సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2061వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలు పరిష్కరించిన బాబా
2. అంతా మంచిగా చేసిన బాబా

సమస్యలు పరిష్కరించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు దేవి. మాది విశాఖపట్నం. బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసారు. ఎక్కడో గాలికి, ధూళికి ఎగిరిపోవాల్సిన మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచారు. బాబా దయతో మా బాబుకి ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత MS చదువుకోసం అమెరికా వెళ్లే అవకాశం నమ్మలేని రీతిన బాబా ఇచ్చారు. బాబు అక్కడ MS చేస్తుండగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకుని, కోర్టులో ప్రవేశపెట్టారు. బాబా దయవల్ల జడ్జి 2 నెలలు సమయమిచ్చి లైసెన్స్ కోర్టుకి చూపించమన్నారు. నేను, మా బాబు బాబాని "కష్టం గట్టెక్కించమ"ని వేడుకున్నాము. బాబా దయవల్ల నెల రోజుల్లో లైసెన్స్ వచ్చేయడం, కేసు కొట్టేయడం జరిగిపోయాయి. తర్వాత బాబా దయవలన బాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు బాబు ఫింగర్ ప్రింట్లు చెక్ చేసేటప్పుడు కేసు తాలూకా జడ్జిమెంట్ కాపీ అడిగారు. అప్పుడు అంత సమయం లేదు. అంత తొందరగా కోర్టువారు కాపీ ఇస్తారని మేము ఊహించలేదు. కానీ బాబా దయ. వెంటనే జడ్జిమెంట్ కాపీ మెయిల్ ద్వారా అందింది. నెలరోజులకి మరో సమస్య వచ్చింది. కోర్టు కేసు ఉన్న వాళ్ళందరూ, అది ఎటువంటి కేసు అయినా కూడా వారివారి దేశాలకి వెంటనే వెళ్లిపోవాలని అమెరికన్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. "ఇండియా వెళితే, వెంటనే ఉద్యోగం దొరుకుతుందా?" అని బాబాని పట్టుకుని ఏడ్చేసాను. ఆయన కనిపించినా, ఆయన గురించి వినిపించినా ఏడుస్తూనే ఉండేదాన్ని. "ఎలా వచ్చిన సమస్య అలానే గాలికి కొట్టుకుపోవాల"ని అడుగుతూనే ఉండేదాన్ని. బాబా దేశం కాని దేశంలో ఒక లాయర్ గురించి మాకు తెలిసేలా చేసి, కేసు ఫైల్ చేయించి సరిగ్గా నెల రోజుల్లో సమస్యను పరిష్కరించారు.

MS పూర్తి అయిన తర్వాత ప్రతి విద్యార్థికీ OPT కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉంటే H1 వీసాతో సంబంధం లేకుండా 3 సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఆ డ్రైవింగ్ కేసు వల్ల ఆ కార్డు మా బాబుకి తిరస్కరించింది. ఇంకా నా దుఃఖానికి అవధులు లేవు. నేను ఎక్కడ, ఏ దేవుడు కనిపించినా ఏడుస్తూనే ఉండేదాన్ని. బాబా చేయి పట్టుకొని, ప్రవాహంలా ఏడుస్తూ "కష్టం గట్టెక్కించమ"ని అడుగుతూనే ఉండేదాన్ని. 2 నెలల్లో బాబా అద్భుతం చేసారు. చాలామందికి రాని OPT మా బాబుకి వచ్చింది. వాళ్ళకి కూడా రావాలని బాబాని అడుగుతున్నాను. నిజానికి అమెరికాలో ఉండాలన్నది నా కోరిక కాదు కానీ, జీవితంలో అన్నీ కోల్పోయాము. ఒకరిని నమ్మి ఇల్లు, కారు, బంగారం అన్నీ పోగొట్టుకున్నాము. నా పేదరికం బాబుకి రాకూడదని బాబాని అదే పనిగా అడిగాను. ఏదేమైనా బాబా తమ మహత్యం చూపించారు, బాబా నా సమస్య తీర్చారు. ఇదే కాదు, బాబా నా జీవితంలో జరగవు అనుకున్నవి, జరిగేలా చూసారు. బాబాని నమ్మండి, సహనంతో సహాయం కోసం అడగండి. ప్రేమతో అడిగితే తప్పకుండా ఆయన దిగి వస్తారు. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి బాబా.  ప్రతి చిన్న సమస్యను తీర్చి మా బాధని దూరం చేస్తూ మీపై ఇంకా ఇంకా నమ్మకం పెంచుతున్న మీకు శతకోటి నమస్కారాలు బాబా".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై


సాయిభక్తుల అనుభవమాలిక 2060వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి  
2. ముందే కలలో సూచించిన బాబా

సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లి  

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను చాలా రోజుల తర్వాత సాయికృపను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2025, జనవరిలో  మా అమ్మకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో బాబా మాకు తోడు ఉండి సహాయాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు(ఆ అనుభవాన్ని  "'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా" అన్న టైటిల్‌తో ఇదివరకు మీ అందరితో పంచుకున్నాను). తర్వాత ఆ సంవత్సరమంతా మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది. దానికి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక ఇప్పటి అనుభవానికి వస్తే.. 2025, డిసెంబర్ నెలాఖరులో ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ నాకు ఫోన్ చేసి, "ఈరోజు ఉదయం నా ఎడమ చేయి ఐదు నిమిషాలపాటు పని చేయలేదు. తర్వాత మళ్లీ మామూలుగా వచ్చింది" అని చెప్పింది. నేను ఉన్న చోటు నుండి వాళ్ళ దగ్గరకి వెళ్లి అమ్మని డాక్టరుకి చూపిద్దామంటే 4 గంటలు పడుతుంది. అంత ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది నాకు. అందుకని మా నాన్నతో వెంటనే అమ్మని న్యూరాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్లి MRI స్కాన్ తీయించమని చెప్పాను. తర్వాత బాబాను, "అమ్మకు ఇబ్బంది లేకుండా చూడండి" అని చెప్పుకున్నాను. కానీ నాకు కొంత ఆందోళనగానే ఉండింది. కాసేపటికి ఈ బ్లాగు ఓపెన్ చేసి ఆరోజు అనుభవాన్ని చదివితే, అక్కడ ఒక భక్తులు తమ తండ్రికి బాగాలేదని, బయాప్సీ చేయించి, "అందులో ఏ ఇబ్బంది ఉండకూడద"ని బాబాని కోరుకుంటే, అంత బాగుందని, క్యాన్సర్ కాదని పంచుకున్నారు. ఆ అనుభవాన్ని చదివాక నాకు బాబా ఆ అనుభవం ద్వారా అమ్మకు బాగుంటుందని చెప్తున్నారనిపించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులో చిన్న చిన్న రక్తం గడ్డలు గుండె నుండి బ్రెయిన్లోకి చేరినట్లు వుంది. కానీ దానివల్ల అమ్మకు ఇబ్బంది లేదు, డాక్టరు పక్షవాతం రాకుండా మందులు వాడాలని మందులు రాశారు. నిజానికి అమ్మ రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి మందులు వాడుతుంది. వాటిని కార్డియాలజిస్ట్ వ్రాసారు. మేము మూడు నెలల క్రితం ఆ మందులు ఆపుదామని కార్డియాలజిస్ట్ డాక్టర్ని అడిగాము. అందుకాయన వాటిని ఆపకుండా డోస్ తగ్గించారు. అదే ఆయన వాటిని ఆపేసి ఉంటే అమ్మకి పూర్తిగా పక్షవాతం వచ్చి ఉండేది. బాబానే ఆయన రూపంలో మాకు సహాయం చేసి పెద్ద ఇబ్బంది రాకుండా కాపాడారు. వెంటనే కార్డియాలజిస్ట్‌ని సంప్రదిస్తే, ఆయన అన్ని టెస్టులు చేసి, అన్ని బాగున్నాయని ఆ మందుల డోస్ మార్చి పంపారు. సమయానికి 'నేనున్నాను' అని తల్లిలా ఆదుకున్న సాయితల్లికి ఈ బ్లాగు ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 2059వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీర్వాదం
2. భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు


భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారు

బాబా నా పేరు మహేష్. ఒకసారి నేను శిరిడీలో లక్ష్మీ మందిరంకి దర్శనానికి వెళ్లి అక్కడున్న బాబా భక్తితో ప్రార్థించాను. దర్శనానంతరం బయటకు వచ్చిన నేను తొందరలో నా చెప్పులు అక్కడే మర్చిపోయాను. ఆ విషయం నాకు అస్సలు గుర్తుకు రాలేదు. నేను బస చేసిన హోటల్‌కి చేరుకున్న తర్వాత చెప్పులు లేవని గమనించాను. కొంచం ఆందోళన కలిగినప్పటికీ బాబాపై నమ్మకంతో ఆయన చూసుకుంటారని మనసులో అనుకొని ఆయనకి చెప్పుకొని ప్రశాంతంగా ఉన్నాను. ఆ రాత్రంతా బాబా ధ్యాసలో గడిచింది. మర్నాడు ఉదయం లక్ష్మీ మందిరంకి వెళ్ళడానికి బయలుదేరాను. నా మనసులో చెప్పులు దొరుకుతాయో లేదోనని భయం ఉన్నప్పటికీ దొరకుతాయన్న ఆశ కూడా ఎక్కువగానే ఉంది. అక్కడికి వెళ్ళాక చూస్తే, నా చెప్పులు కనిపించాయి. ఎవరూ వాటిని తాకకుండా అలాగే ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అది సాయిబాబా కరుణ అనిపించింది. ఆయనపట్ల నా భక్తి మరింత బలపడింది. బాబా తన భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటారని ఈ అనుభవం మరోసారి నిరూపించింది.

ఒకరోజు అకస్మాత్తుగా నీళ్ల విరోచనాలు మొదలై నా శరీరమంతా బలహీనమైపోయి ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను ఈ సమస్య నుంచి బయటపడేసేది బాబా దయ తప్ప ఇంకేమీ లేదని నమ్మి ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థించి పూర్తి భారం ఆయన మీద వేసాను. డాక్టరు సూచనలననుసరించి మందులు సక్రమంగా తీసుకుంటూ ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. బయట ఆహారం పూర్తిగా మానేసి తేలికపాటి భోజనం తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నాను. డీహైడ్రేషన్(నిర్జలీకరణం)కి గురికాకుండా ఎక్కువగా నీళ్లు, ఓఆర్ఎస్ తీసుకున్నాను. ప్రతిక్షణం సాయిబాబా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండసాగాను. మొదటిరోజు చాలా కష్టంగా గడిచినప్పటికీ రెండోరోజు నుంచి పరిస్థితి క్రమంగా మెరుగుపడటం మొదలై విరోచనాలు కావడం తగ్గింది. దాంతో నా మనసుకు ప్రశాంతత వచ్చింది. ఇంకా శరీరంలో కూడా శక్తి మెల్లగా పుంజుకుంటున్నట్లు అనిపించింది. చివరికి సాయిబాబా అనుగ్రహంతో నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ అనుభవం ద్వారా కష్టకాలంలో భక్తి మనకు ఎంత బలన్నిస్తుందో తెలుసుకున్నాను. ప్రార్థనతోపాటు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని అర్థమైంది. ప్రతి సమస్యకు సాయిబాబా ఒక మార్గం చూపిస్తారని నమ్మకం మరింత బలపడింది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

నేను ఒక IT కంపెనీలో పని చేస్తున్నాను. 2025, డిసెంబర్ నెలకు సంబంధించిన నా టైమ్‌షీట్ విషయంలో అప్రూవల్ లేకుండా రెగ్యులరైజ్ అవుతుందా అనే సందేహం నా మనసును కలవరపెట్టడంతో నేను కొంత ఆందోళనకు లోనయ్యాను. అలాంటి సమయంలో నేను ఎప్పటిలాగే, “బాబా! ఈ విషయాన్ని నీవే చూసుకుంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈలోగా అనవసరమైన మెయిల్స్ లేదా రిమైండర్స్ రాకుండా మీరే చూసుకోవాలి" అని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి భారం ఆయన మీద వేసాను. ఆ రోజంతా కొద్దిగా టెన్షన్‌గా ఉన్నప్పటికీ బాబా మీద విశ్వాసం తగ్గలేదు. అనుకోకుండా సిస్టమ్‌లో నా టైమ్‌షీట్ ప్రాసెస్ అయిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ క్షణంలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా డిసెంబర్ టైమ్‌షీట్ రెగ్యులరైజ్ కావడం నిజంగా బాబా కృపే. నా ప్రయత్నం కంటే బాబా అనుగ్రహమే ఎక్కువగా పనిచేసిందని నాకు అనిపించింది. ఈ సంఘటన మరోసారి బాబా మన సమస్యలను మౌనంగా పరిష్కరిస్తారని నిరూపించింది. సమయం వచ్చినప్పుడు బాబా అన్నీ సరిచేస్తారని నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. మనకు చిన్నగా అనిపించే సమస్యలు కూడా ఆయన దృష్టిలో ఉంటాయని అర్థమైంది. బాబా మీద భారమేసి నిశ్చింతగా ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలిసింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2058వ భాగం....


ఈ భాగంలో అనుభవం:


  • బాబా మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు

భక్తులందరికీ నమస్కరం. నా పేరు నవీన్. నేను ఇప్పుడు ఇటీవలి బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవం మీ అందరితో పంచుకుంటాను. 2025, డిసెంబర్ నెలాఖరులో మా అమ్మమ్మ పరమపదించారు. ఆవిడ కర్మాంతరాలు నెల్లూరులో జరిగాయి. ఆ కార్యక్రమానికి నేను వెళ్లాలని 2026, జనవరి 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హఠాత్తుగా నిర్ణయమైంది. మరుసటిరోజు కార్యక్రమాలకి అక్కడ ఉండాలంటే నేను అప్పటికప్పుడు బయలుదేరాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ట్రైన్ లేదా బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళదామంటే నడికుడి నుండి గుంటూరు వరకు ఒక బస్సు, అక్కడ నుండి ఇంకో బస్సు మారి చాలా ప్రయాణం చేయాలి. పోనీ ట్రైన్‌లో వెళదామంటే అది అంత అనుకూలమైన మార్గం కాదు, ఆ మార్గంలో రైళ్లు చాలా తక్కువ. ఉన్నవాటిలో శబరి అనే ట్రైన్ అందుబాటులో ఉన్నప్పటికీ నాకు రిజర్వేషన్ లేదు. మా అమ్మానాన్న, "ఏం కాదు. ఆ ట్రైన్‌‌కే వెళ్ళు, హాయిగా ఉంటుంది. జనరల్‌లో ఖాళీ లేకపోతే స్లీపర్‌లో ఎక్కి TTEతో మాట్లాడి నెల్లూరుదాకా టికెట్ వ్రాయించుకో" అని చెప్పారు. కానీ నాకైతే ఆ రైలు మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే, ఆ రైలు కేరళ వెళ్తుంది. నాకు తెలిసినంతవరకు మామూలు సీజన్‌లోనే ఆ రైలు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇంకా ఇప్పుడు నడుస్తున్న అయ్యప్పస్వాములు సీజన్ సంగతి చెప్పాలా? రైలు అంతా చాలా రద్దీగా ఉంటుంది. అందుకని బస్సులో వెళదాం, సీట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని అనుకున్నాను. అయితే బయలుదేరడానికి సిద్ధమయ్యేముందు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, "మనకి ఏది కరెక్టో బాబాకి తెలుసు. ఆయన్ని నాకు ఏది బెస్టో చెప్పమంటే, కరెక్ట్‌గా చెప్తారు కదా!" అని. వెంటనే నాకు తెలిసిన ఒక బాబా మిత్రుడిని, "నేను బస్సులో వెళ్లాలా? లేక శబరి ట్రైన్‌కి వెళ్లాలా? అని బాబాని అడిగి నాకు ఏ విషయం మెసేజ్ పెట్టండి. ఈలోపు నేను తయారవుతాను" అని చెప్పాను. అతను సరేనన్నారు. కాసేపటికి నేను తయారై ఫోన్‌లో మెసేజ్ చూస్తే. 'బాబా మిమ్మల్ని శబరికి వెళ్లమంటున్నారు' అని ఆ బాబా మిత్రుడు పెట్టిన మెసేజ్ కనపడింది. అది చూసి నేను  ఆశ్చర్యపడ్డాను. ఆ ట్రైన్‌కి రిజర్వేషన్ లేదు. పైగా ఫుల్ రష్ సీజన్. మరి బాబా ఎందుకిలా చెప్పి ఉంటారనుకున్నాను. అయినాసరే, బాబా చెప్పారు కాబట్టి ఆయనే సీటు ఇప్పిస్తారు. ఆయనే స్వయంగా వచ్చి భక్తులకు సీటు ఇచ్చిన ఎన్నో అనుభవాలు చూసాను కదా! ఆయన ఏదో ఒకటి చేస్తారులే అని ఆయన మీద నమ్మకంతో నేను శబరి ట్రైన్‌కే వెళదామని నిశ్చయించుకున్నాను. అదే విషయం మా నాన్నకి చెప్తే, ఆయన సరేనని నన్ను రైల్వేస్టేషన్ వద్ద దింపడానికి స్టేషన్‌కి వచ్చారు. అప్పుడు అంతా నా మనసులో 'సీటు ఉంటుందో, లేదో, 6 గంటలపైన ప్రయాణం' అని ఒకటే ఆలోచనలు. దాంతో ఉండబట్టలేక బాబాని 'స్లీపర్ కోచ్ ఎక్కమంటారా?' అని అడిగాను. దానికి బాబా వద్దన్నారు. బాబా ఇలా అంటున్నారు ఏమిటి అని మళ్ళీ ఆశ్చర్యపడ్డాను. అంతలో, "నేను ఉండగా నువ్వు ఇతరులను(TTE) అడగడం ధేనికి? నేనే నీకు ఇస్తాను" అని బాబా అంటున్నట్లు నా మనసుకి స్ఫురించింది. ఆ విషయం బాబా మిత్రునికి చెప్తే, తను కూడా "బాబా చూసుకుంటారులే" అని భరోసా ఇచ్చారు. ఇలా టెన్షన్ నడుస్తుండగా ట్రైన్ వచ్చింది. నేను అనుకున్నంత రద్దీ లేకపోయినా జనం అయితే ఉన్నారు. దాదాపు ట్రైన్‌లో ఉన్న సీట్లన్నీ ఫుల్ అయి ఉన్నాయి. నేను ట్రైన్ ఎక్కి ఒక దగ్గర సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందామనుకొనే లోపు ఒక ఆమె అక్కడ కూర్చుంది. నేను ఇంకా ఎక్కడ కూర్చుందామా అని చూస్తూ అక్కడే నిల్చున్నాను. ఇంతలో రైలు కదిలింది. నా వెనక సీటులో ఉన్న అతను నన్ను పిలిచి, "నేను దిగుతున్నాను. మీరు కూర్చోండి" అని సీటు ఇచ్చారు. నేను, "సూపర్ బాబా! పిలిచి మరీ సీటు ఇచ్చారు కదా!" అని చాలా ఆనందపడిపోయాను. ఇది బాబా దయకాకపోతే మరేంటి? రద్దీ సీజన్‌లో పిలిచి మరీ సీటు ఇవ్వడం ఏమిటీ? అంతా బాబా అనుగ్రహమే అని నాకు అర్థమైంది. ఈ విషయం నేను వెంటనే నా మిత్రుడికి మెసేజ్ పెడితే, "నేను ఇప్పుడే బాబాతో 6 గంటల ప్రయాణం, తనకి సీటు దొరికేలా చూడండి అని చెప్పుకున్నాను. రెండు నిమషాలు అయిందో, లేదో మీ మెసేజ్ సాయి. అది చూసి నాకు చాలా ఆనందమేసింది" అని చెప్పారు. మేమిద్దరమూ బాబాని నమ్మితే ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని చాలా ఆనందించాము. ఇంకా ప్రయాణం అంతా బాగా జరిగింది. రైలు కాస్త ఆలస్యమై నేను నెల్లూరు చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయింది. నేను అక్కడినుండి వెళ్లాల్సిన ప్రదేశం సిటీకి చాలా దూరంలో, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఆటో దొరుకుతుందో, లేదో అని ఆందోళన చెందాను కానీ, 'బాబా చూసుకుంటారులే' అని అనుకున్నాను. బాబా దయవల్ల రాపిడోలో చూస్తే, వెంటనే ఆటో బుక్ అయింది. హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేరాల్సిన గమ్యం చేరుకున్నాను.

బాబాను నమ్మితే, ఆయన మాట విని పాటిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఎంతటి ఫలితాలు వస్తాయో తెలియపరచడానికి నా ఈ అనుభవం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక రైలు ప్రయాణంలో బాబా చెప్పిన మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయిందే, అదే ఆయన చెప్పిన ప్రతి మాట పాటిస్తే, మనం ఎంత మేలు పొందుతామో వేరే చెప్పాల్సిన పని లేదు. మనమంతా మన జీవితంలో చాలా విషయాలకి వ్యక్తుల మీద ఆధారపడుతుంటాం. నిజానికి వాళ్ళు మనకి అంతగా సహకారం అందిస్తారో, లేదో తెలియదు. అదే మనం వ్యక్తుల మీద ఆధారపడకుండా బాబా మీద ఆధారపడితే, ఆయన ఎంతో అద్భుతంగా అనుగ్రహిస్తారు. బాబా మనల్ని ఎన్నుకొని భక్తులుగా చేసుకోవడం మన జన్మజన్మల సుకృతం. అంత అద్భుతమైన వరాన్ని ఎవరూ వృధా చేసుకోవద్దు. ఎక్కడో మనకి అందనంత దూరంలో ఉండే మహావృక్షం నీకు సదా నీడనిచ్చి కాపాడుతానని మన ఇంటికే వస్తే, మనం ఆ నీడ నుండి బయటపడాలనుకుంటే మన అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. బాబాపట్ల భక్తి పదింతలు ఉంటే వందింతలుకు, 1000 రెట్లు ఉంటే 10000 రెట్లుకు పెంచుకోవాలని, బాబా ప్రేమిని, ఆయనిచ్చిన సేవా భాగ్యాన్ని జాగ్రత్తగా ఆయనకోసం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

చివరిగా ఒక మాట: "ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగివుంటారో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపిస్తాను" అని బాబా అన్న మాట అక్షర సత్యం. ఆయనని నమ్ముకుంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. అలా ఆయన మనల్ని నడిపించాలంటే మనకి ఆయన పట్ల గట్టి నమ్మకం ఉండాలి. బస్సు లేదు రైలు ప్రయాణంలో డ్రైవర్ మీద నమ్మకంతో నిశ్చింతగా నిద్రపోయినట్టు మన జీవిత ప్రయాణంలో బాబాను నమ్మాలి. నమ్మితే, ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా మన ప్రయాణం బాబానగరి అనే శాశ్వత ముక్తిదామంకి చేరుకుంటుంది. అదే మన లక్ష్యం.

సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయిభక్తుల అనుభవమాలిక 2057వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్య లేకుండా అనుగ్రహించిన బాబా
2. బాబా దయతో పరీక్షలో ఉత్తీర్ణత - అద్దెకు ఇల్లు - 11 సార్లు పారాయణ
3. ఎప్పటిలానే అనుగ్రహించిన బాబా




సాయిభక్తుల అనుభవమాలిక 2056వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి ఆందోళనను తీసేసే బాబా

సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు తన్వి. నేను చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తురాలిని. ఆయన నా చిన్ననాటి నుండి నా ప్రతి అడుగులో మార్గనిర్ధేశం చేస్తున్నారు. మావారు ఇండియన్ ఆర్మీ, త్రిపురలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని అక్కడికి తీసుకొని వెళదామని క్వార్టర్ కోసం దరఖాస్తు పెడుతున్నప్పటికీ క్వార్టర్ ఖాళీ లేని కారణంగా అప్లికేషన్ చాలాసార్లు రిజెక్ట్ అయింది. ఆయన మాకు దూరంగా ఉండటం వల్ల మాకు అస్సలు మనశాంతి ఉండేది కాదు. అప్పుడు నేను, 'ఏ సమస్య వచ్చినా అడిగితే చాలు అసాధ్యాన్ని సాధ్యం చేసే బాబా ఉండగా దిగులెందుకని' ఆయన మీద భారమేసి 'నవగురువర వ్రతం' మొదలుపెట్టాను. బాబా అద్భుతం చేసారు. వ్రతం మొదలు పెట్టిన రెండో వారంలోనే మావారు ఫోన్ చేసి, "క్వార్టర్ సెక్షన్ అయింద"ని చెప్పారు. అది విని నా ఆనందానికి అవధులు లేవు. బాబాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

తర్వాత మావారు కుటుంబాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి 2025, అక్టోబర్ 30కి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసారు. కానీ అవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి కన్ఫర్మ్ కాలేదు. దాంతో మావారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఒక్కరే వెళ్లిపోయారు. ఆ తర్వాత మావారు మమ్మల్ని తీసుకెళ్లడానికి మళ్ళీ టిక్కెట్లు బుక్ చేసారు. ఈసారి కూడా అవి వెయిటింగ్ లిస్టులో ఉండటంతో అవి కన్ఫర్మ్ అవుతాయో, లేదో అని నాకు చాలా ఆందోళన మొదలైపోయింది. ప్రయాణం 2025, నవంబర్ 12న కాగా ముందురోజు అంటే నవంబర్ 11న అవి కన్ఫర్మ్ అయ్యేది, లేనిది తెలుస్తుంది. నేను బాబాని, "ఈసారి టిక్కెట్లు కన్ఫర్మ్  అవ్వకపోతే మేము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది బాబా. దయచేసి ఈసారైనా టికెట్లు కన్ఫర్మ్ అయ్యేలా చూడండి సాయి" అని కన్నీళ్లతో వేడుకొని ఆయన సహాయం అర్థించి 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అని రోజంతా జపించాను. సాయంత్రానికి మావారు కాల్ చేసి, "టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. బట్టలు, సామాన్లు అన్ని సర్దుకొని సిద్ధంగా ఉండండి" అని చెప్పారు. నేను బాబాకి నమస్కారం చేసుకొని ధన్యవాదాలు తెలుపుకున్నాను.

ఇకపోతే, ట్రైన్‌లో 3రోజుల ప్రయాణం. పైగా నాకు హిందీ అంతగా రాదు. అందువల్ల నాలో మళ్ళీ ఆందోళన మొదలై, "3 రోజుల ప్రయాణం ఏ ఆటంకం రాకుండా చూడు" సాయి అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మా బెర్తులు ఉన్న చోట ఇద్దరు తెలుగువాళ్ళు వున్నారు. వాళ్ళు కూడా సైనికులు. మాతోపాటు త్రిపుర(అగర్తల) ముందు స్టేషన్ గౌహతి వరకు ప్రయాణం చేసారు. మాకు చాలా ధైర్యంగా అనిపించింది. బాబానే స్వయంగా మాతో ప్రయాణం చేసినట్లు అనిపించింది. సాధారణంగా గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ అంత బాగుండవు. నేను, "ఎలాగైనా మాకు ఇచ్చిన క్వార్టర్ బాగుండేలా చూడు బాబా" అని బాబాని వేడుకున్నాను. ఆయన దయవల్ల మాకు ఇచ్చిన క్వార్టర్ చాలా బాగుంది.

మేమున్న చోట చుట్టూ అంతా హిందీ, బెంగాలీ వాళ్ళు ఉన్నారు. నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక నేను, మా అత్తయ్య ఇంట్లో ఒంటరిగా వుండేవాళ్ళం. నేను, "బాబా! తెలుగువాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యేలా చూడు" అని బాబాకి చెప్పుకున్నాను. అంతలో డ్యూటీలో ఉన్న నా భర్తకి తనతో కలిసి పనిచేసే ఒక అన్నయ్య కాల్ చేసి, 'తనకి తెలిసిన తెలుగువాళ్ళు ఉన్నార'ని వాళ్ళ నంబరు చెప్పి, "మా చెల్లికి వాళ్ళని పరిచయం చేయి. వాళ్ళు కొంచం తోడుగా ఉంటారు. తనకి ఒంటరితనం అనిపించదు" అని చెప్పారు. మావారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి నన్ను, మా అత్తయ్యని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. నేను వాళ్ళు నాతో చనువుగా ఉంటారో, లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, వాళ్ళు నేను అనుకున్న దానికంటే చాలా మంచివాళ్ళు. అంతా బాబా దయ. కానీ మా అత్తయ్య "నేను ఇక్కడ వుండలేను. తిరిగి ఇంటికి (వైజాగ్) వెళ్లిపోతాను" అని ఒకటే గొడవ చేసింది. ఆమె వెళ్ళిపోతే, నేను ఎక్కడ ఒంటరిని అయిపోతానోనని చాలా బాధపడ్డాను. కానీ ఆమె ఎంత చెప్పిన వినలేదు. ఇంకా చేసేది లేక టికెట్ తీసి ఆమెని తిరిగి ఇంటికి పంపేశాం. నేను బాబాతో, "నాకు ఇక్కడ ఎవరూ లేరు. మీరు నాతో వున్నారన్న ధైర్యం తప్ప. ఎప్పుడూ మీరు నాతో వుండి అడుగుడుగునా నన్ను నడిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాలో ఉన్న భయాన్ని, ఆందోళనని తీసేయమని వేడుకుంటున్నాను సాయినాథా" అని వేడుకున్నాను.

తర్వాత 2025, డిసెంబర్ 18న మా తమ్ముడు కాల్ చేసి అమ్మమ్మ పడిపోయి హఠాత్తుగా చనిపోయిందని చెప్పాడు. నేను ఇంత దూరం నుండి వెళ్ళలేక చాలా ఏడ్చాను. మా అమ్మకు దగ్గరుండి ధైర్యం చెప్పలేని పరిస్థితికి రెండురోజులు చాలా బాధపడ్డాను. అమ్మమ్మ పోయిన బాధ నుండి నేను అస్సలు బయటపడలేక, "అమ్మమ్మ చనిపోయిన బాధ నుండి త్వరగా కొలుకునేలా చేయి సాయినాథా. నీవు తప్ప మాకు దిక్కు లేదు. నీవే శరణం బాబా" అని బాబాను వేడుకున్నాను. పిలిస్తే పలికే దైవం శ్రీసాయినాథుడు. ఆయన తన బిడ్డలు కష్టాల్లో ఉంటే  తట్టుకోలేరు. నేను ఆ బాధ నుండి బయటపడేలా చేసారు. "ధన్యవాదాలు సాయితండ్రీ".

ఒకరోజు రాత్రి నా పొట్టలో బాగా మంటగా అనిపించింది. నేను బాబా ఊదీ తీసుకుని కాస్త నా నుదుటన పెట్టి, మరికాస్త నీటిలో కలిపి తాగాను. బాబా దయవల్ల ఉదయానికల్లా నా పొట్టలో మంట తగ్గింది. "చాలా థాంక్స్ బాబా. మీ ఋణం ఏ జన్మలోనూ తీర్చుకోలేనిది. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మమ్మల్ని అడుగడుగునా నడిపించు తండ్రీ. అందరూ బాగుండేలా చూడు తండ్రీ".

మేము ఉండేది ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో అని చెప్పాను కదా! ఇక్కడ ఒకరోజు మరీ విపరీతమైన చలి వేసింది. నేను ఆ చలికి తట్టుకోలేక, "బాబా! నాకు ఎక్కువగా చలి వేయకుండా చూడండి తండ్రీ" అని బాబాను ప్రార్ధించాను. అలా ప్రార్ధించానో. లేదో మరుక్షణమే నాకు చలివేయడం తగ్గింది. "చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ .అందర్ని ఇలానే కాపాడు సాయినాథా".

సాయిభక్తుల అనుభవమాలిక 2055వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి అడుగులో తోడుగా ఉండి అన్నీ అనుకూలంగా జరిపించిన బాబా


సాయిభక్తుల అనుభవమాలిక 2054వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఏం ఉన్నా లేకున్నా బాబా ఉంటే చాలు


సాయిభక్తుల అనుభవమాలిక 2053వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  • బాబా ఊదీ పరమ ఔషధం


సాయిభక్తుల అనుభవమాలిక 2052వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి సమస్యకి దారి చూపే బాబా
2. బాబా దయ


బాబా దయ

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. సాయినాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆయన దయతోనే నేను ఈమాత్రం సంతోషంగా ఉండగలుగుతున్నాను. నేను ఈ మధ్యకాలంలో దంత సమస్యలతో చాలా బాధపడ్డాను. రెండుసార్లు డాక్టర్ దగ్గరకి వెళ్లినా ఉపయోగం లేకపోయింది. తిండి కూడా తినలేకపోయాను. అప్పుడు ఒకరోజు బాబా దగ్గర ఏడుస్తూ, "ఈ సమస్యను తీర్చు బాబా" అని వేడుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే, బాబా దయవల్ల నా పళ్ళు కొన్ని సరి చేయడంతో చాలావరకు నా సమస్య తగ్గింది.

2025, అక్టోబర్ నెల రెండో వారంలో మేము మా బంధువుల అబ్బాయి పెళ్లికి వెళ్లాము. ఆ పెళ్లిలో నా భర్త బ్రాస్లెట్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడున్న బంగారం ధరకి ఎంత నష్టమో అని నాకు కాళ్ళు, చేతులు ఆడలేదు. "ఇంత పరీక్ష ఏంటి బాబా? మీ దయతో ఆ బ్రాస్లెట్ దొరుకుతుంది కానీ, అంతవరకు ఈ టెన్షన్ ఎలా భరించాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అంతే! బాబా 2 నిమిషాల్లో బ్రాస్లెట్ మా అక్కకి దొరికేలా అనుగ్రహించారు.

2025, ఆగస్టు 16 రాత్రి ఉన్నట్టుండి నా కళ్ళు చాలా దురదగా ఉండి ఎడమ కన్ను చాలా లావుగా అయింది. నేను చాలా భయపడి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల మర్నాటికి వాపు తగ్గింది. ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పను? "ఎల్లవేళలా మమ్మల్ని నడిపిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo