సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్త - దాదాజీ గోపీనాథ్ జోషీ


సాయిభక్తుడు దాదాజీ గోపీనాథ్ జోషీ ముంబైలోని దాదర్‌లో రామ్‌మారుతి రోడ్డులో నివాసముండేవాడు. ఒకప్పుడు ఏడాది వయసున్న అతని బిడ్డ మశూచి జ్వరంతో బాధపడ్డాడు. అతడు పిల్లవానికి బాబా ఊదీతీర్థాన్నిచ్చి, "బిడ్డకు నయమైతే, బిడ్డను తీసుకుని శిరిడీ వస్తాన"ని మ్రొక్కుకున్నాడు. దాంతో వేరే ఏ మందులూ వాడకుండానే పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాడు. అయితే చాలాకాలంపాటు అతను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఒకరోజు అతని కొడుకుకు మూర్ఛరోగం వచ్చింది. అప్పుడు అతనికి తన మ్రొక్కు గుర్తుకొచ్చి, మ్రొక్కు మరచినందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుని, "పిల్లవాడికి నయమైతే, త్వరలోనే శిరిడీ వచ్చి మ్రొక్కు తీర్చుకుంటాన"ని మరల ప్రతిజ్ఞ చేశాడు. సాయిబాబా దయవల్ల పిల్లవాడికి నయమైంది. 

1932లో అతడు తన కొడుకుని తీసుకుని శిరిడీవెళ్లి బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాడు. కోపర్‌గాఁవ్ సమీపిస్తుండగా పిల్లవానికి మళ్ళీ మూర్ఛరోగం తిరగబెట్టింది. అప్పుడు వాళ్లతోపాటు ఉన్న సాయి మహాభక్తుడు  శ్రీ ఆర్.బి.పురంధరే, "తిరిగి శిరిడీ వెళ్లి, బాబాకు మ్రొక్కుకున్న మ్రొక్కులలో అన్నీ నెరవేరాయా, లేవా అని పరిశీలించుకోమ"ని సలహా ఇచ్చాడు. అప్పుడు దాదాజీకి తాను అభిషేకం మాత్రమే చేయించానని, మిగిలిన మ్రొక్కులు మర్చిపోయినట్టు గుర్తొచ్చింది. వెంటనే తిరిగి శిరిడీ వెళ్లి, మిగిలిన మ్రొక్కులు చెల్లించాడు. అప్పటివరకు మూర్ఛతో బాధపడుతూ సగం స్పృహలో ఉన్న పిల్లవాడు సమాధిపైకి ఎక్కి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. పిల్లవాడికి పూర్తిగా నయమైంది. మళ్ళీ ఏ ఇబ్బందీ కలగలేదు.

మరుసటి సంవత్సరం, అనగా 1933లో దాదాజీ కుటుంబంతో మళ్ళీ శిరిడీ ప్రయాణమై దారిలో కోపర్గాఁవ్ లోని గోదావరి వద్దకు చేరుకున్నాడు. అక్కడున్నవారు ఆ సమయంలో నది దాటవచ్చని చెప్పడంతో అతడు పిల్లాడిని ఎత్తుకుని భార్యతోపాటు నదిలో దిగాడు. నది మధ్యలోకి వెళ్లేసరికి నది ప్రవాహవేగం ఎక్కువగా ఉండటంతో ఆ వేగానికి తాము కొట్టుకుపోతామని అతనికి అనిపించింది. ఇంతలో అతనికి కళ్ళు తిరగసాగాయి. అతడు ఒక్కసారిగా కళ్ళుమూసుకుని సహాయం కోసం సాయిబాబాను ప్రార్థించడం మొదలుపెట్టాడు. 5 నిమిషాల్లో హఠాత్తుగా శ్రీసాయిబాబా సంస్థాన్‌కు చెందిన బాలాజీ పిలాజీ గురవే నదీ ప్రవాహంలోకి వచ్చి, వాళ్ళు క్షేమంగా ఒడ్డు చేరేందుకు సహాయం చేశాడు.

తరువాత దాదాజీ తన కుమారుని పుట్టువెంట్రుకలు కాశీలో తీయించాలని అనుకున్నాడు. అదేసమయానికి శిరిడీలో బాబాకు అభిషేకం చేయించాలని తలచాడు. కానీ, ఆ విషయాన్ని శిరిడీలో ఉన్న నాను పూజారికి తెలియజేయడం మర్చిపోయాడు. అందువల్ల, పుట్టువెంట్రుకలు తీసే సమయానికి శిరిడీలో అభిషేకం జరగలేదు. వాళ్ళు కాశీలో కార్యక్రమాలు పూర్తిచేసుకుని గయ వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో ఉండగా అతని కొడుకుకి మళ్లీ మూర్ఛ వచ్చింది. అప్పుడు అతనికి శిరిడీలో బాబాకు అభిషేకం చేయించలేదని గుర్తొచ్చింది. వెంటనే అతడు మ్రొక్కు మరచినందుకు ప్రాయశ్చిత్తంగా బాబాకు రెండు అభిషేకాలు చేయమని నాను పూజారికి సందేశం పంపంచాడు. తరువాత పిల్లవాడు కోలుకున్నాడు. తదుపరి వారి ప్రయాణం ఎటువంటి సమస్య లేకుండా సాఫీగా సాగింది.

1934 సంవత్సరంలో దాదాజీ కుమారుడు జ్వరంతో బాధపడ్డాడు. పిల్లవాడికి సరైన వైద్యం అందించటానికి వైద్యులెవరూ ఆ జ్వరం ఏమిటన్నది కనిపెట్టలేకపోయారు. ఆ స్థితిలో పిల్లవాడికి బాబా ఊదీ పెట్టి, తీర్థం త్రాగించారు. దాంతో పిల్లవాడి జ్వరం తగ్గిపోయింది.

1935వ సంవత్సరంలో దాదాజీ కుమారుని బొటనవ్రేలు విపరీతంగా వాచింది. పిల్లవాడిని పరీక్షించిన వైద్యులు బొటనవ్రేలును తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, దాదాజీ బాబాను ప్రార్థించి, ఊదీని ఆ బొటనవ్రేలుకు వ్రాసాడు. కొద్దిరోజుల్లో పిల్లవాడికి నయమయింది. ఆవిధంగా అతడు బాబానే నమ్ముకుని, వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాడు.

సమాప్తం.

Source: Devotees' Experiences of Sri Sai Baba Part I by Parama Poojya  Sri.B.V.Narasimha Swamiji

2 comments:

  1. om sai ram 2nd experience is nice.sais blessings are there to them.saima

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😃🥰🌺😀🌼😊🌹🤗🌸

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo