1. బాబా అనుగ్రహంతో సానుకూలంగా జరిగిన కొన్ని అనుభవాలు
2. తలచిన తక్షణం సహాయం అందిస్తున్న బాబా
3. ప్రాణభిక్షను, ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
బాబా అనుగ్రహంతో సానుకూలంగా జరిగిన కొన్ని అనుభవాలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన మన సాయితండ్రికి పాదాభివందనాలు. ఈ సాయి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్నిటిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
మొదటి అనుభవం:
ఇటీవల మేము వేరే ఊరిలో కొంత పొలాన్ని కొన్నాము. ఆ పొలం రిజిస్ట్రేషన్ కోసం కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బును వేరే ఊరికి పంపించాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలకొనివున్న కరోనా పరిస్థితుల వల్ల, పైగా ఎలక్షన్స్ కూడా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు వేరే ఊరికి పంపించాలంటే భయమేసి నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ డబ్బు వాళ్ళకు చేరేవరకు నీవు తోడుగా ఉండి, జాగ్రత్తగా డబ్బును వాళ్ళకు అందజేయి. నా ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. మాపై కరుణతో ఆ పొలం బాధ్యతనంతా బాబా తీసుకున్నారు. బాబానే మావాళ్ళకు తోడుగా వెళ్ళి డబ్బు ఇచ్చి వచ్చారు. డబ్బు జాగ్రత్తగా చేరాల్సిన చోటికి చేరడంతో ఎంతో భారం తగ్గినట్లనిపించి మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మరొక అనుభవం:
ఈమధ్య నాకు, మావారికి కొద్దిగా నీరసంగా అనిపించింది. దానితో మా బాబు, “ఎందుకైనా మంచిది, అందరం కోవిడ్ టెస్ట్ చేయించుకుందాం” అన్నాడు. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “టెస్ట్ రిపోర్టు నెగిటివ్ రావాలి బాబా. నెగెటివ్ వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి, అందరికీ బాబా ఊదీని ఇచ్చాను. తరువాత అందరం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాము. నాకు, మావారికి, మా కోడలికి నెగెటివ్ వచ్చింది. కానీ మా బాబుకి కొద్దిగా కౌంట్ ఎక్కువ అని వచ్చింది. దాంతో, ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారని మేము కంగారుపడ్డాము. వెంటనే ఎందుకైనా మంచిదని బాబు వేరే రూములో ఉండి మరునాడు మరలా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఈసారి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ మరలా అనుమానంతో మూడోరోజు కూడా టెస్ట్ చేయించుకున్నాడు. మళ్ళీ నెగిటివ్ వచ్చింది. మా ఆనందం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. బాబానే ఎంతో కరుణతో మమ్మల్ని కాపాడారు.
ఇంకొక అనుభవం:
ఇటీవల మా పిల్లలు అమెరికా వెళ్ళారు. వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే కంపల్సరీగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అందువల్ల మరలా అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయతో అందరికీ నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. తరువాత పిల్లలు అమెరికా బయలుదేరేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! పిల్లలు అమెరికా వెళుతున్నారు. మీరే వారికి తోడుగా ఉండి వారికి ఇమ్మిగ్రేషన్ ప్రాబ్లమ్ గానీ, కరోనా ప్రాబ్లమ్ గానీ ఏమీ లేకుండా జాగ్రత్తగా అమెరికా చేర్చండి. నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాన”ని ప్రార్థించాను. బాబా మీద భారం వేస్తే మనకు భయమేల? బాబా దయవల్ల పిల్లలకు ఏ ఇబ్బందీ రాలేదు. వాళ్ళు క్షేమంగా అమెరికా చేరుకున్నారు. అయితే, పాస్పోర్ట్ విషయంలో మా కోడలికి కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చిందట. ఎయిర్పోర్ట్ అధికారులు చాలా హడావిడి చేశారట. “మీరు మా ఆఫీసరుతో మాట్లాడాలి” అన్నారట. దాంతో మా కోడలు చాలా భయపడిందట. అయితే, ఆ ఆఫీసరు వచ్చి అన్నీ పరిశీలించి చూసి, ‘నీకు ఏమీ ఫరవాలేదు’ అని చెప్పటమే కాకుండా, యు.ఎస్.ఏ. లో ఈ విషయం గురించి ఎలా చెప్పాలో వివరించి, తనకు ధైర్యం చెప్పి మరీ పంపించారట. మీ అందరికీ ఆ ఆఫీసరు ఎవరో అర్థమైంది కదా మిత్రులారా? ఆయన మన బాబానే!
చివరిగా ఒక విషయం:
ఈమధ్య మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక పెళ్ళికి వెళితే తన బంగారు లాకెట్ పోయిందట. వాళ్ళు నాకు ఫోన్ చేసి, “అందరూ మీకు ఫోన్ చేయమన్నారు. మీరు బాబాను ప్రార్థిస్తే ఆ లాకెట్ దొరుకుతుందని మా ఆశ. ఆ బంగారు లాకెట్ దొరకాలని మీరు బాబాను ప్రార్థించండి” అని చెప్పారు. మిత్రులారా, మన బాబాపై వాళ్ళకు నమ్మకం ఉన్నందువల్ల, దయచేసి మీరందరూ ఆ బంగారు లాకెట్ దొరకాలని బాబాను ప్రార్థించమని మనవి చేస్తున్నాను. దీన్ని బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. అందుకే మీ అందరినీ అర్థిస్తున్నాను. తప్పయితే నన్ను క్షమించమని అందరినీ ప్రార్థిస్తూ..
మీ
సాయిపాదదాసి.
తలచిన తక్షణం సహాయం అందిస్తున్న బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, మే 26న మా అబ్బాయి వివాహం నిశ్చయించాము. కానీ లాక్డౌన్ పరిస్థితుల వల్ల వివాహం వాయిదా వేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ అమ్మాయి తరఫువాళ్ళు, "మాకు ఈ ముహూర్తమే బాగుంది. ఇది కాదంటే జూన్ 4న మరొక ముహూర్తం ఉంది" అన్నారు. జూన్ 4 అయినా కూడా లాక్డౌన్ సమస్య ఉంటుంది. మేము మా ఊరిలో పురోహితుడిని అడిగితే, "రెండు నెలల తర్వాత ఆగస్టులో అమ్మాయికి, అబ్బాయికి అనుకూలంగా మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి వివాహం జరిపించవచ్చు" అని చెప్పారు. కానీ అమ్మాయి తరఫువాళ్ళు వాళ్ళుండే సిటీలో పురోహితుడిని అడిగితే, "ఈ రెండు ముహుర్తాలు కాకుండా ఆగస్టులో ఏ ముహూర్తాలూ లేవనీ, మళ్ళీ డిసెంబరులోనే ముహూర్తం ఉంద"నీ చెప్పాడు. డిసెంబరులోని ముహూర్తం అంటే ఆలస్యం అవుతుందని, జూన్ 4న వివాహం జరిపిద్దామని అమ్మాయి తల్లి పట్టుబట్టింది. మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోక చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ టెన్షన్ నేను భరించలేకపోయాను. ఇంక నేను, "బాబా! ఈ పరిస్థితుల్లో నీవే దిక్కు. నువ్వే మార్గం చూపాలి" అని బాబాకి మొరపెట్టుకుని బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ పూర్తయ్యేలోపే బాబా అనుగ్రహించారు. హఠాత్తుగా అమ్మాయి తరఫువాళ్ళు వేరే పురోహితుడిని సంప్రదించారు. ఆ పురోహితుడు మా పురోహితుడు చెప్పినట్లే చెప్పాడు. అలా బాబా పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చి నా టెన్షన్ తొలగించారు. తల్లి, తండ్రి లేని నాకు మనోధైర్యాన్నిచ్చారు. ఇంకో విషయం, ముందురోజు కలలో 'నన్ను మర్చిపోయావా?' అన్నట్టు బాబా నాకు దర్శనమిచ్చారు. "ధన్యవాదాలు బాబా. అన్నీ మంచిగా జరిగేటట్లు చూడండి బాబా".
ఈమధ్య మరోసారి బాబా నాకు కలలో దర్శనమిచ్చి నాచేత కుంకుమార్చన చేయించుకున్నారు. నేను ధన్యురాలిని. బాబాను తలచిన వెంటనే అనుగ్రహించిన మరో అనుభవం గురించి ఇప్పుడు చెప్తాను. మా అబ్బాయి మేనేజరుగా ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రస్తుత కరోనా కాలంలో మేనేజర్ స్థాయి ఉద్యోగస్థుల నెల జీతం కరోనా సహాయార్థం ఇవ్వాలనుకుంటున్నట్లు పైస్థాయి అధికారులు ఈమధ్య చెప్పారు. ఆ విషయం మా అబ్బాయి నాతో చెప్పాడు. మా పిల్లల జీతం, మరికొంత మొత్తం కలిపి నేను ప్రతినెలా చీటీ కడుతూ సేవ్ చేస్తున్నాను. మా అబ్బాయికి జీతం రాకపోతే దాదాపు 40 వేల రూపాయలు నేను సర్దుబాటు చేయాలి. అందువలన 'అంత పెద్ద మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలా' అని నేను కలవరపడ్డాను. అప్పుడు, "బాబా! నీవే దిక్కు, కనీసం సగం జీతమన్నా వచ్చేటట్లు చేయండి. అలా వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. ఎంత విచిత్రం అంటే, బాబుకి సగం జీతంతోపాటు 60,000 రూపాయల బోనస్ వచ్చింది. బాబా నన్ను ఎంతలా కరుణించారో చూడండి. "బాబా! ఎలా మిమ్మల్ని తలచినా మీరు తక్షణం మాకు సహాయం చేస్తున్నారు. మీ బిడ్డల్లా మమ్మల్ని చూసుకుంటున్నారు. మీరే నాకు దిక్కు తండ్రీ. నా మనస్సు ఎప్పుడూ మీ మీద నిలిచేటట్లు అనుగ్రహించండి బాబా"
ప్రాణభిక్షను, ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
నా పేరు నీరజ. మాది కడప జిల్లాలోని బద్వేలు. నాకు బాబా గురించి మొదట పరిచయం చేసింది మా మేనమామగారి భార్య భ్రమరాంబగారు మరియు నా ఆప్తమిత్రురాలు ధనమ్మ అక్కగారు. వారిద్దరూ బాబాకు చాలా గొప్ప భక్తులు. నాకు ప్రాణమున్నంతవరకు వాళ్ళిద్దరికీ నేను ఋణపడివుంటాను. 2008వ సంవత్సరంలో మానసికంగా నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. చాలా డిప్రెషన్లో ఉన్న ఆ సమయంలో మా మేనత్త ‘సచ్చరిత్ర పారాయణ చేయమ’ని చెప్పి, ఆ గ్రంథాన్ని నాకు ఇచ్చింది. సరేనని సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. మొదటిసారి పారాయణ చేయడంతోనే నాకే తెలియకుండా నాలో ధైర్యం పెరిగింది. బాబా దయవలన కొద్దిరోజుల్లోనే నా మానసిక ఆరోగ్యం మెరుగుపడింది. అప్పటినుంచి బాబాపై నాకు నమ్మకం ఏర్పడింది. 2014లో ఒకసారి నా ఎడమచేయి చాలా నొప్పిగా అనిపించింది. టాబ్లెట్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు. గంటగంటకూ నొప్పి పెరుగుతూ ఉండేసరికి నాకు ఏమి చేయాలో తోచలేదు. మావారికి చెబుదామంటే, నా నోటినుండి మాట కూడా రావడం లేదు. చాలా భయం వేసింది. ప్రాణాలు పోయేంత నొప్పితో విలవిలలాడిపోయాను. అటువంటి సమయంలో ‘బాబానే నాకు దిక్కు’ అనుకుని బాబా నామస్మరణ చేస్తూ, "బాబా! నా ప్రాణాలు కాపాడండి" అని వేడుకున్నాను. దయామయులైన బాబా నా ప్రార్థన ఆలకించి ఉదయానికల్లా నా చేయినొప్పి తగ్గేలా అనుగ్రహించారు. నిజంగా బాబా నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఇలా బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. "బాబా! మీ అనుగ్రహం సదా నాపై ఉండాలి తండ్రీ".
ఇది ఇటీవల జరిగిన అనుభవం. 2021, జూన్ 12 ఉదయం నాకు 'సాయి స్తవనమంజరి' పారాయణ చేయాలని సంకల్పం కలిగింది. సాయంత్రం బాబాకు పూజచేసి స్తవనమంజరి పఠిద్దామని అనుకున్నాను. అయితే నేను సాయంత్రం పూజ మొదలుపెట్టేలోపే బాబా అనుగ్రహాన్ని ఒక శుభవార్త రూపంలో విన్నాను. మా బావగారి అబ్బాయి చాలా సంవత్సరాల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు ఉద్యోగం వస్తే కుటుంబానికి చాలా అండగా ఉంటుందని మేము బాబాకి మొరపెట్టుకుంటుండేవాళ్ళము. నేను సాయంత్రం పూజ మొదలుపెట్టే ముందు తను ఫోన్ చేసి, "నాకు ఉద్యోగం వచ్చింది. ఈరోజే ఉద్యోగంలో చేరాను" అని చెప్పాడు. అది వింటూనే బాబా మా మొర ఆలకించారని చాలా సంతోషంగా అనిపించి సాయి మహరాజుకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! మీ కృప ఎల్లప్పుడూ మాపై ఇలాగే ఉండాలి. ప్రాణమున్నంతవరకు నేను మీ పాదాలను వదలను తండ్రీ".