సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీరావుసాహెబ్ యశ్వంత్ జనార్ధన్ గల్వంకర్



శ్రీసాయిబాబా భక్తులలో ఒకరైన శ్రీరావుసాహెబ్ యశ్వంత్ జనార్ధన్ గల్వంకర్ శ్రీసాయి సచ్చరిత్ర రచయిత శ్రీదభోల్కర్ (హేమాడ్‌పంత్) గారి అల్లుడు. ఇతను బొంబాయి సచివాలయంలో హోంశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేశాడు. కొంతకాలం శిరిడీ సంస్థాన్ మండలి సభ్యులుగా, సాయిలీల పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. బాబాతో దభోల్కర్‌కి ఉన్న అనుబంధం సహజంగానే గల్వంకర్‌ని బాబా వైపు ఆకర్షించేలా చేసింది. బాబా గొప్ప మహాత్ములని విన్నప్పటికీ ఏ విధమైన ప్రాపంచిక, పారమార్థిక ప్రయోజనాన్ని ఆశించక అతను మొదటిసారి 1911లో తన మామగారు, మరికొందరు బంధువులతో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. బాబా దర్శనానికి వాడా నుండి మశీదుకు వెళ్తుండగా, బాబా దక్షిణ అడుగుతారనే విషయం అతనికి దారిలో గుర్తొచ్చి, తిరిగి వాడాకెళ్ళి రెండు రూపాయలు తీసుకొని మశీదుకు వెళ్ళాడు. బాబాను దర్శించినప్పుడు వారు అతనిని దక్షిణ అడిగారు. అతడు బాబాకు రెండు రూపాయలు సమర్పించాడు. అతనివ్వదలిచిన ఆ రెండు రూపాయలు మాత్రమే తీసుకొని బాబా ఇంక అతనిని దక్షిణ అడగలేదు. వారి అంతర్యామిత్వానికి అతడు ముగ్ధుడయ్యాడు. కానీ బాబాపట్ల పూర్తిగా ఆకర్షితుడు కాలేదు. నాలుగైదుసార్లు బాబాను దర్శించాక అతనికి బాబాపట్ల ఆసక్తి పెరిగింది.

ఒకసారి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి రెండు రూపాయలు దక్షిణ అడిగారు. మరుసటిరోజు అతను వాటిని మానియార్డరు ద్వారా శిరిడీ పంపాడు. ఆ కలలో బాబా కేవలం దక్షిణ అడగటమే కాక అతనిని నీతి, నిజాయితీలతో మెలగమని; సచ్ఛీలత, ఇంద్రియనిగ్రహము కలిగి ఉండమని రెండు విలువైన ఆదేశాలు ఇచ్చారు. అతడు ఆ ఆదేశాలను శ్రద్ధ, పట్టుదలతో ఆచరించాడు.

బహుశా 1917లో గల్వంకర్ మరలా బాబాను దర్శించినప్పుడు బాబా తమ వరదహస్తాన్ని అతని తలపై ఉంచారు. బాబా హస్తస్పర్శ అతనిపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. అతను తనను, పరిసరాలను మరచి ఆనందపరవశ్యంలో మునిగిపోయాడు. అప్పుడక్కడున్న భక్తులతో బాబా అతని పూర్వజన్మ వృత్తాంతాల గురించి వివరిస్తూ, ‘పూర్వజన్మలో అతను నీతి, నిజాయితీ గల సచ్ఛీలుడని, ఆ జన్మలో అతను పొందిన స్థితులు, రూపాలననుసరించి తామే ప్రస్తుత జన్మలో అతనిని అతని తల్లి గర్భంలో ప్రవేశపెట్టామని, ఈ జన్మలో కూడా అతను నీతి, నిజాయితీలను నిలబెట్టుకుంటున్నాడ’ని చెప్పారు. అంటే, బాబా తమ భక్తుల పుట్టుకలు, జన్మల గురించి శ్రద్ధ వహిస్తారన్న మాట! 

బాబా దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటినుండి గల్వంకర్ దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లింది. భగవద్గీతను, భాగవతంలోని ఏకాదశ స్కంధమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యపారాయణ చేయసాగాడు. ఆ గ్రంథాలను పారాయణ చేయమని దీక్షిత్, జోగ్‌లను ఆదేశించినట్లు బాబా అతనిని ఆదేశించలేదు. కానీ శ్రీసాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే తాను పారాయణ చేస్తున్నానని అతని నమ్మకం. క్రిస్మస్ మరియు ఇతర సెలవులప్పుడు అతను భక్తివిశ్వాసాలతో బాబా దర్శనానికి శిరిడీ వెళ్తుండేవాడు. బాబా ఎప్పుడూ అతనిని సెలవులకి మించి ఎక్కువ రోజులు శిరిడీలో ఉంచేవారు కాదు. బాబా అతనికెప్పుడూ అద్వైతము, ఆత్మసాక్షాత్కారము మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి శిరిడీ వెళ్ళినప్పుడు, “నేను ఈ మూడున్నర మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాదు. నేను అంతటా ఉన్నాను. ప్రతిచోటా నన్ను దర్శించవచ్చు” అని బాబా చెప్పడం అతను విన్నాడు. చిన్నవయసు, ఉద్యోగం మరియు ఇతర విషయాలపట్ల ఆసక్తి కారణంగా బాబా మహాసమాధి చెందక ముందు అతడు వారితో సన్నిహిత బంధాన్ని ఏర్పరుచుకోలేకపోయాడు. అందుకతడు బాబా సమాధి చెందాక ఎంతో బాధపడేవాడు.

1921లో గల్వంకర్ తన కుటుంబంతో కాశీ ప్రయాగ యాత్రలకు వెళ్ళాడు. ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ దర్శించి భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు, “మాకు ఎవరైనా సత్పురుషుల దర్శనం లభించేటట్లు అనుగ్రహించమ”ని అతను బాబాను ప్రార్థించాడు. తరువాత అతను ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న గైడుతో, “ఇక్కడ మహాత్ములైవరైనా ఉంటే వారి దర్శనానికి తీసుకెళ్లమ”ని చెప్పాడు. వాళ్ళు భరద్వాజాశ్రమం విడిచిన నాలుగైదు నిమిషాలకు గైడు ఒకచోట టాంగాను ఆపించి అక్కడున్న ఒక మహాత్ముని చూపించి, “వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తూ ఉంటారు. వారు ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరి వద్దనుండి డబ్బు పుచ్చుకోరు” అని చెప్పాడు. అయితే, బాబాను ప్రార్థించిన కొద్దినిమిషాలకే ఆ మహాత్ముడు కనపడటంతో గల్వంకర్ హృదయం ఆనందంతో ఉప్పొంగి, గైడు వెళ్లవద్దని వారిస్తున్నా లెక్కచేయక ఆ మహాత్ముడిని సమీపించి నమస్కరించాడు. వారు అతనిని కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి, “రా, బిడ్డా” అంటూ ఆహ్వానించారు. అంతలో గైడు వారిస్తున్నా వినకుండా గల్వంకర్ భార్య, తల్లి, మిగిలినవారంతా కూడా వెళ్లి ఆ మహాత్మునికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి గల్వంకర్ వద్ద పూలు, పండ్లు వంటివేవీ లేనందువల్ల తన దగ్గరున్న మూడణాలు వారికి దక్షిణగా సమర్పించాడు. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ అతనిచ్చిన నాణాలను ఎంతో ప్రసన్నంగా స్వీకరించి జేబులో వేసుకున్నారు ఆ మహాత్ముడు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ మహాత్ముని రూపంలో బాబానే తమను ఆదరించి దక్షిణ స్వీకరించారని గల్వంకర్ భావించాడు.

1932లో ఒకరోజు గల్వంకర్‌కు బాబా స్వప్నదర్శనమిచ్చి, “నీకు ఏం కావాలి?” అని అడిగారు. అతడు, “నాకు ప్రేమ కావాలి. మీ ప్రేమ తప్ప నాకు మరేదీ వద్దు” అని చెప్పాడు. అప్పుడు బాబా, “నీకు ప్రేమ లభిస్తుంది” అని అభయమిచ్చి అదృశ్యమయ్యారు. అప్పటినుంచి అతను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమవాహిని అతనిలో పరవళ్లు త్రొక్కేది. అంతటి భాగ్యశాలి గల్వంకర్! బాబా ప్రసాదించిన దానితో అతడు సంతృప్తికరమైన జీవితాన్ని సాగించాడు.

సోర్స్: http://saiamrithadhara.com/mahabhakthas/rao_sahib_yashwant.html

3 comments:

  1. Om SaI
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thankyou sister

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo