సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 548వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా సందేశం ఖచ్చితంగా నిజమవుతుంది
  2. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా ఎదురవలేదు

బాబా సందేశం ఖచ్చితంగా నిజమవుతుంది

సాయిభక్తులకు నమస్కారం. నా పేరు సునీత. నేను ఈ మధ్యనే 'శ్రీ సాయి సన్నిధి' వాట్సాప్ గ్రూపులో చేరాను. అందులో 'సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగ్ వారు ప్రతిరోజూ షేర్ చేసే సాయిభక్తుల అనుభవాలు చదువుతూ తోటి భక్తుల సమస్యలను బాబా ఎలా తీరుస్తున్నారో తెలుసుకొంటూ ఎంతో ఆనందిస్తున్నాను. ఇలాంటి అనుభవాలు నాకు కూడా బాబా ఎన్నో ప్రసాదించారు. వాటిలోనుండి ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నా చిన్నతనంనుంచే నేను బాబా భక్తురాలిని. కానీ అప్పట్లో బాబాను పూజించేదాన్ని కాదు. పదవ తరగతి చదువుతున్నప్పుడు బాబాపట్ల ఇష్టము, ప్రేమ కలిగాయి. అప్పటినుంచి ఆయనను పూజించడం మొదలుపెట్టాను. పూజ అయితే చేసేదాన్ని గానీ పెద్దగా బాబాతో అనుబంధం ఏర్పడలేదు, నా అనుభవాలను కూడా ఎప్పుడూ ఎవరితో పంచుకోలేదు. కొన్ని సంవత్సరాలకి “బాబా అంటేనే నా శ్వాస, ఆయన లేకపోతే నేను లేను” అన్న విధంగా అయిపోయింది. ఏదో ఒకటి జరిగితే, అది అనుభవం అవుతుందేమో గానీ నా ప్రతి అడుగులోనూ బాబానే, నేను ఏం చేసినా బాబానే. అలాంటి నాకు ప్రత్యేకంగా ఒక అనుభవం అని చెప్పడానికి కూడా ఏమీ తోచట్లేదు. కళ్ళు మూసినా, తెరచినా అంతా బాబానే అయిపోయినప్పుడు చెప్పుకోడానికి ప్రత్యేకంగా అనుభవాలంటూ ఎక్కడుంటాయి?  

2020, ఆగస్టు 21, రాత్రి నాకొక కల వచ్చింది. కలలో బాబా నా ప్రక్కన కూర్చొని, నా తలమీద చేయిపెట్టి, "ఎందుకు అంత బాధపడిపోతున్నావ్? అంతా నేను చూసుకుంటాను కదా!" అన్నారు. బాబా నా ప్రక్కన కూర్చోవడమేమిటని నేను ఆశ్చర్యపోతూ, "బాబా! మీరు రావడం ఏమిటి?" అని అడిగాను. "ఏం, రాకూడదా?" అన్నారు బాబా. "అది కాదు బాబా. మనసు బాధతో ఉన్నప్పుడు మీరు పిలిచినా రాలేదు. కానీ ఇప్పుడు వచ్చారు. అది నేను నమ్మలేకపోతున్నాను" అన్నాను. అప్పుడు బాబా, "అప్పుడు నీ మనసంతా కన్నీళ్లతో నిండిపోయివుంది. కాబట్టి నేను కనిపించలేదు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా! అందులోనూ నిద్రలో ఉన్నావు, అందుకే నీకు నేను కనిపిస్తున్నాను" అన్నారు. తరువాత బాబా ఒక సంఘటన గురించి తెలిపారు. అదేమిటంటే, 'మా అమ్మాయివాళ్ళ బావగారు మరో రెండు రోజుల్లో చనిపోతారు' అని బాబా చెప్పారు. "అదేంటి, అలా ఎలా?" అని అన్నాను. అంతే, బాబా వెళ్లిపోయారు. ఆ విషయం నేను చెప్పినా నా కుటుంబసభ్యులెవరూ నమ్మరు. మా అమ్మాయి, అల్లుడితో కూడా చెప్పలేను. యూరప్‌లో ఉన్న నాకు ఏమీ అర్థం కాలేదు. 'అసలు ఏం జరిగింది? అతనికేమైనా అయిందా? విషయం ఎలా తెలుసుకోవాలి?' అని ఒకటే ఆలోచన. చివరికి ఇండియాలో ఉన్న వాళ్ళ ఇంటికి వాట్సాప్ కాల్ చేశాము. అప్పుడు వాళ్ళు, "అతని ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్లో చేర్చామ"ని చెప్పారు. "అసలు విషయమేమిటి?" అని అడిగితే, "అతనికి కామెర్లు వచ్చి లివర్ చెడిపోయింది. పైగా కుక్క కరిచింది" అని చెప్పారు. అది విని నేను, "ఇదంతా నిజమా!" అని నిర్ఘాంతపోయాను. శనివారం గడిచింది. ఆదివారంనాడు డాక్టర్లు, "అతనింక బ్రతకడు" అని చెప్పేశారు. అప్పుడు, 'బాబా ఈ విషయం గురించి ముందే చెప్పారు' అని చెప్పాలనుకున్నాను కానీ, ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. మా అల్లుడు అతన్ని వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. హైదరాబాదులోని అపోలో హాస్పిటల్‌కి ఫోన్ చేసి మాట్లాడితే, అక్కడ డాక్టర్, "తీసుకొని రండి, కానీ చాలా ఖర్చవుతుంద"ని అన్నారు. అప్పుడు కూడా చెపుదామని అనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థంకాక చెప్పలేకపోయాను. ఒకసారి ఫోన్ చేస్తే, "అపోలోలో తెలిసిన అతనుంటే రిపోర్టులు పంపించి పరిశీలించమని చెప్పాము. అతను రిపోర్టులు చూసి, 'ఇక లాభం లేదు, అతనిని తీసుకొని రావద్ద'న్నారు" అని చెప్పారు. అప్పుడు కూడా చెప్పాలని నోటివరకు వచ్చి ఆగిపోయాను. అంతే, ఆ రాత్రి అతను చనిపోయాడు. బాబా చెప్పినట్లే జరిగింది. ఈ అనుభవాన్ని ఇప్పటికీ నేను ఎవరితోనూ చెప్పలేదు. మీరు బ్లాగులో ఎలా చెప్తారో కూడా నాకు తెలియదు, ఖచ్చితంగా దీన్ని ప్రచురించాలని కూడా నేను చెప్పట్లోదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 'చనిపోతాడ'ని బాబా చెప్పినట్లే అతను చనిపోయాడు. అందరి బాధలు తీర్చే బాబా అతని బాధ ఎందుకు తీర్చలేదని మనకు అనిపిస్తుంది. అందరి విషయంలో ఈ విధంగా బాధ తీర్చకుండా ఉంటారా అంటే అది కూడా కాదు. అందుకు నిదర్శనం మనం పొందిన అనుభవాలే. ఆయన ఎన్నోసార్లు, ఎన్నో కష్టాల నుండి మనల్ని కాపాడారు. చివరి నిమిషంలో సైతం కాపాడిన అనుభవాలెన్నో, ఎన్నెన్నో! అయితే, కర్మానుసారం ఎవరికి ఏది చేస్తే శ్రేయస్కరమో అది బాబాకు తెలుసు, కాబట్టి ఆయన అది చేస్తారని మనం గుర్తుంచుకోవాలి.

బహుశా ఇలాంటి అనుభవం ఎవరూ చెప్పి ఉండరేమో, కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే, బాబా మనకు ఇచ్చే సందేశం ఖచ్చితంగా నిజమవుతుంది. ఆయన సందేశంతో ఎన్నో బాధలు తీరిపోతాయి, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ‘బాబా సందేశాన్ని చదివి, విని వదిలేస్తున్నామా? లేదా ఆచరిస్తున్నామా?’ అన్నదే ప్రశ్న. ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయి. అందుకే చెప్తున్నాను, సాయి సందేశాలను చదివి ఊరుకోకుండా, చదివినదాన్ని అందరం ఆచరిద్దాం. కనీసం మనవంతు ప్రయత్నం చేద్దాం. కుటుంబంలో ఒక్కరు మారితే, కుటుంబం మొత్తం మారుతుంది. అలాగే బాబా భక్తులమైన మనలో చిన్న ఆవగింజంత ఈ మార్పు రావాలి. ప్లీజ్.. మారదాం, బాబా తత్వంలోకి వెళ్దాం, బాబా దారిలో నడుద్దాం, ప్రతి ఒక్కరం శ్రద్ధ, సబూరీ పాటిద్దాం. మనం మారుదాం, మన చుట్టుపక్కల వాళ్ళని మారుద్దాం. ఇది నా చిన్న విన్నపం. జై సాయిరామ్!

బాబా దయవల్ల ఎలాంటి సమస్యా ఎదురవలేదు

సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతిరెడ్డి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకించి ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకి నా కృతజ్ఞతలు. నా పేరు జ్యోతి. నేను గత 8 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. ఈరోజు మొదటిసారిగా మీ అందరితో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను.

2020, ఆగస్టు 5వ తేదీన మావారు తన ఆఫీసులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక మావారు నాకు ఈ విషయాన్ని వివరించారు. నాకు చాలా ఆందోళన కలిగింది. వెంటనే నేను బాబాకు నమస్కరించి, “బాబా! మీరే మావారిని రక్షించండి” అని మనసారా వేడుకుని, బాబా ఊదీని మావారి నుదుటన పెట్టాను. మావారికి ఎలాంటి సమస్యా లేకపోతే నేను నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల మావారికి ఎలాంటి సమస్యా ఎదురవలేదు. నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వీలైనంత త్వరలో ఇతర అనుభవాలను పంచుకునేలా సహాయం చేయమని బాబాను అభ్యర్థిస్తున్నాను.

ఓం శ్రీ సాయినాథాయ నమః


సాయిభక్తుల అనుభవమాలిక 547వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సంబంధాలన్నీ చెడగొడుతూ వస్తున్న బాబా నా ప్రేమను గెలిపిస్తారని ఆశగా చూస్తున్నా! 
  2. బాబా నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు

సంబంధాలన్నీ చెడగొడుతూ వస్తున్న బాబా నా ప్రేమను గెలిపిస్తారని ఆశగా చూస్తున్నా!

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులకు నమస్కారం. నేనిప్పుడు బాబా నా జీవితంలో చేస్తున్న సహాయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 30 సంవత్సరాలు. నాకింకా పెళ్లి కాలేదు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. తనకి కూడా నేనంటే ఇష్టం. మా ఇద్దరి విషయం మా ఇళ్లల్లో తెలుసు. అబ్బాయి తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. వాళ్ళు అంత మొండిపట్టుపట్టడానికి నేను ఇష్టపడిన అబ్బాయి ఏమైనా తక్కువ స్థితిలో ఉన్నాడా అంటే అదేమీ కాదు, తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ మంచి పోజిషన్లో ఉన్నాడు. కానీ మావాళ్లు కేవలం కులాలు వేరన్న కారణంతో మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఎన్నిసార్లు, ఎంతగా నచ్చజెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. "మా మాట కాదని నువ్వు ఏదైనా చేస్తే మేము కులంలోవాళ్లకి మొహం చూపించుకోలేము, మేము చచ్చిపోతాము" అని చెప్తూ(బెదిరిస్తూ) వస్తున్నారు. ఇదంతా గత 5 సంవత్సరాలుగా సాగుతోంది. ఈ ఐదేళ్ళలో మావాళ్ళు నాకోసం ఎన్నో సంబంధాలు చూశారు, చూస్తూనే ఉన్నారు. కానీ బాబా దయవలన ఒక్క సంబంధం కూడా కుదరలేదు. రెండుసార్లు పెళ్లిచూపులు జరిగినప్పటికీ చివరి నిమిషంలో కుదరలేదు. నేను ఎంత ఏడ్చినా మావాళ్ళు అర్థం చేసుకోకపోవడంతో ఒకానొక స్థితిలో ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అంతలో ఒకేసారి మూడు సంబంధాలు వచ్చాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఎప్పటిలాగానే బాబా మీద నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఇంట్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉండటంతో నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు, "బాబా! ఆ మూడు సంబంధాలు ఏదో ఒకలా నువ్వే చెడగొట్టు. అలా జరిగితే నేను నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. వెంటనే రెండు సంబంధాలు చెడిపోయాయి. మిగిలిన ఆ ఒక్క సంబంధం అదివరకు వచ్చిందే. అది మా ఇంట్లోవాళ్లకి బాగా నచ్చి, అతణ్ణి పెళ్ళి చేసుకోమని నాపై చాలా ఒత్తిడి చేశారు. ఏం చేయాలో అర్థంకాక అయోమయ స్థితిలో ఉండిపోయాను. అంతలో ఏమయిందో తెలీదుగాని, హఠాత్తుగా ఆ సంబంధం గురించి ఇంట్లోవాళ్ళు మాట్లాడడం మానేశారు. అంతా బాబా దయ. కానీ, వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతూ వస్తున్న బాబా, ఇంట్లోవాళ్ళని మాత్రం నేనిష్టపడ్డ వ్యక్తిని పెళ్ళిచేసుకోవటానికి ఒప్పుకునేలా చేయట్లేదు. 

"బాబా! మీరు 'మనుషులు అందరూ ఒకటే. కులం, మతం అనే భేదభావం చూపొద్దు' అని చెప్తారు. కానీ జనాలు మాత్రం కులం, మతం అని కొట్టుకు చస్తున్నారు. బాహ్యానికి మీ భక్తులమని కూడా చెప్పుకుంటూ లోపల వేరే కులం, వేరే మతమని భేదం చూపిస్తూ ఉన్నారు. నేను ఇటు ఇంట్లోవాళ్ళనీ వదులుకోలేను, అలాగని నేను ఇష్టపడ్డ అబ్బాయినీ వదులుకోలేను. ఏం చేయాలో తెలియక మానసికంగా క్రుంగిపోయి ఉన్నాను. మరణమొకటే మార్గంలా కనిపిస్తుంది. నేను తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేసివుంటే దయచేసి నన్ను క్షమించి నా ప్రేమను గెలిపించండి. మా ఇద్దరినీ కలపండి బాబా".

చివరిగా, రోజూ ఈ బ్లాగు చదివే భక్తులకు నాదో విన్నపం. దయచేసి నా గురించి బాబాను ప్రార్థించండి. మీ అందరి ప్రార్థనలు విని బాబా తప్పక మా ఇద్దర్నీ కలుపుతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.

బాబా నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులకు నమస్కారం. నా పేరు చెప్పటం 'నేను' అనే అహంకారానికి హేతువు అవుతుంది కాబట్టి నేను పేరు వెల్లడించదలుచుకోలేదు. ఈ శరీరం సాయిది, కాబట్టి ఆయనే ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని పంచుకోమని నన్ను ప్రోత్సహించినట్లుగా భావించి నేను మొదటిసారి మీ ముందుకు వచ్చాను.

రెండు మూడు సంవత్సరాలుగా నాకు బాబాపట్ల భక్తి ఏర్పడింది. కానీ సరిగ్గా ఆలోచిస్తే, నా చిన్నవయస్సులో సత్యసాయి సంస్థ నడిపే స్కూల్లో చదువుతున్నప్పుడే స్కూల్లో జరిగే సాయి భజనలు, కీర్తనలలో నేను పాల్గొంటుండేవాడిని. సరిగా ఊహతెలియని ఆ వయస్సులో నాకు తెలియకుండానే నేను మా నాన్నతో కలిసి బాబా గుడికి వెళ్తుండేవాడిని. చిన్నవాడిని కదా! అలా వెళ్లడం నాకొక షికారులా ఉండేది. అప్పట్లో నాకేం తెలుసు, బాబా పిచ్చుక కాలికి దారం కట్టి తమ వద్దకు లాక్కున్నట్లు నన్ను తమ వైపుకు లాక్కుంటున్నారని. అయితే 2-3 సంవత్సరాల నుండే నాలో ప్రచండంగా భక్తి పెరిగింది. రెండు సంవత్సరాల క్రితం 'బాబాను గురువుగా నమ్మి, అన్నీ ఆయనకు అప్పగిస్తే, అంతా ఆయనే చూసుకుంటారు' అని సాయి సర్వస్వం అనే యూట్యూబ్ ఛానెల్ లోని ఒక వీడియో చూసి తెలుసుకున్నాను. ఆ క్షణం అనుకున్నాను, "బాబా! నా జీవితభారాన్ని నీపై వేస్తున్నాను తండ్రీ" అని. అలా అనుకున్నప్పటినుండి 2-3 రోజులపాటు విభూతి వాసన వస్తుండేది. 'ఎందుకు ఇలా వస్తోంది' అని ఆలోచిస్తుండేవాడిని. తరువాత తెలిసింది, 'బాబా తన ఉనికిని ఆవిధంగా తెలుపుతార'ని.

చెప్పాలంటే, నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాల జాబితా చాలానే ఉంటుంది. అందులో ఒకటి: మరో రెండు సంవత్సరాలలో మా నాన్నగారు రిటైర్ అవుతారనగా బదిలీలు అయ్యే సమయం వచ్చింది. అప్పటిదాకా ఆయన రోజూ 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుండేవారు. కనీసం ఇప్పుడైనా ఆఫీస్ ఇంటికి దగ్గరలో ఉండేలా బదిలీ అయితే బాగుంటుంది అనుకున్నాము. కానీ దూరప్రాంతానికి బదిలీ కావొచ్చన్న సమాచారం మాకు అందింది. అది తెలిసి నేను, "బాబా! నాన్న బదిలీ విషయం నువ్వే చూసుకో! అంతా మంచిగా జరిగితే, నీ గుడిలో ప్రసాదం ఇస్తాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా కృపవలన కొద్దిరోజుల్లో నాన్నకి దగ్గరలో ఉన్న ఊరికి బదిలీ అయింది.

ఒకసారి మా అమ్మ అనారోగ్యం పాలైతే, బాబా ఊదీని నీళ్ళల్లో వేసి ఆమెకిస్తూ రోజూ ఆరతి పాడి, అష్టోత్తరం చదివేవాడిని. బాబా అనుగ్రహం వలన అమ్మకి చాలా త్వరగా నయమైంది. ఇలా బాబా నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనే నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఈ మధ్య నాలో కలి ప్రభావం ఎక్కువైందో ఏమోగాని బాబాపై ధ్యానం కుదరటం లేదు. చాలా బాధగా ఉంటోంది. కానీ కొద్దిరోజుల్లో దాన్ని బాబా సరిచేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ అనుభవాల ద్వారా తోటి భక్తుల మనసులో బాబాపట్ల కాస్త ప్రేమ పెరిగినా చాలు, నా ఈ జన్మ ధన్యమైనట్లే.

ఓం సాయిరామ్!


సాయిభక్తుల అనుభవమాలిక 546వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నా సాయి అద్భుతం - డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
  2. అనుగ్రహించిన సాయి

నా సాయి అద్భుతం - డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

'OM SAI RAM' ఈ మూడు అద్భుతమైన పదాలు నా ప్రపంచంలో ఎంతో ఆనందాన్ని తీసుకొస్తాయి. “oms AIR am” అనే పదాలే నాకు శ్వాస. బాబా ప్రసాదించిన అనుభవాలు పంచుకోవడానికి, చదవడానికి చక్కటి వేదికను ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్ బృందానికి నా కృతజ్ఞతలు. ఇది బాబా మహాసమాధి అనంతరం ఆధునిక సాయి సచ్చరిత్ర. ఇక, బాబా నాకు ప్రసాదించిన అనుభవానికి వస్తాను.

నా డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియనుండటంతో నేను దానిని రెన్యూవల్ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ మేము వేరే స్టేట్‌కి మారినందువల్ల వ్రాతపరీక్షకి, డ్రైవింగ్ టెస్ట్‌కి నేను మళ్ళీ హాజరు కావాల్సి ఉంది. అయితే గత పదినెలలుగా కారు నడపనందున నేను కాస్త ఆందోళన చెందాను. సాయి దయవల్ల డ్రైవింగ్ మేనేజ్ చేయగలనుగాని, వ్రాతపరీక్ష సరిగా అట్టెంప్ట్ చేయలేనేమోనని చాలా భయపడ్డాను. ఎందుకంటే ఈ స్టేట్ నియమాలు చాలా కఠినమైనవి. అందువలన నేను బాబాకు నమస్కరించుకొని, "బాబా! నా డ్రైవింగ్ లైసెన్స్ ఎటువంటి సమస్యలు లేకుండా రెన్యూవల్ అయినట్లయితే నేను నా అనుభవాన్ని నా ప్రియమైన వెబ్‌సైట్‌లో పంచుకుంటాను" అని సాయిని ప్రార్థించాను. అంతలో కరోనా కారణంగా లాక్‌డౌన్ మొదలైంది. దాంతో ఎటూ వెళ్లే అవకాశంలేక మేము బయటికి వెళ్లడం మానేశాము. చివరికి నా డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి నెలరోజులు దాటిపొయింది. అప్పుడు నేను, 'ఇంకా ఆలస్యం అయితే సమస్య అవుతుంద'ని అలోచించి సాయిని ప్రార్థించి, నా లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి వెళ్ళాను. నా సాయి అద్భుతం చేశారు. వ్రాతపరీక్షగాని, డ్రైవింగ్ టెస్ట్ గాని లేకుండా, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ఫైరీ గురించి ఒక్కమాటైనా అడగకుండా కౌంటర్లో ఉన్న మహిళ నా లైసెన్స్‌ను రెన్యూవల్ చేసింది. అంతా నా సాయిచేసిన అద్భుతం.

అందరికీ సాయిరామ్! నా వైవాహిక జీవితం కోసం దయతో ప్రార్థించండి. నిజానికి నా భర్త చాలా మంచివాడు, మంచి అవగాహన కలవాడు. నాపట్ల ఎంతో శ్రద్ధ చూపేవాడు. కానీ ప్రస్తుతం తను మారిపోయాడు. వ్యక్తిగతంగా నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. కొన్ని విషయాలను వివరించడం కష్టం. నాకంటూ ఎవరూ లేరు. (అవసరం తీరిపోయిందని నా కుటుంబం నన్ను విడిచిపెట్టింది.) అందువలన నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి నాకోసం ఒక్క క్షణకాలాన్ని వెచ్చించి, నా గురించి సాయిబాబాను ప్రార్థించండి. 'మీ అందరికీ, మీ కుటుంబసభ్యులకు ఆరోగ్యం, సంపదలను ప్రసాదించి, సదా ఆనందంగా ఉండేలా ఆశీర్వదించాల'ని సాయి తండ్రిని కోరుకుంటున్నాను. 

బాధ, సంతోషం, మారే అనుభూతి కలిగిన నా మనసుకి సాయి తప్ప వేరే దైవం తెలియదు. గత 20 ఏళ్లుగా నా సాయిదేవుడు నాతో ఉన్నారు, నన్ను నడిపించారు. కానీ ఇప్పుడు ఆయన నావైపు చూడటం లేదు. "బాబా! నేను మీ పాదాల దగ్గర ఉంటే, నాకు కష్టం ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా అది తీరలేదంటే, నేను మీ పాదాల దగ్గర లేననేగా!  బాబా! మీరెక్కడున్నారు? మీరు నా బాధ వింటున్నారా? నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మీరు నా జీవితాన్ని మధ్యలో వదిలేయలేరు. నేను ఇంతకంటే ఎక్కువ వ్యక్తపరచలేను. నాకు మాటలు రావడం లేదు. దయచేసి నాకు సహాయం చెయ్యండి. నా వైవాహిక బంధాన్ని కాపాడండి".  

ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

అనుగ్రహించిన సాయి

నా పేరు మంజుల. నేను నల్గొండ నివాసిని. సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను బాబా భక్తురాలిని. ఆయనే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయనే నా తోడునీడ, నా సర్వస్వము. ఆయన ప్రేమతో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపించి నన్ను కష్టాలనుండి బయటపడేశారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. 

గత కొంతకాలంగా నా కూతురు, కొడుకు విషయంలో నేను బాధపడుతున్నాను. అందుకు కారణాలు:

1. నా కూతురికి సంతానం కలగటం గురించి, వాళ్ళు ఫ్రాన్స్ నుండి కెనడాకు వెళ్లే విషయం గురించి.  

2. నా కొడుకు ఇటలీలో మాస్టర్స్ చదువు పూర్తిచేసి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇండియాకి వచ్చాడు. మళ్లీ తాను విదేశాలకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడ కూడా ఉద్యోగం ఏమీ చేయట్లేదు.

ఈ రెండు విషయాల గురించి ఒకరోజు మా గురువుగారైన గరిడేపల్లి సాయిబాబా మందిరంలోని పూజారి రవికుమార్ గారితో చెప్పాను. దానికి వారు మా పాప చేత, బాబు చేత బాబా చరిత్ర 41 రోజులపాటు నిత్యపారాయణ చేయించమన్నారు. నేను వాళ్ళిద్దరికీ విషయం చెప్పాను. అందుకు వారిద్దరూ అంగీకరించి, జూలై 30, గురువారంనాడు పారాయణ ప్రారంభించారు. నేను మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. అందులో భాగంగా నేను పారాయణ చేస్తున్నప్పటికీ ఎప్పుడూ బాబాను ఏమీ కోరుకోలేదు. కానీ ఆగస్టు 20, గురువారంనాడు మాత్రం పారాయణ చేస్తూ, "బాబా! నా కూతురికి సంతానాన్ని ప్రసాదించు" అని కోరుకున్నాను. ఇంకా, "నా ప్రార్థన మన్నించి మీరు నా కోరిక  తీరిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని పారాయణ కొనసాగించాను. బాబా నా ప్రార్థన విన్నారు. 2020, ఆగష్టు 22న పాప ఫోన్ చేసి, 'తను ప్రెగ్నెంట్" అని చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. పట్టలేని ఆ ఆనందంలో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే, ‘బాబు ఉద్యోగ విషయంలో, పాప కెనడా ప్రయాణ విషయంలో కూడా సహాయం అందించమని, డెలివరీ వరకు పాపకు తోడుగా ఉండమ'ని బాబాని వేడుకుంటున్నాను. "అందర్నీ కాపాడమ"ని సాయినాథుని పాదపద్మాలకు విన్నవించుకుంటూ..  జై సాయిరాం! 

సర్వం శ్రీసాయిపాదార్పణమస్తు!
శుభమస్తు!


సాయిభక్తి సాధన రహస్యం - సాయియోగంలో ఉపవాస నియమం




సాయియోగంలో ఉపవాస నియమం

శ్రీసాయిబాబా మనకందించినది మధ్యేమార్గం. ఇటు మితిమీరిన భోగలాలసతను, అటు అలవిమాలిన హఠయోగాన్ని బాబా ఆమోదించలేదు. కాలపరిణామంలో ఎన్నో మతాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఎందరో మహాత్ములు ప్రభవించి, వారివారి కాలపరిస్థితులకు ఆనాటి ఆధ్యాత్మికావసరాలకు అనుగుణంగా ఎన్నో ఆచారసంప్రదాయాలను పాదుకొల్పారు. కానీ, వ్యక్తి యొక్క సామాజిక ఆధ్యాత్మిక అవసరాలకనుగుణంగా ఆ ఆచారసంప్రదాయాలు కూడా కాలానుగుణంగా మారవలసిందిపోయి, అవన్నీ జనజీవనస్రవంతిలో అలాగే కలగాపులగంగా కలిసిపోయాయి. ఆ ఆచారసంప్రదాయాలు ఆయాకాలాలలో అర్థవంతమైనవే! అయితే, కాలగతిలో అవి ఏర్పడడానికి వెనుక వున్న లక్ష్యం అవసరం అర్థం అంతరించి – కరి మ్రింగిన వెలగపండులా – అర్థరహితమయిన మూఢవిశ్వాసాలుగా మిగిలాయి. ఎందరో మహాపురుషులు ఆయాకాలాలలో అటువంటి అర్థంలేని వ్యర్థాచారాలను ఖండించి నిరసించారు. కానీ, ‘పాత’ మీద పామరప్రజానీకానికి వుండే మోజు, మౌఢ్యం; ఈ రెంటినీ ఆధారం చేసుకొని బ్రతికే ఒక వర్గం ‘మేధావుల’ స్వార్థం మూలంగా ఈ ఆచారాలు ఇంకా మన మనస్సులనే గోడలకు బూజువలె పట్టుకొని వ్రేలాడుతున్నాయి. ‘జైసాదేశ్ వైసావేష్’ అన్నారు శ్రీసాయిబాబా! ఏ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆ కాలంలో పాటించడం వివేకం; ‘కాలధర్మం’ చెందిన ఆచారాలను పట్టుకొని వ్రేలాడడం అవివేకం! అయితే, మరి ఈ కాలానికి అనుగుణమైన ధర్మం, పురుషార్థసాధనం ఏమిటి? అదెలా తెలుసుకోవడం? – అనే సందేహం రావడం సహజం. దాన్ని తెలియజెప్పడానికే శ్రీసాయిబాబా వంటి మహాత్ములు ఇటీవల కాలంలో అవతరించారు! బాబా చూపిన బాట, ఆయన చెప్పిన మాట, తమ లీలల ద్వారా ఆయన సూచించిన బోధ – ఇవే యీ కాలానికి మన శ్రుతులు, స్మృతులు!

బాబా నిరసించిన వ్యర్థ ఆచారాలలో ఉపవాసం ఒకటి. ఉపవాసమంటే మనస్సు (అంతఃకరణము)ను వ్యర్థమయిన విషయాలతో నింపక, ఖాళీగా వుంచుకొని, అందులో మన ఉపాసనాదైవాన్ని ప్రతిష్టించుకొని, ఆయనకు అంతరంగంలో దగ్గరవడమన్నమాట! ఉప – దగ్గరగా/సమీపంలో, వాసము – ఉండటం, అని ‘ఉపవాస’మనే పదానికి అర్థం. కానీ, అసలైన యీ అర్థం పోయి, ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది! ఆకలి కడుపుతో పూజాధ్యానాదులు చేసేటప్పుడు మన దేహంలోని ప్రాణచలనం అస్తవ్యస్తమై, శోష నిద్రలతో కూడిన ఒక విధమైన ‘తమస్సు’ మనస్సును ఆవరిస్తుంది. ఈ ‘అవస్థ’నే కొందరు ‘సమాధి’, ‘అమనస్కం’ అని పొరబడుతుండటం కూడా కద్దు! “బుభుక్షితం న ప్రతిభాతి కించిత్”– అంటే, 'ఆకలితో కడుపు కాలుతున్నవాడికి ఏమీ తోచకపోవడం సహజమే!' అయితే, ఆ ‘ఏమీ తోచకపోవడ’మనేది యోగసాధనలో చెప్పబడ్డ మనోలయము కాదు, అమనస్కము అంతకంటే కాదు!

ఓ అర్థశతాబ్దం క్రితం గుజరాత్ రాష్ట్రంలో శ్రీప్రకాశానందస్వామి శ్రీనిత్యానందస్వామి అనే ఇద్దరు మహాత్ములుండేవారు. వారిరువురూ మూర్తీభవించిన వివేక వైరాగ్యాలవలె జీవించారు. శ్రీప్రకాశానందస్వామివారి ప్రసంగాలను ఆ మహాత్ములిరువురి మధ్య జరిగిన సద్గోష్టుల రూపంలో ‘వార్తాలాపం’ అనే గ్రంథంగా భక్తులు ప్రచురించారు. ఒకసారి శ్రీనిత్యానందస్వామి శ్రీప్రకాశానందస్వామి వారినిలా అడిగారు, “ఎప్పుడైనా ఆకలితో నుండవలసిన అవసరము కలిగినప్పుడు ఆకలివల్ల నిధిధ్యాసనకు విఘ్నము కలుగలేదా?” దానికి శ్రీప్రకాశానందస్వామి, “ఆహారము లేనప్పుడు వృత్తి ఏకాగ్రత చెందేదానికి బదులు స్తబ్ధమై మూఢత్వం చెందేది!” అంటూ తమ స్వానుభవాన్ని వివరించారు. శ్రీప్రకాశానందుల వంటి ఆరూఢులైన యోగుల అనుభవమే అలా వుంటే, ఇక సామాన్యుల విషయం చెప్పాలా? అయితే, సుష్టుగా భోంచేసి, ధ్యానం చేసుకుందామని కూర్చున్నా ఈ ప్రమాదం తప్పదు. అందుకే మితమయిన ఆహారము విహారము ధ్యానానికి అవసరం.

ధ్యానయోగాన్ని బోధిస్తూ భగవద్గీత:

“నాత్యశ్నతస్తుయోగో స్తినచైకాంత మనశ్నతఃl
న చాతి స్వప్నశీలస్య జాగ్రతోనైవ చార్జునll”

అంటే, 'అతిగా తినేవాడికి, బొత్తిగా తిండి తినని వానికి యీ ధ్యానయోగము సిద్ధించదు!' అని చెబుతున్నది. మరి ఎటువంటివాడికి అది సిద్ధిస్తుంది? ఆ తరువాతి శ్లోకంలోనే, ‘యుక్తాహార విహారస్య’ (అంటే, ‘సరైన ఆహారము నడత గలిగిన వానికి’)* అని సమాధానమిచ్చాడు గీతాచార్యుడు. ‘యుక్త’ అనే పదానికి ‘విధించబడిన కొలతలో’ అని అర్థం చెప్పారు శ్రీఆదిశంకరులు తమ గీతాభాష్యంలో. అంతేకాదు! ‘విధించబడిన కొలత కంటే అధికంగా’ తినడం ‘అత్యశ్నతః’. గీతలోనే మరోచోట ‘లఘ్వాశీ’ అంటూ, ‘స్వల్పంగా భుజించేవానికి’ ధ్యానయోగ సిద్ధి కలుగుతుందని గీతాచార్యుడే చెప్పాడు. అంటే, యుక్తమైన ఆహారమంటే స్వల్పంగా భుజించడమనీ, ‘విధించబడిన కొలత కంటే అధికంగా’ భుజించకుండావుండటమనేది గీతార్థమనుకుంటే, ఇక్కడ మళ్ళీ ఓ ప్రశ్న తలెత్తుతోంది! ‘స్వల్పంగా’ అంటే ఎంత స్వల్పంగా? దానికి నిర్దిష్టమైన కొలతేమైనా వున్నదా? ఉంటే, మరి ఆ కొలతేమిటి? – అని. “ఆత్మసమ్మతమైన అన్నం కంటే అధికంగా తినడమే” కొలతకంటే ఎక్కువగా తినడమని శ్రీఆదిశంకరుల వివరణ. ఎంత ఆహారం తీసుకుంటే అజీర్ణం చేయకుండా వుంటుందో, (అనాయాసంగా) పనులు చేసుకొనేందుకు అనుకూలంగా వుంటుందో అదే ఆత్మసమ్మతమయిన అన్నం అని కూడా శ్రీశంకరులు వివరించారు. “ఏ అన్నము తన కొలతకు తగినదో ఆ అన్నము కాపాడుతున్నది; అది చెరుపు చేయుట లేదు. దానికంటే అధికమైనది చెరుపు చేయుచున్నది. దానికంటే తగ్గినది కాపాడుటలేదు” అన్న శతపథబ్రాహ్మణ మంత్రం శ్రీశంకరుల నిర్వచనానికి ప్రమాణం. ఈ నిర్వచనం కూడా ‘కొలత ఎంత?’ అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. సరి! ధ్యానయోగాభ్యాసానికి సంబంధించిన యీ మితాహారమీమాంసకు యోగశాస్త్రగ్రంథాలేమైనా సమాధానం చెప్పాయా? చెప్పకేమి! ఘేరండసంహిత అనే ప్రామాణిక హఠయోగశాస్త్రగ్రంథం ఇలా చెబుతున్నది: “అన్నము కూర మొదలైనవాటికి సగం కడుపు; నీటికి పాతిక కడుపు; గాలి సంచరించేందుకు ఖాళీగా మిగిలిన పాతిక కడుపును వుంచాలి” అని. జాగ్రర్తగ చూస్తే యీ సమాధానమూ మనం ఆశించిన ‘కొలత’ను నిర్దిష్టంగా చెప్పడం లేదు!

ఇక ధర్మశాస్త్రగ్రంథాలను పరిశీలిద్దాం! “ఆహారాన్ని ఔషధంలా తీసుకో!” (“ఔషధవత్ ప్రాశ్నియాత్” బౌ.ధ.సూ.2.10.53) అని బౌధాయన మహర్షి బోధిస్తే, “సన్యాసి ఎనిమిది ముద్దలు, వానప్రస్థుడు పదహారు ముద్దలు, గృహస్థు ముప్పైరెండు ముద్దలు ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచారికి పరిమితి లేదు!” అని ఆపస్తంబ మహర్షి ఆదేశం. ఇప్పటి వరకు మనం పేర్కొన్న ‘కొలత’లలో ఆపస్తంబనిర్దేశం నిర్దిష్టంగా కనిపించినా, అది సార్వజనీనకంగా ఎంతవరకు ఆచరణ యోగ్యం? ఏతావాతా తేలిందేమిటంటే, “ఎంత ఆహారము తీసుకోవాలి?” అన్న ప్రశ్నకు, ‘ఇంత’ అని తూనిక కొలతలలో చెప్పేందుకు వీలులేదు. ‘స్వల్పం’ అనేది సాపేక్షికమైన విషయం. అది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. ఒకే వ్యక్తి విషయంలో కూడా వయస్సు, చేసే పని, దేహారోగ్యం, మానసికస్థితి మొదలైన అంశాలను అనుసరించి మారుతుంది. తేలిగ్గా జీర్ణమయ్యేంత, భుక్తాయాసము, నిద్ర రానంత, తినగానే ఒళ్ళు బరువు లేకుండా పనిచేసుకొనేంత ‘లఘువు’గా ఉండే ఆహారమే ‘యుక్తాహారం’. ఈ విషయాన్నే శ్రీమద్భాగవతం ఇంకొంచెం ఖచ్చితంగా క్లుప్తంగా, “ప్రాణవృత్యైవ సంతుష్యే – న్మునిర్నైవేన్ద్రియప్రియైః!” అంటే “మనన స్వభావము గల ముని శరీర నిర్వహణకు చాలినంత ఆహారంతో సంతుష్టి చెందాలి! ఇంద్రియాలకు ప్రియములైన (అంటే, జిహ్వకు రుచికరములైన) పదార్థాలను చాపల్యంతో తినకూడదు” అని చెబుతున్నది. “స్వల్పంగా తిను! ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు! రుచులకు పోవద్దు!” అన్న శ్రీ సాయిబాబా ఉపదేశాన్ని ‘పరిప్రశ్నాత్మకంగా’ యోచిస్తే, యోచించి ఆచరిస్తే, ఇంకా ఎన్నో విషయాలు అవగతమౌతాయి!

అంతేకానీ, ఉపవాసాలు ఒక్కపొద్దుల పేరుతో రకరకాల ఫలహారాలు, ‘టిఫెన్లు’ ఆరగించడం, పండుగ పబ్బాలలో దేవుడి పేరు చెప్పి నానారకాల నవకాయ పిండివంటలు వండుకొని, అటు దేవుడికి ‘చూపించి’, ఇటు మెక్కడం (- ఆ పిండివంటలకు ‘న్యాయం’ చేయటానికా అన్నట్లు నైవేద్యం పెట్టేదాకా ఏమీ తినకుండా ‘ఉపవాసం’ వుండి, కడుపు ఖాళీ చేసుకొని మరీ ఆయత్తమవడం -) ... ఇదీ మనం మామూలుగా చూస్తున్న చేస్తున్న తంతు! “జిహ్వరుచుల చేత జీవుండు చెడునయా” అన్నట్లు వీటివల్ల జిహ్వాచాపల్యం పెరిగి చెడిపోవడం తప్ప వేరే ఫలితం లేదు! అయితే, అప్పుడప్పుడు ఉపవాసం వుండడం ఆరోగ్యానికి మంచిదని, వైద్యశాస్త్ర రీత్యా ఈ ఉపవాస నియమాన్ని సమర్థింపచూస్తారు కొందరు. నిజమే! పైన చెప్పిన విధంగా ఉపవాసాలుండి, తర్వాత నానాగడ్డీ తిని అజీర్తి తెచ్చుకున్నవారికి, ‘లంఖణం పరమౌషధం’ కాక మరేమవుతుంది? నిజానికి “హితం భుంజాన్మితం భుంజ్యాత్, నభుంజ్యాద మితం హితం” - అంటే, 'హితమైన పదార్థాలనే తినాలి. అవైనా మితంగానే తినాలి. హితమైనవే అయినా అమితంగా తినరాదని' ఆయుర్వేదం ఘోషిస్తున్నది. అంతేకాదు! దీర్ఘకాల ఉపవాసాలుండటం వల్ల శరీరంలో ధాతువైషమ్యం కలిగి, దేహారోగ్యం దెబ్బతినడమే గాక, క్రమంగా ఎన్నో మనోవికారాలకు కూడా దారి తీస్తుందని కూడా వైద్యశాస్త్రం  హెచ్చరిస్తున్నది. ఎన్నో రకాల ‘క్యాన్సర్’లకు – ముఖ్యంగా ‘బ్లడ్ క్యాన్సర్’ (leukemia) కు దారితీసే ప్రధాన కారణాలలో ఆకలిని చంపుకోవడం (supression of hunger) ఒకటని ఆధునిక వైద్యశాస్త్రం వక్కాణిస్తున్నది.

ఈ ఉపవాసాలు జాగరణలు వ్రతాలు మొదలయిన తంతులకు, ఈనాటి ఆధ్యాత్మికతకు ఎంత బ్రహ్మముడి పడివున్నదంటే, వాటిని మరల్చడం, వదల్చుకోవడం ఒక బ్రహ్మయజ్ఞమే! అందుకే వేమనయోగి వంటి మహాత్ములు, “ఒక్క పొద్దులుండి వరము చెందెదమంచు l రెండిచత్తురు మాలబండ జనులు” అనీ, “ఒక్కపొద్దుచేత బ్రక్కలెండు గానీ చిత్తమెల్ల గురుని చేరబోదు” అనీ, నయాన చెప్పి చూచారు; “కూడు పెట్టకున్న గుక్షిలో జఠరాగ్ని l భక్షణంబు చేయు కుక్షిమలముl కూడు విడచి మలము కుడుచురా వుపవాసి” అని ఈసడించారు. అప్పటికీ నయాన విననివారికి, “ఒక్క పొద్దులున్న వూరపందిగ పుట్టు!” అంటూ భయాన చెప్పజూసారు – మనకర్థమయ్యే మన భాషలో! సరి! ఇక, శ్రీసాయిబాబా ఉపవాసదీక్షల గూర్చి యేం చెప్పారో చూద్దాం!

శ్రీమతి గోఖలే తన మిత్రురాలైన శ్రీమతి కాశీబాయి కానీత్కర్ ద్వారా శ్రీసాయిబాబా గురించి విని, బాబా దర్శనం కోసం శిరిడీ బయలుదేరింది. అక్కడ తన బస కోసం శిరిడీలో నివాసముండే దాదాకేల్కర్ అనే భక్తునికి తనను పరిచయంచేసే ఉత్తరాన్ని కూడా తన స్నేహితురాలి నుండి తీసుకుంది. బయలుదేరేముందు తాను శిరిడీ చేరగానే బాబా సన్నిధిలో మూడురోజులపాటు ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకుంది. శిరిడీలో సరిగ్గా అదే సమయానికి బాబా తన ప్రక్కనే వున్న దాదాకేల్కరుతో “నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను!” అన్నారు. హఠాత్తుగా బాబా తనతో అలా ఎందుకంటున్నారో దాదాకేల్కరుకు అర్థం కాలేదు. ఆ మరుసటిరోజే శ్రీమతి గోఖలే శిరిడీ చేరి, దాదాకేల్కర్ ఇంటికెళ్ళి తనను పరిచయం చేసుకొని, అక్కడే బస ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత బాబా దర్శనం కోసం మసీదుకెళ్ళింది. బాబాకు నమస్కరించి కూర్చొనగానే బాబా తనంతట తానే ఆమెతో, “అమ్మా, ఈ ఉపస్సు (ఉపవాసం) తపస్సులతో అవసరం ఏమిటి? మనం దాదా ఇంటికి పోయి చక్కగా పూరన్ పోళీలు అవీ చేసుకొని,  దాదాకు దాదా పిల్లలకు పెట్టి, మనమూ తిందాం!” అన్నారు. శ్రీమతి గోఖలే మసీదు నుండి దాదాకేల్కర్ ఇంటికెళ్ళేసరికి, అప్పుడే దాదా భార్య ‘బయట చేరడం’తో సమయానికి వంటచేసేవారు లేక, ఎలాగా అని ఆలోచిస్తున్నారు. శ్రీమతి గోఖలే తాను వంట చేస్తానంటే, ఇంటికొచ్చిన అతిథి చేత వంట చేయించుకోవడం ఉచితం కాదని దాదా సంకోచించాడు. అప్పుడు శ్రీమతి గోఖలే తాను శిరిడీ బయలుదేరడానికి ముందు సంకల్పించుకున్న ఉపవాసదీక్ష, అంతకు కొద్దిసేపు ముందు బాబా తనకు చేసిన ఉపదేశం... అన్నీ కేల్కర్ కు వివరించింది. ఆ ముందు రోజు బాబా తనతో అన్న మాటల అర్థం అప్పుడుగానీ దాదాకేల్కర్ కు బోధపడలేదు. శ్రీమతి గోఖలే వంట చేసి, దాదా కుటుంబానికి వడ్డించి, తానూ తిన్నది. బాబా ఆదేశానుసారం తను సంకల్పించిన ఉపవాసదీక్షకు స్వస్తి చెప్పింది.

ప్రత్యేక ఆధ్యాత్మిక సాధన-దీక్ష లేని సామాన్య భక్తులకు ‘ఉపస్సు-తపస్సు’ బాబా వద్దన్నారేగానీ, తీవ్రసాధనలో వుండే సాధకులకు మాత్రం  ఉపవాసాది దీక్షలు తప్పనిసరేమో - అని భావించడానికి కూడా వీలులేదు! ఎందుకంటే, సంసారబంధాలు త్యజించి, శిరిడీలోనే నివాసముంటూ, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైవున్న కాకాసాహెబ్ దీక్షిత్ అనుభవమే తీసుకుందాం. ఏకభుక్తం వుంటూ, నియమంగా రాత్రుళ్ళు ఆహారం తీసుకోవడం మానాలని సంకల్పించుకున్నాడు శ్రీదీక్షిత్ ఒకసారి. అలా అనుకొని మసీదుకెళ్ళగానే బాబా, “కాకా, రాత్రికి మామూలుగా భోజనం తయారుచేసుకొని తిను!” అన్నారు. దాంతో, దీక్షిత్ తాను పెట్టుకున్న ఉపవాస నియమానికి తిలోదకాలిచ్చాడు. అంటే ఆధ్యాత్మిక సాధనలో భాగంగానైనా సరే ఉపవాసనియమాన్ని బాబా ససేమిరా ఆమోదించలేదని స్పష్టమవుతున్నది. శ్రీఉపాసనీ మహరాజ్ వృత్తాంతం ఈ అంశాన్ని ఇంకా స్పష్టం చేస్తుంది.

ప్రత్యక్ష సాయిభక్తులందరిలో తీవ్రతపస్విగా మహాసిద్ధపురుషునిగా ఓ సద్గురుమూర్తిగా వేలాదిమందిచే ఆరాధింపబడుతున్న మహనీయుడు శ్రీఉపాసనీ మహరాజ్. ఆయన 1911లో బాబాను దర్శించినప్పుడు, బాబా ఆయనను నాల్గుసంవత్సరాలు శిరిడీలో వుండమని ఆదేశించారుఅలా చేస్తే ఉపసానీకి పరిపూర్ణసిద్ధి లభిస్తుందని కూడా బాబా హామీ ఇచ్చారు. మరి ఆ నాలుగేళ్ళ కాలంలో తాను చేయవలసిన ఆధ్యాత్మికసాధనలు ఏమిటని అడిగాడు శ్రీఉపాసనీ. దానికి బాబా, “ఏమీ చెయ్యనక్కరలేదు! రొట్టెకూర తిని ఊరక కూర్చుంటే చాలు! మిగిలిందంతా నేను పూర్తి చేస్తాను” అని అన్నారు. బాబా కేవలం "ఊరకే కూర్చో!" అని చెప్పడంతో బాటు, “రొట్టెకూర తింటూ ఊరక కూర్చో!” అని ఆహారం విషయం ప్రత్యేకంగా నొక్కి చెప్పడం గమనార్హం. 

బాబా అలా ఆహారం విషయం నొక్కి చెప్పడానికి రెండు కారణాలను మనం ఊహించవచ్చు. ఉపవాసతపవాసాల పట్ల బాబాకున్న నిరసన భావం మొదటిది; రెండవది, బాబా అభిమతానికి వ్యతిరేకంగా ఆ తరువాత శ్రీఉపాసనీ చేసిన ‘నిరాహార దీక్షను', దానివల్ల ఆయనకు కలుగబోయే నష్టాన్ని బాబా తనదైన శైలిలో ముందుగానే సూచించి హెచ్చరించడం! శిరిడీలో కొందరు సాయిభక్తులు నిర్వహిస్తున్న భోజనశాలలో మొదట భోజనం చేసేవాడు శ్రీఉపాసనీ. కానీ కొంతకాలం గడిచాక ఆ భోజనశాల నిర్వాహకులకు శ్రీఉపాసనీకి మధ్య ఎవో మనఃస్పర్థలు కలిగాయి. భోజనశాల నిర్వాహకులు తనను అవమానం చేసారని వారిపై కినుకతో భోజనం మానేసి పస్తులుండటం ప్రారంభించాడు శ్రీఉపాసనీ. సాటి సాయిభక్తులు ఎంత నచ్చచెప్పజూసినా, స్వయంగా బాబానే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ శ్రీఉపాసనీ తన ఉపవాసదీక్షను విరమించలేదు. ఆ నిరసన వ్రతాన్ని దైవం నిర్ణయించిన ఒక తపోదీక్షగా భావించి మొండిగా మూర్ఖంగా కొనసాగించాడు. శ్రీఉపాసనీ తనకై తాను విధించుకున్న కఠిన ఉపవాసదీక్షను చూచిన గ్రామస్తులు ఆయనను "ఉపవాసీ బాబా" అని పిలిచేవారు. దీర్ఘకాలం కఠిన ఉపవాసాలవల్ల శ్రీఉపాసనీ దేహారోగ్యమేగాక మానసిక స్వస్థత కూడా దెబ్బతిన్నది; 1913 ఏప్రిల్ లో చాలా ప్రమాదకరంగా పరిణమించింది కూడా. శ్రీసాయి అనుగ్రహవిశేషము మార్గదర్శకత్వము లేనట్లయితే శ్రీఉపాసనీ శాశ్వతంగా పిచ్చివాడై అలానే మరణించి వుండేవాడేమో! శ్రీఉపాసనీని ఆ ప్రమాదస్థితి నుండి తప్పించి, స్వస్థత చేకూర్చడానికి శ్రీసాయి తమ దివ్యశక్తితో ఏం చేసారో మనకు అగోచరం. శ్రీఉపాసనీ స్వస్థుడవడానికి బాహ్యంగా మాత్రం బాబా చేసిన చికిత్స, ఇచ్చిన ‘ఔషధం’ మాత్రం- ఆహారం!

శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందేందుకు క్షణికమైన ఇంద్రియసుఖాలనన్నింటిని త్యజించి ‘అనిత్యమైన’ దేహాన్ని రకరకాల క్లేశాలకు గురిచేయడమే ‘తపస్స’ని చాలామందికున్న అవగాహన. శరీరాన్ని ఎంత ఘోరంగా కష్టపెడితే అది అంత ‘ఉగ్రతపస్సు’ క్రింద లెక్క! నిజానికి మొదట్లో ‘తపస్సు’ అనే పదానికి ఈనాటి మన వ్యవహారంలో మనకు స్ఫురిస్తున్న పైన చెప్పిన అర్థం లేదు! ‘తపస్సు’ అనే పదం ‘తప్’ అనే ధాతువు నుండి పుట్టింది. ‘తప్’ శబ్దానికి ‘కాల్చుట’, ‘వేడి’, ‘తపన’ అని అర్ధాలున్నాయి. “స తపో తస్యత”. ఆ వేడి ఎటువంటి వేడి? ఏదో ఒక కార్యాన్ని సాధించాలని ఆతురపడే వ్యక్తి అంతరంగంలో ఆలోచనల ఒరిపిడి నుండి పుట్టే వేడి; మంత్రోచ్ఛాటన చేస్తూ హోమాగ్ని ముందు కూర్చుని వున్న యజ్ఞదీక్షితుడు అనుభవించే వేడి; ఆత్మసాక్షాత్కారం కోసం తపించే సాధకుని తీవ్ర హృదయ సంవేగనం నుండి బయల్పడే వేడి; భగవత్సాక్షాత్కారం కోసం అనన్య ప్రేమ జ్వరంతో పరితంపించే భక్తుని విరహాగ్ని నుండి ఉద్భవించే వేడి; చిత్తవృత్తులను నిరోధించి తీవ్రధ్యానయోగ తత్పరుడైన యోగి యొక్క ప్రాణాగ్ని నుండి ప్రభవించే వేడి; ‘తపః’ శబ్దం తెలియజెప్పే వేడి – అటువంటి వేడి! అటువంటి వేడిని (ఉత్తేజాన్ని) సాధకునిలో పుట్టించేది, ఆ వేడితో వ్యక్తి హృదయంలోని దుఃఖకారకాలైన మలినవాసనలను మండించి మసిచేసే మార్గమే ఆధ్యాత్మిక మార్గం! అందుకే దానిని తప్తమార్గమన్నారు!

కానీ, కాలాంతరంలో యీ ‘తపస్సు’లోని ‘వేడి’ ‘వాడి’ అంతరించి, నానారకాల ఉపాయాలతో శరీరాన్ని బాధించి తపింపచేయటమే ‘తపస్సు’ అనే భావం పాదుగొల్పుకొన్నది. అలాంటి ఆత్మహింసాకరమైన సాధనాలలో శరీరాన్ని ఆకలితో అలమటింపచేయటం ఒక ప్రధాన ‘తపస్సు’గా తయారైంది. “వ్రతోపవాస నియమైః శరీరోత్తాపనం తపః”– అని కొన్ని గ్రంథాలు తపస్సును నిర్వచించాయి. మొదట్లో యీ ఉపవాసమనే ‘తపస్సు’ను ఏదైనా నేరంగానీ పాపంగానీ చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్తకర్మగా (-అంటే, శిక్షగా) ధర్మశాస్త్రగ్రంథాలు విధించాయి. ధర్మశాస్త్రగ్రంథ పరిభాషలో ‘తపస్సు’ అనేది ప్రాయశ్చిత్తానికి పర్యాయపదం. ఉదాహరణకు యాజ్ఞవల్క్యస్మృతి ఇటువంటి ప్రాయశ్చిత్త రూపమైన తపస్సును నిర్వచిస్తూ ఇలా అంటున్నది:

“విధినోక్తేన మార్గేణ కృచ్ఛచాన్ద్రాయ నాదిభిఃl
శరీర శోషణం ప్రాహుః తపసాం తపముత్తమంll”

- అంటే, 'శాస్త్ర ప్రతిపాదితమైన మార్గాన్ననుసరించి కృచ్ఛ చాంద్రాయణాదుల ద్వారా శరీరమును శోషింపజేయటము ఉత్తమమయిన తపము' అని అంతేకాదు! ‘ఉప’ అంటే ‘తిరిగి వెనక్కురావడమ’నీ, ‘వాస’మంటే జీవితం గడపడమ’నీ, ఉపవాసమంటే పాపం చేసినందువల్ల మలినమైన జీవితంనుండి వెనక్కు మరలి, పవిత్ర జీవతం గడపడమనీ - ‘ఉపవాస’ పదానికి పురాణోక్తమయిన నిర్వచనం.

((చాంద్రాయణ వ్రతమంటే చాంద్రమాసంలోని శుక్లపక్షంలో మొదటిరోజున ఒక్క ముద్ద (పిడికిలిలో పట్టేంత) మాత్రమే ఆహారం తీసుకొని, రెండవరోజు రెండు ముద్దలు, మూడవరోజు మూడు ముద్దలు, ... ఇలా పెంచుకుంటూ పోయి, పౌర్ణమి మరుసటిరోజునుండి, అంటే కృష్ణపక్షంలో రోజుకొక్క ముద్ద చొప్పున తగ్గిస్తూ, అమావాస్యనాడు పూర్తిగా నిరాహారంగా వుండటం. ఇటువంటివే కృచ్ఛము, పరాకము, సాంతపనము, ప్రాజాపత్యము మొదలయిన ఉపవాసవ్రతాలు. పాపపరిహార్థం చేసే ప్రాయశ్చిత్త విధులుగ ధర్మశాస్త్రగ్రంథాలలో ఇవి వివరింపబడివున్నాయి.))

ఆధ్యాత్మిక విద్యపై అగ్రవర్ణాల గుత్తాధిపత్యం, వర్ణవిభేదాలు, కులవైషమ్యాలు పెచ్చుమీరిన కాలంలో రచింపబడిన కొన్ని గ్రంథాలలో స్త్రీ శూద్రులకు వేదాధ్యయనము మొదలయిన ఆధ్యాత్మిక విద్యలు నిషేధింపబడ్డాయి. ఆ గ్రంథకర్తల దృష్టిలో స్త్రీ శూద్రులు ‘పాపయోనులు’, అపవిత్ర శరీరులు! పూర్వజన్మలో వారు చేసిన పాపాల ఫలితంగా అలా నీచజన్మలను పొందినవారు! కనుక వారు పవిత్రులవడానికి పాపపరిహారార్థం పాటించే ప్రాయశ్చిత్తవిధులే వారికి సరైన తరుణోపాయాలుగా నిర్ణయించి, ఆ ఉపవాసాది శిక్షలనే వ్రతాలపేర వారు చేయదగిన (అర్హమైన) ఆధ్యాత్మిక సాధనలుగా విధించారు. క్రమేణా ప్రజాబాహుళ్యంలో తాము పాపకర్ములమనే ‘పాపాత్మభావన’ పెరగడం వల్ల కాబోలు, యీ ఉపవాసం వంటి (ప్రాయశ్చిత్త) వ్రతాలకు అన్ని వర్గాలలోను ఆదరణ పెరిగి ఈనాడు సార్వజనీనంగా అవి ఉత్తమ ఆధ్యాత్మికసాధనాలుగ ప్రాచుర్యం పొందాయి. కానీ యీ విధమైన ఆత్మహింసాకర ప్రవృత్తులను ప్రక్రియలను మహాత్ములేకాదు, ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఎప్పటికప్పుడు నిరసించి ఖండిస్తూనే వచ్చాయి.

“జడాస్తమ పోభిః శయన్తిదేహం, బుధామనశ్చాపి వికారహేతుంl
శ్వాముక్త మస్త్రదళతీతి కోపాత్, క్షేప్తార ముద్దిశ్య హనస్తి సింహఃll”

-అంటే, 'జడబుద్ధులు (మూర్ఖులు) శారీరక తపస్సుచే (ఉపవాసాదులచే) తమ శరీరమును కృశింపచేసుకొంటారు. బుద్ధిమంతులు సర్వవికారములకు కారణభూతమైన మనస్సును శమింపచేస్తారు. కుక్కను కర్రతో కొడితే ఆ కుక్క కసి తీర్చుకోవడానికి ఆ కర్రను కరుస్తుంది; అదే సింహమైతే కోపంతో ఆయుధాన్ని ప్రయోగించిన వానిపై ఉరికి, వానినే చంపుతుంది'.

“అహింసా సత్యవచనం అన్యశంస్యం దమోఘృణాl
ఏతత్తపో విదుర్ధీరా న శరీరస్య శోషణమ్ll”

'అహింస, సత్యము పలకడము, ఇతరులకు దుఃఖము కలిగించే పనులు చేయకుండడము, దమము, దయ ఇవియే తపములని విజ్ఞులు చెప్తారు; శరీరాన్ని శోషింపచేడం తపస్సు కానేకాదు'.

“దేహ దండణ మాత్రేణ కాముక్తి రవివేకినామ్l
వల్మీక తడానాద్దేవి మృతః కిం సుమనోరగఃl
మాసపక్షోపవాసేన మన్యస్తేయే తపోజనాఃl
ఆత్మతన్తూప ఘాతాస్తే న తపస్స తతాం మతంll”

- అంటే, 'శరీరాన్ని కష్టపెట్టినంత మాత్రాన ఆ అవివేకికి ముక్తి లభిస్తుందా? పుట్టపైన కొట్టినంత మాత్రాన ఆ పుట్టలోని పాము చస్తుందా; ... మాసం పక్షము రోజులు ఉపవాసము ఉండటమే తపస్సు అని కొందరనుకుంటారు. (నిజానికి అలా చేయడం వల్ల) వారు తమ ఆత్మతంతువును నశింపచేసుకుంటున్నారు. సత్పురుషులు దానిని తపస్సుగా అంగీకరించరు'.

అందుకే సత్పురుష శ్రేష్టుడైన శ్రీసాయినాథుడు కూడా ఇలాంటి ‘ఉపవాస తపవాసాలను’ అంగీకరించలేదు. హఠంతో (-అంటే, మొండిగా) దేహాన్ని వివిధ క్లేశాలకు గురిచేసి చేసే సాధన హఠయోగాభ్యాసానికి చెందిందని సామాన్యంగా అనుకోవడం కద్దు. కానీ, అది కేవలం అవగాహనా లోపంవల్ల కలిగిన దురూహ మాత్రమే. ఉదాహరణకు ప్రామాణిక హఠయోగ శాస్త్రగ్రంథాలలో ఒకటైన ఘేరండ సంహిత ఆహారనియమాన్ని గూర్చి ఏం చెబుతున్నదో చూద్దాం.

“ఏకాహారం నిరాహారం యమాన్తేచ న కారయేత్ll”

- అంటే, 'ఒంటిప్రొద్దు భోజనం, మూడుగంటలకు మించి నిరాహారంగా ఉండడం (యోగాభ్యాసి) చేయరాదు' అని!

ఈ సందర్భంలో మరొక్క విషయం వివరించవలసిన అవసరం వుంది. పరిపూర్ణులయిన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే, వారు తమ జీవితంలో ఏదో ఒక దశలో, దేహాన్ని కఠిన శ్రమలకు గురిచేసి, ఎంతోకాలం తీవ్ర ‘తపస్సు’లో నిమగ్నమైనవారనే విషయం గోచరిస్తుంది. ఎవరి మాటో ఎందుకు? ఉదాహరణకు శ్రీసాయిచరిత్రనే తీసుకొందాం. ఒకసారి ఒక సాధకుడు సమయానికి సరైన భోజనం లభించలేదని సతమతమౌతుంటే, అతనితో బాబా మందలింపుగా ఇలా అన్నారు: “ఒక్కపూట తిండి దొరకనందుకే అంత ఆరాటపడతావేం? నేను కొన్ని మాసాలపాటు భోజనం లేకుండా కేవలం 'కాలాటెక్కల్' ఆకులు, వేపాకు తిని గడిపాను. వీసమెత్తు కండన్నమాట లేకుండా దేహం మొత్తం ఎముకల ప్రోగులా తయారైంది. ఆ ఎముకలు కూడా ఎప్పుడు ఊడిపోయి రాలిపోతాయా అన్నట్లుండేవి. అయినా, నా శరీరం నుండి ప్రాణాలు మాత్రం పోలేదు. దయామయుడైన ఆ భగవంతుని సంకల్పం అలా వుంది!”

అయితే బాబా వర్ణించిన ‘స్థితి’ సామాన్య సాధకులు ప్రారంభంలోనే ‘అనుకరించ’దగిన ఆదర్శం కాదు. బాబావలె నెలల పర్యంతం కేవలం వేపాకులు తిని జీవించడం సామాన్యులకు అసలు అసాధ్యమైన కార్యం. ఆత్మజ్ఞానోదయమయిన వెంటనే, హృదయకుహర కవాటాలను బ్రద్దలుకొట్టుకొని పొంగిపొరలే ఆత్మానంద రసానుభూతిలో, దేహస్ఫురణ కూడా కొట్టుకొని పోయినప్పటి పరిస్థితి వారిది! ఆ స్థితిలో ఆహార సేకరణ వంటి దేహావసరాలను పట్టించుకోవడం అసాధ్యమవుతుంది. ఆ దశ వైరాగ్యంతో ఆ మహాత్ములు వారికై వారు స్వచ్ఛందంగా విధించుకొన్న నియమం కాదు. ఆ స్థితిలో సహజంగా కలిగే అనివార్య పరిణామం.

ఈ విషయాన్ని సందేహాలకు తావు లేకుండా ఇంకొంచెం వివరంగా తెలుపుతున్నది  భగవాన్ శ్రీరమణమహర్షి అనుభవం. అరుణాచలం చేరిన మొదటి రోజుల్లో ఎంతో కాలం దేహస్ఫురణను కూడా విస్మరించి ఆత్మానందంలో అంతర్ముఖుడై వుండిన మహర్షి అప్పటి తమ ‘స్థితి’ని గూర్చి తామే ఒకసారి స్వయంగా ఇలా చెప్పారు: “ఇక్కడకు (అరుణాచలం) వచ్చిన మొదటిరోజుల్లో కళ్ళుమూసుకుని ఒకే ధ్యానంలో ఉంటే, రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే ప్రొద్దుకూకిందా? తెల్లవారిందా? అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు. విహారం వుంటే ఆహారం కావాలి. ఆహారం వుంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు. ఆహారం లేకుంటే నిద్రరాదు. ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు. నాకంతే అయ్యేది. కళ్ళు తెరచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంలో ఏదో ఒకటి ఒక గ్లాసు ఆహారమిచ్చేవారు. అంతే! అయితే ఒకటి. ఒకే నిర్వికల్ప నిష్ఠలో ఉన్నప్పుడే తప్ప, మనస్సు శరీరం వ్యవహారార్థం ఉపయోగించినపుడు ఆహారనిద్రలు విసర్జించుటకు వీలు కాదు అట్లాచేస్తే శరీరం తూలుతుంది. ... అందువల్ల మిత సాత్వికాహార విహార నియతి ఆత్మోన్నతికి అత్యంతావశ్యకమని చెప్పవలసి ఉన్నది. ... అంటే, ఆహారనిద్రలు అసలు మానడం మంచిది కాదు. అతిగానూ ఉండకూడదన్నమాట!”

హఠాత్తుగా ఆ మహాత్ములలో వరదలా పొంగిన దివ్యభావావేశపు ఉధృతి తగ్గి, ఆ ఆత్మానందస్థితి వారికి సహజము స్వాభావికము అయిన తరువాత, అటు శ్రీసాయిబాబా గానీ, ఇటు భగవాన్ శ్రీరమణమహర్షిగానీ, నిత్యం భిక్ష చేసి స్వల్పంగా భుజించేవారే తప్ప వారేనాడూ ఉపవాసం చెయ్యలేదు! అంతేకాదు! ఇక్కడ గమనించవలసిన విషయం మరొక్కటున్నది. అంతటి దేహవిస్మృతిని కల్గించే అంతర్ముఖావస్తలోనున్న మహాత్ములను కూడా జీవధర్మమైన ‘ఆకలి’ బహిర్ముఖులను చేసి, ప్రాణాధారంగా ఏ ఆకులో అలములో తినవలసిన అవసరాన్ని కలిగించింది. ఇక, సామాన్య సాధకుల విషయం చెప్పాలా? రుచిని పట్టించుకోకుండా ఏదో ఒకటి తిని సాధన చేసుకోవాలి తప్ప, నిరాహారం నిషిద్ధం, అనర్థం కూడా!

“అత్యాహార మనాహారం నిత్యం యోగీ వర్జయేత్” - (యోగి ఎల్లప్పుడూ అత్యాహారాన్ని, నిరాహారాన్ని త్యజించాలి!) అన్న శృతి ఆదేశంలోని అర్థం ఇదే. అదే, భోజనం దొరకలేదని బాధపడుతున్న సాధకునికి బాబా చేసిన హితవులోని అంతరార్థం.

శ్రీసాయిబాబా ఉపవాసాలనెంత మాత్రం ఆమోదించకున్నా, ఎందరో సాయిభక్తులు బాబా పేర గురువారాలు, లేదా వారు అనుకొన్న (ఎన్నుకొన్న) మరో రోజునో ఉపవాసాలుండటం పరిపాటి అయింది. శ్రీసాయిచరిత్ర-బోధనల పట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. గురువారాలు ఉపావాసాలుండటాన్ని గూర్చి బాబానే స్వయంగా ఏం చెప్పారో చూద్దాం!

శ్రీM.W.ప్రధాన్ అనే సాయిభక్తుడు ఒకసారి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా శిరిడీలో షామా ఇంట్లో విందు ఏర్పాటుచేసి, సాటి సాయిభక్తులందరినీ ఆహ్వానించాడు. ఆ రోజు గురువారం కనుక తాను భోజనం చేయననీ అందువల్ల విందుకు హాజరు కాలేననీ ప్రధాన్ కు క్షమాపణ చెప్పి, బాబా వద్దకు వెళ్ళాడు బాలాభాటే. భాటేను చూడగానే శ్రీసాయిబాబా, “భావు (ప్రధాన్) యేర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేసావా?” అని అడిగారు.

భాటే: “బాబా ఈరోజు గురువారం!”

బాబా: “ఓహో! అయితే ఏమిటిట?”

భాటే: “నేను గురువారాలు భోజనం చెయ్యను. అది నా నియమం!”

బాబా: “ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు?”

భాటే: “మీ ప్రీతి కోసమే!”

బాబా: “అయితే నేనే చెబుతున్నాను. పో! పోయి భావుతో పాటు భోజనం చేయి!”

అప్పటికే సాయంత్రం నాలుగయింది. అయినప్పటికీ ప్రధాన్ ను కలుసుకొని, బాబా ఆజ్ఞ గురించి చెప్పి భోజనం చేసాడు శ్రీభాటే.

తన ప్రీతికోసమని గురువారం తదితర దినాలలో ఉపవాసముండటాన్ని బాబా అంగీకరించకపోయినా, కనీసం అనూచారంగా వస్తున్న ఏకాదశి, మహాశివరాత్రి వంటి పవిత్రదినాలలో ఉపవసించడం మాటేమిటి? ప్రజాసంస్కృతిలో భాగంగా పాదుకొనిపోయిన అలాంటి ఆచార వ్యవహారాల పట్ల మతసాంప్రదాయాల పట్ల గౌరవంతో (తమకిష్టం లేకపోయినా) బాబా ఉపేక్ష వహించి ఊరుకొన్నారా? లేక, వాటినీ నిష్కర్షగా త్రోసిపుచ్చారా? - సరి! ఇప్పుడిక ఈ అంశాన్ని పరిశీలిద్దాం!

శ్రీసాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరిలో బాబాతో అత్యంత చనువు సాన్నిహిత్యం గల భక్తుడు శ్రీతాత్యాకోతేపాటిల్. బాబాతో సుమారు పదునాల్గు సంవత్సరాలపాటు రాత్రిళ్ళు మసీదులో నిదురించే మహదవకాశం పొందిన భాగ్యశాలి శ్రీతాత్యా. బాబా-తాత్యాల అనుబంధాన్ని చూచిన వారు తాత్యాను బాబా ప్రాణాధికంగా ప్రేమించేవారని అనుకొనేవారు. అటువంటి సన్నిహిత సాయిభక్తుడైన శ్రీతాత్యాకోతేపాటిల్ తన ‘స్మృతులలో’ ఇలా అంటారు:

“నేను ఏకాదశి, శ్రావణ సోమవారాలు, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో తప్పక ఉపవసించేవాడిని. కానీ, ఉపవాసం వల్ల ఇటు ఐహికంగాగానీ, అటు ఆధ్యాత్మికంగాగానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం. ఆ పర్వదినాలలో నేనెంత ఉపవశించాలని యత్నించినా బాబా నాచేత ఏదో తినిపించి ఉపవాసాన్ని భంగం చేసేవారు. ఒక శివరాత్రినాడు నేను బాబాతో, 'బాబా, దయచేసి ఈ శివరాత్రి నాడైనా నా చేత ఏమి తినిపించకండి. నన్నీ రోజైనా ఉపవాసం చెయ్యనివ్వండి!' అని అన్నాను. 'తినరా! తిను! ఏం శివరాత్రి?' అన్నారు బాబా. ప్రక్కనే వున్న దాదాకేల్కర్ కూడా బాబా చెప్పినట్లే చెయ్యమని, ఆయన మాటను ఉల్లంఘించవద్దని హెచ్చరించాడు. నేనిక బాబా మాటకు అడ్డుచెప్పలేదు. ఆ నాటినుండి నేనే రోజునా ఉపవాసం చెయ్యలేదు”.

శ్రీసాయి వంటి అద్భుత అవతారపురుషునితో అంతటి సాన్నిహిత్యం సాంగత్యం గల తాత్యావంటి ధన్యజీవులకు సామాన్య ఆధ్యాత్మిక నియమాలతో ఇక అవసరం ఏముంటుంది? కానీ, తాత్యా అంతటి భాగ్యానికి నోచుకోని సామాన్యభక్తులకు ఏకాదశి ఉపవాసం వంటి ‘సదాచార’ విధులను పాటించడం ఉత్తమం కదా?- అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు! అటు సన్నిహిత భక్తులకైనా, ఇటు కేవలం సందర్శకులవంటి సామాన్య భక్తులకైనా ఉపవాసాది ఆచారాల విషయంలో బాబా తమ వైఖరిని నిర్ద్వంద్వంగానే ప్రకటించారు. శ్రీమతి గోఖలే అనుభవాన్ని ముందు తెలుసుకొన్నాం. శ్రీ శాంతారాం నాచ్నే అనుభవం ఈ విషయాన్ని ఇంకా తేటతెల్లం చేస్తుంది. 


శాంతారాం బల్వంత్ నాచ్నే తన మిత్రులైన శంకర బాలకృష్ట వైద్య, అచ్యుత దాతేలతో కలిసి 1912 లో శిరిడీ సందర్శించారు. బాబా సన్నిధిలో మూడురోజులున్నారు. వారు శిరిడీ చేరిన మరుసటిరోజు ఏకాదశి. వైద్య, దాతే ఛాందసభావాలు కలిగినవారు. ఏకాదశిరోజున భోజనం చెయ్యరు. నాచ్నేకు ఉపవాస నియమం లేకపోయినా తోటి మిత్రులను విడచి ఒక్కడే భోజనం చేయడం బాగుండదని, ఏమీ తినకుండా మశీదు చేరాడు. మధ్యాహ్నఆరతికి సమయం అయ్యింది. భక్తులందరూ మశీదు చేరుకుంటున్నారు. బాబా అప్పుడు నాచ్నేను పిలిచి “భోజనం చేసావా?” అని అడిగారు. నాచ్నే 'లేదని' చెప్పాడు.

బాబా: "అయితే వెళ్ళి భోంచేసిరా!"

నాచ్నే: "బాబా! ఈరోజు ఏకాదశి!"

బాబా: (నాచ్నే మిత్రులిద్దరినీ చూపుతూ) "వీళ్ళు పిచ్చివాళ్ళు. నీవు సాఠేవాడాకు పోయి భోజనం చేసిరా!" అన్నారు.

బాబా ఆజ్ఞ ప్రకారం నాచ్నే సాఠేవాడాకు వెళ్ళి అక్కడ భోజనశాలను నిర్వహిస్తున్న బాలాభావ్ అనే భక్తుని భోజనం పెట్టమని అడిగాడు. ఏకాదశినాడు కూడా నాచ్నే తిండి కోసం కొట్టుకుంటున్నాడని విసుక్కొంటూ, ఆరతి అయిందాకా భోజనం పెట్టనని చెప్పి, బాలాభావ్ ఆరతికి మసీదుకు వెళ్ళాడు. అతని వెనుకనే నాచ్నే కూడా మసీదు చేరాడు. నాచ్నేను చూడగానే బాబా, “భోజనం చేసావా?” అని అడిగారు. నాచ్నే జరిగిందంతా చెప్పకుండా, “బాబా, ఆరతి వేళ అయింది కదా! ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను” అని సర్ది చెప్పబోయాడు. కానీ బాబా పట్టుదలగా, “నీవు భోజనం చేసిన తర్వాతనే ఆరతి మొదలవుతుంది. అంతవరకు ఆరతి ఆగుతుందిలే! నీవు పోయి భోజనం చేసిరా!” అని అన్నారు. అక్కడే వున్న బాలాభావ్ కిక నాచ్నేకి భోజనం వడ్డించక తప్పలేదు. నాచ్నే భోజనం చేసి మసీదుకు వచ్చిన తర్వాతనే ఆరతి ప్రారంభమయ్యింది. అదే సమయానికి మౌసీ అనే వృద్ధభక్తురాలు బాబాకు తాంబూలం (బీడా) సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాచ్నేకిచ్చి వేసుకోమన్నారు. ఏకాదశినాడు తాంబూల చర్వణం నిషిద్ధం. అందుకని నాచ్నే కొంచెం ముందువెనుకాడుతుంటే, “సందేహించకు, ఊఁ! వేసుకో!” అన్నారు బాబా. నాచ్నే బీడా వేసుకున్నాడు. ఆ విధంగా ఏకాదశినాడు భోజనమే కాకుండా, తాంబూలసేవనం కూడా చేయించి, అర్థంలేని ఆచారాలు వ్యర్థమని తమ ప్రత్యేక పంథాలో ఉపదేశించారు బాబా.

ఏకాదశి నియమం లేని నాచ్నేను భోజనం చేయమన్నారు కానీ, ఆ నియమం వున్న నాచ్నే మిత్రులను భోజనం చేయమని బాబా చెప్పలేదు. కనుక, ఈ నియమాలను బాబా గౌరవించినట్లేనని కొందరు బుద్ధిమంతులు వాదించవచ్చు. నాచ్నే మిత్రులిద్దరినీ బాబా భోజనం చెయ్యమని చెప్పకపోవడానికి కారణం – ఆ నియమాలపట్ల గౌరవం వుండి కాదని వారినుద్దేశించి, "వీరంతా పిచ్చివాళ్ళు" అని బాబా అనడంలోనే తేటతెల్లమవుతుంది. పూర్వాచారపరాయణత్వమనే ‘పిచ్చి’ తలకెక్కిన "పిచ్చివాళ్ళు" తాను భోజనం చేయమని చెప్పినా వినరని బహుశా వారిని వదిలిపెట్టి వుండవచ్చు! ఎందుకంటే ఆ వెంటనే జరిగిన సంఘటనే ఆ విషయాన్ని నిరూపిస్తుంది.

ఆరతి అయినవెంటనే ఒక మార్వాడీ బాలిక బాబా దగ్గరకొచ్చి ఏదైనా పండు వుంటే ఇవ్వమని అడిగింది. బాబా అప్పుడు నాచ్నే మిత్రుడైన దాతేతో, “వెళ్ళి నీవు దాచుకున్న నారింజపళ్ళను తీసుకురా!” అన్నారు. ఏకాదశి ఉపవాసం దృష్ట్యా మామూలు ఆహారానికి బదులుగా ‘ఫలహారం’ కోసమని కొన్ని నారింజ పండ్లు ప్రొద్దునే అట్టిపెట్టుకున్నాడు దాతే. కానీ బాబా ఆ పళ్ళు తెమ్మని అడిగితే, అవి తాను ఏకాదశి ఫలహారం కోసం వుంచుకున్నానని చెప్పి, ఆ పండ్లు ఇవ్వలేదు! బాబా కూడా అతణ్ణి మరి ఒత్తిడి చేయలేదు.

“గురువు సకల ధర్మాత్ము”డని నమ్మి, అలా ఆచరించిన నాచ్నేకు విశేషంగా సద్గురు ప్రసాదం లభిస్తే, కరడు కట్టిన సనాతన ఆచారాలు తలకెక్కిన ఛాందసునికి, ఒక పసిబిడ్డ కోసం శ్రీసాయియే స్వయంగా అడిగినా ఒక పండు కూడా సమర్పించుకోలేని ‘సంస్కారం’ మిగిలింది.

సద్గురు కృపకు శరణాగతికి మనను దూరం చేసే బూజు పట్టిన ఆచారాల బారినుండి మనను ఆ సాయినాథుడే కాపాడుగాక!

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 545వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయి సచ్చరిత్ర పారాయణ మంచి ఉద్యోగాన్ని ప్రసాదించింది
  2. ఆపరేషన్‌ లేకుండా చేసిన బాబా

సాయి సచ్చరిత్ర పారాయణ మంచి ఉద్యోగాన్ని ప్రసాదించింది

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఈ అద్భుతమైన బ్లాగు ద్వారా భక్తుల అనుభవాలను అందరికీ పంచుతున్న బృందానికి నా ధన్యవాదాలు. మా అబ్బాయి ముంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. తను తనకి వస్తున్న జీతంతో సంతృప్తిగా లేడు. అంతేకాకుండా, ప్రమోషన్ విషయంలో తన మేనేజర్ నుండి సరైన స్పందన లేదు. అందువలన మంచి ఉద్యోగం చూసుకుని కంపెనీ మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన అనుభవానికి తగిన ఓపెనింగ్స్ ముంబాయిలో కనిపించలేదు. ఆ సమయంలో నేను శిరిడీ సందర్శించాను. అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు నాకొక బాబా విగ్రహాన్ని కొనాలని అనిపించి ఒక విగ్రహం తీసుకున్నాను. దాన్ని తీసుకుని వెళ్లి మా అబ్బాయి ఇంట్లో పెట్టాను. అప్పటినుండి మా అబ్బాయికి చాలా ఓపెనింగ్స్ కనిపించాయి. తను దరఖాస్తు చేయడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం ప్రారంభించాడు. అయితే అంతకుమించి పురోగతి కనిపించలేదు. ఆ సమయంలో ఒకరోజు నేను సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. అందులో, ప్రతిరోజూ తాను సాయి సచ్చరిత్ర చదవడం యొక్క ప్రాముఖ్యత గురించి, మంచి ఉద్యోగం పొందడానికి అది ఎలా సహాయపడింది అనే విషయం గురించి అక్కడ ఎవరో వ్రాశారు. తరువాత అదేరోజు నేను యూట్యూబ్‌లో భక్తుల అనుభవాలను వింటున్నప్పుడు, అలాంటి అనుభవాన్నే ఒకరు వివరించారు. వాటి ద్వారా సాయిబాబా సందేశం ఇస్తున్నారని నాకనిపించింది. వెంటనే నేను మా అబ్బాయికి, కోడలికి సాయి సచ్చరిత్ర చదవమని చెప్పాను. నిజానికి నేను గత ఒక సంవత్సర కాలంగా ప్రతిరోజూ సాయి సచ్చరిత్ర, స్తవనమంజరి చదువుతున్నాను.

మా అబ్బాయి, కోడలు సచ్చరిత్ర చదవడం ప్రారంభించిన 10 రోజుల్లో మా అబ్బాయి ఒక మంచి పేరున్న కంపెనీలో ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేశాడు. తరువాత తను ఆశించిన దానికంటే ఎక్కువ జీతంతో ఆఫర్ లెటర్ వచ్చింది. నేను చాలా సంతోషించి, వీలైనంత త్వరగా శిరిడీ సందర్శించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోమని, కొత్త కంపెనీలో అంతా సజావుగా సాగేందుకు సాయి ఆశీస్సులు తీసుకోమని మా అబ్బాయికి, కోడలికి సలహా ఇచ్చాను. తోటి సాయిభక్తులను కూడా ప్రతిరోజూ సచ్చరిత్ర ఒక పేజీ లేదా ఒక అధ్యాయం చదవమని సలహా ఇస్తున్నాను. అలా చేయడం వలన ఖచ్చితంగా మనశ్శాంతి లభిస్తుంది. శ్రద్ధ, సబూరీ పెంపొందడానికి సహాయపడుతుంది.


ఆపరేషన్‌ లేకుండా చేసిన బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను 2011 నుండి సాయిబాబాకు భక్తురాలిని. గత 12 సంవత్సరాలుగా మా అమ్మ నాడీ సంబంధిత సమస్య(న్యూరో డిజార్డర్‌)తో బాధపడుతూ మందులు వాడుతోంది. ఆమెకు దగ్గరవాటిని చూడలేని సమస్య కూడా ఉంది. ఇటీవల ఆమె "చాలా దూరమున్నవాటిని, అతి దగ్గరగా ఉన్నవాటిని చూడలేకపోతున్నా"ని చెప్పింది. మేము తనని చెక్-అప్ కోసం డాక్టరు వద్దకు తీసుకొని వెళ్తే, రెండు కళ్ళను స్కాన్ చేయించమని చెప్పారు. స్కాన్ చేస్తే రెటీనా నరాలలో మచ్చ ఉందని, అందువలనే ఆమె దృష్టి అస్పష్టంగా ఉందని చెప్పారు. అయితే అందుకు అసలు కారణం ఏమిటనేది డాక్టరు కూడా కనుగొనలేకపోయారు. కానీ కంటి శుక్లం ఆపరేషన్ చేయవలసి ఉందని చెప్పారు. అమ్మ శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో మేమంతా చాలా ఆందోళన చెంది బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాము. బాబా దయవల్ల నగరంలోని మరో పేరుగాంచిన హాస్పిటల్‌లో సంప్రదించాము. అక్కడ అవే పరీక్షలు, స్కాన్ చేసి, "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదని, అద్దాలు మార్చుదామని, మచ్చ విషయంలో ఆరునెలలకు ఒకసారి చెక్-అప్ సరిపోతుంద"ని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఆ మాటతో మేము చాలా ఉపశమనం పొందాము. ఇదంతా మా సాయిబాబా వల్లే సాధ్యమైంది. ఆయన మాపై కృపతో కరుణించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. కొన్నినెలలుగా నా కొడుకు విషయంలో నాలో నేను బాధపడుతున్నానని మీకు తెలుసు. దయచేసి వెంటనే తనకి నయమయ్యేలా చేయండి బాబా. అది నెరవేరితే నేను సంతోషంగా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను".

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.



సాయిభక్తి సాధన రహస్యం - ‘ఊర’కుండుట తెలుపు ఉత్తమయోగం!




‘ఊర’కుండుట తెలుపు ఉత్తమయోగం!

“గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు! చేయవలసినదంతా నేను చేసి, మిమ్ములను చివరికంటా గమ్యం చేరుస్తాను!”  - అన్న శ్రీసాయి ఉపదేశం ఆయన బోధనసారమని చెప్పొచ్చు! పైకి చూచేందుకు అది ఎంతో తేలికైన సాధనగా కనిపించవచ్చు; ‘ఇంతేనా’ అని అనిపించనూ వచ్చు! లోతుగా యోచిస్తేగానీ అగాధమైన శ్రీసాయిలీలాప్రబోధాలలోని అమూల్య అంతరార్థాలు మనకవగతం కావు. ఎందుకంటే, బాబా చెప్పినట్లు ఆయనకు పూర్తిగా ‘పగ్గాలప్పజెప్పి నిశ్చింతగా ఊరక కూర్చొనడం’ అంత తేలికైన పనేమీ కాదు! మనలోని వివిధ మనోచాపల్యాలు మనలనలా ‘ఊరక’ కూర్చొననివ్వవు. ఈ దృష్ట్యా బాబా బోధించిన ఆధ్యాత్మిక సాధనకు మనోనిగ్రహము, సంయమనము – పరోక్షంగా ఆవశ్యకాలే అవుతున్నాయి. “ఊరకుండుట దెలియ ఉత్తమయోగంబు! మానసంపు కలిమి మధ్యమంబు” అని వేమన యోగీంద్రుడన్నదందుకే. బాబా బోధించిన ‘ఊరక కూర్చొనడమనే ఉత్తమ యోగ’ సిద్ధికి యెటువంటి చాపల్యాలు లేని మానసంపు కలిమి బలిమి మాధ్యమికమైన సాధన మార్గాలు. మన మనోరథాలీడేరాలంటే, మన మనస్సనే రథం యొక్క పగ్గాలు పూర్తిగా బాబాకు అప్పగించాలి. అలా అప్పగించాలంటే, మన మనసు యొక్క పగ్గాలు ముందు మన చేతిలోకి రావాలి కదా? అలా మన మనసు యొక్క పగ్గాలు మనకు స్వాధీనం కావడానికి బాబా బోధించిన అనేక ఉపాయాలలో ఆహార నియమము, నైవేద్య నియమము ముఖ్యమైనవి. అదెలాగో ఇంకొంచెం వివరంగా తెలుసుకొందాం!

మనోనిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో కామాన్ని ధనవ్యామోహాన్ని (-శ్రీరామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే "కామినీ కాంచనాల" ను) జయించడం కష్టమని అందరూ అనుకోవడం కద్దు. ఒకవిధంగా ఇది యదార్థం కూడా. ఈ అవరోధాలను అధిగమించేందుకు మహాత్ములు ఎన్నో ఉపాయాలను, సుళువులను బోధించారు. వాటిలో సాత్త్వికాహారం ఒకటి. అయితే, మహాత్ములు బోధించిన మిగిలిన సాధనోపాయాలన్నింటికంటే ఈ సాత్త్విక ‘ఆహార’ నియమానికి ఎక్కువ ప్రజాకర్షణ, ఆదరణ లభించింది. దాంతో, మనలో సత్త్వగుణాన్ని పెంపొందించే సాత్త్విక పదార్థాలేమిటి? ఏయే పదార్థాలు రజోగుణాన్ని పెంచుతాయి? ఏయే తామస పదార్థాల వలన మనలో తమోగుణం పెరుగుతుంది? సాధకుడు ఏయే పదార్థాలు తినాలి? ఏవి తినవచ్చు? ఏవి తినకూడదు? ఎవరు పెడితే తినవచ్చు? ఎవరితో తినకూడదు? ఎప్పుడు ఎలా తినాలి? ఎప్పుడెప్పుడు తినకూడదు? దైవానికి ఏయే పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి? ఏవి పెట్టరాదు? - వగైరా విచికిత్స విచారణ పెరిగాయి. ఈ సాత్త్వికాహార జిజ్ఞాస వామనపాదంలా పెరిగిపెరిగి క్రమంగా బ్రహ్మజిజ్ఞాసను బలికొంది. తత్ఫలితంగా యీ ఆహార విషయ విచికిత్స కాలాంతరంలో ఏ చికిత్సకు అలవికాని మడి మైల వంటి మూఢాచారాలకు, అస్పృశ్యత వంటి దురాచారాలకు, ‘ఉపవాసతపవాసాది’ వ్యర్థాచారాలకు దారితీసింది. ఈ దుస్థితికి ఆవేదన చెంది ఆహారనియమాల పేర అంటుజాడ్యంలా ప్రబలిన అవివేకపు ఆచారాలను తూర్పారబట్టాడు శ్రీవివేకానందస్వామి. “ఆహార పారిశుద్ధ్య నియమంలోని మూలభావం నశించింది. దాని అక్షరాలు మాత్రం పాటింపబడుతున్నాయి. ఆహార శబ్దానికి ‘ఇంద్రియ విషయములు’ అని శ్రీఆదిశంకరాచార్యులు, ‘అన్నము’ అని శ్రీరామానుజులు అర్థం చెప్పారు. ఈ రెండు దృక్పథాలకు సామరస్యం కల్పించే అర్థాన్ని తీసుకోవాలని నా అభిప్రాయం. ఆహారాన్ని గూర్చిన పరిశుద్ధతాపరిశుద్ధతల విచారంలోనే జీవితకాలమంతా వ్యర్థంగా గడిచిపోతున్నది. ఇంద్రియనిగ్రహమే (ఆహార నియమం యొక్క) ముఖ్యోద్దేశ్యము... మతాన్ని వంట ఇంట్లో బంధించకండి!” ఇది శ్రీవివేకానందుల వివేకవాణి.

ఆత్మోద్ధరణకు వివేకాభ్యాసాలు రెండూ అవసరం. వివేకశూన్యమైన అభ్యాసం క్రమంగా దురభ్యాసంగా మారక తప్పదు. మరైతే, ఏది వివేకం? ఈ అంశాన్ని గూర్చి మరి కొంచెం యోచిద్దాం! ఏది సాత్త్వికాహారం అనే విషయంలో మహాత్ములలోను వివిధ యోగశాస్త్రగ్రంథాల మధ్య ఏకాభిప్రాయం లేదు! సాత్త్వికాహారం ఏది అన్న నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా, సాధనలో సాత్త్వికాహారం అవసరమన్న విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు. మరి ఆధ్యాత్మిక సాధనలో సాత్త్వికాహారం అవసరమన్న విషయం ఎఱిగివుండి కూడా సాధకులు సాత్త్వికాహారాన్నే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందరో సాధకులు సాత్త్వికాహార నియమం పాటించదలచుకొన్నా అట్టే కాలం ఆ అభ్యాసాన్ని కొనసాగించలేకపోవడానికి కారణమేమిటి? వారిలో సత్త్వగుణం లోపించడం వల్లనేనని శాస్త్రం చెప్పే సమాధానం. ఉదాహరణకు సత్త్వగుణప్రధానులు సాత్త్వికమైన ఆహారాన్ని, రాజసులు రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని, తమోగుణ ప్రధానులు తామసపదార్థాలను ఇష్టపడతారని భగవద్గీత. అంటే, సత్వగుణం పెంపొందాలంటే సాత్త్వికాహారం తీసుకోవాలి. సాత్త్వికాహారాన్ని ప్రీతితో తీసుకోవాలంటే సత్త్వగుణముండాలి! చూచేందుకీ సమస్య 'పెళ్ళైతే కాని పిచ్చి కుదరదు; పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు!' అన్నట్లుంది కదూ! ప్రారంభంలో సాధకునికి సాత్త్వికాహారం మీద ప్రీతి వుండదు; ఇష్టం లేకపోయినా, సాత్త్వికాహారాన్నే నియమంగా తీసుకుంటుంటే, కొంతకాలానికి అతనిలో సత్వగుణం పెరిగి, ఆ తరువాత ఆ సాత్త్వికాహారాన్నే ఇష్టపడతాడు - అని అందామా? సరి! ఇష్టంలేక కష్టంతో ఒక నియమాన్ని పాటించడం తామసమైన సాధనని పెద్దల ఉవాచ. అదీగాక, సంతోషము ప్రీతి తృప్తి కలిగించని ఆహారం అసాత్త్వికమే అవుతుంది!

మనం తీసుకొనే ఆహారం సాత్త్వికమైనా అసాత్త్వికమైనా, మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నంతవరకు అది జిహ్వాచాపల్యం క్రిందనే జమవుతుంది. ఒకవేళ సాత్త్వికాహారం పట్ల ‘ఇష్టం’ అనేది జిహ్వాచాపల్య లక్షణం కాదని ఎవరైనా అనవచ్చు! మంచిదే! కానీ, రాజసిక తామసిక పదార్థాల పట్ల మనకుండే చాపల్యమే, అసలైన సాత్వికాహారాన్ని ఇష్టంతో తిననీయకుండా చేస్తుందనేది మాత్రం నిర్వివాదమైన అంశం కదా? అందువల్ల, జిహ్వాచాపల్యాన్ని జయించడం వల్లనే సత్త్వగుణమొచ్చి, ఆ సత్త్వగుణం యొక్క ఒకానొక లక్షణంగా సాత్త్వికాహారాన్ని సహజ ప్రీతితో భుజించగలుగుతాడు. ఇంతకూ ఏతావాతా తేలిందేమంటే, - సంపూర్ణ శరణాగతి భావనను సుగమం చేసే మనో సంయమన సాధనకు ‘సాత్త్వికహారం’ ఉత్తమోత్తమమైన ఉపాయం అని చెప్పడానికి వీలులేదని తేలుతున్నది. మరి ఏది దారి? 

శ్రీసాయిలీలాప్రబోధాలను సునిశితంగా పరిశీలిస్తే అతి సుగమమైన ‘దారి’ మనకు ఇట్టే గోచరిస్తుంది. స్థూలదృష్టికి, బాబా చర్యలు భక్తులకు తమపై ‘నమ్మకం’ కుదిర్చే ‘చమత్కారాలు’ గాను, ఆయన ఉపదేశాలు సామాన్య నీతిబోధకాలైన ‘సూక్తులు’ గానూ కనిపిస్తాయి. “నేనెప్పుడూ చమత్కారాలు చెయ్యను!” అని చెప్పిన శ్రీసాయి, “నా చర్యలు అగాధాలు! ... ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి!” అని కూడా అన్నారు. శ్రీసాయిలీలాప్రబోధాలను శ్రద్ధతో మననం చేస్తూ పోతే, బాబా మహత్తరగాథలు వేదోపబృంహణాలైన (వేదార్థాలను వివరించే) ఆఖ్యానాల్లా, ఆయన సూక్తులు రహస్యార్థ ప్రతిబోధకాలైన యోగసూత్రాల్లా మనకు గోచరిస్తాయి. అటువంటి తత్త్వజిజ్ఞాసతో కూడిన సాయిలీలాప్రబోధాల మననం మనలో సద్వివేకాన్ని, బాబా పట్ల భక్తిశ్రద్ధలను దృఢం చేసి, నిష్టాసబూరీలతో సాయిపథంలో సూటిగా సాగిపోయేలా చేస్తాయిసరి! ఇక, శ్రీసాయిబాబా ఆహారనియమం విషయకంగా ఏం చెప్పారో, ఆయన ఉపదేశాచరణ మనలో సంయమనాన్ని కలుగజేసి క్రమంగా ‘నిశ్చింతగా ఊరక కూర్చొనడమ’నే ఉత్తమయోగాన్ని ఎలా సిద్ధింపజేయగలదో చూద్దాం!

ఆహారనిద్రాభయ మైథునాలు – జీవులకు సహజధర్మాలని ముందే చెప్పుకున్నాం. ఈ నాలుగింటిలో ఆహారము మైథునము బాహ్య పదార్థాలతో వ్యక్తులతో సంబంధం కలిగినవి. అంటే వ్యక్తి యొక్క బాహ్యప్రవృత్తికి సంబంధించినవి. నిద్రాభయాలు మౌళికంగా మనోవృత్తులకు, అంటే, వ్యక్తి యొక్క అంతఃప్రవృత్తితో ముడిపడినవి. మైథునం జీవోత్పత్తికి కారణమైతే, ఆహారం జీవపోషణకు ఆధారం. జీవోత్పత్తికి మూలమైన వీర్యం ఆహారం నుండే ఉత్పన్నమవుతుంది. అందువల్ల మైథునం కంటే ఆహారమే జీవులకు ప్రాథమికావసరమని చెప్పొచ్చు. అంటే, అస్ఖలిత బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం ఉండటం సాధ్యమవుతుంది కానీ, ఆహారం లేకుండా కొంతకాలం కూడా జీవించడం అసాధ్యం.

రసన మంటే నాలుక. జిహ్వ రసనేంద్రియము. ‘రస’మనే పదానికి ద్రవము, రుచి, సారము అనే అర్థాలున్నాయి. మనోదేహాలను పోషించడం ఆహారం యొక్క ప్రధాన ప్రయోజనం. వివిధ భక్ష్యభోజ్యాలను భుజించేటప్పుడు వాటి రుచిని ఆస్వాదిస్తూ మనసు పొందే సుఖానుభూతిని ఆహారం యొక్క అవాంతర ప్రయోజనమనవచ్చు. ప్రాణాధారమైన ఆహారం పట్ల మనసుకు ఆకర్షణను కలుగజేస్తుంది రుచి. ఉదాహరణకు, జీవోత్పత్తి అనే సహజ జీవధర్మానికి సాధనం మైథునము. అందము అలంకరణలు మొదలైనవి దానిని ఆకర్షణీయం చేసే ఉపాయాలు. అంటే, ఆకలి -భోజనం చేయటం అనేవి కామప్రవృత్తి-మైథునక్రియల వంటివైతే, వివిధ రుచులు-వంటకాలు లైంగిక ఆకర్షణను పెంచే సౌందర్య సాధనాలవంటివన్న మాట! మైథునం యొక్క మౌళిక ప్రయోజనాన్ని మరచి, దాని ద్వారా కలిగే సుఖానుభూతి పట్ల మోజు పెరిగితే సహజకామ ప్రవృత్తి కాముకత్వంగా మారుతుంది. అలాగే, ప్రాణాధారమైన ‘ఆహారసేవనాన్ని సుఖవంతం చేసేది రుచి’ - అనే ప్రకృతి ధర్మాన్ని మరచిపోతే, అది రుచులకోసం తినటమనే వికృతిగా పరిణమిస్తుంది. రుచిగా లేకపోతే శరీరానికి అవసరమైనా తినకపోవడం, రుచిగా వుంటే ఆకలి-అవసరం లేకపోయినా అతిగా తినడం, ఒక రుచితో తృప్తిపడలేక,  ఎప్పుడూ నానారుచులకోసం ప్రాకులాడటం జరుగుతుంది. ఈ విపరీత పరిణామమే జిహ్వాచాపల్యం. ఈ చాపల్యాన్ని దూరం చేసుకోవడమే, "రుచులకోసం ప్రాకులాడొద్దు!" అన్న బాబా ఉపదేశంలోని సారాంశము!

బుద్ధుడు చెప్పిన ‘పాఠం’!

“భోజనంలో మితం పాటించు! అవసరమైనంతవరకే మనఃస్ఫూర్తిగా తిను! సరదాకోసం, వ్యసనంకొద్దీ, చాపల్యంకొద్దీ తినొద్దు! దేహసౌందర్యం కోసం తినొద్దు! శరీర సమతుల్యతకు, దేహం ఆరోగ్యంగా స్థిరంగా వుండడానికి, శరీరం వ్యాధిగ్రస్తమవకుండా కాపాడుకోవడానికి, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి అవసరమైనంత ఆహారం గ్రహించు! ఇంతకు మునుపే నీలో చోటుచేసుకొనివున్న (జిహ్వ) చాపల్యాలను అదుపులో వుంచు! క్రొత్త రుచులకు మనసులో చోటివ్వకు! ఇలా చేస్తే నీకు సుఖమయ జీవితం లభిస్తుంది. ఇది ఆహార విషయంగా నేను చెప్పే పాఠం!”

Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 544వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి దివ్యపూజ అనుభవాలు
  2. బాబా అనుగ్రహం

సాయి దివ్యపూజ అనుభవాలు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నేను రెండు అనుభవాలను పంచుకున్నాను. ఇది నా మూడవ అనుభవం. "ఇంత ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!".

దివ్యపూజ చేయాలని నా మనసులో బలంగా ఉన్నప్పటికీ అందరూ ఏవేవో చెప్పి భయపెట్టడం వల్ల ఎన్నోసార్లు మందిరంలో నాకు సాయి దివ్యపూజ పుస్తకాలను ఇచ్చినా నేను తీసుకోలేదు. అలా రెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు ఎవరో పూజా విధానాన్ని కూడా తెలిపి, “నీ కష్టాలు తీరుతాయి” అని చెప్పి దివ్యపూజ పుస్తకం నాకు ఇచ్చారు. ఆ సమయంలో అది బాబా అనుగ్రహంలా తోచి ఆ పుస్తకం తీసుకున్నాను. 2019 మార్చి నెలలో మొదటిసారి దివ్యపూజ ప్రారంభించాను. అప్పుడు బాబా నాకు కొన్ని అనుభవాలు ప్రసాదించారు.
 
మొదటి అనుభవం :
 
మొదటి గురువారం పూజ ప్రారంభిస్తుండగానే ఒక ఆటంకం వచ్చింది. మనసుకి చాలా కష్టంగా అనిపించి ఎంతో ఏడ్చాను. చివరికి బాబా మీద భారం వేసి దివ్యపూజ ప్రారంభించాను. బాబా దయవలన పూజ సంతోషంగా సాగింది. రెండవవారం దివ్యపూజ పూర్తైన తరువాత సచ్చరిత్ర పుస్తకం మీద వెంకటేశ్వరస్వామి రూపం కనపడింది. బాబా నా పూజకు సంతోషించి ఇలా నిదర్శనమిచ్చారని చాలా సంతోషించాను. ఆ ఫోటోను ఈ క్రింద జతపరుస్తున్నాను, మీరు కూడా చూసి ఆనందించండి.
మూడవవారం పూజ యథావిధిగా జరిగింది. నాలుగవవారం పూజ పూర్తిచేసి ధూప్ స్టిక్ వెలిగించాను. ఆ వెలుగులో శివుడి ఆకారం బాబా ఫోటోపైన కనపడింది. ఆ ఫోటోను కూడా జతపరుస్తున్నాను, చూడండి.
చివరివారమైన ఐదవ గురువారంనాడు పూజ చాలా ఆడంబరంగా చేద్దామని అందరినీ ఆహ్వానించాను. యథావిధిగా పూజ చేస్తుండగా, ఎండాకాలం అయినప్పటికీ విపరీతమైన గాలి, వాన మొదలైంది. ఆ కారణంగా కరెంటు పోయింది. నేను ఆహ్వానించినవాళ్ళు వర్షం పడుతున్నందువలన పూజకు రాలేమని చెప్పేశారు. బాబా నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టారని బాధతో ఎంతో ఏడ్చేశాను. అయినా చేసేది లేక దివ్యపూజ ముగించి ఆరతి ఇస్తుండగా బాబా కృపవలన కరెంటు వచ్చింది. ఒక గంట తరువాత వర్షం కూడా తగ్గింది. అందరూ వచ్చి,  బాబాను దర్శించుకొని చాలా సంతోషించారు. తరువాత ప్రసాదాలు తీసుకొని తమతమ ఇళ్ళకు వెళ్లారు. బాబా నాపై ప్రేమతో వర్షాన్ని అపి, భక్తులను పంపి, ప్రసాదం తీసుకొని వెళ్లేలా చేశారని చాలా సంతోషించాను. ఇదంతా ఈ భక్తురాలిపై బాబా చూపిన అపారమైన అనుగ్రహం.

2019 జూలై-ఆగష్టులో రెండవసారి దివ్యపూజ చేసినప్పటి అనుభవం:

నేను తరచూ బాబా పూజ చేసిన తరువాత, బాబా ప్రశ్నలు & జవాబులు యాప్‌లో బాబా సందేశం కోసం చూసేదాన్ని. అలా చూసినప్పుడు దాదాపు ప్రతిసారీ, “బాబాని శ్రీరాముని అవతారంలో చూసుకో!” అని వచ్చేది. అందువలన మొదటివారం పూజలో వడపప్పు, పానకం బాబాకు సమర్పించాను. కాసేపటి తరువాత పూజామందిరంలో ఉన్న వడపప్పు, పానకం తీసుకొచ్చి, ఇంట్లో ఎవరూ లేరని వంటగదిలో ఉన్న బాబా క్యాలెండరు క్రింద పెట్టాను. అందరూ వచ్చాక ప్రసాదం స్వీకరిద్దామని చూస్తే, పానకం ఉన్న పాత్ర ఖాళీగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాను. బాబానే ఆ పానకాన్ని స్వీకరించి మొదటివారమే ఇలా ఆశీర్వదించారని చాలా సంతోషించాను. దివ్యపూజ పూర్తి కావస్తుండగా శిరిడీలో బాబా సేవకు పిలుపు వచ్చింది. బాబా కృపతో తొమ్మిది రోజులపాటు శిరిడీలో బాబా సేవ చేసుకునే అదృష్టం ప్రాప్తించింది.

2020 ఏప్రిల్-మే నెలల్లో మూడవసారి దివ్యపూజ చేసినప్పటి అనుభవం:

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మూడవసారి దివ్యపూజ చేశాను. యథావిధిగా మూడు వారాలు గడచిపోయాయి. మరుసటిరోజు శుక్రవారంనాడు పూజామందిరాన్ని శుభ్రంచేద్దామని బాబా ప్రక్కన ఉన్న స్టాండులో నుండి ఒక గుడ్డ తీస్తుండగా ప్రక్కనే రెండు వేపాకులు కనపడ్డాయి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, మా ఇంటి ప్రాంగణంలో అసలు వేపచెట్లే లేవు. నా జీవితంలోని చేదు(చెడు) రోజులను తొలగించి, మంచి రోజులని ప్రసాదించానని ఆ వేపాకుల ద్వారా బాబా నాకు నిదర్శనమిచ్చారని నేను చాలా సంతోషించాను. అంతా బాబా దయ. ఆయన అనుగ్రహం.

"బాబా! మీకు నా కృతజ్ఞఙ్ఞతలు. మీ ఆశీస్సులు ఎల్లవేళలా మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ!"

బాబా అనుగ్రహం

ఓం శ్రీ సాయిరామ్! నా పేరు సబిత. నేను మొదటసారిగా నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకుంటున్నాను.

మొదటి అనుభవం: 

ఈమధ్య నాకు, మావారికి, మా బాబుకి జ్వరం వచ్చింది. నాకు, మావారికి త్వరగానే జ్వరం తగ్గినప్పటికీ మా బాబుకి తగ్గలేదు. దాంతో కరోనా ఏమోనన్న భయంతో మేము చాలా కంగారుపడ్డాము. ఆ స్థితిలో, "బాబుకి జ్వరం తగ్గేలా చేయమ"ని బాబాను వేడుకున్నాము. బాబా దయవలన కొద్దిరోజుల్లోనే జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ బాబా, థాంక్యూ సో మచ్".

రెండవ అనుభవం:

ఆగస్టు 31న నేను పదవీ విరమణ చేశాను. నేను ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందోనని ఆందోళనపడి, 'అంతా సవ్యంగా జరిగేలా చూడమ'ని బాబాని వేడుకున్నాను. బాబా ఆశీస్సులతో నేను ఊహించని విధంగా నా పదవీ నిరమణ కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది. "థాంక్యూ బాబా! మీ దయవలన నా గ్యాస్ట్రిక్ సమస్య కొంతవరకు తగ్గింది. దానిని పూర్తిగా తగ్గిస్తారని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చేలా అనుగ్రహించండి బాబా".

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.


సాయిభక్తుల అనుభవమాలిక 543వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ప్రసాదించిన మూడు మంచి అనుభవాలు
  2. మరుక్షణమే బాధను తీసేసిన బాబా

బాబా ప్రసాదించిన మూడు మంచి అనుభవాలు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

నేను హైదరాబాద్ నివాసిని. కొన్ని కారణాల వలన నేను నా పేరు వెల్లడించదలుచుకోవడం లేదు. కానీ ఇటీవల కలిగిన మూడు మంచి అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. "అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి బాబా!"

మొదటి అనుభవం - బాబా కృపతో ప్లాటు అమ్మకంలో లభించిన మంచి మొత్తం
 
నేను ఒక ఇంటిని కొన్నాను. ఆ ఇంటి బకాయిలు చెల్లించేందుకు నాకున్న ఒక ప్లాటు అమ్మాలనుకున్నాను. సంవత్సరంపాటు వేచి ఉన్నప్పటికీ ఆ ప్లాటు అమ్ముడుపోలేదు. 2020, జూన్ మొదటివారంలో ఆ ప్లాటు కొనేందుకు ఒక కొనుగోలుదారుడు వచ్చాడు. కానీ అతను తక్కువ మొత్తం చెల్లించి, ప్లాటు కొనుక్కునేందుకు ఆసక్తి కనబరిచాడు. అప్పుడు నేను బాబాను తలచుకొని, "నేను ఈ ధరలో నా ప్లాటు అమ్మాలా? లేక ఇంతకన్నా ఎక్కువ మొత్తాన్ని పొందడానికి ఇంకొంత సమయం వేచి ఉండాలా?" అని అడిగాను. "కొంతసమయం వేచి ఉండమ"ని బాబా సమాధానం వచ్చింది. బాబాపై విశ్వాసంతో నేను అలాగే చేశాను. బాబా దయవల్ల నెలలోపు మరో కొనుగోలుదారుడు వచ్చి ఎక్కువ మొత్తాన్ని చెల్లించి ఆ ప్లాటు తీసుకున్నాడు. బాబా కృపవలన నాకు దాదాపు 80 వేల రూపాయల నుండి లక్షరూపాయల వరకు అదనంగా లభించింది.

రెండవ అనుభవం - అగ్రిమెంట్ కంటే ముందే ముట్టిన కొంత మొత్తం

ప్లాట్ కొనుగోలుదారుడు డబ్బు ఇవ్వడానికి 3 నెలల సమయం తీసుకున్నారు. కానీ ఆలోపే మాకు ఇల్లు అమ్మినవాళ్ళు డబ్బు ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేయసాగారు. అందువలన నేను రోజూ, "బాబా! కొనుగోలుదారుని వద్దనుండి మాకు రావాల్సిన మొత్తాన్ని అగ్రిమెంట్ ప్రకారం అదేరోజు లేదా అంతకంటే ముందు మాకు అందేలా చేయండి"ని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. 2020, ఆగష్టు 30న కొనుగోలుదారుడు కొంత మొత్తాన్ని నా సోదరికి అందజేసినట్లు నాకు సమాచారం అందింది. అంతా బాబా దయ.

మూడవ అనుభవం - కరోనా నుండి రక్షణ:
 
2020, జూలై 29న నాకు, నా భర్తకు జ్వరం వచ్చింది. ఒక్కరోజు వ్యవధిలో మా ఇద్దరు పిల్లలకు కూడా జ్వరం వచ్చింది. వాళ్ళు జ్వరంతోపాటు దగ్గు, జలుబుతో బాధపడ్డారు. నేను చాలా ఆందోళనపడ్డాను. ఆరోజు నా పుట్టినరోజు కూడా. కానీ ఆ పరిస్థితుల కారణంగా పుట్టినరోజు జరుపుకోలేకపోయాను. అసలే కరోనా సమయం. నా భర్త తన వృత్తిరీత్యా రోజూ ఎంతోమందిని కలుస్తుంటారు. పైగా ఆయన చాలా తక్కువ నివారణచర్యలు పాటిస్తారు. అందువలన నేను చాలా ఆందోళనచెందాను. దానికితోడు మెడికల్ షాపువాళ్ళు ఐడి కార్డు లేకుండా మందులు ఇవ్వకపోవటంతో మందులు కూడా దొరకని పరిస్థితి. ఏమి చేయడానికీ తోచక నేను, "బాబా! ఒక్కరోజులో మా అందరికీ నయం కావాలి. కరోనా మాపై ప్రభావం చూపకూడదు" అని బాబాను ప్రార్థించాను. తరువాత నా భర్త హాస్పిటల్‌కి వెళ్లి రక్తపరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్షలో తనకు వచ్చింది సాధారణ జ్వరమని నిర్ధారణ అయ్యింది. బాబా దయవలన నాకు, నా పిల్లలకు ఒక్కరోజులో నయమైంది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అనుగ్రహం మీ బిడ్డలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను".

మరుక్షణమే బాధను తీసేసిన బాబా

ఓం సాయిరామ్! 'సాయి మహారాజ్ సన్నిధి'కి వందనాలు. నా పేరు లలిత. ఇదివరకు నేను కొన్ని అనుభవాలను ఈ బ్లాగ ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈమధ్య గ్యాస్ లాగా ఫార్మ్ అయి నా పొట్టంతా పట్టేసింది. అందువల్ల నేను చాలా ఇబ్బందిపడ్డాను. అప్పుడు బాబాను తలచుకొని, "బాబా! ఈ బాధనుండి నాకు విముక్తిని ప్రసాదించండి. నా కష్టం తీరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, కొద్దిగా ఊదీ తీసుకొని పొట్టపై రాసుకున్నాను. మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగాను. బాబా ఎంత అద్భుతం చేశారంటే, మరుక్షణమే ఆయన నా బాధని తీసేశారు. పట్టలేని ఆనందంతో ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "ఎప్పుడూ నాతోనే ఉండండి బాబా. ఐ లవ్ సో మచ్ బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo