- కోరుకున్నట్లే గృహవైద్యంతో ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
|
సాయి వచనం:-
|
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 2115వ భాగం....
సాయిభక్తుల అనుభవమాలిక 2114వ భాగం....
1. బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
2. సాయి సచ్చరిత్ర చదవడం వల్ల పొందిన బాబా అనుగ్రహం
బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం
ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఛత్రపతి. నా జీవితంలో ప్రతి అడుగు బాబా అనుగ్రహంతోనే పడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి ప్రయాణం చేసినా ముందుగా బాబాను మనసారా ప్రార్థించి, ఆయన ఆశీస్సులు తీసుకోవడం నాకు అలవాటు. ఈ మధ్య నా తిరుమల యాత్ర కూడా అలాగే ప్రారంభమైంది. నిజానికి నేను ఈ యాత్రను నా స్నేహితురాలికోసం ప్లాన్ చేసి ఇద్దరికీ టికెట్లు బుక్ చేశాను. ఎందుకంటే, తను ఇంతవరకు తిరుమల దర్శనం చేసుకోలేదు. కానీ విధి విచిత్రమైనది. చివరి క్షణంలో అనివార్య కారణాల వల్ల తను రాలేని పరిస్థితి వచ్చింది. ఒక్క క్షణం, 'నేను కూడా ప్రయాణం వాయిదా వేసుకుందామా?' అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ, 'ఎవరికోసం ఈ యాత్రను ప్లాన్ చేశానో తను రాలేకపోయింది. అయినా శ్రీవేంకటేశ్వరస్వామి నన్ను తమ సన్నిధికి పిలుస్తున్నారేమో! ఆ పిలుపు వెనుక బాబా దివ్య సంకల్పమే ఉందేమో! అని నా మనసుకి బలంగా అనిపించింది. బహుశా ఈ యాత్రను నేను ఒంటరిగా చేయాలని, ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలని బాబా ముందుగానే నిర్ణయించి ఉండవచ్చు. అందులకాని నేను ఒక్కడినే తిరుమల వెళ్లి, వద్దామని అనుకున్నాను. అయితే, తిరుమలలో విపరీతమైన రద్దీ ఉందని, దర్శనానికి గంటల సమయం పడుతుందని అందరూ అన్నారు. తర్వాత నేను నా ప్రయాణం మొదలుపెట్టేముందు బాబాను ఒక్కటే కోరుకున్నాను, "బాబా! మీ దయతో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం తొందరగా, ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అనుగ్రహించండి తండ్రీ" అని. బాబా కరుణ ఎంత అద్భుతమో! ఎవరి ఊహకి అందనంత త్వరగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎంతో ప్రశాంతమైన స్వామివారి దివ్య దర్శనం నాకు లభించింది. ఆ క్షణం నా మనసంతా బాబాపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. దర్శనానికి క్యూలో వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు బాబా నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు నాకు అనిపించింది. నాకు ఒక గొప్ప సత్యం అర్థమైంది, 'మనం ప్రణాళికలు వేసుకుంటాం కానీ, అవి ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా నెరవేరాలో నిర్ణయించేది మాత్రం దైవ సంకల్పమే. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు. కానీ ఆ జరగకపోవడం వెనక కూడా భగవంతుని దయ దాగి ఉంటుంది. జరిగేది మన ఊహలకు మించిన అనుభవమవుతుంది' అని. చివరిగా నా ఈ తిరుమల యాత్ర నాకు కేవలం ఒక దర్శనం కాదు, బాబా చూపించిన ప్రేమ, కరుణ, మార్గదర్శకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం. నన్ను తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి చేర్చి, ఎలాంటి ఆటంకం లేకుండా దివ్య దర్శనం ప్రసాదించి, తిరిగి క్షేమంగా ఇంటికి తిరిగి చేర్చిన నా సద్గురు శ్రీ శిరిడీ సాయిబాబాకు నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు.
శంభు మంగేష్ వాగ్లే - 1వ భాగం....
బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించిన భాగ్యశాలి శంభు మంగేష్ వాగ్లే. అతను గోవా రాష్ట్రంలోని ఐయాస్(తిస్వాడి) తాలూకా, శాంతాక్రజ్ గ్రామవాసి. 1911లో అతను బోరివలిలో ఉన్న ప్రఖ్యాత 'మాడ్గాంకర్' కుటుంబానికి చెందిన విస్తారమైన స్థిరాస్తుల పర్యవేక్షకుడిగా పనిచేస్తుండేవాడు. ఒకరోజు 'బలవంతరావు రామచంద్ర' ఉరఫ్ 'బాలభాయ్' మాడ్గాంకర్ అతన్ని, "గోవాలో మేలైన ‘సోన్కేవడే’(సుగంధభరితమైన పసుపురంగు పూలు) లభిస్తాయి కదా?" అని అడిగారు. అందుకతను "అవున"ని సమాధానమిస్తూ, "వాటికి ఒక నిర్దిష్ట కాలం(సీజన్) ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే అవి పుష్కలంగా లభిస్తాయ"ని వివరించాడు. అప్పుడు బాలభాయ్, "బాంద్రా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీగోవిందరావు రఘునాథ్ దభోల్కర్ వాటిని తీసుకురమ్మని మీతో చెప్పమని చెప్పారు. మీరు వాటిని తీసుకొచ్చి ఆయనకిస్తే, ఆయన ఎంతో సంతోషిస్తారు. కారణం, వారి ఆధ్యాత్మిక గురువు శ్రీశిరిడీ సాయిబాబాకు ఆ పూల సుగంధానిచ్చే కాచు గోళీలు(కాచు అనే పదార్థాన్ని కిళ్ళిలో వాడతారు) అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఆయనకోసం మీరు ఈ పనిని తప్పక చేయాల"ని అన్నారు. అతను "సరేన"ని ఒక వారంలోపే ఆ పూలు సేకరించి దాబోల్కర్కి అందజేశాడు. సహజంగానే ఆయన చెప్పలేనంతగా ఆనందభరితులయ్యారు. నాటినుండి వాగ్లేకి దభోల్కర్తో పరిచయం మొదలైంది. ఆ విషయమై అతను, "కాలం గడిచేకొద్దీ దాభోల్కర్ నాతో ఎంతో ఆప్యాయతతో, సానుభూతితో వ్యవహరించసాగారు. అంతటి ఉన్నత పదవి, తన హోదాకు తగినంత గంభీరత, అధికార దర్పం కలిగిన వ్యక్తి అయినప్పటికీ నా వంటి ఒక సామాన్య, అల్పుడైన వ్యక్తిపట్ల ఆయన ప్రవర్తన అసాధారణమైన ఆప్యాయతతో కూడుకొని ఉండేది. నేటికీ(1939) ఆయన ఆ దయార్ద్ర ప్రవర్తనను తలచుకున్నప్పుడల్లా నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది" అని చెప్పారు.
దైవసంకల్పమో, యాదృచ్చికమో గానీ ఒకరోజు వాగ్లే బోరివాలి స్టేషన్లో దభోల్కర్ను అనుకోకుండా కలిసినప్పుడు ఆయనకి ఏదో స్ఫూర్తి కలిగి సమీపంలో ఉన్న తమకి పరిచయస్తుడైన భన్సాలీవాణి వర్గానికి చెందిన ఒక వ్యాపారిని పిలిచి, "మీరు శిరిడీ వెళ్ళినప్పుడు, ఈ వాగ్లేని తప్పకుండ మీతోపాటు తీసుకువెళ్ళండి" అని అన్నారు. అది విన్న వాగ్లే ఆశ్చర్యపోతూ, "ఎందుకు రావూసాహెబ్! మీరంత ప్రయాస పడుతున్నారు? నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి? అక్కడికి వెళ్లి ఆయన(సాయిబాబా) నుండి కోరుకోవాల్సింది నాకేమీ లేదు, ఆయనకు ఏ ఇబ్బంది కలిగించాలని కూడా నాకు లేదు" అని అన్నాడు. దానికి ఆయన, "మీ అభిప్రాయాన్ని నేను కాదనను కానీ, మీరు వెళ్లాల్సిందే!" అని నిశ్చయంగా చెప్పడంతో అతను, "సరే రావుసాహెబ్, చూద్దాం" అని బదులిచ్చాడు. అతను అలా చెప్పగానే, ఆయన రైలు బయలుదేరింది. ఆ తర్వాత రోజుల్లో దభోల్కర్ గట్టిగా పలికిన ఆ మాటలు వాగ్లే మనసును నిరంతరం కుదిపేసాయి. ఒకరోజు అతను బోరివాలికి చెందిన దామోదర్ రఘునాథ్ ఠాకూర్తో కూర్చుని ఉండగా యధాలాపంగా జరిగిన ఆ సంఘటన గురించి చెప్పాడు. అది విన్న ఠాకూర్ ఎంతో సంతోషించి, "దభోల్కర్ సాహెబ్ ఇలాంటి విషయాలను ఎవరికి పడితే వారికి చెప్పే వ్యక్తి కాదు. ఆయన ప్రత్యేకంగా మీకే ఈ విషయం చెప్పారంటే, మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే!" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అది అక్కడితోనే ముగిసిపోలేదు. ఆ సమయంలో ఆయన కుమార్తె, మనవళ్లు అక్కడే ఉన్నారు. వాళ్లంతా చాలా ఆనందంగా ఏకకంఠంతో, "వాగ్లేసాహెబ్, మీరు గనక శిరిడీ వెళితే, మాకు మా మనిషి కలుస్తార"ని ఆశని వ్యక్తం చేసారు. విషయమేమిటంటే, ఠాకూర్గారి అల్లుడు- వసాయి నివాసి అయిన శ్రీపాండురంగ్ సఖారాం నారేకర్ తన కుటుంబాన్ని వదిలేసి అప్పటికి రెండేళ్లగా శిరిడీలోనే ఉంటున్నారు.
పైసంఘటనతో సహజంగానే అప్పటివరకు శిరిడీ వెళ్ళడం గురించి వాగ్లే మనసులో ఉన్న అనిశ్చితి దానంతటదే తొలగిపోయి శిరిడీ వెళ్లాలని నిశ్చయానికి వచ్చాడు. కాబట్టి, ఆ సంవత్సరం డిసెంబరులో అతను గోవాలోని తన ఇంటికి వెళ్లడానికని యజమాని నుండి అనుమతి పొందాడు. తర్వాత అతను బొంబాయిలోని భివాండిలో మూడవ సంవత్సరం వైద్య పరీక్షలకు సిద్ధమవుతున్న తన స్నేహితుడు డా. నారాయణ రామచంద్ర బస్తోద్కర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ గోవాకు చెందిన గృహస్థుడైన పాండురంగ్ అనంత్ కెంకరే అనే అతని ఇంకో స్నేహితుడు కళాశాలలో బి.ఏ. చదువుతున్నాడు. అతను వాళ్ళిద్దరితో శిరిడీ వెళ్లాలన్న తన సంకల్పం గురించి చెప్పి, వాళ్ళు కూడా వస్తారేమోనని అడిగాడు. కానీ వాళ్ళు వెంటనే ఎలాంటి సమ్మతి తెలియజేయలేదు. కానీ ఆ రాత్రి 8 గంటల కలకత్తా మెయిల్లో వెళ్ళడానికి వాగ్లే సిద్ధమై, వేళకు బోరిబందర్ స్టేషన్కు బయలుదేరబోతుండగా ఆ స్నేహితులిద్దరూ స్టేషన్ వరకు వస్తామంటూ అతనితోపాటు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే, వాగ్లే తన టిక్కెట్ కొన్నప్పుడు వాళ్ళు కూడా రహస్యంగా తమతమ టిక్కెట్లు తీసుకుని, అతనికి వీడ్కోలు చెప్పకుండా అతనితోపాటు వెళ్లి కోచ్లో కూర్చున్నారు. అది చూసి అతను ఆశ్చర్యానందాలకు గురయ్యాడు. తర్వాత రైలు సమయానికి బయలుదేరడంతో వారి శిరిడీ యాత్ర ప్రారంభమైంది. మధ్య దారిలో వాళ్ళు మన్మాడ్ స్టేషన్లో దిగి, 'డౌన్-మన్మాడ్' రైలు వచ్చేవరకు అక్కడ వేచి ఉండాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు జీవితంలో ఎన్నడూ చూడని తీవ్రమైన చలికి ఇబ్బందిపడ్డారు కానీ, రైలు నిర్ణీత సమయానికి రావడంతో అది ఎక్కి ఉదయం ఆరు గంటలకు కోపర్గాఁవ్ స్టేషన్లో దిగారు. వాళ్ళు అక్కడినుండి టాంగాలో శిరిడీకి ప్రయాణమయ్యారు. దారిలో గోదావరి నీటి ప్రవాహం చూసి సంతోషపడ్డారు. సుమారు ఏడున్నర గంటలకు వాళ్ళు శిరిడీ పుణ్యభూమిలో అడుగుపెట్టారు.
వాగ్లే, అతని స్నేహితులు గ్రామంలోకి వెళ్ళినప్పుడు ముందుగా పైకప్పులేని మట్టి ఇళ్లను చూసి చకితులయ్యారు. కానీ వారి దృష్టి అంతా శ్రీసాయిబాబాపైనే కేంద్రీకృతమై ఉంది. సరిగ్గా అప్పుడే ఒక నల్లని దిగంబర వ్యక్తి ఒక మట్టి ఇంటి కప్పుపై నిలబడి, సూర్యుని వైపు ముఖం ఉంచి సూర్యుని చూస్తూ కనిపించాడు. అతన్ని చూసిన వాగ్లే, అతని స్నేహితులకి, 'ఈయనే సాయిబాబానా?' అనిపించింది. ఒక క్షణం పాటు అలాగే అనిపించి, అక్కడి ప్రజలను అదే ప్రశ్న అడిగారు. దానికి ఆ ప్రజలు, "ఈయన బాబా కాదు, షెగాం మహారాజ్ శిష్యుడు, తన ఉద్ధరణార్థం బాబా పాదాల చెంతకు వచ్చి, మౌనవ్రతం పాటిస్తున్నాడు" అని తెలియజేసారు. అప్పుడు వాళ్ళు, "ఇప్పుడు బాబా ఎక్కడ ఉన్నారు?" అని అడగ్గా, "బాబా బయటకు వెళ్లారు. ఇప్పుడు తిరిగి వస్తున్నారు. అదిగో బాకాల శబ్దం. మీరు వెళ్లి, మశీదులో కూర్చోండి" అని చెప్పారు. వాగ్లే, అతని స్నేహితులు బాకాలు మోగుతున్న దిశగా చూస్తే, దూరంగా ఒక పెద్ద ఎర్ర గొడుగు, చాలా జనం వస్తూ కనిపించారు. అది చూసి వాళ్ళు వెళ్లి మశీదులో కూర్చున్నారు. అక్కడ కింద ఒక సభా మండపం, దాని ముందు ఒక పెద్ద ఎత్తైన ప్రదేశం, వ్యాసపీఠం, దానికి కుడి వైపున వెండి ఆసనం, మధ్యలో గోడకు ఆనుకుని పగలు రాత్రి వెలిగే దీపాల వరస, ఎడమ వైపున ఎల్లప్పుడూ మండుతూ ఉండే ఒక అగ్నిగుండం(ధుని), చిలుము ఉన్నాయి. వాళ్ళు అవన్నీ గమనిస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే దూరాన కనిపించిన బాబావారి ఊరేగింపు మశీదులోకి ప్రవేశించింది. సాయిబాబా చూడటానికి మంచి రంగుతో, దృఢంగా, కొద్దిగా వంగి ఉన్నారు. ఆయన చిరిగిన అరబిక్ శైలి కఫ్నీ ధరించి, తలకి ఒక చిన్న గుడ్డను చుట్టుకుని ఉన్నారు. ఆయన భుజాల నుండి తల పైకెత్తి, నోటితో కఠిన పదజాలంతో తిట్లు, శాపనార్థాలు పలుకుతూ వచ్చి ఆసనం మీద కూర్చున్నారు. వాగ్లే, అతని స్నేహితులు వెంటనే లేచి, బాబాకోసం కానుకగా తెచ్చిన బాదం హల్వా, ఇతర వస్తువులు తీసుకొని బాబా ముందుకి వెళ్లారు. బాబా వాళ్ళని చూస్తూనే, "బొంబాయి నుండి వచ్చారు. కూర్చోండి" అని అన్నారు. వాళ్ళు బాబాకు నమస్కరించి, ఆ వస్తువులను ఆయన ముందు ఉంచారు. ఆయన వాళ్ళకి ఊదీ ఇచ్చారు. వాళ్ళు దానిని తీసుకొని తమలాగే బాబా దర్శనానికి వచ్చిన ప్రయాణికులు ఆరోజు చాలామంది ఉన్నందున అక్కడినుండి లేచి అన్నపానీయాల కోసం వెళ్లారు.
సాయిభక్తుల అనుభవమాలిక 2113వ భాగం....
- అన్నీ వింటూ సమాధానమిచ్చే బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2112వ భాగం....
- సాయి వర్షించే కరుణని ఎంతని వర్ణించను?
కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ -- 2వ భాగం....
కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ శిరిడీలో తాను గమనించిన విషయాలు గురించి ఇంకా ఇలా చెప్తున్నారు:
నేను శ్రీసాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు భాటే(భాటియా), పార్సీ మొదలైన వారి అందమైన భార్యలు, కుమార్తెలు కూడా వారి దర్శనానికి వచ్చేవారు. వాళ్ళు కొన్నిసార్లు శ్రీసాయిబాబా దగ్గర కూర్చునేవారు. అటువంటి సమయాల్లో కొంతమంది పురుషులు కూడా అక్కడ ఉండేవారు. వాళ్లలో ఎప్పుడూ అక్కడే ఉండేవాళ్ళు, బయటినుండి వచ్చినవాళ్ళు అనే రెండు రకాల వ్యక్తులు ఉండేవారు. ఈ వ్యక్తుల కళ్ళు సహజంగానే అక్కడున్న అందమైన స్త్రీల వైపు ఆకర్షింపబడేవి. మానవ స్వభావాన్ని చూస్తే, ఇది చాలా సహజమైన విషయం. కానీ బయటినుండి వచ్చిన వారి వైఖరి భక్తి, విశ్వాసాలతో, భావోద్వేగాలతో నిండి ఉన్నందున వారి ముఖాలపై ఎలాంటి ప్రత్యేక భావోద్వేగం కనిపించేది కాదు. వారి ముఖాలపై సాత్విక(ధర్మబద్ధమైన) భావాలు మాత్రమే ప్రకటమైనందున వాళ్ళు గంభీర స్వభావులుగా కనబడేవారు. కానీ ఎల్లప్పుడూ అక్కడే ఉండే వారి మనసులు మాత్రం చంచలమైనట్లు స్పష్టంగా కనిపించేది. శ్రీసాయిబాబా వైఖరి ఏ సమయంలోనూ, ఏ కారణంగానూ మారేది కాదు. ఆయన చాలా గంభీరంగా, ప్రశాంతంగా, స్థిర చిత్తంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపించేది. ఆయన చాలా గంభీరంగా ఉన్నారని స్పష్టంగా తెలిసేది. వారి దర్శనానికి వచ్చిన ఆ అందమైన స్త్రీల హావభావాల్లో కూడా ఎలాంటి చంచలత్వం కనపడేది కాదు, దానికి విరుద్ధంగా నిష్కళంకమైన, స్వచ్ఛమైన వైఖరి, సాత్విక భావాలు స్పష్టంగా ప్రకటమవుతుండేవి. అటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు బయటినుండి వచ్చిన నా వంటి మనుషుల మనస్సులో మొదట ఏవైనా తప్పుడు లేదా పాపభావాలు కలిగినప్పటికీ వారి ఆ సాత్విక భావాల వల్ల అవి క్షణంలో మాయమైపోయి, వాటి స్థానంలో స్వచ్ఛమైన సాత్విక భావాలు వాటంతటవే ఉదయించేవి. నాకు అనిపించేది ఏమిటంటే, ‘సాధుసత్పురుషులను దర్శించడం వల్ల వేరే ఏ ప్రయోజనం లేకపోయినా, ప్రజల భావోద్వేగాలను శుద్ధిచేసే కార్యం వారికి తెలియకుండానే జరుగుతుంది. అది మామూలు ప్రయోజనం కాదు. సాధుసత్పురుషుల(మహాత్ముల) చరిత్రలు చదవడం ద్వారా జరిగే భావోద్వేగ శుద్ధి కార్యం వారి సాన్నిధ్యంలో, వారి ప్రత్యక్ష దర్శనం వల్ల మరింతగా జరుగుతుంది.
శ్రీసాయిబాబా ఎన్నడూ వేదాల గురించి మాట్లాడలేదు. భక్తి మార్గ ఉపదేశాలను కూడా వారి ప్రవర్తన, ఆచరణ, ప్రత్యక్ష ఉదాహరణల ద్వారా భోదించారు. ఇలా చెప్పడం అతిశయోక్తి అవుతుందని నేను అనుకోను. సాయిబాబా తమ దర్శనానికి వచ్చే భక్తులను అప్పుడప్పుడు 'గురుచరిత్ర' వంటి ప్రామాణిక గ్రంథాలను పఠించమని లేదా 'సప్తాహం' చేయమని సూచించేవారు. ఒకసారి 'ఓక్' అనే భక్తునితో గోవాలోని తన ఇంటిలో కూర్చొని 'గురుచరిత్ర' సప్తాహం చేయమని చెప్పారు బాబా.
మసీదులో శ్రీసాయి మహారాజ్ తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగేది. ప్రజలందరూ వాటిని గొప్ప భక్తితో స్వీకరించేవారు. సాయిబాబా తాగిన పాత్రలో మిగిలిన నీరే ఆ తీర్థం. కొందరు దానిని స్వీకరించడానికి మొదట సంకోచించినప్పటికీ భక్తితోనో లేదా లోకవిరుద్ధంగా కనపడకుండా ఉండటానికో ప్రతి ఒక్కరూ దానిని తీసుకునేవారు. కుష్ఠురోగుల వంటి రోగగ్రస్తులకు మసీదులోకి రావడానికి ఎటువంటి నిషేధం లేనప్పటికీ, మశీదు నిర్వాహకులు అలాంటి వారు అక్కడికి రాకుండా ఏర్పాట్లు చేశారు. కనుక మహారాజ్ ఉదయం లెండికి వెళ్లే సమయానికి ఆ కుష్ఠురోగులు రహదారికి ఇరువైపులా నిలబడి మహారాజ్ దర్శనం కోసం ఎదురుచూసేవారు. ఆ సమయంలో వాళ్ళు మహారాజ్ పాదాలపై తమ తలను ఉంచి వారి దర్శనం చేసుకునేవారు. వారి స్పర్శ మహారాజ్ ముఖకవళికలలో ఎలాంటి మార్పు కలిగించేది కాదు. దానికి విరుద్ధంగా ఆయన కరుణ దృష్టితో వారిని చూస్తున్నట్లు అనిపించేది. నాలాంటి వ్యక్తులకు అదంతా వికారంగా, అత్యంత జుగుప్సాకరంగా, అంటువ్యాధి అన్న భయం కలిగించేదిగా ఉన్నప్పటికీ మహారాజ్ వైఖరిని చూసి ఆయనపై నాకు గౌరవం మరింత పెరిగింది. అంతేకాక, సత్పురుషుల వైఖరి(స్వభావం)లో దైవిక గుణాలు ఎలా ఉన్నతంగా ఉంటాయో కూడా నిరూపణగా చూడటం వల్ల ఒక విధమైన శిక్షణ లభించేది.
మహారాజ్ మసీదులో ఉన్నప్పుడు ఆయన వద్దకి చిన్న పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చాలా అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ, మహారాజ్ వాళ్ళని ఎత్తుకుని నవ్వుతూ నవ్వుతూ తమ ఒంటి మీద ఉన్న వస్త్రంతో వాళ్ళ ముక్కు, నోరు తుడిచి శుభ్రం చేసేవారు. ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో పంచదార పలుకులు లేదా మరేవైనా తినుబండారాలు పెట్టేవారు. తద్వారా సహజాతిసహజంగా ఆయనకి అందరిపట్ల ఉండే సమత, మమతలు ప్రదర్శితమయ్యేవి. ఇది కూడా ఒక విధంగా భక్తులకు శిక్షణే.
శ్రీసాయిబాబా ఎప్పుడూ శాంతంగా, ఆనందంగా, సమచిత్తంతో ఉండేవారు. కానీ అప్పుడప్పుడు ఆయన మనో వైఖరి ఆకస్మికంగా మారిపోయి తీవ్రమైన భయాందోళనలు కలిగించేదిగా కనిపించేది. ఆయన రుద్రావతారం ధరించినట్లుగా అనిపించేది. ఒకరోజు రాత్రి నేను ఇతరులతో కలిసి రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్లి, అక్కడ హారతి అయ్యాక తిరిగి వస్తుంటే, దారిలో మహారాజ్ ఒకటే కోపంతో ఊగిపోతూ కనిపించారు. ఆయన కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆయన నిటారుగా నిలబడి, చేతిలోని కర్రను అటూ ఇటూ ఊపుతున్నారు. బాబా ఆ వైఖరి ప్రజలలో భయాన్ని పుట్టించగా పరుగులు తీయనారంభించారు. అటువంటి సంఘటనను నేను మొదటిసారి చూసినప్పుడు మహారాజ్ ఇంతలా ఆవేశపడటానికి కారణం ఏమిటో నా తర్కానికి అందలేదు. దీని గురించి నేను చాలామందిని అడిగాను. కానీ వారి నుండి నాకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఇలాంటి ఆగ్రహావేశాలు శ్రీఅక్కల్కోట్ మహారాజ్లో తరచుగా కనిపించేదని నేను విన్నాను. ఇంకా తర్వాత ఎవరో నాతో ఇలా కూడా అన్నారు, 'హారతి అనంతరం అక్కల్కోట్కర్ మహారాజ్ మహారాజ్(సాయిబాబా) శరీరాన్ని ఆవహించినందున అలా జరుగుతుందని, మరియు పాపాలు వంటి అదృశ్య కారణాలు ఉండవచ్చని'. కానీ అది విని నాకు అంతగా సంతృప్తి కలగలేదు. ఒక సత్పురుషుని విషయంలో ఎల్లప్పుడూ సాత్విక గుణాలు కనిపిస్తున్నప్పుడు, ఉన్నట్టుండి ఆగ్రహావేశాలు వంటి తామసిక గుణం ఎందుకు ఉద్భవిస్తుందో అంతుచిక్కని రహస్యం. తత్వశాస్త్రవేత్తలే దీని గురించి ఆలోచించాలి.
మహారాజ్ విషయంలో కనిపించే ఇతరుల మనసును తెలుసుకోవడం, భూత, భవిష్యత్తుల గురించిన జ్ఞానం, ఇంకా అలాంటి ఇతర అద్భుతాలు కేవలం యోగ సిద్ధ పురుషునికి మాత్రమే ప్రాప్తిస్తాయి. పతంజలి యోగశాస్త్రంలో ఇటువంటి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీనిని బట్టి శ్రీసాయిబాబా ఒక గొప్ప యోగి సత్పురుషులై ఉండాలనే స్పష్టమైన అవగాహనకు నేను వచ్చాను. భావికభక్తులు ఆయనను ప్రత్యక్ష దైవమన్న దృష్టితో చూడటం కూడా యోగ్యమైనదే(సరైనదే). ఎందుకంటే, యోగ సాధన ద్వారా దైవత్వాన్ని(భగవత్ స్వరూపాన్ని) పొందినవారు దైవం కాక మరేమిటి? అటువంటి సత్పురుషుల వద్దకి కపటం లేకుండా వెళ్లినా, చికిత్స నిమిత్తం వెళ్లినా ఆ సత్పురుషుల సాత్విక గుణాల ప్రభావం వల్ల వారు కూడా సాత్వికులు కావడం సహజం.
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 4,5, 6 సంచిక & 1938, 7,8,9 సంచిక
సాయిభక్తుల అనుభవమాలిక 2111వ భాగం....
- సాయి సమాధానాలు - నేర్పిన పాఠం
సాయిభక్తుల అనుభవమాలిక 2110వ భాగం....
- వెంట వున్నానని నిదర్శనం చూపించిన సాయి
కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ -- 1వ భాగం....
బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించిన భాగ్యశాలి కృష్ణజీ లక్ష్మణ్ సోమన్ అలియాస్ కిరాత్. ఇతను తలక్వాడి, బెల్గాం వాసి. చిత్పవన్(కొంకణ్) బ్రాహ్మణుడు. పోలీస్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేసి పదవి విరమణ చేసాడు. ఇతను శిరిడీలో తాను గమనించిన విషయాలు ఇలా చెప్తున్నారు:
1913 సంవత్సరం ఆరంభంలో రెవెన్యూ సర్వేశాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న శ్రీరావుబహుదుర్ హరివినాయక్ అలియాస్ తాత్యాసాహెబ్ సాఠే నన్ను మొదటిసారిగా శిరిడీకి పిలిచారు. శిరిడీ శ్రీసాయిబాబాకి సంబంధించి ఒక మాసపత్రిక ప్రచురించాలన్న ఆలోచన ఆయన మనసులో ఉండేది. సరిగ్గా ఈ కారణం చేతనే ఆయన నన్ను ప్రత్యేకించి శిరిడీకి పిలిచారు. నేను అంతకుమునుపే శిరిడీ పేరు, తాత్యాసాహెబ్ సాఠే శ్రీసాయినాథ్ మహారాజ్ భక్తుడని చాలారోజుల నుండి వింటూ ఉన్నాను. సాఠే తనకు, ఇతరులకు నివాసయోగ్యంగా ఉండేలా అక్కడ ఒక వాడా(భవనాన్ని) నిర్మించారు. ఆ భవనం ఆవరణలో ఒక వేపచెట్టు ఉంది. దాని చుట్టూ ఒక చిన్న అరుగు నిర్మించారు. శ్రీసాయినాథ్ మహారాజ్ అప్పుడప్పుడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చోవడం వలన ఆ చెట్టుకి ఒక విధమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. కొంతమంది స్త్రీలు, పేదలు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. సాయినాథ్ మహారాజ్ కీర్తి విని దూరదూరాల నుండి చాలామంది వారి దర్శనానికి వచ్చేవారు. వారిలో ధనిక, పేద, మధ్యతరగతి ప్రజలు తరచుగా ఏదో ఒక కోరికతో వచ్చేవారు. కేవలం మోక్షం లేదా ముక్తిని పొందే ఉద్దేశ్యంతో చాలా అరుదుగా వచ్చేవారు. శ్రీసాయినాథ్ మహారాజ్ వారిని దక్షిణ అడిగి ప్రజల ప్రయోజనార్థం ఆ ధనాన్ని సంతోషంగా ఇచ్చేవారు. మొదట్లో దక్షిణ ఎలా ఉపయోగించబడిందో నాకు తెలియదు కానీ, తరువాత నాకు తెలిసింది ఏమిటంటే, ‘మహారాజ్ సమక్షంలో ఉండే మహల్సాపతి సోనార్(కంసాలి), కాశీరాం షింపి, అప్పా జాగలే, తాత్యాపాటిల్, అప్యాజీ ఉపాలే వంటి ఇద్దరు లేదా నలుగురు వ్యక్తులకు సాయినాథ్ మహారాజ్ దక్షిణ నుండి ఎంతో కొంత మొత్తం ఇచ్చేవారని, వాళ్ళు వారి అవసరాలు చూసుకునేవారని’. ఈ విషయం రావుబహుదుర్ సాఠేసాహెబ్ అక్కడికి వెళ్ళినప్పుడు అతని దృష్టికి వచ్చి, దక్షిణ రూపంలో వచ్చే నగదు సరిగ్గా వినియోగించబడటం లేదని అతనికి అనిపించింది. కాబట్టి, మనం పైన చెప్పిన భక్త బృందాన్ని విశ్వాసించి, దక్షిణను సక్రమంగా వినియోగించేలా, అలాగే వృద్ధాప్యంలో ఉన్న శ్రీసాయినాథ్ మహారాజ్ తదనంతరం వారి సంస్థాన్ ఏర్పాటుకు, అది సక్రమంగా నడిచేలా మనం కొన్ని ఏర్పాట్లు చేయగలిగితే మంచిదని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఉద్దేశ్యంతోపాటు అతను ఒక మాసపత్రికను కూడా ప్రచురించాలని ప్రణాళిక వేసి, అందుకోసమే నన్ను ప్రత్యేకించి శిరిడీకి పిలిచారు. వారి ఉద్దేశ్యం ప్రకారం నేను 'శ్రీసాయినాథ్ ప్రభ' అనే పేరుతో కొత్త పత్రికను ప్రారంభించాలని నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా విషయసూచికను సేకరించడానికి సిద్ధమయ్యాను. శ్రీసుందర్రావు అనే ఒక గృహస్థుడు ఈ పత్రిక కోసం ఆంగ్లంలో వ్యాసాలు వ్రాసారు. సాఠే ఆలోచన భక్త బృందంలోని కొందరికి నచ్చి, ఒకరోజు సమావేశమై 'శ్రీసాయినాథ్ దక్షిణ భిక్ష సంస్థ' అనే పేరుతో ఒక సంస్థ స్థాపించారు. ఈ సంస్థ స్థాపన గురించిన వివరాలు కొత్తగా ప్రారంభించిన 'శ్రీసాయినాథ్ ప్రభ' అనే పత్రికలో ఇవ్వబడ్డాయి. దాని నుండి, ఈ సంస్థ యొక్క స్వభావం మరియు లక్ష్యాలను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
నేను శిరిడీ వెళ్లిన రోజు సాయంత్రమే శ్రీసాయినాథ్ మహారాజ్ దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆయనను దర్శించుకోవడానికి వెళ్తుండేవాడిని. ప్రతిరోజూ మసీదుకు వెళ్లడంలో నా ఉద్దేశ్యం, అక్కడ జరిగేదంతా దగ్గరగా గమనించి, అది మన మనస్సుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, మరియు శ్రీసాయిబాబా జీవిత రహస్యాన్ని ఛేదించి, అది మనకు ఎంతవరకు సహాయపడుతుందో చూడటమే. శ్రీసాయిబాబా చాలా సందర్భాలలో నలుగురు లేదా ఐదుగురు సన్నిహిత భక్తులతో మసీదులో కూర్చొని కనిపించేవారు, కొన్నిసార్లు దూర ప్రాంతాల నుండి అనేకమంది భక్తులు వచ్చేవారు. శ్రీసాయిబాబాను చూడగానే ఎవరి మనసైనా ఆయనపట్ల భక్తి, గౌరవాలతో నిండిపోవడం కనిపించేది. నా అనుభవం కూడా అదే. ఆయన పొడవైన, దృఢమైన దేహ సౌష్ఠవము, ప్రకాశవంతమైన కళ్ళు, విశాలమైన నుదురు కలిగి ఉండేవారు. ఆయన ముఖంలోని విశిష్టమైన సాత్విక భావాల కారణంగా ఏ వ్యక్తి అయినా ఆయన ముందు సహజంగానే వినమ్రులయ్యేవారు. ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ధనవంతులైనా, పేదలైనా, శ్రీసాయిబాబా వారిని సమాన దృష్టితో చూసేవారు. దీనివల్ల ఆయన సాధుత్వపు ప్రభావం ప్రజలపై సులభంగా పడేది. ఆయన తమ ప్రవర్తన ద్వారా ప్రజలకు సమానత్వాన్ని ఒక పాఠంగా నేర్పుతున్నట్లు ఉండేది.
నేను కొన్నిరోజులు రోజుకు కేవలం రెండుసార్లు మాత్రమే మశీదుకు వెళ్ళాను. కొన్నిరోజుల తర్వాత ఒకరోజు సాఠే నాతో, "శ్రీసాయిబాబా లెండి నుండి తిరిగి వచ్చిన తర్వాత ధుని దగ్గర కూర్చుని, ప్రత్యేకించి కొంతమంది సమీప భక్తులతో ముచ్చటిస్తారు. ఆ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళాలి" అని చెప్పారు. అప్పటినుంచి నేను శ్రీసాయిబాబా లెండి నుండి తిరిగి వచ్చే సమయానికి (ఉదయం 7 నుండి 8 గంటల మధ్య) మసీదుకు వెళ్ళే నియమాన్ని పెట్టుకున్నాను. ఆ సమయంలో శ్రీసాయిబాబా గ్రామీణ పామర భాషలో ఏవో కథలు చెబుతుండేవారు. వాటిలో 'పంథారి' గ్రామం గురించి చాలాసార్లు ప్రస్తావించేవారు. వారి మాటల్లో కోడి, గుడ్డు, పెట్ట వంటి అనేక పదాలు ఉండేవి. దీని కారణంగా మహారాజ్ మతం గురించి నాకు తరచూ సందేహం కలిగేది. నేను దీని గురించి ఇతర వ్యక్తులను కూడా విచారించాను. కానీ ఆయన జన్మ రహస్యం గురించి ఎవరూ నాకు ఖచ్చితమైన వివరాలు చెప్పలేదు. నేను సాఠేను అడిగినప్పుడు, దాని గురించి ఆయనకు కూడా ఏమీ తెలియదని తేలింది. ఋషి యొక్క కుల, మతాల గురించి, నది మూలాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయకూడదని అంటారు, ఇది సాధు సత్పురుషుల విషయంలో కూడా వర్తిస్తుందా? ఆ విషయం స్పష్టంగా తెలియనప్పటికీ సాధు సత్పురుషులు సర్వదా సర్వత్రా పూజ్యనీయులు.
పైన చెప్పిన విధంగా నేను ప్రతిరోజూ మశీదుకు వెళ్తుండగా ఒకరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నేను, తాత్యాసాహెబ్ సాఠే ఇద్దరం మేల్కొన్నాము. అప్పుడు తాత్యాసాహెబ్ సాఠే నాతో, 'కృష్ణా! నువ్వు ప్రతిరోజూ గురుచరిత్ర పఠిస్తావు కదా! మరి మన వాడా ఆవరణలో ఉన్న వేపచెట్టు కింద కూర్చొని సప్తాహ పారాయణం ఎందుకు చేయకూడదు?' అని అన్నారు. దానికి నేను, "వేపచెట్టు కింద కూర్చుని సప్తాహ పారాయణ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇక్కడ ఒక ఔదుంబర వృక్షం ఉంటే, దాని కింద సప్తాహ పారాయణం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా, మీరు నన్ను ఇక్కడికి పిలిచిన పనిపై నా పూర్తి శ్రద్ధను పెట్టడమే మరింత సముచితం. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ ఉదయం పూట చాలా చల్లగా ఉంటుంది. అంతేకాక, నా సప్తాహం ఇతరులకు అనవసరమైన అపోహలు కలిగించడం సరైనదిని నేను అనుకోవడం లేదు. అందువల్ల, ఇక్కడ సప్తాహం చేయడానికి బదులుగా, నేను సోలాపూర్కి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తాను. అలా చేయడం వల్ల నా ప్రస్తుత పనికి ఆటంకం కలగదు, నేను నా పూర్తి శ్రద్ధను అక్కడ పెట్టగలుగుతాను' అని బదులిచ్చాను. ఇలా చెప్పిన తర్వాత, ఆయన ఆ విషయంపై పట్టుబట్టలేదు. కొంతసేపు ఇతర విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత, తెల్లవారుజామున సుమారు 4:05 గంటలకు మేమిద్దరం మళ్ళీ నిద్రపోయాము. ఒక గంట తర్వాత మళ్ళీ మేల్కొని, నేను ముఖం కడుక్కుని ఎప్పటిలాగే మసీదుకు వెళ్ళాను. శ్రీసాయిబాబా లెండి నుండి తిరిగి వచ్చి ధుని దగ్గర కూర్చుని ఉన్నారు. ఆయన వద్ద నలుగురు, ఐదుగురు భక్తులున్నారు. బాబా వాళ్లతో పామర భాషలో కొన్ని కథలు చెపుతున్నారు. నేను వెళ్ళినప్పుడు బాబా ఆ భక్తులను చూస్తూ ఒక కథ చెప్తున్నారు. నేను వెళ్ళగానే నా తలను మహారాజ్ పాదాల వద్ద ఉంచి నమస్కరించి 4-5 అడుగుల దూరంలో కూర్చుని ఆయన చెప్పే ఆ కథ వినసాగాను. కానీ నాకు ఆ కథ అర్థం కాలేదు. శ్రీసాయిబాబా అనర్గళంగా మాట్లాడుతూ సందర్భానుసారంగా సహజాతి సహజంగా, "ఔదుంబర వృక్షం ఏమిటి? రావి చెట్టు ఏమిటి? వేప చెట్టు ఏమిటి? అన్నీ ఒకటే!" అని అన్నారు. బాబా ఆ మాటలు పలకగానే, ఆరోజు ఉదయం గురుచరిత్ర సప్తాహం గురించి సాఠేకు, నాకు మధ్య జరిగిన సంభాషణ నాకు గుర్తుకొచ్చింది. మహారాజ్ ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు అని ఆ విషయం నాకు గుర్తు చేసి ఉంటారని భావించి నేను మహారాజ్ ముఖం వైపు చూసాను. కానీ మహారాజ్ దృష్టి ధుని మీదే ఉంది. పైమాటలు పలుకుతున్నప్పుడు ఆయన నావైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు కూడా. అందువల్ల ఆ మాటలు పలకడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటో నేను గ్రహించలేకపోయాను. కానీ ఆయన ముఖంలో నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ సమయంలో మరో 4-5 మంది అక్కడికి వచ్చారు. శ్రీసాయిబాబా నుండి మునపటివలె కథా ప్రవాహం కొనసాగింది. నాలాగే ఇతరులు కూడా అందులోని కొన్ని సంకేతాలు, ఆధారాలను గ్రహిస్తూ ఉంటారని నాలో నేను తర్కించుకున్నాను. అక్కడ ఒక గంటసేపు కూర్చున్న తర్వాత నేను వాడాకి తిరిగి వెళ్లి విషయాన్ని తాత్యాసాహెబ్ సాఠేకు నివేదించాను. అది విని ఆయన నవ్వి నాతో ఇలా అన్నారు, "వేప చెట్టు ఉన్నందువల్ల ఏమి జరిగిందో నేను నీకు చెప్పలేదు. శ్రీసాయిబాబా స్వయంగా ఈ వేప చెట్టు కింద కూర్చునేవారు. నువ్వు ఇక్కడ ఒక సప్తాహం చేయాలి". నేను మాత్రం పైన పేర్కొన్న ఇబ్బందులను కారణంగా చూపి, నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే కారణంతో సప్తాహం చేయడానికి నిరాకరించాను. కానీ సప్తాహం చేయాల్సి వస్తే, యోగ్యమైన ఏర్పాట్లతో పవిత్రంగా ఉండాలని, నేలపై దుప్పటి పరుచుకొని రాత్రి అక్కడే నిద్రపోవడం సముచితమని భావిస్తున్నందున నేను సప్తాహం చేయడానికి నిరాకరించాను.
తరువాయి భాగం వచ్చే వారం ...
సోర్స్: సాయిలీల పత్రిక 1938, 4,5, 6 సంచిక & 1938, 7,8,9 సంచిక
సాయిభక్తుల అనుభవమాలిక 2109వ భాగం....
1. శిరిడీలో పాండురంగ విఠలుని దర్శనం
2. కోరిన కోరికలన్నీ తీర్చే సాయినాథుడు
3. బాబాని భక్తితో కొలిస్తే నెరవేరని కోరిక ఏదీ లేదు!!
