బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించి, వారి అనుగ్రహానికి పాత్రుడైన భక్తుడు పూణే నివాసి శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే 1931, మే 9న శ్రీసాయిలీల పత్రికకు పంపిన లేఖలోని కొన్ని వివరాల తెలుగు అనువాదం:
శ్రీసాయిలీల గ్రంథ రచయితకు నా వినమ్ర నమస్కారాలు. శ్రీవారికి(శ్రీసాయిబాబా) సంబంధించిన మరికొన్ని దివ్య లీలలు ఇటీవల నాకు స్ఫురించినందున, అవి మరింత విస్తృతంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వాటిని మీకు తెలియజేస్తున్నాను. ఇది 15 సంవత్సరాల కిందట(1916లో) జరిగింది. ఒకరోజు ఉదయం బాబా బాపుసాహెబ్ జోగ్, తదితర భక్తులతో సంభాషిస్తూ ఇలా అన్నారు, "కాకా(దీక్షిత్) తీవ్ర జ్వరంతో బాధపడుతూ చాలా అనారోగ్యంగా ఉన్నాడు. నేను లేకుండా అతను మందులు తీసుకోడు. కాబట్టి నేను పార్లే వెళ్ళాలి. కానీ బాపుసాహెబ్, నువ్వు 'అతనినే ఇక్కడికే రమ్మని' కబురు పంపు" అన్నారు. ఈ సంభాషణ జరిగిన రోజు, భావుసాహెబ్కు(కాకాసాహెబ్ దీక్షిత్) జ్వరం వచ్చి ఐదవరోజు. అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ తన సాధారణ అలవాటు ప్రకారం ఊదీ, ఊదీ తీర్థం తప్ప మరే ఇతర మందులు అసలు తీసుకోలేదు. మర్నాడు బాపుసాహెబ్ ద్వారా శ్రీసాయి పిలుపు అతని ఇంటి ముంగిట చేరింది. ఆ కబురు అందిన వెంటనే అతను మరునాడు సాయంత్రం శిరిడీకి బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా తన ప్రయాణ విషయంలో తన భార్య దివంగత శ్రీమతి బాబిబాయిసాహెబ్ ఎటువంటి ఆందోళనకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో పార్లే నుంచి శిరిడీకి తనతోపాటు నన్ను కూడా తీసుకెళ్తానని ఆమెకు తెలియజేసారు.
మేము బయలుదేరడానికి నిర్ణయించిన రోజు ఉదయం, భావుసాహెబ్ వద్ద నుండి నాకు ఒక ఆకస్మిక పిలుపు వచ్చింది. ఆ పిలుపు అతని ఆరోగ్యానికి సంబంధించి నా మనసులో ఆందోళన కలిగించింది. దాంతో నేను వెంటనే ఆయన బంగళాకు బయలుదేరాను. నేను వెళ్ళిన సమయానికి భావుసాహెబ్ ఇంకా నిద్రలేవలేదు. అందువల్ల నేను నేరుగా బాబీని కలిసి మాట్లాడాను. ఆమె నాకు మొత్తం పరిస్థితి వివరించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి భావుసాహెబ్ నిద్రలేచారు. నేను వెంటనే ఆయనను కలిసి ఈ విధంగా సూచించాను, "నేను మీతో తోడుగా ఉన్నంతవరకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని బాబీబాయికి పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, ఆమెను, వంటమనిషిని మన వెంట తీసుకువెళ్లడం చాలా వివేకవంతమైన పని అవుతుంది. ఎందుకంటే, మనం శిరిడీ చేరుకున్న తర్వాత, బాబా మనల్ని అక్కడ ఎన్ని రోజులు ఉంచుకోవాలని నిర్ణయిస్తారో చెప్పలేము కదా!" అని. నా సూచన ఆయనకు సబబుగా అనిపించింది. అదే రోజే సాయంత్రం మేము బొంబాయి నుంచి శిరిడీకి బయలుదేరాము. మా రైలు మన్మాడ్ వద్ద ఆగినప్పుడు స్త్రీల బోగిలో కేవలం ఇద్దరు స్త్రీలు మాత్రమే ఉండడాన్ని గమనించిన కొంతమంది బ్రిటిష్ సైనికులు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో నేను అక్కడ లేకపోయి ఉంటే, నిజంగా ఒక అత్యంత భయంకరమైన సంఘటన జరిగి ఉండేది. ఎందుకంటే, ఆ సమయంలో శారీరక బలహీనత కారణంగా భావుసాహెబ్కు, అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం, చక్కదిద్దడం పూర్తిగా అసాధ్యమై ఉండేది. చివరగా, మేము క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. మేము శిరిడీలో అడుగుపెట్టగానే పార్లేలో భావుసాహెబ్ను పట్టిపీడించిన జ్వరం తగ్గిపోయింది, తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు.

