సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2067వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని ఊదీ సంజీవని
2. బాబా చేసిన మేలు

సాయినాథుని ఊదీ సంజీవని

పిలిచినంతనే పలికే దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసాయినాథునికి ప్రణామాలు. నా పేరు జ్యోతి. ఈ బ్లాగు సాయి భక్తులకు నిజంగా ఒక వరం. ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలను ఈ బ్లాగులో చదువుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సాయితండ్రి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిలో నుండి కొన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకసారి ఊరిలో ఉన్న మా ఇంటిని శుభ్రం చేయించాలని పనివాళ్ళని రమ్మని చెప్పాను. నేను వెళ్లి వాళ్ళచేత శుభ్రం చేయించాలి. నాకు కూడా చాలా పని ఉంటుంది. అయితే ఆరోజు ఉదయం నిద్రలేచేసరికి నాకు చాలా నీరసంగా ఉండి అస్సలు లేచే ఓపిక లేకుండా పోయింది. అక్కడ చూస్తే, అప్పటికే పనివాళ్ళు వచ్చేసారు. నేనున్న స్థితిలో మేమున్న ఊరి నుంచి ఆ ఊరికి ప్రయాణం చేయాలంటే చాలా భయమేసింది. అయినా సాయినాథుని మీద భారమేసి కొద్దిగా ఊదీ నుదిటికి పెట్టుకొని, మరికొంత ఊదీ నీటిలో కలుపుకొని తాగి, "సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించి బయలుదేరాను. అలా వెళ్లిన నేను ఆ రోజంతా దుమ్ము, ధూళిలో ఎంతో కష్టపడి చాలా పని చేశాను. అంత పని చేసినా సాయంత్రం వరకు ఎటువంటి అలసట తెలియలేదు. ఇంటికొచ్చాక కానీ ఉదయం నా పరిస్థితి నాకు గుర్తు రాలేదు. అంత ఓపిక, శక్తి ఎక్కడినుండి వచ్చాయో అనిపించింది. ఎక్కడినుండి ఏముంది? ఆ సాయినాథుడే లేచి నిలబడలేనంత నీరసంగా ఉన్న నాకు ఎంత పని చేసినా అలసిపోనంత శక్తిని తమ ఊదీతో ఇచ్చారు. కొన్నిసార్లు మన ఒంట్లో అస్సలు బాగాలేనప్పుడు చాలా పెద్ద పనులు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు అంత త్వరగా ఆహారం ఇవ్వలేని శక్తిని మన తండ్రి సాయినాథుడు ఇవ్వగలరు. ఆయన ఊదీ పరమ ఔషధంగా అనంతమైన శక్తిని ఇవ్వగలదు.

ఇంకోసారి హఠాత్తుగా నా నడుము పట్టేసింది. నొప్పి చాలా ఎక్కువైపోయి మందులు వేసుకున్నా తగ్గలేదు. ఏ పనీ కాదు కదా నా పనులు కూడా చేసుకోలేకపోయాను. నిలబడలేకపోయాను, కూర్చోలేకపోయాను. పడుకున్నా భయంకరమైన నొప్పితో విలవిలలాడిపోయాను. నాకు చాలా భయమేసింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఏ స్కానింగ్లో, సర్జరీలో అంటారని భయమేసింది. అది అంతటి భయంకరమైన నొప్పి. ఆ నొప్పితో నాలుగు రోజులు ఇబ్బందిపడిన తర్వాత నాకెందుకో 'బాబా ఊదీ రాసుకొని ఉండొచ్చు కదా!' అనిపించింది. అప్పటివరకు బాబాని "నొప్పి తగ్గించమ"ని వేడుకుంటున్నా బాబా ఊదీని ఉపయోగించాలని గుర్తు రాలేదు. ఇక వెంటనే బాబా ఊదీ నీటిలో కలిపి నొప్పి ఉన్నచోట రాశాను. అంతే! ఇంకా సాయితండ్రి అద్భుతం చూడండి. అరగంటలో నొప్పి చాలావరకు తగ్గిపోయింది. అస్సలు కదలలేకపోయినా నేను అరగంట తర్వాత ఇంటి పనులు మామూలుగా చేసుకున్నాను. ఇలా ఎన్నోసార్లు సాయినాథుడు నన్ను రక్షించారు.  ఎప్పుడు, ఎక్కడ నొప్పి వచ్చినా, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఆ సాయినాథుని ఊదీ సంజీవని. సాయినాథుని దయతో మరిన్ని అనుభవాలను త్వరలోనే మీతో పంచుకుంటాను. సాయితండ్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతా ప్రణామములు.

బాబా చేసిన మేలు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు లలిత. ఒకసారి మా చిన్న పాపకి కడుపులో నొప్పి బాగా వచ్చింది. టాబ్లెట్లు వాడినా నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని పాప నుదిటికి కొంచెం ఊదీ పెట్టి, మరి కొంచెం ఊదీ నోటిలో వేసాను. తర్వాత కొద్దిసేపటికి పాప నొప్పి తగ్గింది. నాకు చాలా ఆనందమేసి సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఇంకోసారి మా బావగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 'హార్ట్‌లో రెండు బ్లాకులు ఉన్నాయని, స్టంట్లు వేయాలని' డాక్టర్ చెప్పారు. నేను చాలా టెన్షన్ పడి బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని అనుకున్నాను. బాబా దయవల్ల రెండు స్టంట్లు వేశారు. అతను క్షేమంగా ఇంటికి వచ్చారు. నేను ప్రతి సంవత్సరం కనుమ పండక్కి నా కన్నవారి ఇంటికి వెళ్తాను. అలాగే ఈ సంవత్సరం(2026) వెళ్ళాలనుకున్నాను. కానీ ఈసారి సరిగా ఆ సమయానికి నా తోడికోడలు బయట వుంది. బావ గారు పేషెంట్. అతనిని, అలాగే కొద్దిరోజుల ముందే పుట్టిన వాళ్ళ మనవరాలిని వదిలేసి ఎలా వెళ్లడమని కనుమ రోజు వెళ్లలేదు. తర్వాత వెళదామంటే పిల్లలకి కాలేజీలు ఉంటాయి. అందుకని బాబాని గుర్తు చేసుకొని, "బాబా! నేను ఎలా అయినా కన్నవారి ఇంటికి వెళ్ళేలా చేయండి" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవలన నా తోడుకోడలు ఇంట్లోకి వచ్చాక తను పిల్లల్ని చూసుకుంటానన్నది, ఇంట్లో అందరూ నేను వెళ్ళడానికి ఒప్పుకున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే కాపాడుతూ ఉండండి. మీ పాదాలందు స్థిరమైన నమ్మకం, భక్తి, శ్రద్ధలు కలిగి ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2066వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఎప్పుడూ మనతో ఉండే బాబా కరుణ


నా పేరు మహేశ్వర. నేను కొద్ది రోజులు తీవ్రమైన పళ్ళ నొప్పితో బాధపడ్డాను. ఆ కారణంగా తినడం, మాట్లాడడం నాకు కష్టంగా మారింది. మందులు తీసుకున్నా నొప్పి పూర్తిగా తగ్గలేదు. అప్పుడు నేను, “బాబా! ఈ నొప్పి నుంచి నాకు ఉపశమనం ప్రసాదించండి” అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించి ఆయన మీద నమ్మకముంచాను. అలా ప్రార్థించినంతనే నా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఆ రాత్రి నొప్పి తీవ్రత క్రమంగా తగ్గడం మొదలై మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి చాలావరకు తగ్గిపోయింది. నాకు నిజంగా ఆశ్చర్యమనిపించింది. సాయిబాబా ఆశీర్వాదాలే అందుకు కారణమని నా హృదయపూర్వక విశ్వాసం. ఈ అనుభవం నా విశ్వాసాన్ని బలపరిచింది. భక్తి మనసుకు శక్తినిస్తుందని, మనసు ప్రశాంతంగా ఉంటే శారీరక ఉపశమనం వస్తుందని అర్థమైంది. కష్ట సమయంలో సాయిబాబా మీద నమ్మకం చాలా ఆవశ్యకం. బాబా కరుణ ఎప్పుడూ మనతో ఉంటుంది. నమ్మకంతో బాబాని ప్రార్థించండి. ఆ సాయిబాబా అందరికీ ఆరోగ్యం, శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఒకరోజు నేను ఇంటికి తాళం వేసి టిఫిన్‌ కోసం బయటికి వెళ్ళాను. టిఫిన్ చేసి తిరిగి వచ్చాక చూస్తే, తాళం చెవి కనిపించలేదు. నాకు చాలా ఆందోళనగా అనిపించి నా బ్యాగులో, జేబులో, బైక్ దగ్గర అంతా వెతికాను. కానీ తాళం చెవి దొరకలేదు. మనసులో భయం పెరిగి సాయిబాబాను తలుచుకొని, “బాబా! మీరే తాళం చెవి దొరికే మార్గం చూపించండి” అని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆయన మీద పూర్తి నమ్మకంతో కాసేపు ప్రశాంతంగా నిల్చున్నాను. అప్పుడు ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది. టిఫిన్‌కు వెళ్లేముందు చెప్పుల స్టాండ్ నుండి చెప్పులు తీసిన సంగతి గుర్తొచ్చి, అక్కడ చూడాలనిపించింది. వెంటనే చెప్పుల స్టాండ్ దగ్గరకు వెళ్లి చూస్తే, తాళం చెవి ఆ చెప్పుల స్టాండ్‌లోనే ఉంది. ఆ క్షణం నాకు ఎంతో ఆనందం కలిగింది. బాబా కృప వలనే ఇది జరిగిందని అనుకున్నాను. చిన్న విషయమే అయినా బాబా ఎంత జాగ్రత్త వహించారో అర్థమై మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. బాబాపై నమ్మకం ఎన్నడూ వృధా కాదని మరోసారి తెలిసింది. సాయిబాబాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నేను హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. 2026, సంక్రాంతి పండగకి నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకు సమీపంలో ఉన్న నా స్వగ్రామానికి వెళ్లాలనుకున్నాను. అయితే పండగకి ముందు వర్ష సూచనలు ఉండటంతో నాకు కొంత ఆందోళన కలిగింది. నెల్లూరు వరకు ఏ ఇబ్బందీ లేకుండా చేరుకున్నాక అక్కడ వాతావరణం మేఘావృతంగా కనిపించింది. దాంతో వర్షమొస్తే తదుపరి నా ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటుందేమోనన్న భయం కలిగి, “బాబా! నేను సురక్షితంగా నా స్వగ్రామానికి చేరేవరకు వర్షం లేకుండా కాపాడు” అని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆ తరువాత మనసుకి కొంత ధైర్యం, ప్రశాంతత కలిగాయి. నేను నెల్లూరు నుంచి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆకాశం మబ్బులతో ఉన్నప్పటికీ బాబాపై నమ్మకంతో ముందుకు సాగాను. నేను స్వగ్రామానికి చేరేవరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఇది పూర్తిగా బాబా అనుగ్రహమేనని హృదయపూర్వకంగా అనిపించింది. కొద్దిసేపటికే తేలికపాటి వర్షం మొదలైంది. అది చూసి బాబా నా ప్రార్థనను ఆలకించారనిపించింది. బాబా దయవల్ల భోగి పండుగ ఏర్పాట్లు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగాయి.

మర్నాడు నా జీవితంలో మరో ముఖ్యమైన అనుభవం చోటు చేసుకుంది. అదేమిటంటే, మా టీమ్‌కి సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్‌తో టీమ్ మీటింగ్ షెడ్యూల్ అయింది. నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. చర్చ కీలకమైనందున మనసులో ఒత్తిడి పెరిగి మీటింగ్‌ జరగడానికి ముందు నేను సాయిబాబాను, “బాబా! నాకు ధైర్యం ఇవ్వండి. మీటింగ్ సజావుగా జరిగేలా చూడండి” అని ప్రార్థించాను. అప్పుడు నా మనసుకి కొంత ప్రశాంతంగా అనిపించింది. మీటింగ్ ప్రారంభమయ్యాక సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ కీలక ప్రశ్నలు అడిగారు. వాటికి మా టీమ్ ధైర్యంగా స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది. నేను కూడా ఆత్మవిశ్వాసంతో నా అభిప్రాయాలు వ్యక్తపరిచాను. మీటింగ్ మొత్తం సాఫీగా సాగింది. ఏ సమయంలోనూ ఒత్తిడి, గందరగోళం అనిపించలేదు. చివరికి సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ మా పనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అది విని నా టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ విజయానికి సాయిబాబా ఆశీర్వాదమే కారణమనిపించింది. ప్రార్థన మనసుకు ధైర్యం, స్థిరత్వం ఇస్తుందని ఈ రెండు అనుభవాలు నాకు బలంగా తెలియజేశాయి. కష్ట సమయంలో బాబాను నమ్ముకుంటే అంతా తేలికవుతుందని నమ్మకం మరింత పెరిగింది. సాయిబాబా అనుగ్రహం ఎల్లప్పుడూ తన భక్తులతోనే ఉంటుందనే విశ్వాసంతో ఈ అనుభవాలు మీతో పంచుకున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 2065వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా వర్షించిన కృపాకటాక్షాలు


సాయిభక్తుల అనుభవమాలిక 2064వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనస్ఫూర్తిగా కొలిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తారు బాబా
2. పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా
3. చావు అంచుల దాకా వెళ్లిన వ్యక్తిని కాపాడిన బాబా


పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా

సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు మనోజ. నా జీవితంలో బాబా లీలలు ఇన్ని అని చెప్పలేను. ఎందుకంటే, నిత్యం నా వెన్నంటే ఉండి నన్ను ప్రతి విషయంలోనూ నడిపిస్తున్నారు బాబా. ఆయనకి శతకోటి నమస్కారాలు. 2026, జనవరిలో మా మూడు సంవత్సరాల పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది. మందులు వాడినప్పటికీ ఆ మందుల ప్రభావం తగ్గగానే మళ్ళీ జ్వరం వస్తూ పాప బాగా ఇబ్బందిపడింది. తను చాలా నీరసించిపోయింది. నేను, మావారు పాపకి తగ్గిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. హాస్పిటల్‌కి తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదు. నాకు తెలిసిందల్లా బాబాకి చెప్పుకోవటం, ఆయన్ని వేడుకోవటం మాత్రమే. కాబట్టి ఆయన్నే ప్రార్థిస్తూ రోజూ ఊదీ పాపకి పెట్టి, కొద్దిగా ఊదీ నీటిలో కలిపి తాగిస్తుండేదాన్ని. అయితే ఐదు రోజులు దాటినా పాపకి తగ్గకపోయేసరికి ఇక అప్పుడు పాపని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ బాబా నాకెందుకు పరీక్ష పెడుతున్నారని బాధపడ్డాను. మరుసటిరోజు డాక్టర్ దగ్గరకి వెళ్తుంటే హాస్పిటల్ ఎదురుగా ఉన్న గోడ మీద బాబా ఫోటో కనపడింది. బాబాని చూసి నాకు చాలా ధైర్యంగా అనిపించింది. డాక్టరు దగ్గరకి వెళ్ళడానికి ముందు నర్సు టెంపరేచర్ చెక్ చేసి, "నార్మల్ ఉంది. జ్వరం లేదు" అని చెప్పింది. ఇంకా నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మావారు, "ఎలాగూ వచ్చాం కదా! మామూలుగా ఒకసారి చూపించినట్టు ఉంటుంది, డాక్టరుని కలుద్దాం" అన్నారు. బాబానే తిరిగి వెళ్లిపోవద్దని చెప్పినట్టు నాకు అనిపించింది. డాక్టర్ చూసి. "పాపకి సమస్యేమీ లేదు కానీ, మీరు ముందు వాడిన మందుల డోస్ సరిగ్గా వేయకపోవటం వల్ల జ్వరం తగ్గలేదు" అని వేరే మందులు ఇచ్చారు. అవి వేసాక పాపకి జ్వరం మళ్ళీ రావడం ఆగి తగ్గుముఖం పట్టింది. నిజంగా మేము డాక్టరుకి చూపించకుండా వెళ్ళిపోయి ఉంటే పాప ఇబ్బందిపడేది. అలా జరగకుండా బాబానే చూసారు. నేను చాలా  సంతోషపడి బాబాకి పరిపరి విధాల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నమ్మిన వారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుని చరణాలకు సాష్టాంగ ప్రణామాలు.


సాయిభక్తుల అనుభవమాలిక 2063వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగితే ఇంతలా ఏర్పాటు చేస్తారా బాబా!
2. బాబా దయతో అడ్డుంకులు తొలగి ప్రాజెక్ట్ పూర్తి



సాయిభక్తుల అనుభవమాలిక 2062వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    • బాబా ఇచ్చిన మోతీచూర్ లడ్డు కానుక - సానుకూల సంకేతం 


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను ఇప్పుడు బాబా ఇచ్చిన మధురమైన అనుభూతిని పంచుకుంటున్నాను. నేను చాలా రోజుల నుండి బాబా గుడికి వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. చివరికి బాబా అనుగ్రహంతో 2026, జనవరి 8న తిరుపతిలో ఉన్న ఒక బాబా గుడికి వెళ్లేందుకు సమయం కలిసి వచ్చింది. ఆ రోజు గురువారం కావడం వల్ల నేను చేయాల్సి ఉన్నా పారాయణం ఆ గుడిలోనే చేసి, ఆరతి చూసుకొని వద్దామనుకున్నాను. నేను కొన్నిరోజులుగా నా ఆధ్యాత్మిక జీవితం గురించి సందిగ్ధంలో ఉన్నాను. దానికి సంబంధించి ఏదైనా సానుకూల సంకేతం ఇమ్మని గుడికి వెళ్లే ముందు బాబాని కోరుకున్నాను. అలాగే 'నేను చాలా రోజుల తర్వాత గుడికి వస్తున్నాను బాబా. ఏమైనా కానుక ఇవ్వొచ్చుగా?' అని మనసులో అనుకున్నాను. కానీ అది బాబాకి చెప్పుకోకుండానే గుడికి వెళ్ళాను. గురువారం అయినందున జనాలు బాగా ఉన్నారు. నేను క్యూలో వెళ్లి బాబాని తాకి, దర్శనం చేసుకొని అక్కడ పెడుతున్న కట్టు పొంగలి ప్రసాదం తీసుకున్నాను. తర్వాత బాబాకి ఎదురుగా మధ్యలో కూర్చుని పారాయణం మొదలుపెట్టాను. అప్పటికి ఉదయం 11 గంటలు దాటింది. కాసేపటికి ఆరతి సమయం దగ్గర పడుతుండడంతో శుభ్రపరిచేందుకు కింద కూర్చున్న వాళ్ళ అందరినీ లేచి వెళ్ళమన్నారు. నేను పారాయణ చేస్తూనే లేచి బయటకు వెళ్లి అక్కడ ఒక మూలాన ఉండి పారాయణ కొనసాగిస్తున్నాను. అదే సమయంలో ప్రసాద వితరణ చేసే వైపు చూస్తే, పెద్ద పెట్టెతో మోతీచూర్ లడ్డులు పంచడం మొదలుపెట్టారు. వాటిని చూడడంతోనే వెళ్లి ఒక లడ్డు తీసుకొని తినాలనిపించింది కానీ, 'పారాయణ మధ్యలో ఉండగా వెళ్లి తీసుకోవడమెందుకు?' అని ఒక పక్క, ఇంకో పక్క 'పారాయణ పూర్తి చేసేలోపు ప్రసాదం అయిపోతుందెమో!' అని ఆలోచనలు నా మనసులో తిరిగాయి. ఆ రెండు ఆలోచనలు నా మనసున కాసేపు కొనసాగినప్పటికీ చివరికి 'నేను పారాయణ చేసిన తర్వాతే ప్రసాదం దగ్గరకి వెళ్తాను. ఒకవేళ ఆ లడ్డు ప్రసాదం అయిపోయినా బాబా ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తారు' అనే నిశ్చయించుకున్నాను. అంతలోపు లోపల శుభ్రం చేయడం అయిపోవడంతో ఆరతి దగ్గర నుంచి చూస్తే బాగుంటుందని బాబాకి దగ్గరగా వెళ్లి కూర్చొని పారాయణ కొనసాగించాను. పారాయణ అయిన వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకొని ప్రసాదం ఇచ్చే దగ్గరకి వెళ్లాలని అనుకున్నాను కానీ, పారాయణ పూర్తైయ్యే సమయానికి ఆ విషయం మార్చిపోయి అక్కడే బాబాని చూస్తూ కూర్చున్నాను. అప్పుడు ఒకామె తన చిన్నకూతురితో అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళకి ప్రసాదం పంచడానికి వచ్చింది. ఆ చిన్నపాప ఇచ్చిన ప్రసాదం మరేదో కాదు, మోతీచూర్ లడ్డు. దాన్ని నా చేతిలో పెట్టడంతోనే నా ఆనందానికి అవదులు లేవు. నా పారాయణ పూర్తిచేసి కూర్చున్న చోట నుండి లేచి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళకపోయినా నేను ఉన్న చోటికే నేను కోరుకున్న ప్రసాదం పంపిన బాబా అనుగ్రహం గురించి ఏమని చెప్పగలము? బాబా అనుగ్రహం అక్కడితో ఆగలేదు.

నేను బాబా ఇచ్చిన ఆనందంలో ఆరతిని బాబాకి చాలా దగ్గరగా వీక్షించాను. ఆరతి అనంతరం బాబాకి దగ్గరగా వెళ్లి మరోసారి దణ్ణం పెట్టుకుందామని లైన్‌లో వెళ్లి బాబాను తాకి నమస్కరించుకుని వెనక్కి తిరిగి వచ్చి మరల ప్రసాదం కోసం లైన్‌లో నిల్చున్నాను. అప్పుడు ఆరతి సమయానికి భక్తులు తెచ్చిన ప్రసాదాలన్నీ కలిపి పంచుతున్నారు. నాకు ఇచ్చిన ఆ ప్రసాదంలో కొద్దిగా సాంబార్ అన్నం, పూర్తి మోతీచూర్ లడ్డు ఉన్నాయి. అన్ని రకాల ప్రసాదాలు కలిపేసినా నాకు పూర్తి లడ్డు రావడమేమిటి!! నేను ఆ లడ్డు చూసి, "నేను ఒకసారి అడిగితే మీరు రెండుసార్లు ఇచ్చారా బాబా? మీ కృపకు అంతులేదు బాబా" అని మళ్ళీ నా మనసులో ఆనందం ఉప్పొంగింది. ఆ ఆనందంలో తేలుతూ అన్నదానం లైన్‌లోకి వెళ్ళాను. కానీ నాకేం తెలుసు బాబా లీల ఇంకా పూర్తి అవ్వలేదని?

నేను పళ్లెంలో భోజనం వడ్డించుకొని చేతిలో పట్టుకొని తింటూ గుడి ఎంట్రన్స్ దగ్గరకి వెళ్ళాను. అక్కడ చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. నేను అక్కడ ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అన్నది పట్టించుకోకుండా నా పాటికి నేను కొంచెం దూరంలో భోజనం చేస్తున్నాను. కొద్దిసేపటికి గుడి ఎంట్రన్స్ వైపుకి నా తల తిప్పితే, అక్కడ ఆ గుడిలో బాబా దగ్గర సేవ చేసే ఒకతను భక్తులకు ప్రసాదం పంచుతూ, 'స్వామీ! ఇటు రండి' అని నాకు సైగ చేస్తున్నారు. నేను, "ఏమిటి ఆయన నన్ను పిలుస్తున్నారు?" అని కొంచెం ఆశ్చర్యపోయి 'నన్ను కాదేమో!' అని పక్కకి వెళ్ళిపోయాను. అయినా కూడా ఆయన నాకోసమే చూస్తే, మళ్ళీ నన్ను ఇలా రమ్మని సైగ చేసారు. సరేనని వెళ్తే ఆయన తన చుట్టూ ఎంతోమంది జనాలు ఉంటే, వాళ్ళ మీద నుండి చేయి చాపి చిరునవ్వుతో నా చేతిలో ఒక మోతీచూర్ లడ్డు పెట్టారు. అంత జనంలో ఆయన నన్ను పిలవడం ఏంటి? పోనీ ఏదో ప్రసాదం ఇవ్వాలనుకుంటే, అది మోతీచూర్ లడ్డు కావడం ఏంటి? పారాయణ అయిన వెంటనే ఒకసారి ప్రసాదం ఇచ్చే దగ్గరకి వెళ్తాను, ఒకవేళ ఆ లడ్డు ప్రసాదం అయిపోయినా బాబా ఇస్తారులే అని నా మనసులో ఆలోచన రావటం ఏమిటి? దాన్ని బాబా ఒక్కసారి కాదు 3 సార్లు నెరవేర్చడం ఏమిటి? నాకు నోట మాట రాలేదు. బాబా ప్రేమకి నేను ఏమైపోతానో నాకు అర్థం కాలేదు. నేనెంత ఆనందం పొందానో మాటల్లో చెప్పలేను. ఆ ఆనందంలో నేను భోజనం ఏం తిన్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆనందానికి నా కడుపు నిండిపోయింది.

వెంటనే బాబా ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ఆనందాన్ని నాకు తెలిసిన ఒక బాబా బంధువుతో పంచుకోవాలని తనకి ఫోన్ చేశాను. తనతో మాట్లాడుతుండగా కాసేపటి ముందు నాకు లడ్డు ఇచ్చిన ఆయన నా దగ్గరకి వచ్చి, "ఏ వూరు? ఎక్కడి నుంచి వచ్చారు?" అని కొంచం మాట్లాడారు. నేను ఆయనతో బాబా నాకు ఇచ్చిన ప్రేమను చెప్పాలని బాగా అనుకున్నాను. కానీ చెప్పేలోపు ఆయన వస్తానని వెళ్లిపోయారు. సరేనని నేను బాబా ప్రేమని ఫోన్లో బాబా బంధువుతో పంచుకోసాగాను. కాసేపటి తర్వాత నాకు లడ్డు ఇచ్చిన ఆ బాబా సేవకుడు మళ్ళీ నా కంటపడ్డారు. నేను ఆనందంగా బాబా ప్రేమను ఆయనకి చెప్పి, "మీ ద్వారా బాబా నా కోరిక తీర్చారు" అని అన్నాను. అందుకాయన, "బాబానే మీకు ఇచ్చారు" అని చెప్పి వెళ్ళొస్తానని వెళ్ళిపోయారు. బాబా ఇవ్వడమే కాకుండా 'నేనే నీకు ఇచ్చాను' అని తెలియజెప్పడానికే ఆయన్ని పంపించి, నాతో మాట్లాడించినట్లు ఉంది ఇదంతా. నేను బాబాను ఏదైనా కానుక, నా ఆధ్యాత్మిక జీవితంకి సంబంధించి సానుకూల సంకేతం అడిగితే, ఆయిన ఏకంగా ఒకసారి కాదు, మూడు సార్లు మోతీచూర్ లడ్డు కానుకగా నాకిచ్చి, నా ఆధ్యాత్మిక జీవితంకి డోకా ఏమీ లేదని, మధురంగా ఉంటుందని నా భుజం తట్టి చెప్పినట్టుగా నాకు ఈ అద్బుతమైన అనుభవం ప్రసాదించారు. నేను ఆ రోజంతా ఆ అనుభవాన్ని, బాబా ప్రేమని తలుచుకుంటూ అసలు ఎంత ఆనందంలో తేలానో చెప్పలేను. అసలు ఏమి చెప్పి బాబా ప్రేమని వర్ణించగలం? వర్ణించటానికి మాటలు చాలవు. ఆనందంలో ఇంకా ఏదో చెప్పాలనుకున్నా మానవ మేధస్సుకు తెలిసిన పదాలతో ఏదో చెప్పడమే తప్ప, బాబా ప్రేమని వర్ణించడానికి దేవతలకు కూడా పదాలు సరిపోవు. బాబా మీద మనకి ఎంత ప్రేమ ఉంటే, అంతలా ఆయన మనం అడిగిన దానికంటే ఎన్నోరెట్లు అధికంగా, ఎంతో మధురంగా ​​ఇస్తారనడానికి నా ఈ అనుభవం ఒక ఉదాహరణ. కాబట్టి బాబాని మనం ఏమైనా అడిగితే, ఆయన అడిగిన దానికి మించి ఇస్తారనే నమ్మకంతో ఆయన మీద ప్రేమతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయిభక్తుల అనుభవమాలిక 2061వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలు పరిష్కరించిన బాబా
2. అంతా మంచిగా చేసిన బాబా

సమస్యలు పరిష్కరించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు దేవి. మాది విశాఖపట్నం. బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసారు. ఎక్కడో గాలికి, ధూళికి ఎగిరిపోవాల్సిన మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచారు. బాబా దయతో మా బాబుకి ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత MS చదువుకోసం అమెరికా వెళ్లే అవకాశం నమ్మలేని రీతిన బాబా ఇచ్చారు. బాబు అక్కడ MS చేస్తుండగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకుని, కోర్టులో ప్రవేశపెట్టారు. బాబా దయవల్ల జడ్జి 2 నెలలు సమయమిచ్చి లైసెన్స్ కోర్టుకి చూపించమన్నారు. నేను, మా బాబు బాబాని "కష్టం గట్టెక్కించమ"ని వేడుకున్నాము. బాబా దయవల్ల నెల రోజుల్లో లైసెన్స్ వచ్చేయడం, కేసు కొట్టేయడం జరిగిపోయాయి. తర్వాత బాబా దయవలన బాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు బాబు ఫింగర్ ప్రింట్లు చెక్ చేసేటప్పుడు కేసు తాలూకా జడ్జిమెంట్ కాపీ అడిగారు. అప్పుడు అంత సమయం లేదు. అంత తొందరగా కోర్టువారు కాపీ ఇస్తారని మేము ఊహించలేదు. కానీ బాబా దయ. వెంటనే జడ్జిమెంట్ కాపీ మెయిల్ ద్వారా అందింది. నెలరోజులకి మరో సమస్య వచ్చింది. కోర్టు కేసు ఉన్న వాళ్ళందరూ, అది ఎటువంటి కేసు అయినా కూడా వారివారి దేశాలకి వెంటనే వెళ్లిపోవాలని అమెరికన్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. "ఇండియా వెళితే, వెంటనే ఉద్యోగం దొరుకుతుందా?" అని బాబాని పట్టుకుని ఏడ్చేసాను. ఆయన కనిపించినా, ఆయన గురించి వినిపించినా ఏడుస్తూనే ఉండేదాన్ని. "ఎలా వచ్చిన సమస్య అలానే గాలికి కొట్టుకుపోవాల"ని అడుగుతూనే ఉండేదాన్ని. బాబా దేశం కాని దేశంలో ఒక లాయర్ గురించి మాకు తెలిసేలా చేసి, కేసు ఫైల్ చేయించి సరిగ్గా నెల రోజుల్లో సమస్యను పరిష్కరించారు.

MS పూర్తి అయిన తర్వాత ప్రతి విద్యార్థికీ OPT కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉంటే H1 వీసాతో సంబంధం లేకుండా 3 సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఆ డ్రైవింగ్ కేసు వల్ల ఆ కార్డు మా బాబుకి తిరస్కరించింది. ఇంకా నా దుఃఖానికి అవధులు లేవు. నేను ఎక్కడ, ఏ దేవుడు కనిపించినా ఏడుస్తూనే ఉండేదాన్ని. బాబా చేయి పట్టుకొని, ప్రవాహంలా ఏడుస్తూ "కష్టం గట్టెక్కించమ"ని అడుగుతూనే ఉండేదాన్ని. 2 నెలల్లో బాబా అద్భుతం చేసారు. చాలామందికి రాని OPT మా బాబుకి వచ్చింది. వాళ్ళకి కూడా రావాలని బాబాని అడుగుతున్నాను. నిజానికి అమెరికాలో ఉండాలన్నది నా కోరిక కాదు కానీ, జీవితంలో అన్నీ కోల్పోయాము. ఒకరిని నమ్మి ఇల్లు, కారు, బంగారం అన్నీ పోగొట్టుకున్నాము. నా పేదరికం బాబుకి రాకూడదని బాబాని అదే పనిగా అడిగాను. ఏదేమైనా బాబా తమ మహత్యం చూపించారు, బాబా నా సమస్య తీర్చారు. ఇదే కాదు, బాబా నా జీవితంలో జరగవు అనుకున్నవి, జరిగేలా చూసారు. బాబాని నమ్మండి, సహనంతో సహాయం కోసం అడగండి. ప్రేమతో అడిగితే తప్పకుండా ఆయన దిగి వస్తారు. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి బాబా.  ప్రతి చిన్న సమస్యను తీర్చి మా బాధని దూరం చేస్తూ మీపై ఇంకా ఇంకా నమ్మకం పెంచుతున్న మీకు శతకోటి నమస్కారాలు బాబా".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై


సాయిభక్తుల అనుభవమాలిక 2060వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి  
2. ముందే కలలో సూచించిన బాబా

సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి  

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను చాలా రోజుల తర్వాత సాయికృపను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2025, జనవరిలో  మా అమ్మకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో బాబా మాకు తోడు ఉండి సహాయాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు(ఆ అనుభవాన్ని  "'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా" అన్న టైటిల్‌తో ఇదివరకు మీ అందరితో పంచుకున్నాను). తర్వాత ఆ సంవత్సరమంతా మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది. దానికి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక ఇప్పటి అనుభవానికి వస్తే.. 2025, డిసెంబర్ నెలాఖరులో ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ నాకు ఫోన్ చేసి, "ఈరోజు ఉదయం నా ఎడమ చేయి ఐదు నిమిషాలపాటు పని చేయలేదు. తర్వాత మళ్లీ మామూలుగా వచ్చింది" అని చెప్పింది. నేను ఉన్న చోటు నుండి వాళ్ళ దగ్గరకి వెళ్లి అమ్మని డాక్టరుకి చూపిద్దామంటే 4 గంటలు పడుతుంది. అంత ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది నాకు. అందుకని మా నాన్నతో వెంటనే అమ్మని న్యూరాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్లి MRI స్కాన్ తీయించమని చెప్పాను. తర్వాత బాబాను, "అమ్మకు ఇబ్బంది లేకుండా చూడండి" అని చెప్పుకున్నాను. కానీ నాకు కొంత ఆందోళనగానే ఉండింది. కాసేపటికి ఈ బ్లాగు ఓపెన్ చేసి ఆరోజు అనుభవాన్ని చదివితే, అక్కడ ఒక భక్తులు తమ తండ్రికి బాగాలేదని, బయాప్సీ చేయించి, "అందులో ఏ ఇబ్బంది ఉండకూడద"ని బాబాని కోరుకుంటే, అంత బాగుందని, క్యాన్సర్ కాదని పంచుకున్నారు. ఆ అనుభవాన్ని చదివాక నాకు బాబా ఆ అనుభవం ద్వారా అమ్మకు బాగుంటుందని చెప్తున్నారనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో చిన్న చిన్న రక్తం గడ్డలు గుండె నుండి బ్రెయిన్లోకి చేరినట్లు వుంది. కానీ దానివల్ల అమ్మకు ఇబ్బంది లేదు, డాక్టరు పక్షవాతం రాకుండా మందులు వాడాలని మందులు రాశారు. నిజానికి అమ్మ రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి మందులు వాడుతుంది. వాటిని కార్డియాలజిస్ట్ వ్రాసారు. మేము మూడు నెలల క్రితం ఆ మందులు ఆపుదామని కార్డియాలజిస్ట్ డాక్టర్ని అడిగాము. అందుకాయన వాటిని ఆపకుండా డోస్ తగ్గించారు. అదే ఆయన వాటిని ఆపేసి ఉంటే అమ్మకి పూర్తిగా పక్షవాతం వచ్చి ఉండేది. బాబానే ఆయన రూపంలో మాకు సహాయం చేసి పెద్ద ఇబ్బంది రాకుండా కాపాడారు. వెంటనే కార్డియాలజిస్ట్‌ని సంప్రదిస్తే, ఆయన అన్ని టెస్టులు చేసి, అన్ని బాగున్నాయని ఆ మందుల డోస్ మార్చి పంపారు. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లికి ఈ బ్లాగు ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 2059వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీర్వాదం
2. భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు


భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు

బాబా నా పేరు మహేష్. ఒకసారి నేను శిరిడీలో లక్ష్మీ మందిరంకి దర్శనానికి వెళ్లి అక్కడున్న బాబా భక్తితో ప్రార్థించాను. దర్శనానంతరం బయటకు వచ్చిన నేను తొందరలో నా చెప్పులు అక్కడే మర్చిపోయాను. ఆ విషయం నాకు అస్సలు గుర్తుకు రాలేదు. నేను బస చేసిన హోటల్‌కి చేరుకున్న తర్వాత చెప్పులు లేవని గమనించాను. కొంచం ఆందోళన కలిగినప్పటికీ బాబాపై నమ్మకంతో ఆయన చూసుకుంటారని మనసులో అనుకొని ఆయనకి చెప్పుకొని ప్రశాంతంగా ఉన్నాను. ఆ రాత్రంతా బాబా ధ్యాసలో గడిచింది. మర్నాడు ఉదయం లక్ష్మీ మందిరంకి వెళ్ళడానికి బయలుదేరాను. నా మనసులో చెప్పులు దొరుకుతాయో లేదోనని భయం ఉన్నప్పటికీ దొరకుతాయన్న ఆశ కూడా ఎక్కువగానే ఉంది. అక్కడికి వెళ్ళాక చూస్తే, నా చెప్పులు కనిపించాయి. ఎవరూ వాటిని తాకకుండా అలాగే ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది సాయిబాబా కరుణ అనిపించింది. ఆయనపట్ల నా భక్తి మరింత బలపడింది. బాబా తన భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారని ఈ అనుభవం మరోసారి నిరూపించింది.

ఒకరోజు అకస్మాత్తుగా నీళ్ల విరోచనాలు మొదలై నా శరీరమంతా బలహీనమైపోయి ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను ఈ సమస్య నుంచి బయటపడేసేది బాబా దయ తప్ప ఇంకేమీ లేదని నమ్మి ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థించి పూర్తి భారం ఆయన మీద వేసాను. డాక్టరు సూచనలననుసరించి మందులు సక్రమంగా తీసుకుంటూ ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. బయట ఆహారం పూర్తిగా మానేసి తేలికపాటి భోజనం తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నాను. డీహైడ్రేషన్(నిర్జలీకరణం)కి గురికాకుండా ఎక్కువగా నీళ్లు, ఓఆర్ఎస్ తీసుకున్నాను. ప్రతిక్షణం సాయిబాబా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండసాగాను. మొదటిరోజు చాలా కష్టంగా గడిచినప్పటికీ రెండోరోజు నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడటం మొదలై విరోచనాలు కావడం తగ్గింది. దాంతో నా మనసుకు ప్రశాంతత వచ్చింది. ఇంకా శరీరంలో కూడా శక్తి మెల్లగా పుంజుకుంటున్నట్లు అనిపించింది. చివరికి సాయిబాబా అనుగ్రహంతో నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ అనుభవం ద్వారా కష్టకాలంలో భక్తి మనకు ఎంత బలన్నిస్తుందో తెలుసుకున్నాను. ప్రార్థనతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని అర్థమైంది. ప్రతి సమస్యకు సాయిబాబా ఒక మార్గం చూపిస్తారని నమ్మకం మరింత బలపడింది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

నేను ఒక IT కంపెనీలో పని చేస్తున్నాను. 2025, డిసెంబర్ నెలకు సంబంధించిన నా టైమ్‌షీట్ విషయంలో అప్రూవల్ లేకుండా రెగ్యులరైజ్ అవుతుందా అనే సందేహం నా మనసును కలవరపెట్టడంతో నేను కొంత ఆందోళనకు లోనయ్యాను. అలాంటి సమయంలో నేను ఎప్పటిలాగే, “బాబా! ఈ విషయాన్ని నీవే చూసుకుంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈలోగా అనవసరమైన మెయిల్స్ లేదా రిమైండర్స్ రాకుండా మీరే చూసుకోవాలి" అని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి భారం ఆయన మీద వేసాను. ఆ రోజంతా కొద్దిగా టెన్షన్‌గా ఉన్నప్పటికీ బాబా మీద విశ్వాసం తగ్గలేదు. అనుకోకుండా సిస్టమ్‌లో నా టైమ్‌షీట్ ప్రాసెస్ అయిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ క్షణంలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా డిసెంబర్ టైమ్‌షీట్ రెగ్యులరైజ్ కావడం నిజంగా బాబా కృపే. నా ప్రయత్నం కంటే బాబా అనుగ్రహమే ఎక్కువగా పనిచేసిందని నాకు అనిపించింది. ఈ సంఘటన మరోసారి బాబా మన సమస్యలను మౌనంగా పరిష్కరిస్తారని నిరూపించింది. సమయం వచ్చినప్పుడు బాబా అన్నీ సరిచేస్తారని నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. మనకు చిన్నగా అనిపించే సమస్యలు కూడా ఆయన దృష్టిలో ఉంటాయని అర్థమైంది. బాబా మీద భారమేసి నిశ్చింతగా ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలిసింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2058వ భాగం....


ఈ భాగంలో అనుభవం:


  • బాబా మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు

భక్తులందరికీ నమస్కరం. నా పేరు నవీన్. నేను ఇప్పుడు ఇటీవలి బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవం మీ అందరితో పంచుకుంటాను. 2025, డిసెంబర్ నెలాఖరులో మా అమ్మమ్మ పరమపదించారు. ఆవిడ కర్మాంతరాలు నెల్లూరులో జరిగాయి. ఆ కార్యక్రమానికి నేను వెళ్లాలని 2026, జనవరి 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హఠాత్తుగా నిర్ణయమైంది. మరుసటిరోజు కార్యక్రమాలకి అక్కడ ఉండాలంటే నేను అప్పటికప్పుడు బయలుదేరాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ట్రైన్ లేదా బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళదామంటే నడికుడి నుండి గుంటూరు వరకు ఒక బస్సు, అక్కడ నుండి ఇంకో బస్సు మారి చాలా ప్రయాణం చేయాలి. పోనీ ట్రైన్‌లో వెళదామంటే అది అంత అనుకూలమైన మార్గం కాదు, ఆ మార్గంలో రైళ్లు చాలా తక్కువ. ఉన్నవాటిలో శబరి అనే ట్రైన్ అందుబాటులో ఉన్నప్పటికీ నాకు రిజర్వేషన్ లేదు. మా అమ్మానాన్న, "ఏం కాదు. ఆ ట్రైన్‌‌కే వెళ్ళు, హాయిగా ఉంటుంది. జనరల్‌లో ఖాళీ లేకపోతే స్లీపర్‌లో ఎక్కి TTEతో మాట్లాడి నెల్లూరుదాకా టికెట్ వ్రాయించుకో" అని చెప్పారు. కానీ నాకైతే ఆ రైలు మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే, ఆ రైలు కేరళ వెళ్తుంది. నాకు తెలిసినంతవరకు మామూలు సీజన్‌లోనే ఆ రైలు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇంకా ఇప్పుడు నడుస్తున్న అయ్యప్పస్వాములు సీజన్ సంగతి చెప్పాలా? రైలు అంతా చాలా రద్దీగా ఉంటుంది. అందుకని బస్సులో వెళదాం, సీట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని అనుకున్నాను. అయితే బయలుదేరడానికి సిద్ధమయ్యేముందు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, "మనకి ఏది కరెక్టో బాబాకి తెలుసు. ఆయన్ని నాకు ఏది బెస్టో చెప్పమంటే, కరెక్ట్‌గా చెప్తారు కదా!" అని. వెంటనే నాకు తెలిసిన ఒక బాబా మిత్రుడిని, "నేను బస్సులో వెళ్లాలా? లేక శబరి ట్రైన్‌కి వెళ్లాలా? అని బాబాని అడిగి నాకు ఏ విషయం మెసేజ్ పెట్టండి. ఈలోపు నేను తయారవుతాను" అని చెప్పాను. అతను సరేనన్నారు. కాసేపటికి నేను తయారై ఫోన్‌లో మెసేజ్ చూస్తే. 'బాబా మిమ్మల్ని శబరికి వెళ్లమంటున్నారు' అని ఆ బాబా మిత్రుడు పెట్టిన మెసేజ్ కనపడింది. అది చూసి నేను  ఆశ్చర్యపడ్డాను. ఆ ట్రైన్‌కి రిజర్వేషన్ లేదు. పైగా ఫుల్ రష్ సీజన్. మరి బాబా ఎందుకిలా చెప్పి ఉంటారనుకున్నాను. అయినాసరే, బాబా చెప్పారు కాబట్టి ఆయనే సీటు ఇప్పిస్తారు. ఆయనే స్వయంగా వచ్చి భక్తులకు సీటు ఇచ్చిన ఎన్నో అనుభవాలు చూసాను కదా! ఆయన ఏదో ఒకటి చేస్తారులే అని ఆయన మీద నమ్మకంతో నేను శబరి ట్రైన్‌కే వెళదామని నిశ్చయించుకున్నాను. అదే విషయం మా నాన్నకి చెప్తే, ఆయన సరేనని నన్ను రైల్వేస్టేషన్ వద్ద దింపడానికి స్టేషన్‌కి వచ్చారు. అప్పుడు అంతా నా మనసులో 'సీటు ఉంటుందో, లేదో, 6 గంటలపైన ప్రయాణం' అని ఒకటే ఆలోచనలు. దాంతో ఉండబట్టలేక బాబాని 'స్లీపర్ కోచ్ ఎక్కమంటారా?' అని అడిగాను. దానికి బాబా వద్దన్నారు. బాబా ఇలా అంటున్నారు ఏమిటి అని మళ్ళీ ఆశ్చర్యపడ్డాను. అంతలో, "నేను ఉండగా నువ్వు ఇతరులను(TTE) అడగడం ధేనికి? నేనే నీకు ఇస్తాను" అని బాబా అంటున్నట్లు నా మనసుకి స్ఫురించింది. ఆ విషయం బాబా మిత్రునికి చెప్తే, తను కూడా "బాబా చూసుకుంటారులే" అని భరోసా ఇచ్చారు. ఇలా టెన్షన్ నడుస్తుండగా ట్రైన్ వచ్చింది. నేను అనుకున్నంత రద్దీ లేకపోయినా జనం అయితే ఉన్నారు. దాదాపు ట్రైన్‌లో ఉన్న సీట్లన్నీ ఫుల్ అయి ఉన్నాయి. నేను ట్రైన్ ఎక్కి ఒక దగ్గర సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందామనుకొనే లోపు ఒక ఆమె అక్కడ కూర్చుంది. నేను ఇంకా ఎక్కడ కూర్చుందామా అని చూస్తూ అక్కడే నిల్చున్నాను. ఇంతలో రైలు కదిలింది. నా వెనక సీటులో ఉన్న అతను నన్ను పిలిచి, "నేను దిగుతున్నాను. మీరు కూర్చోండి" అని సీటు ఇచ్చారు. నేను, "సూపర్ బాబా! పిలిచి మరీ సీటు ఇచ్చారు కదా!" అని చాలా ఆనందపడిపోయాను. ఇది బాబా దయకాకపోతే మరేంటి? రద్దీ సీజన్‌లో పిలిచి మరీ సీటు ఇవ్వడం ఏమిటీ? అంతా బాబా అనుగ్రహమే అని నాకు అర్థమైంది. ఈ విషయం నేను వెంటనే నా మిత్రుడికి మెసేజ్ పెడితే, "నేను ఇప్పుడే బాబాతో 6 గంటల ప్రయాణం, తనకి సీటు దొరికేలా చూడండి అని చెప్పుకున్నాను. రెండు నిమషాలు అయిందో, లేదో మీ మెసేజ్ సాయి. అది చూసి నాకు చాలా ఆనందమేసింది" అని చెప్పారు. మేమిద్దరమూ బాబాని నమ్మితే ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని చాలా ఆనందించాము. ఇంకా ప్రయాణం అంతా బాగా జరిగింది. రైలు కాస్త ఆలస్యమై నేను నెల్లూరు చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయింది. నేను అక్కడినుండి వెళ్లాల్సిన ప్రదేశం సిటీకి చాలా దూరంలో, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఆటో దొరుకుతుందో, లేదో అని ఆందోళన చెందాను కానీ, 'బాబా చూసుకుంటారులే' అని అనుకున్నాను. బాబా దయవల్ల రాపిడోలో చూస్తే, వెంటనే ఆటో బుక్ అయింది. హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేరాల్సిన గమ్యం చేరుకున్నాను.

బాబాను నమ్మితే, ఆయన మాట విని పాటిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఎంతటి ఫలితాలు వస్తాయో తెలియపరచడానికి నా ఈ అనుభవం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక రైలు ప్రయాణంలో బాబా చెప్పిన మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయిందే, అదే ఆయన చెప్పిన ప్రతి మాట పాటిస్తే, మనం ఎంత మేలు పొందుతామో వేరే చెప్పాల్సిన పని లేదు. మనమంతా మన జీవితంలో చాలా విషయాలకి వ్యక్తుల మీద ఆధారపడుతుంటాం. నిజానికి వాళ్ళు మనకి అంతగా సహకారం అందిస్తారో, లేదో తెలియదు. అదే మనం వ్యక్తుల మీద ఆధారపడకుండా బాబా మీద ఆధారపడితే, ఆయన ఎంతో అద్భుతంగా అనుగ్రహిస్తారు. బాబా మనల్ని ఎన్నుకొని భక్తులుగా చేసుకోవడం మన జన్మజన్మల సుకృతం. అంత అద్భుతమైన వరాన్ని ఎవరూ వృధా చేసుకోవద్దు. ఎక్కడో మనకి అందనంత దూరంలో ఉండే మహావృక్షం నీకు సదా నీడనిచ్చి కాపాడుతానని మన ఇంటికే వస్తే, మనం ఆ నీడ నుండి బయటపడాలనుకుంటే మన అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. బాబాపట్ల భక్తి పదింతలు ఉంటే వందింతలుకు, 1000 రెట్లు ఉంటే 10000 రెట్లుకు పెంచుకోవాలని, బాబా ప్రేమిని, ఆయనిచ్చిన సేవా భాగ్యాన్ని జాగ్రత్తగా ఆయనకోసం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

చివరిగా ఒక మాట: "ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగివుంటారో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపిస్తాను" అని బాబా అన్న మాట అక్షర సత్యం. ఆయనని నమ్ముకుంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. అలా ఆయన మనల్ని నడిపించాలంటే మనకి ఆయన పట్ల గట్టి నమ్మకం ఉండాలి. బస్సు లేదు రైలు ప్రయాణంలో డ్రైవర్ మీద నమ్మకంతో నిశ్చింతగా నిద్రపోయినట్టు మన జీవిత ప్రయాణంలో బాబాను నమ్మాలి. నమ్మితే, ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా మన ప్రయాణం బాబానగరి అనే శాశ్వత ముక్తిదామంకి చేరుకుంటుంది. అదే మన లక్ష్యం.

సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo