థించమని చెప్పడంతో అతను ప్రతి రాత్రి ప్రార్థిస్తానని ఆమెకి మాటిచ్చాడు. ఆమె కూడా ప్రతి రాత్రి పడుకునే ముందు సాక్షాత్కారం కోసం ప్రార్థించేది. 1912లో ఒకరోజు రాత్రి అతను పూజించే దైవమున్న హాలులోని ద్వారం పైభాగం నుండి శ్రీరాముడు నెమ్మదిగా కిందికి దిగి వస్తున్నట్లు అతనికి అనిపించింది. అతను నమస్కరించాడు, కానీ ఆ దైవస్వరూపం యొక్క వక్షస్థలానికి పైభాగాన్ని చూసేలోపే ఆ దృశ్యం అదృశ్యమైంది. అందువల్ల అతను కేవలం కాళ్లు, నడుము భాగాన్ని మాత్రమే చూడగలిగాడు. ఆ అనుభవాన్ని మళ్లీ పొందడం ఇష్టం లేక అతను రాత్రిపూట ప్రార్థించడం మానేశాడు, అప్పటి నుండి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండసాగాడు.
తరువాయి భాగం వచ్చేవారం..
