ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి ఉంటే కానిది ఏమీ లేదు!
2. జ్యోతిర్లింగ దర్శనభాగ్యం ప్రసాదించిన బాబా
సాయి ఉంటే కానిది ఏమీ లేదు!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. అందరికీ నమస్తే! నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఆల్టెన్ కంపెనీలో పనిచేశాను. దురదృష్టవశాత్తు నేను ఆ కంపెనీలో చేరి 8 నెలలు కాకముందే నా క్లయింట్తో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ముగిసింది. దాంతో నేను బెంచి మీద ఉండాల్సి వచ్చింది. చివరికి కంపెనీవాళ్ళు 3 నెలల నోటీసు పీరియడ్ ముగిసేలోపు వేరే ఉద్యోగం వెతుక్కోమని చెప్పారు. దాంతో నేను ఒకపక్క నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మరోపక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. కానీ నాకు హెచ్ఆర్ కాల్స్ రాలేదు. అప్పుడు నేను సాయిబాబాను ప్రార్థించడం ప్రారంభించాను. తర్వాత బాబా దయతో నాకు ఇంటర్వ్యూ కాల్స్ రావడం మొదలై 2, 3 కంపెనీలకు ఎంపికయ్యాను. కానీ ఆఫర్ లెటర్ రాలేదు. నేను బాబాతోపాటు హనుమాన్ని కూడా ప్రార్థించాను. ఆ 2-3 కంపెనీలు ప్రతిస్పందించాయి. నేను తుది నిర్ణయం తీసుకొనే ముందు ఏ కంపెనీని ఎంచుకోవాలని సాయిని అడిగి సాయి సూచననుసరించి 'బిగ్ 4' కంపెనీలో చేరి మంచి గుర్తింపు పొందాను. గతంలో సాయి ఆల్టెన్ కంపెనీ ఎంచుకోవద్దని సూచించినప్పటికీ నేను ఆ కంపెనీలో చేరి సాయి మాట వినకపోవడం వల్ల కొన్ని నెలల్లోనే ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చింది. అది అర్థమయ్యాక నాకు సాయిపై నమ్మకం పెరిగి ఇంకెప్పుడూ సాయి వద్దని పని చేయకూడదని నిశ్చయించుకున్నాను. నన్ను క్షమించి అన్ని ఇబ్బందులలో సహాయాన్ని, బలాన్ని ఇస్తున్న సాయికి ధన్యవాదాలు.
ఇప్పుడు మా అమ్మ అనుభవాలు ఆమె మాటల్లోనే చదవండి. అందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళై 26 సంవత్సరాలైన మాకు సొంతిల్లు లేదు. మాకు ఒక స్థలం ఉంది. దాంట్లో ఇల్లు కట్టాలని మావారు అనేవారు. కానీ ఆ స్థలంకి లోన్ రాదు, మొత్తం డబ్బులు పెట్టి కట్టే స్తోమత లేదు. అందుచేత ఫ్లాట్ తీసుకోవాలని ఉండేది. కానీ మావారికి ఫ్లాట్స్ ఇష్టముండేది కాదు. నేను సాయిని, ఇంకా దేవుళ్లందరినీ, "మాకు ఇంతవరకు సొంతిల్లు లేదు. మాకు ఒక ఇల్లు ప్రసాదించండి" అని వేడుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా 2024, నవంబరులో మావారు మాకున్న లారీ అమ్మేశారు. ఆ డబ్బులు వచ్చాక నేను మావారు ఆ డబ్బు దేంట్లో పెట్టుబడి పెడతారో అని భయపడి, "సాయీ! ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. సాయి దయ చూపారు. అప్పటివరకు ప్లాట్స్ అంటే ఇష్టపడని మావారు ఒక ప్లాట్ చూడడం, అది నచ్చడం, తన దగ్గరున్న డబ్బు నుండి కొంత అడ్వాన్స్ కట్టడం జరిగిపోయాయి. 15 రోజుల్లో లోన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంక్షన్ అయి 2025, జనవరి 10వ తారీఖు కల్లా రిజిస్ట్రేషన్ కూడా అయింది. సాయి ఉంటే కానిది ఏమీ లేదు.
2025, ఫిబ్రవరి 9న మా అమ్మ చనిపోయింది. ఆ సమయంలో మావారు ఊర్లో లేరు. కొన్ని కారణాల వల్ల రాలేదు. ఆ విషయమై నేను, మా పిల్లలు, మా పుట్టింటివాళ్ళు అందరం చాలా బాధపడ్డాం. నా అన్నదమ్ములు మీ కార్యక్రమాలకు మేము రామన్నారు. నేను, "ఏమి చేయగలను సాయి?" అని సాయితో అనుకున్నాను. సరిగ్గా నాలుగు నెలల తర్వాత మే 9న మేము మా ఇంటి గృహప్రవేశం పెట్టుకున్నాము. అప్పుడు, "గృహప్రవేశానికి మా పుట్టింటి తరఫువాళ్ళు రాకపోతే ఎలా తండ్రీ? ఎటువంటి గొడవలు, ఆటంకాలు లేకుండా కార్యక్రమం సక్రమంగా జరిగేలా చేయండి" అని సాయిని ప్రార్థించాను. సాయి దయవల్ల నా అన్నదమ్ములు గృహప్రవేశానికి వచ్చారు. అసలు రామన్నవాళ్ళు రావడమే కాకుండా ఇంటి పనులు దగ్గరుండి చేయించి మొత్తం కార్యక్రమమంతా జరిపించారు. ఇది సాయి కృపాకటాక్షం. "ధన్యవాదాలు సాయి".
జ్యోతిర్లింగ దర్శనభాగ్యం ప్రసాదించిన బాబా
సాయి భక్తులకు ప్రణామాలు. నా పేరు మణిమాల. నేను ఉపాధ్యాయురాలిని. 2026, ఫిబ్రవరి 19న మధుర, రామేశ్వరం వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలని మా కుటుంబసభ్యులందరికీ విమాన టికెట్లు బుక్ చేసుకున్నాము. కానీ అనుకోకుండా మా పెద్ద పాప కొడుకుకి డెంగ్యూ జ్వరం వచ్చి ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. రోజురోజుకు తన ప్లేట్లెట్లు తగ్గుతుంటే మేము మా పర్యటన మీద ఆశ వదులుకొని, "మనవడికి మంచిగా ఉంటే చాలు దేవా" అనుకున్నాము. కానీ సాయి నిజంగా మాకు జ్యోతిర్లింగ దర్శనభాగ్యం ప్రసాదిస్తారని పూర్తి విశ్వాసం ఉండింది. అదే నిజమైంది. ఫిబ్రవరి 19, మధ్యాహ్నం 12.30కి ఫ్లైట్ అంటే ఉదయం 9 వరకు మేము హాస్పిటల్లోనే ఉండగా డాక్టర్ వచ్చి, "మీరు అనుకున్నట్లు పర్యటనకి వెళ్ళండి. ఏమీ కాదు" అని చెప్పారు. మేము డాక్టర్ చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని దేవాలయాలు తృప్తిగా దర్శించుకొని క్షేమంగా ఇల్లు చేరాము. "ధన్యవాదాలు బాబా. మీ దయతోనే ఇది సాధ్యమైంది. సదా మీ భక్తులను సన్మార్గంలో నడిపించి ముక్తిని ప్రసాదించు తండ్రీ".
