సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1665వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 30వ భాగం

నా పేరు సాయిబాబు. 2022, మార్చి 1వ తేదీ, శివరాత్రి మహా పర్వదినం. గుంటూరు-తెనాలి మార్గం మధ్యలో ఉన్న క్వారీ శివాలయం చాలా మహిమ గలది. అక్కడ శివరాత్రి చాలా చాలా ఘనంగా జరుపుతారు. ఆ రోజున చాలామంది భక్తులు వచ్చి శివయ్యను దర్శించుకుంటారు. మేము కూడా అక్కడికి వెళ్లాలనుకున్నాము కానీ, ‘భక్తుల రద్దీ చాలా ఉంటుంది. కనీసం మూడు గంటలసేపు క్యూలో నిలబడాలి’ అని నాకనిపించింది. అందువల్ల ముందురోజు రాత్రే నేను, నా భార్య ఆ శివాలయానికి వెళ్ళాము. అప్పుడు చాలా తక్కువమంది భక్తులున్నారు. వెంట వెంటనే మూడుసార్లు దర్శనం చేసుకున్నాం. మూడోసారి దర్శనానంతరం ఒక అడుగు బయటకు వేసిన నా భార్య ఎందుకో అనుమానమొచ్చి పూజారి దగ్గరకు వెళ్లి, “ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగమా?” అని అడిగింది. అందుకు ఆ పూజారి “అవున”ని బదులిచ్చారు. అది విన్న నా భార్య ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే, బ్రహ్మసూత్రమున్నశివలింగాన్ని దర్శించడం అదృష్టం పండితేనే జరుగుతుందని తెలిసి మేము ఐదు, ఆరు నెలల నుండి గూగుల్‌లో వెతుకుతుంటే అలాంటి శివలింగం ఉన్న దేవాలయాలు మాకు చాలా దూరంలో ఉన్నాయని తెలిసి 'ఎప్పుడు బ్రహ్మసూత్రమున్న శివలింగాన్ని దర్శించుకుంటామో!’ అని అనుకుంటున్నాము. అలాంటిది బాబా అంత దూరం వెళ్లాల్సిన పని లేకుండా మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మసూత్రమున్న శివలింగ దర్శనం చేయించారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ శివాలయాన్ని ఎన్నోసార్లు దర్శించుకుంటున్నప్పటికీ అది బ్రహ్మసూత్రమున్న శివలింగమని మాకు అప్పటివరకు తెలీదు. బాబా దయవల్లనే అన్ని సంవత్సరాలుగా తెలియని విషయం తెలిసింది. లేదంటే, ప్రతిసారీలాగానే అప్పుడు కూడా మామూలుగా దర్శనం చేసుకుని వచ్చేసే వాళ్ళము. ఐదు నిమిషాల తర్వాత నేను ఆ పూజారిని మాకు బాగా పరిచయమున్న ఆ ఆలయ అధికారి ఉన్నారా? అని అడిగాను. "లేరండీ. వాళ్లు మారిపోయి ఇంకొకరు వచ్చారు” అని జవాబు ఇచ్చారు పూజారి. నేను మనసులో, "వారు కనుక ఉండుంటే రేపు శివరాత్రి పర్వదినాన ఈ బ్రహ్మసూత్రమున్న శివలింగాన్ని మరింత దగ్గరగా దర్శించుకునేవాళ్ళం కదా బాబా. ఎంతో పుణ్యం వచ్చేది. కానీ శివరాత్రి రోజున వేలల్లో భక్తులు వస్తారు, శివలింగాన్ని దూరం నుండే దర్శించుకోవాలి. సరిగా దర్శనం అవ్వదు” అని అనుకున్నాను. మరునాడు శివరాత్రి రోజున యధావిధిగా మా గృహంలో పూజ చేసుకున్నాం. నా భార్య బ్రహ్మసూత్రమున్న ఆ శివాలయానికి వెళదామని అంది. నేను, “చాలా రద్దీగా ఉంటుంది. అంతసేపూ లైన్లో నిలబడలేము” అని అన్నాను. కానీ చివరికి తప్పనిసరై సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్లాం. అక్కడికి వెళ్ళాక ఒకింత ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, భక్తులు పెద్దగా లేరు(కొద్దిసేపటి క్రితం వరకు చాలా జనం ఉన్నారట). పది నిమిషాల్లో మాకు దర్శనమైంది. అయితే దూరం నుండే. కానీ బాబా ఉన్నారు కదా! మేము గుడి ద్వారం నుండి కాలు బయటపెట్టగానే ఒకరు కనిపించారు. వారే మాకు బాగా పరిచయమున్న ఆ ఆలయ పాత అధికారి. వారు మమ్మల్ని చూసి కుశల ప్రశ్నలు వేసి మళ్ళీ అదే ద్వారం గుండా లోపలికి పంపి శివలింగాన్ని దగ్గరగా దర్శింపజేసి స్వయంగా మా చేతులతో పూలు సమర్పించుకొని అవకాశం ఇచ్చారు. ఈ భాగ్యం కలిగించింది ఆలయ అధికారే అయినా ఆయన రూపంలో చేయించింది మాత్రం ఆ బాబానే.

2022లో ఒకరోజు మేము పొన్నూరు ఆంజనేయస్వామిని, సహస్రలింగాన్ని దర్శించి చీరాల వెళ్ళాం. అంతలో చీకటి పడింది. అయినా ఇంతదూరం వచ్చి సముద్ర దర్శనం చేసుకోకుంటే ఎలా అని ఓడరేవుకు వెళ్ళాము. లైట్‌హౌస్ కాంతి, పైన చంద్రకాంతి, వెన్నెల్లో సముద్రపు అలలు, చల్లగాలి, ఆకాశంలో చుక్కలు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది మా మనసులకు. పగలు ఎన్నోసార్లు సముద్ర స్నానానికి వెళ్ళాం కానీ చీకటిపడ్డాక వెళ్ళడం అంత అద్భుతంగా ఉంటుందని మేము ఊహించలేదు. కొంతసేపైన తర్వాత సముద్రానికి, చంద్రునికి దీపాలు పెట్టాలనుకుని కారు హెడ్లైట్ల వెలుగులో ఇసుకలో చిన్న గుంట తీశాము. కానీ వెంటనే ఒక అల రావడంతో గుంట పూడుకుపోయింది. గాలి కూడా ఉదృతంగా ఉంది. ఇలా అయితే ఎలా అని, "ఇక్కడ మాతో దీపాలు పెట్టించి, వాటిని సముద్రుడు స్వీకరించేలా చేయండి బాబా" అని వేడుకొని చిన్న గుంట తీశాము. అప్పటివరకు అక్కడివరకు వచ్చిన అలలు ఈసారి రాలేదు. గాలి కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము ఏ ఆటంకం లేకుండా దీపాలు పెట్టి, పూజ చేసి సముద్రుణ్ణి స్వీకరించమనగానే ఒక అల వచ్చి దీపాలను తనతో తీసుకువెళ్లింది. అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది. కొంతసేపైనా తర్వాత తిరుగు ప్రయాణమయ్యాము. అలా దీపావళి రోజుల్లో కడలికి దీపోత్సవం చేయించారు బాబా. బాబాని ప్రార్థిస్తే అంతా సవ్యంగా జరుగుతుంది.

ఒకప్పుడు ఒక పిచ్చుకల జంట మా ఇంటి ఆవరణలోకి వచ్చి పూలచెట్ల మీద, ప్రహరీగోడ మీద వాలి ఒక గంట అలా ఉండి వెళ్ళిపోతుండేవి. మేము కొంచెం కడిగిన బియ్యం పెడితే తిని, పక్కనే గిన్నెలో ఉంచిన నీళ్లు త్రాగేవి. కొన్నాళ్ల తర్వాత అవి రావడం మానేశాయి. చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు మేము, “ఆ పిచ్చుకల జంటను చూసి చాలా రోజులైంది. కాదు కాదు చాలా సంవత్సరాలైంది. వరిపైర్లకు వేసే కెమికల్స్ వల్ల ఆ గింజలు తిని అవి కనుమరుగైపోయాయేమో’ అనుకున్నాము. అలా అనుకున్న తర్వాత అవి రావడంతో చాలా సంవత్సరాల తర్వాత వాటిని చూసి మాకు చాలా ఆనందంగా కలిగింది. అవి వరుసగా 15 రోజులు వచ్చి 16వ రోజు రాలేదు. అరగంట వేచి చూసినా రాకపోయేసరికి ఎందుకో కొంచెం బాధగా అనిపించి మనసులో, "ఆ పిచ్చుకల జంట ఏమైంది బాబా" అని అనుకున్నాను. ఒక్క నిమిషం గడక ముందే ఆడపిచ్చుక నా ఎదుట ప్రత్యక్షమైంది. అది ఎగురుకుంటూ వచ్చి నా ఎదురుగా ఉన్న గోడమీద వాలింది. నాకు చాలా ఆనందమేసి కొంచెం బియ్యం పెడితే తిని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ పిచ్చుకలు ఎప్పుడూ రాలేదు. ఏమయ్యాయో, ఎక్కడున్నాయో బాబాకే ఎరుక. కానీ మనసులో అనుకోగానే బాబా చూపించారు, అది చాలు. "ధన్యవాదాలు బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo