- అప్పుడెలా పలికారో ఇప్పుడు అలానే పలుకుతున్న బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిభక్తులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సచ్చరిత్ర పారాయణ చేసేటప్పడు ఒక భక్తుడి కష్టాన్ని సాయి తీర్చాడని చదివి కష్టం తీర్చడం వరకే మనం చూస్తాంగాని ఆ భక్తుడి మనోవేదన ఎలా ఉంది? ఆ స్థితిలో సాయి చూపిన కరుణ ఆ భక్తుడి హృదయాన్ని ఎలా పరిణితి చెందించింది? అనే విషయాలను పెద్దగా ఆలోచించము. ఎందుకంటే, మనకి పరిణితి కంటే కష్టాలు తీరడమే ప్రధానం. అందువల్ల నా పారాయణ యాత్రికంగా ఉందని, ఆ లీలను పొందిన భక్తుల మానసిక స్థితిలో నా మనసు లేకుండా ఊరికే చదువుతున్నాను అనిపిస్తుంది. నాకు తెలియకుండానే నాకు కలిగే ఇటువంటి అశ్రద్ధ పోవాలంటే నా నిత్యజీవితంలో ఆ సాయినాథుడు చూపించే నిదర్శనాలు పంచుకోవటం ఒక మార్గంగా అనిపిస్తుంది. అలా పంచుకుంటేనే ఆయన భౌతికంగా ఉన్నపుడు చూపిన లీలలోని భోద మనసుకి భోదపడుతుంది అనేది నా నమ్మకం. అంతేకాదు, సాయినాథుని కృపతో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడ్డప్పడు బాబా తన భక్తులతో ఎప్పుడూ ఉంటారనే ధైర్యంతోపాటు ఆ అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయిభక్త కోటితో పంచుకోవడం వల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది. నిజానికీ బాబా ఇస్తున్న లెక్కలేనన్ని అనుభవాలు ఎప్పటికీ మధురానుభూతులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బ్లాగుకి పంపాలని నాకు అనిపిస్తోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా మన శ్రద్ధ-సబూరీ బలహీనపడ్డపుడు మనం పంచుకున్న ఆ అనుభవాలను ఒకసారి చదువుకుంటే మనకు తెలియని ధైర్యాన్నిస్తాయి.
బాబా భౌతికంగా ఉన్నపుడు ఎంతోమందికి ఆరోగ్యసమస్యలు, అంటువ్యాధులు వచ్చినప్పుడు ఊదీతో నయం చేసారు, ఇప్పటికి చేస్తున్నారు. నా జీవితంలో కూడా చేసారు. అటువంటి అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023లో నేను మా అమ్మానాన్నలతో శిరిడీ వెళ్ళాను. శిరిడీ చేరుకోవడానికి ముందురోజు మేము గాణ్గాపుర్, అక్కల్కోట, తుల్జాపూర్, పండరీపురం, కొల్హాపూర్ అన్ని ఒక్కరోజులో దర్శించాము. తుల్జాపూర్లో మా నాన్న కాలికి చిన్న దెబ్బ తగిలితే, చిన్న దెబ్బే కదా అని మేము పట్టించుకోలేదు. కానీ అది సెప్టిక్ అయ్యి శిరిడీలో ఉండగా నాన్నకి జ్వరం(సెప్టిక్ అయినా విషయం మాకు అప్పుడు తెలీదు) దాంతోపాటు ఒళ్లునొప్పులు వచ్చాయి. షుగర్ వల్ల ఒళ్లునొప్పులు మరీ ఎక్కువగా నాన్నని ఇబ్బంది పెట్టాయి. బాగా తిరగడం వల్ల ఒళ్లునొప్పులు వచ్చుంటాయని నేను నాన్నకి బాబా ఊదీ పెట్టి, "త్వరగా నాన్నకి ఒళ్లునొప్పులు తగ్గేలా చేయమ"ని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజు సాయంత్రం నాన్నని, "ఎలా ఉంది?" అని అడిగితే, అందుకు నాన్న, "రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనిపించేంతా ఎక్కువగా ఒళ్లునొప్పులు వచ్చాయి. అప్పుడు బాబాని తలచుకుని టాబ్లెట్ వేసుకున్నాను. పొద్దుటికల్లా తగ్గిపోయాయి" అని చెప్పారు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనిపించే అంతలా ఉన్న నొప్పుల్ని ఒక్క టాబ్లెట్తో తగ్గించి మా శిరిడీయాత్రను సాఫీగా పూర్తి చేయించారు ఆ సాయినాథుడు.
శిరిడీ నుండి ఇంటికి రాగానే నాన్నకి దెబ్బ తగిలిన చోట వాచిపోయింది. దాంతో నాన్న హాస్పిటల్కి వెళ్లి చూపించుకుంటే, "సెప్టిక్ అయింద"ని డాక్టర్ కట్టుకట్టారు(మధుమేహం ఉన్నపుడు చిన్న చిన్న దెబ్బలు కూడా చాలా ప్రమాదం సృష్టిస్తాయి. మధుమేహం ఉన్నవాళ్ళు దెబ్బలు తగిలితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు). ఆ కట్టు చూడగానే నాకు చాలా భయం వేసింది. దెబ్బ తగిలిన చాలారోజులు వరకు పట్టించుకొనందున ఆ దెబ్బ అంత తొందరగా తగ్గదేమో అని ఆందోళనగా అనిపించింది. అయితే బాబా సచ్చరిత్రలో ఒక భక్తుడు ఆయన్ని తలుచుకొని, ఆరోగ్యం బాగులేని వాళ్ళకి చికిత్స చేస్తే, వాళ్లకు వెంటనే తగ్గుతుందని ఉంటుంది. అందుచేత నేను కూడా రోజూ బాబాని తలుచుకుంటూ నాన్నకి ఆయింట్మెంట్ పూసేదాన్ని. బాబా కరుణతో ఆ గాయం చాలా తొందరగా తగ్గిపోయింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే గాయం మానిపోయాక నాన్నకి మళ్లీ ఒళ్లునొప్పులు ఎక్కువయ్యాయి. వాటికి తోడు నీరసం కూడా ఉండటంతో ఎప్పుడూ పడుకొని ఉండేవారు. మా నాన్నని అలా శక్తి లేకుండా నీరసంగా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండింది. ఒకరోజు నాన్న నాతో, "నొప్పులు భరించలేకున్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను" అన్నారు. అది విని నాకు చాలా టెన్షన్గా అనిపించి నేనే నాన్నని తీసుకోని హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ని కలిసాను. డాక్టర్ చూసి రెండు సెలైన్ బాటిల్లు పెట్టించుకోమన్నారు. నాన్న అవి పెట్టించుకునేటపుడు నేను బాబాని, "బాబా! ఇంతటితో నాన్నకి ఒళ్లునొప్పులు తగ్గాలి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ రోజు హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి క్రమేణా నాన్నకి ఒళ్లునొప్పులు తగ్గాయి.
తరవాత నాకు జలుబు చేసి జ్వరం వచ్చింది. జ్వరం మాత్రలు ఎన్ని వేసుకున్నా తగ్గలేదు. ఇక నా శక్తి అంతా పోయి ఆ సాయినాథుడిని, "బాబా! ఈ జ్వరం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. దయచేసి తగ్గేలా చూడు" అని ప్రార్ధించాను. బాబా దయవల్ల ఆ పక్కరోజుకి జ్వరం తగ్గింది. ఈవిధంగా బాబా భౌతికంగా ఉన్నపుడు ఆనాటి భక్తులకి ఎలా పలికారో నాకు కూడా అలానే పలుకుతున్నారు. ఈ అనుభవాలను పొందేటపుడు నా మనసు ఎలా ఉందో అలానే బాబా భౌతికంగా ఉన్నప్పటి భక్తుల మానసిక స్థితి ఉండి ఉంటుంది. ఆ స్థితిని అనుభూతి చెందుతూ నన్ను నేను మైమరచి అనంతమైన సాయి లీలల భోదామృతంలో మునిగిపోవాలని ఆ సాయినాథుడిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

