సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 330వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా అండగా ఉన్న బాబా 

ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

సాయిరాం! నేను సాయి భక్తురాలిని. నా చిన్నతనంలో మా అమ్మానాన్నలు ఎక్కువగా అమ్మవారిని, శివుడిని కొలిచేవారు. అందువల్ల నేను కూడా ఎక్కువగా వాళ్లకే దణ్ణం పెట్టుకునేదాన్ని. నాకు బాబా గురించి ఏమీ తెలియదు, అసలు బాబా ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి నా జీవితంలోకి బాబా ఎలా ప్రవేశించారో, అడుగడుగునా నాకు ఎలా అండగా ఉంటున్నారో నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.

నాకు చిన్నప్పటినుండి అన్నీ కష్టాలే. ఏరోజూ సంతోషంగా లేను. మా నాన్నగారు నన్ను బాగా క్రమశిక్షణతో పెంచాలని చూశారు. ఆ క్రమంలో నన్ను బాగా కొట్టేవారు కూడా. ఆ కారణంగానేమో నాకు తెలియకుండానే చిన్నవయస్సునుండే  నాలో భయాందోళనలు గూడుకట్టుకున్నాయి. అందువలన నా తల్లిదండ్రుల దగ్గర ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు. మా స్వంత ఊరు నెల్లూరే అయినా మేము ఎక్కువగా సౌధి అరేబియాలో ఉండేవాళ్ళం. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మేము నెల్లూరు వచ్చి స్థిరపడ్డాము. అనుకోకుండా మా సందు ఎదురుగా ఒక బాబా మందిర నిర్మాణం జరిగింది. నాకు బాబా గురించి ఏమీ తెలియకపోయినా, రోజూ ఆ మందిరానికి వెళ్లి బాబాను ప్రార్థించి, నా కష్టాలన్నీ ఆయనతో చెప్పుకొని బాధపడేదాన్ని.

నేను బీ.టెక్ లో ఉన్నప్పుడు నాన్నకి నాకు మధ్య చాలా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఆ క్రమంలో నేను బీ.టెక్ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. తరువాత నాన్న బిజినెస్‌ నేను చూసుకుంటూండేదాన్ని. ఆ సమయంలో నాకు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నేను బాబా దగ్గరికి వెళ్లి, "నాకు మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు బాబా, ఒక సంవత్సరంలోపు నాకు పెళ్ళి అయిపోయేలా చూడండి. లేకుంటే నేను ఇంకెప్పుడూ మీకు దణ్ణం పెట్టను" అని చెప్పుకున్నాను. బాబా నా కోరిక తీర్చలేదు. నాకు కోపం వచ్చి బాబాకు దణ్ణం పెట్టడం, ప్రార్థన చేయడం మానేశాను. కానీ, ఎప్పుడూ బాబానే తలచుకొనేదాన్ని. బీ.టెక్ ఆపేసిన రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ చదువుకుందామని డిగ్రీలో చేరాను. ఇంట్లోనే చదువుకొని పరీక్షలకి హాజరయ్యేదాన్ని. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా నాకు పెళ్లి కుదిరింది. ఎందుకో తెలీదుగాని నా పెళ్లి శుభలేఖ తీసుకుని మందిరానికి వెళ్లి బాబా పాదాల దగ్గర పెట్టాను. మీరు నమ్మరేమో! మా డాడీ ఫ్రెండ్ నాకొక బాబా వెండి పటాన్ని బహుమతిగా ఇచ్చారు. బాబాకి నేను దణ్ణం పెట్టకపోయినా మందిరానికి వెళ్లి శుభలేఖ ఇవ్వగానే ఆయన పటం రూపంలో నా పెళ్ళికి వచ్చారు. అయినా కూడా నేను బాబాని మనస్ఫూర్తిగా ప్రార్థించేదాన్ని కాదు. కానీ ఆ పటాన్ని మాత్రం నా దగ్గర పెట్టుకుని రోజూ దీపం పెట్టేదాన్ని.

నిజానికి పెళ్ళైన తర్వాత నా తల్లిదండ్రుల మొహం చూడకూడదని అనుకున్నాను. కానీ, మా అత్తింటివాళ్ళు సరిగా లేరు, అందుకే నేను మా పుట్టింటివాళ్ళని వదులుకోలేకపోయాను. పుట్టింటివాళ్ళు గానీ, అత్తింటివాళ్ళు గానీ ఎవరూ నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నా భర్త మాత్రం బంగారం. నాచేత డిగ్రీ పూర్తిచేయించి, ఐ-సెట్ వ్రాయించి, ఎంబీఏలో చేర్పించారు. ఎంబీఏలో నాకు సుమ అనే అమ్మాయి పరిచయమైంది. తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది. ఎవరితోనూ ఎక్కువ రోజులు స్నేహాన్ని కొనసాగించలేని నేను ఏ కారణం చేతనో తన స్నేహాన్ని వదులుకోలేకపోయాను. తను మంచి బాబా భక్తురాలు. తనెప్పుడూ నాతో బాబా గురించి చెబుతూ ఉండేది. కానీ బాబా మీద కోపంతో నేను తను చెప్పేది సరిగా వినేదాన్ని కాదు. ఎంబీఏ పుర్తయ్యాక నేను చెన్నైలో ఉన్న మావారి దగ్గరికి వెళ్ళాను. కాలం చక్కగా నడుస్తుంటే మా నాన్న మాటలు విని నాకు, నా భర్తకు మధ్యలో మనస్పర్థలు సృష్టించుకున్నాను. విషయం విడాకుల దాకా వెళ్ళింది. కానీ సుమ చెప్పడం వల్ల నేను విడాకులు తీసుకోకుండా మళ్ళీ మావారి దగ్గరికే వెళ్లిపోయాను. ఆయన చాలా మంచివారు, నన్ను చిన్నపిల్లలా చూసుకునేవారు. అప్పటికి మాకు పెళ్ళయి ఆరు సంవత్సరాలయింది. రెండుసార్లు నాకు అబార్షన్ అయింది. మా నాన్నకి చాలా ఆస్తి ఉన్నప్పటికీ నా వైద్యం కోసం ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ బాబా దయవలన మావారు మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు నెలకు 50,000 రూపాయల జీతం వస్తుంది.

నాకు, మావారికి మధ్య మనస్పర్థలున్న సమయంలో 'నవగురువార వ్రతం' చేసుకోమని నాతో చెప్పింది సుమ. కానీ ఆ సమయంలో దేవుడి గురించి వింటేనే నాకు పిచ్చి కోపం వచ్చేది. అందువల్ల నేను తన మాట అస్సలు పట్టించుకోలేదు. మావారి దగ్గరకు వెళ్లాక ఆ వ్రతం సంగతి గుర్తొచ్చి నవగురువార వ్రతం చేసుకుంటానని మావారిని అడిగాను. ఆయన, 'సరే, చేసుకో' అన్నారు. అయితే ఆ వ్రతం గురించి నాకు ఏమీ తెలియదు. నాకు తెలుగు చదవడం, వ్రాయడం రాదు. అప్పుడు నేను సుమకి ఫోన్ చేస్తే, తను ఆ పుస్తకంలో ఉండేవన్నీ ఫోన్లో చెప్తుంటే నేను వాటిని ఇంగ్లీషులో వ్రాసుకుని వ్రతం మొదలుపెట్టాను. వ్రతం మొదలుపెట్టాక కూడా మా మధ్య చాలా మనస్పర్థలు వచ్చాయి. బాబా దగ్గర కూర్చుని ఏడుస్తూనే పూజ చేసేదాన్ని. నేను అలా ఏడుస్తున్న ప్రతిసారీ నా ప్రక్కన ఎవరో ఉన్నట్లు నాకు అనిపించేది. ప్రతి గురువారం నా వ్రతానికి ఏవో ఆటంకాలు వస్తుండేవి. కానీ బాబా దయవల్ల ఏ గురువారమూ నేను వ్రతాన్ని ఆపలేదు. చివరి గురువారం నేను, మావారు కలిసి వంట చేసి 11 మందికి భోజనం పెట్టాము. అలా ఆనందంగా వ్రతం పూర్తి చేసుకున్నాను.

వ్రత సమయంలో ఒకసారి నాకు, మావారికి మధ్య గొడవ జరిగినప్పుడు, "ఈయన దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానా?" అని అనుకున్నాను. ఆరోజు రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను ట్రైనులో ప్రయాణిస్తున్నాను. వెళ్లేదారిలో 'నేను కరెక్ట్ ట్రైన్ ఎక్కానా లేదా' అని ఆలోచిస్తుండగా ఒకతను వచ్చి, "నువ్వు భయపడకు. నువ్వు ఎక్కిన ట్రైను కరెక్టే" అని చెప్పారు. ఆ కల ద్వారా 'నేను మావారి దగ్గరికి రావడం కరెక్టేన'ని బాబా చెప్పారని అర్థం చేసుకున్నాను.

వ్రత సమయంలోనే నేను పిల్లలకోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేదాన్ని. నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ కూడా బాబా భక్తురాలే. ఆవిడ హాస్పిటల్ ముఖద్వారం దగ్గర బాబా విగ్రహం ఉంటుంది. నేను హాస్పిటల్లోకి అడుగుపెట్టే ముందు బాబాకు నమస్కరించుకుని, 30 రూపాయలు హుండీలో వేసి లోపలికి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళిన ప్రతిసారీ నేను ధైర్యంగా ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. నా వ్రతం 2019, ఫిబ్రవరి నెలలో పూర్తయింది. మార్చిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి రెండు వారాలు పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆ రెండు వారాల సమయంలో ఒక బాబా గ్రూపులో నిరుపమ అనే సాయిభక్తురాలు, "నేను శిరిడీ వెళ్తున్నాను, బాబాకి ఏమైనా ప్రార్థనలు అందజేయాల్సినవి ఉంటే పంపించండి" అని మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చూసిన సుమ నాకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు నేను 108 రూపాయలు నిరుపమగారి అకౌంటుకి ట్రాన్స్ఫర్ చేసి, 'ఆ మొత్తాన్ని బాబాకు దక్షిణగా సమర్పించమని, నేను గర్భం దాల్చేలా, బేబీ ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని నా తరఫున బాబాని ప్రార్థించమ'ని మెసేజ్ పెట్టాను. మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు నిరుపమగారికి బాబాకు సమర్పించమని మనీ ట్రాన్స్ఫర్ చేస్తుండేవారు. కానీ వాళ్ళకి బాబా ఊదీ ప్రతిసారీ అందేది కాదు. నాకు బాగా గుర్తుంది, 2 వారాల బెడ్ రెస్ట్ తర్వాత అది నా మొదటి స్కానింగ్. నేను చాలా భయపడుతూ హాస్పిటల్‌కి బయలుదేరాను. బయటికి అడుగుపెడుతూనే నిరుపమగారు పంపిన బాబా ఊదీ నాకు అందింది. ఊదీ రూపంలో బాబా నన్ను అనుగ్రహించారని నేను చాలా సంతోషించాను. తరువాత నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. బాబా నిజంగానే అనుగ్రహించారు! నేను గర్భవతినయ్యాననే శుభవార్తతో హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను. అప్పటినుండి 9 నెలలు పూర్తయ్యే వరకు ఎవరో ఒకరి ద్వారా బాబా ఊదీ నాకు చేరుతూ ఉండేది. నేను ఆ ఊదీ ప్రతిరోజూ పెట్టుకొంటూ ఉండేదాన్ని.

నేను గర్భం దాల్చిన తర్వాత 'ఎక్కడ అబార్షన్ అవుతుందో' అని భయపడుతుండేదాన్ని. అలా నేను భయపడిన ప్రతిసారీ బాబా కలలో కనిపించి నాకు ధైర్యం చెప్పేవారు. అలానే కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి కూడా చాలా ఆందోళనపడుతూ ఉండేదాన్ని. ఆ భయాలన్నిటినీ బాబా నా కలలోకి వచ్చి పోగొట్టేవారు. ఒకసారి కలలో మామిడిపండ్లను చూపించారు, ఒకసారి పువ్వులను చూపించారు.

5వ నెలలో నాకు సీమంతం చేయమని మావారిని అడిగాను. ఆయన 'చేయన'ని చెప్పారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆరోజు రాత్రి కలలో ఒకతను కుంకుమ, గంధం, అక్షింతలు తీసుకొచ్చి నాకిచ్చారు. "మీరెవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను వీటిని ఎలా తీసుకుంటాను?" అని అతనిని అడిగాను. అంతలో పక్కనుండి ఒక పెద్దావిడ వచ్చి, "తీసుకోమ్మా, తీసుకుంటే మంచిది" అని చెప్పింది. అప్పుడు వాటిని తీసుకున్నాను. మావారు అందరినీ పిలిచి నాకు సీమంతం చేయకపోయినా బాబా నా కలలోకి వచ్చి ఆ లోటు తీర్చారు.

చెన్నైలాంటి సిటీల్లో బాబాని కొలిచేవాళ్ళు చాలా తక్కువ. హాస్పిటల్‌కి చెకప్‌ కోసం వెళ్లేటప్పుడు ఒక్కోసారి క్యాబ్‌లు లేటుగా వచ్చేవి. అలాంటి సమయంలో నేను, మావారు టెన్షన్ పడుతుంటే క్యాబ్‌లు చాలా త్వరగా వచ్చేవి. ఆ క్యాబ్స్‌లో బాబా ఫోటోలు ఉండేవి. అవి చూస్తే అర్థం అయ్యేది, బాబానే నాకోసం క్యాబ్స్ పంపించేవారని.

నేను గర్భం దాల్చినప్పటి నుండి మావారు నాకోసం కొబ్బరినీళ్లు తెప్పించేవారు. ఆ కొబ్బరినీళ్లు తెచ్చే అతను కూడా బాబా భక్తుడే. అతను చాలా కష్టాల్లో ఉన్నపుడు బాబాకి మొక్కుకొన్నాడట. అతను బాబాకి మనస్ఫూర్తిగా దగ్గరయ్యాక తన కష్టాలన్నీ తీరిపోయాయట. అతను ప్రతి గురువారం బాబా గుడికి వెళ్లి ప్రసాదం చేసి పెట్టేవారట. ఆ విషయం తెలిశాక గురువారంనాడు నేను అతనికి బియ్యం, పెసరపప్పు ఏదో ఒకటి ఇచ్చి ప్రసాదం చేసేటప్పుడు వీటిని కూడా అందులో కలపమని చెప్పాను. నేనెప్పుడు దిగులుగా ఉన్నా ఆ భక్తుడు వచ్చి బాబా ఊదీ ఇచ్చి, "ఇది పెట్టుకోండి" అని చెప్పి వెళ్లేవాడు. తొమ్మిదవనెలలో బిడ్డ ఎలా ఉంటుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉండేది. అప్పుడు ఆ భక్తుడు ప్రసాదం నాకిచ్చి, "ఇది తినండి. అంతా మంచి జరుగుతుంద"ని చెప్పాడు. తొమ్మిది నెలలుగా నేను అతనికి డబ్బులిస్తున్నప్పటికీ అతనెప్పుడూ ఇలా ప్రసాదం తీసుకొని రాలేదు. నేను ఆయనను చూడటం అదే చివరిసారి.

సుమ చెప్పడం వల్ల మహాపారాయణ గ్రూపులో చేరి సచ్చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టాను. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. పాప ఆరోగ్యంగా పుడితే దివ్యపూజ చేస్తానని, శిరిడీకి వస్తానని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహించారు, పాప ఆరోగ్యంగా పుట్టింది. ఇప్పుడు నేను ఆ మ్రొక్కు తీర్చుకోవాలి.

కాన్పు తర్వాత పురిటిస్నానం చెన్నైలోనే జరిగింది. అప్పుడు ఎవరినీ పిలిచి భోజనాలు పెట్టలేదు. నేను మా ఫ్రెండుని పిలుచుకుంటానని చెబితే మా అత్తగారు ఒప్పుకోలేదు. చాలా బాధపడ్డాను. కానీ తర్వాత మా అమ్మావాళ్ళ ఇంట్లో పాపకి బారసాల చేశారు. అప్పుడు సుమారు 150 మందికి భోజనాలు పెట్టారు. వాళ్ళలో మా తమ్ముడి ఫ్రెండ్ ఒకబ్బాయి బాబా వెండి ఫోటో తీసుకువచ్చి పాపకి బహుమతిగా ఇచ్చాడు. బాబా నన్నే కాదు, మా పాపని కూడా ఆశీర్వదించారని ఎంతో ఆనందించాను.

ఇరుకుటుంబాల మధ్యనున్న అపార్థాల వల్ల నేను ఎంత బ్రతిమిలాడినా మావారు పాప బారసాలకి రాలేదు. నేను మా పుట్టింట్లో ఉన్నన్ని రోజులు తను రానని చెప్పారు. చాలా బాధపడ్డాను. కానీ బాబా దయవల్ల మావారు ప్రతి వారాంతంలో పాపకోసం ఇంటికి వచ్చి పాపని చూసి వెళ్తున్నారు. పాపకి ప్రతిరోజూ బాబా ఊదీని తప్పనిసరిగా పెడుతున్నాను. బాబా ఎల్లప్పుడూ పాపకి తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అనుభవాన్ని ముగిస్తున్నాను.


5 comments:

  1. Om sai ram babu ki fever and motion chala problem ga undi sai kapadandi . One month nundi motion problem ga undi.save him baba

    ReplyDelete
  2. ALWAYS BLESS ME SAIRAM
    ALWAYS BE WITH ME

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo