బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించిన భాగ్యశాలి కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ అలియాస్ కిరాత్. ఇతను తలక్వాడి, బెల్గాం వాసి. చిత్పవన్(కొంకణ్) బ్రాహ్మణుడు. పోలీస్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేసి పదవి విరమణ చేసాడు. ఇతను శిరిడీలో తాను గమనించిన విషయాలు ఇలా చెప్తున్నారు:
1913 సంవత్సరం ఆరంభంలో రెవెన్యూ సర్వేశాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న శ్రీరావుబహుదుర్ హరివినాయక్ అలియాస్ తాత్యాసాహెబ్ సాఠే నన్ను మొదటిసారిగా శిరిడీకి పిలిచారు. శిరిడీ శ్రీసాయిబాబాకి సంబంధించి ఒక మాసపత్రిక ప్రచురించాలన్న ఆలోచన ఆయన మనసులో ఉండేది. సరిగ్గా ఈ కారణం చేతనే ఆయన నన్ను ప్రత్యేకించి శిరిడీకి పిలిచారు. నేను అంతకుమునుపే శిరిడీ పేరు, తాత్యాసాహెబ్ సాఠే శ్రీసాయినాథ్ మహారాజ్ భక్తుడని చాలారోజుల నుండి వింటూ ఉన్నాను. సాఠే తనకు, ఇతరులకు నివాసయోగ్యంగా ఉండేలా అక్కడ ఒక వాడా(భవనాన్ని) నిర్మించారు. ఆ భవనం ఆవరణలో ఒక వేపచెట్టు ఉంది. దాని చుట్టూ ఒక చిన్న అరుగు నిర్మించారు. శ్రీసాయినాథ్ మహారాజ్ అప్పుడప్పుడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చోవడం వలన ఆ చెట్టుకి ఒక విధమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. కొంతమంది స్త్రీలు, పేదలు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. సాయినాథ్ మహారాజ్ కీర్తి విని దూరదూరాల నుండి చాలామంది వారి దర్శనానికి వచ్చేవారు. వారిలో ధనిక, పేద, మధ్యతరగతి ప్రజలు తరచుగా ఏదో ఒక కోరికతో వచ్చేవారు. కేవలం మోక్షం లేదా ముక్తిని పొందే ఉద్దేశ్యంతో చాలా అరుదుగా వచ్చేవారు. శ్రీసాయినాథ్ మహారాజ్ వారిని దక్షిణ అడిగి ప్రజల ప్రయోజనార్థం ఆ ధనాన్ని సంతోషంగా ఇచ్చేవారు. మొదట్లో దక్షిణ ఎలా ఉపయోగించబడిందో నాకు తెలియదు కానీ, తరువాత నాకు తెలిసింది ఏమిటంటే, ‘మహారాజ్ సమక్షంలో ఉండే మహల్సాపతి సోనార్(కంసాలి), కాశీరాం షింపి, అప్పా జాగలే, తాత్యాపాటిల్, అప్యాజీ ఉపాలే వంటి ఇద్దరు లేదా నలుగురు వ్యక్తులకు సాయినాథ్ మహారాజ్ దక్షిణ నుండి ఎంతో కొంత మొత్తం ఇచ్చేవారని, వాళ్ళు వారి అవసరాలు చూసుకునేవారని’. ఈ విషయం రావుబహుదుర్ సాఠేసాహెబ్ అక్కడికి వెళ్ళినప్పుడు అతని దృష్టికి వచ్చి, దక్షిణ రూపంలో వచ్చే నగదు సరిగ్గా వినియోగించబడటం లేదని అతనికి అనిపించింది. కాబట్టి, మనం పైన చెప్పిన భక్త బృందాన్ని విశ్వాసించి, దక్షిణను సక్రమంగా వినియోగించేలా, అలాగే వృద్ధాప్యంలో ఉన్న శ్రీసాయినాథ్ మహారాజ్ తదనంతరం వారి సంస్థాన్ ఏర్పాటుకు, అది సక్రమంగా నడిచేలా మనం కొన్ని ఏర్పాట్లు చేయగలిగితే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఉద్దేశ్యంతోపాటు అతను ఒక మాసపత్రికను కూడా ప్రచురించాలని ప్రణాళిక వేసి, అందుకోసమే నన్ను ప్రత్యేకించి శిరిడీకి పిలిచారు. వారి ఉద్దేశ్యం ప్రకారం నేను 'శ్రీసాయినాథ్ ప్రభ' అనే పేరుతో కొత్త పత్రికను ప్రారంభించాలని నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా విషయసూచికను సేకరించడానికి సిద్ధమయ్యాను. శ్రీసుందర్రావు అనే ఒక గృహస్థుడు ఈ పత్రిక కోసం ఆంగ్లంలో వ్యాసాలు వ్రాసారు. సాఠే ఆలోచన భక్త బృందంలోని కొందరికి నచ్చి, ఒకరోజు సమావేశమై 'శ్రీసాయినాథ్ దక్షిణ భిక్ష సంస్థ' అనే పేరుతో ఒక సంస్థ స్థాపించారు. ఈ సంస్థ స్థాపన గురించిన వివరాలు కొత్తగా ప్రారంభించిన 'శ్రీసాయినాథ్ ప్రభ' అనే పత్రికలో ఇవ్వబడ్డాయి. దాని నుండి, ఈ సంస్థ యొక్క స్వభావం మరియు లక్ష్యాలను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
నేను శిరిడీ వెళ్లిన రోజు సాయంత్రమే శ్రీసాయినాథ్ మహారాజ్ దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆయనను దర్శించుకోవడానికి వెళ్తుండేవాడిని. ప్రతిరోజూ మసీదుకు వెళ్లడంలో నా ఉద్దేశ్యం, అక్కడ జరిగేదంతా దగ్గరగా గమనించి, అది మన మనస్సుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, మరియు శ్రీసాయిబాబా జీవిత రహస్యాన్ని ఛేదించి, అది మనకు ఎంతవరకు సహాయపడుతుందో చూడటమే. శ్రీసాయిబాబా చాలా సందర్భాలలో నలుగురు లేదా ఐదుగురు సన్నిహిత భక్తులతో మసీదులో కూర్చొని కనిపించేవారు, కొన్నిసార్లు దూర ప్రాంతాల నుండి అనేకమంది భక్తులు వచ్చేవారు. శ్రీసాయిబాబాను చూడగానే ఎవరి మనసైనా ఆయనపట్ల భక్తి, గౌరవాలతో నిండిపోవడం కనిపించేది. నా అనుభవం కూడా అదే. ఆయన పొడవైన, దృఢమైన దేహ సౌష్ఠవము, ప్రకాశవంతమైన కళ్ళు, విశాలమైన నుదురు కలిగి ఉండేవారు. ఆయన ముఖంలోని విశిష్టమైన సాత్విక భావాల కారణంగా ఏ వ్యక్తి అయినా ఆయన ముందు సహజంగానే వినమ్రులయ్యేవారు. ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ధనవంతులైనా, పేదలైనా, శ్రీసాయిబాబా వారిని సమాన దృష్టితో చూసేవారు. దీనివల్ల ఆయన సాధుత్వపు ప్రభావం ప్రజలపై సులభంగా పడేది. ఆయన తమ ప్రవర్తన ద్వారా ప్రజలకు సమానత్వాన్ని ఒక పాఠంగా నేర్పుతున్నట్లు ఉండేది.
నేను కొన్నిరోజులు రోజుకు కేవలం రెండుసార్లు మాత్రమే మశీదుకు వెళ్ళాను. కొన్నిరోజుల తర్వాత ఒకరోజు సాఠే నాతో, "శ్రీసాయిబాబా లెండి నుండి తిరిగి వచ్చిన తర్వాత ధుని దగ్గర కూర్చుని, ప్రత్యేకించి కొంతమంది సమీప భక్తులతో ముచ్చటిస్తారు. ఆ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళాలి" అని చెప్పారు. అప్పటినుంచి నేను శ్రీసాయిబాబా లెండి నుండి తిరిగి వచ్చే సమయానికి (ఉదయం 7 నుండి 8 గంటల మధ్య) మసీదుకు వెళ్ళే నియమాన్ని పెట్టుకున్నాను. ఆ సమయంలో శ్రీసాయిబాబా గ్రామీణ పామర భాషలో ఏవో కథలు చెబుతుండేవారు. వాటిలో 'పంథారి' గ్రామం గురించి చాలాసార్లు ప్రస్తావించేవారు. వారి మాటల్లో కోడి, గుడ్డు, పెట్ట వంటి అనేక పదాలు ఉండేవి. దీని కారణంగా మహారాజ్ మతం గురించి నాకు తరచూ సందేహం కలిగేది. నేను దీని గురించి ఇతర వ్యక్తులను కూడా విచారించాను. కానీ ఆయన జన్మ రహస్యం గురించి ఎవరూ నాకు ఖచ్చితమైన వివరాలు చెప్పలేదు. నేను సాఠేను అడిగినప్పుడు, దాని గురించి ఆయనకు కూడా ఏమీ తెలియదని తేలింది. ఋషి యొక్క కుల, మతాల గురించి, నది మూలాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయకూడదని అంటారు, ఇది సాధు సత్పురుషుల విషయంలో కూడా వర్తిస్తుందా? ఆ విషయం స్పష్టంగా తెలియనప్పటికీ సాధు సత్పురుషులు సర్వదా సర్వత్రా పూజ్యనీయులు.
పైన చెప్పిన విధంగా నేను ప్రతిరోజూ మశీదుకు వెళ్తుండగా ఒకరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నేను, తాత్యాసాహెబ్ సాఠే ఇద్దరం మేల్కొన్నాము. అప్పుడు తాత్యాసాహెబ్ సాఠే నాతో, 'కృష్ణా! నువ్వు ప్రతిరోజూ గురుచరిత్ర పఠిస్తావు కదా! మరి మన వాడా ఆవరణలో ఉన్న వేపచెట్టు కింద కూర్చొని సప్తాహ పారాయణం ఎందుకు చేయకూడదు?' అని అన్నారు. దానికి నేను, "వేపచెట్టు కింద కూర్చుని సప్తాహ పారాయణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇక్కడ ఒక ఔదుంబర వృక్షం ఉంటే, దాని కింద సప్తాహ పారాయణం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా, మీరు నన్ను ఇక్కడికి పిలిచిన పనిపై నా పూర్తి శ్రద్ధను పెట్టడమే మరింత సముచితం. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ ఉదయం పూట చాలా చల్లగా ఉంటుంది. అంతేకాక, నా సప్తాహం ఇతరులకు అనవసరమైన అపోహలు కలిగించడం సరైనదిని నేను అనుకోవడం లేదు. అందువల్ల, ఇక్కడ సప్తాహం చేయడానికి బదులుగా, నేను సోలాపూర్కి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తాను. అలా చేయడం వల్ల నా ప్రస్తుత పనికి ఆటంకం కలగదు, నేను నా పూర్తి శ్రద్ధను అక్కడ పెట్టగలుగుతాను' అని బదులిచ్చాను. ఇలా చెప్పిన తర్వాత, ఆయన ఆ విషయంపై పట్టుబట్టలేదు. కొంతసేపు ఇతర విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత, తెల్లవారుజామున సుమారు 4:05 గంటలకు మేమిద్దరం మళ్ళీ నిద్రపోయాము. ఒక గంట తర్వాత మళ్ళీ మేల్కొని, నేను ముఖం కడుక్కుని ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళాను. శ్రీసాయిబాబా లెండి నుండి తిరిగి వచ్చి ధుని దగ్గర కూర్చుని ఉన్నారు. ఆయన వద్ద నలుగురు, ఐదుగురు భక్తులున్నారు. బాబా వాళ్లతో పామర భాషలో కొన్ని కథలు చెపుతున్నారు. నేను వెళ్ళినప్పుడు బాబా ఆ భక్తులను చూస్తూ ఒక కథ చెప్తున్నారు. నేను వెళ్ళగానే నా తలను మహారాజ్ పాదాల వద్ద ఉంచి నమస్కరించి 4-5 అడుగుల దూరంలో కూర్చుని ఆయన చెప్పే ఆ కథ వినసాగాను. కానీ నాకు ఆ కథ అర్థం కాలేదు. శ్రీసాయిబాబా అనర్గళంగా మాట్లాడుతూ సందర్భానుసారంగా సహజాతి సహజంగా, "ఔదుంబర వృక్షం ఏమిటి? రావి చెట్టు ఏమిటి? వేప చెట్టు ఏమిటి? అన్నీ ఒకటే!" అని అన్నారు. బాబా ఆ మాటలు పలకగానే, ఆరోజు ఉదయం గురుచరిత్ర సప్తాహం గురించి సాఠేకు, నాకు మధ్య జరిగిన సంభాషణ నాకు గుర్తుకొచ్చింది. మహారాజ్ ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు అని ఆ విషయం నాకు గుర్తు చేసి ఉంటారని భావించి నేను మహారాజ్ ముఖం వైపు చూసాను. కానీ మహారాజ్ దృష్టి ధుని మీదే ఉంది. పైమాటలు పలుకుతున్నప్పుడు ఆయన నావైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు కూడా. అందువల్ల ఆ మాటలు పలకడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటో నేను గ్రహించలేకపోయాను. కానీ ఆయన ముఖంలో నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ సమయంలో మరో 4-5 మంది అక్కడికి వచ్చారు. శ్రీసాయిబాబా నుండి మునపటివలె కథా ప్రవాహం కొనసాగింది. నాలాగే ఇతరులు కూడా అందులోని కొన్ని సంకేతాలు, ఆధారాలను గ్రహిస్తూ ఉంటారని నాలో నేను తర్కించుకున్నాను. అక్కడ ఒక గంటసేపు కూర్చున్న తర్వాత నేను వాడాకి తిరిగి వెళ్లి విషయాన్ని తాత్యాసాహెబ్ సాఠేకు నివేదించాను. అది విని ఆయన నవ్వి నాతో ఇలా అన్నారు, "వేప చెట్టు ఉన్నందువల్ల ఏమి జరిగిందో నేను నీకు చెప్పలేదు. శ్రీసాయిబాబా స్వయంగా ఈ వేప చెట్టు కింద కూర్చునేవారు. నువ్వు ఇక్కడ ఒక సప్తాహం చేయాలి". నేను మాత్రం పైన పేర్కొన్న ఇబ్బందులను కారణంగా చూపి, నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే కారణంతో సప్తాహం చేయడానికి నిరాకరించాను. కానీ సప్తాహం చేయాల్సి వస్తే, యోగ్యమైన ఏర్పాట్లతో పవిత్రంగా ఉండాలని, నేలపై దుప్పటి పరుచుకొని రాత్రి అక్కడే నిద్రపోవడం సముచితమని భావిస్తున్నందున నేను సప్తాహం చేయడానికి నిరాకరించాను.
తరువాయి భాగం వచ్చే వారం ...
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 4,5, 6 సంచిక & 1938, 7,8,9 సంచిక
