సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - నాల్గవభాగం



శిష్యుడి చెవిలో మంత్రాన్ని గుసగుసలాడడంతో గురువు యొక్క కర్తవ్యం ముగుస్తుందని అనుకుంటే అది పొరపాటే. అందుకే సాయిబాబా తరచూ "నేను చెవిలో మంత్రాన్ని ఉచ్ఛరించే గురువును కాదు" అని చెప్పేవారు. వివిధ విషయవాసనలతో, కోరికలతో, ప్రాపంచిక వ్యామోహాలతో సతమతమవుతున్న తమ భక్తులను సంస్కరించి, ఉద్ధరించి సద్గతిని అందజేయడమే బాబా అవతారకార్యం. అందుచేత ఆయన సదా భక్తుల వెంటే వుంటూ తాము చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటున్నారా, లేదా అని గమనిస్తూ, ఒకవేళ భక్తులు అలా నడుచుకోకుండా తప్పుకుపోతుంటే, వారిని సరిదిద్ది సరైన మార్గంలో నడిపించి వారి పురోగతి కోసం ఆరాటపడుతుంటారు. నానాసాహెబ్ విషయానికి వస్తే, అతను తమను కలిసిన ప్రతిసారీ బాబా అతనికొక కొత్త పాఠాన్ని బోధించేవారు. కొన్నిసార్లు అంతటితో ఆగక అతను ఆ బోధను ఆచరణలో పెట్టాడో, లేదో నిశితంగా పరిశీలించేవారు, పలువిధాల పరీక్షించేవారు. ఒకవేళ అతను తాము చెప్పిన బోధను విస్మరించినట్లైతే తర్వాత అతను శిరిడీ వచ్చినప్పుడు బాబా ఉద్దేశపూర్వకంగా అతనిని పట్టించుకునేవారు కాదు. సాధారణంగా 'నానా, నానా' అని పిలుస్తూ తనతో ఎంతో చనువుగా మెలిగే బాబా అలా అసాధారణంగా ప్రవర్తిస్తుంటే అతను తాను చేసిన పని ఏదో బాబాను కలవరపెట్టిందని గ్రహించి తనను క్షమించమని బాబాను వేడుకొనేవాడు. అప్పుడు బాబా, "అరే, ఇలా చేయకు" అని, లేదా "నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేనెందుకు నీతో మాట్లాడాలి" అని కొన్నిసార్లు కోపాన్ని నటించేవారు, కొన్నిసార్లు చాలా మధురంగా మాట్లాడుతూ అతనిని మందలించేవారు.


ఒకసారి బాబా, "షడ్రిపులలో(స్వభావరీత్యా మనిషిలో వుండే ఆరు దుర్గుణాలు) దేనిని సులభంగా జయించవచ్చు?" అని నానాని అడిగారు. అతను, "ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం" అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "అది అసూయ! దానిపై విజయం సాధించడం చాలా సులభం. అసూయ అంటే ఇతరుల పురోగతిని జీర్ణించుకోలేకపోవడమే. అసూయ చెందడం వలన మనకి లాభమూ లేదు, నష్టమూ లేదు. ఒక వ్యక్తి తన సత్కర్మలననుసరించి సంపద, శ్రేయస్సు పొందుతాడు. కాబట్టి, ఎవరైనా అభివృద్ధి చెందారంటే అది వారి సత్కర్మల ఫలితం. దానివలన మనకేమి నష్టం? అందువల్ల, అసూయపడే చెడు గుణాన్ని జయించాలి" అని అన్నారు. అది విన్న నానాసాహెబ్ బాబా ముందు సాష్టాంగపడి, "ఈరోజు నుండి, నేను అసూయ చెందకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను" అని చెప్పాడు.


సహాయం చేసే విషయంలో బాబా బోధ 

కొన్ని నెలల తర్వాత నానాసాహెబ్ మళ్ళీ శిరిడీ వచ్చి బాబా పాదాల చెంత కూర్చున్నప్పుడు బాబా అతనితో, "నానా, నేను నీకు రెండవ పాఠం బోధిస్తున్నాను" అని, "ఎవరైనా ప్రజాసంక్షేమ విషయంగా నిన్ను సహాయం కోరితే, చేయగలిగినదంతా చేయాలి. సహాయం చేయలేని స్థితిలో ఉన్నా లేదా చేయాలనిపించకపోయినా మర్యాదగా తిరస్కరించాలే తప్ప సహాయం కోరిన వ్యక్తిని అపహాస్యం చేయడంగానీ, అవమానించడంగానీ లేదా అతనికి ఎదురు తిరగడంగానీ చేయకూడదు. నీ ఆధిక్యతను కూడా చూపించకూడదు. చెప్పిన మాటపై నిలబడాలి. ఇది నీకు గుర్తుంటుందా?" అని అన్నారు. అందుకతను, "అలాగే చేస్తాన"ని బాబాకి వాగ్దానం చేశాడు. అప్పుడు బాబా, "దీనిని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు" అని అన్నారు. "అయినప్పటికీ, మీ సలహాకి కట్టుబడి ఉంటాన"ని అతను హామీ ఇచ్చాడు. నిజానికి అప్పటికే నానా వల్ల ఒక తప్పిదానికి అంకురార్పణ జరిగింది. అదే బాబా అతనికి పై సలహా ఇవ్వడానికి ప్రేరకమైంది.


కోపర్గాఁవ్ నుండి శిరిడీ వెళ్ళే దారిలో గోదావరి నది ఒడ్డున ఒక దత్తాత్రేయ మందిరం ఉంది. ఆ ఆలయ పూజారి చాలా సాత్వికుడు, దైవభక్తి గలవాడు. అతను ఆ మందిర సమీపంలోనే నివాసముండేవాడు. కోపర్గాఁవ్ మీదుగా శిరిడీ వెళ్ళినప్పుడల్లా ఆ దత్త మందిరాన్ని దర్శించి, అక్కడ కొంత సమయం గడిపి పూజారితో పిచ్చాపాటీ మాట్లాడటం నానాకి అలవాటు. అలా కొంతకాలం గడిచాక, వారిరువురి మధ్య చనువు పెరిగాక ఒకరోజు పూజారి మెల్లగా నానాతో, "నది ఒడ్డున ఘాట్ నిర్మించాలనుకుంటున్నాను. అది మందిరాన్ని అందంగా చేయడంతో పాటు బట్టలు ఉతకడానికి, స్నానాలు చేయడానికి, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన సౌకర్యాలను స్థానిక ప్రజలకు అందిస్తుంది" అని అన్నాడు. అతనికి నానా బాగా సంపన్న కుటుంబానికి చెందినవాడని, పెద్ద మొత్తంలో జీతం అందుకుంటాడని, చాలా భక్తిపరుడని తెలుసు. అదీకాక అతను కలెక్టర్ కార్యదర్శిగా ఉన్నందున ఈ విషయంలో తన అధికారాన్ని కూడా ఉపయోగిస్తాడు. అతను సంకల్పిస్తే అవసరమైన నిధులు సమీకరించి, తన వంతు కూడా కొంత మొత్తాన్ని కలపోచన్న ఆలోచనలతో పూజారి యుక్తిగా విషయాన్ని నానా ముందుంచాడు. అయితే నానాసాహెబ్ ఘాట్ నిర్మాణానికి కొన్ని వేల రూపాయలలో ఖర్చవుతుందని గ్రహించి పూజారి ప్రతిపాదనకు తన సమ్మతిని తెలపలేదు. కానీ పూజారి ఊరుకోక నానాసాహెబ్ ఆలయాన్ని దర్శించిన ప్రతిసారీ ఆ విషయం గురించి గుర్తు చేస్తుండేవాడు. చివరికి నానాసాహెబ్ తన మనసు విప్పి పూజారితో చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు: "మీరు సంకల్పించిన ఘాట్ నిర్మాణానికి వేల రూపాయలు ఖర్చవుతుంది. నేను అంత మొత్తాన్ని సమకూర్చలేను. అయినప్పటికీ మీరు పట్టుబట్టినట్లైతే మందిరం నుండి నది వరకు 10-12 మెట్ల నిర్మాణం గురించి నేను ఆలోచిస్తాను. అందుకు 300 రూపాయల ఖర్చవుతుంది. ఆ మొత్తాన్ని నేను భరించగలను" అని. నానా చెప్పింది విన్న పూజారి మంచి సంకల్పానికి కనీసం శుభారంభమైనా జరుగుతుందని సంతృప్తి చెందాడు.

బాబా పై విధంగా నానాకి బోధించిన కొన్ని వారాల తరువాత(1899-1900లో) ఒక రాత్రి నానా తన తోడల్లుడు శ్రీబినీవాలేతో కలిసి రైలులో శిరిడీకి ప్రయాణమయ్యాడు. బినీవాలే దత్త భక్తుడు. అతను తనకు బాబాపై నమ్మకం లేకపోయినా నానా కోరిక మన్నించి బాబా దర్శనానికి బయలుదేరాడు. మరుసటిరోజు ఉదయం కోపర్గాఁవ్ చేరుకున్నాక నానా, 'నేను ఇప్పుడు దత్త దర్శనానికి వెళితే పూజారి డబ్బులు గురించి మళ్ళీ అడుగుతాడు. నేను ఇంతవరకు అతనికి ఇస్తానన్న డబ్బులు సేకరించడం కూడా మొదలుపెట్టలేదు. అందువల్ల అతనికి లేవని చెప్పడం చాలా కష్టం' అని తన తోడల్లుడు బినీవాలే దత్త దర్శనం కోసం ఎంతో తపనపడుతున్నప్పటికీ పూజారిని తప్పించుకోవడానికి అడ్డదారిలో శిరిడీ వెళ్లాలనుకున్నాడు. ఆ దారంతా ముళ్ళపొదలతో నిండి ఉంది. పైగా అది తెల్లవారుజాము సమయం కావడం వల్ల వెలుతురు అంతగా లేదు. అందువల్ల మధ్యదారిలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, ముళ్ళ కారణంగా రక్తస్రావం కూడా కాసాగింది. మొత్తానికి ఎలాగోలా వాళ్ళు శిరిడీ చేరుకున్నారు. వెంటనే వాళ్ళు మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. నానా బాబా అమృతవాణి వినాలని ఆశగా ఎదురుచూసాడు. కానీ మామూలుగా తమ దర్శనార్థం శిరిడీ వచ్చే భక్తులను, "మీ ప్రయాణం ఎలా జరిగింది?", "మీరంతా ఎలా వచ్చారు?" మొదలైన కుశల ప్రశ్నలు అడిగే బాబా నానాను ఏమీ అడగలేదు సరికదా తమ సహజశైలికి విరుద్ధంగా అతనిని అస్సలు పట్టించుకోలేదు. దాంతో నానా తన వల్ల ఏదో తప్పు జరిగిందని గ్రహించాడు. కానీ, అదేమిటో గుర్తించడంలో విఫలమయ్యాడు. కాసేపు బాబా దృష్టిలో పడాలని వేచి చూసాడు కానీ, ఆయన వాళ్ళని పట్టించుకోకపోవడంతో తన తోడల్లుడితో కలిసి వాడాకి వెళ్లిపోయాడు. కానీ, 'బాబా ఎందుకు ఒక్క మాటైనా నాతో మాట్లాడలేదు?' అన్న ప్రశ్న నానా మనసుని నిరంతరాయంగా గుచ్చుతూ ఉండటంతో, "బాబా నాతో మాట్లాడకపోతే నేను శిరిడీ  వచ్చి ఏమి ప్రయోజనం?" అని చాలా బాధపడ్డాడు. మళ్ళీ వెళితే ఈసారైనా బాబా తనతో మాట్లాడతారేమో అని ఎంతో ఆశగా వెంటనే మసీదుకి వెళ్ళాడు. కానీ అతనికి మళ్ళీ నిరాశే ఎదురైంది. ఆఖరికి తనను తాను ఆపుకోలేక, "బాబా! మీ కోపానికి కారణం ఏమిటి?" అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా, "నువ్వు నేను చెప్పిన పాఠాన్ని హృదయగతం చేసుకుంటానని వాగ్దానం చేసావు. కానీ అలా చేయలేదు. అలాంటి వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడాలి?" అని మళ్ళీ ఇలా అన్నారు: "అరే నానా, వాగ్దానం చేసిన ధన సహాయాన్ని బువా(పూజారి) అడుగుతాడన్న భయంతో ఇక్కడికి రావడానికి వేరే మార్గాన్ని ఎంచుకొని దత్త దేవుని దర్శనాన్ని వదులుకున్నావు. ఇదేమీ ప్రవర్తన? 300 రూపాయలు ఏర్పాటు చేయలేకపోతే నిజం చెప్పడంలో హాని ఏమిటి? స్పష్టంగా ఆ విషయం బువాతో చెప్తే అతనేమీ నిన్ను మింగేయడు కదా! సాధారణ దారి కాకుండా అడ్డదారి తీసుకొని పూజారిని తప్పించుకోవడంలో విజయం సాధించినా పాదాలలో గుచ్చుకున్న ముళ్ళతో కష్టం కొనితెచ్చుకోలేదా? నాతో ఇన్ని సంవత్సరాలు సాంగత్యం చేసి నువ్వు నేర్చుకున్నది ఇదేనా?" అని అన్నారు. సాయిబాబా సర్వజ్ఞతకు నానాసాహెబ్ ఆశ్చర్యపోయాడు. అతను తన తప్పు ఒప్పుకొని, క్షమించమని వేడుకొని మళ్ళీ ఇటువంటి తప్పు చేయనని మాట ఇచ్చాడు.

చందోర్కర్ తోడల్లుడు బినీవాలే విషయానికి వస్తే, దత్తుని తప్ప మరేమీ పట్టించుకోని అతను బాబాని పూజించే శిరిడీ విడిచి దత్త దర్శనమయ్యే ప్రదేశానికి వెళ్లాలని ఆరాటపడ్డాడు. అంతలో అకస్మాత్తుగా అతని కళ్లకు బాబా మూడు తలలతో, అంటే దత్తునిగా దర్శనమిచ్చారు. అప్పటినుండి అతను బాబాను దత్తావతారంగా నమ్మి జీవితాంతం సాయిభక్తుడిగా ఉండిపోయాడు.

దానం చేసే విషయంలో బాబా బోధ

మరో సందర్భంలో బాబా, "ఎటువంటి అహంకారం, ఆగ్రహం లేకుండా బిక్ష ఇవ్వు. ఒకవేళ ఇచ్చిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబడితే, శాంతంగా సమాధానమివ్వు. అధికార దర్పాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించకు" అని నానాకి మరో సూచన ఇచ్చారు. నానా అది చాలా తేలిక అని భావించాడు. తర్వాత కొన్నిరోజులకి అతను కళ్యాణ్‌‌లో ఉన్న తమ ఇంటికి వెళ్ళాడు. అతను ఎప్పుడు సెలవులున్నా కుటుంబంతో అక్కడ గడిపేవాడు. ఆ సమయంలో ఇంట్లోని ఆడవాళ్లు మధ్యాహ్నం తీరిక సమయంలో వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తుండేవారు. ఒకనాటి మధ్యాహ్నం నానాసాహెబ్ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య భజ్ని (గోధుమ పిండి, బియ్యం పిండి, మసాలా దినుసులు కలిపి తయారు చేసే వంటకం. దీనిని సాధారణంగా మరాఠీలో 'చక్రం' మరియు గుజరాతీలో ‘చక్లి’ అని పిలుస్తారు) తయారు చేయడంలో నిమగ్నమైంది. ఆమె ఆ పనిలో ఉండగా హఠాత్తుగా ద్వారం వద్ద చిరిగిన మాసిన బట్టలతో ఉన్న ఒక బ్రహ్మణ బిచ్చగత్తె నిలబడి ఆహారం పెట్టమని అడిగింది. ఇంటి ముందున్న గేటు దాటి ఇంటి గడప వరకు ఆ బిచ్చగత్తె ఎలా వచ్చిందో ఆమెకి అర్థం కాలేదు. నానా భార్య దయతో ఆ బిచ్చగత్తెకి కొన్ని భజ్నియాలు ఇచ్చింది. ఆ బిచ్చగత్తె వాటితో తృప్తి చెందక ఇంకా కావాలని అడిగింది. నానా భార్య మరిన్ని భజ్నియాలు ఇచ్చింది. అయినా ఆ బిచ్చగత్తె సంతృప్తి చెందలేదు. అలా 1/8, ‌‌1/4 1/2, ఒక వంతు, చివరికి రెండు వంతుల ఇచ్చినప్పటికీ ఆ బిచ్చగత్తె సంతృప్తి చెందలేదు. అప్పుడు నానా భార్య, "తయారు చేసిన భజ్నియాలలో సగభాగం నీకిచ్చాను. అయినా నీకు తృప్తి కలగలేదా?" అని అంది. ఆ బిచ్చగత్తె, "అవన్నీ నాకిస్తే నేను వెళ్తాను" అని చెప్పింది. దాంతో నానా భార్య కోపం తెచ్చుకొని, “ఆహారాన్ని ఇతరుల నుండి సేకరించి కడుపు నింపుకునే నువ్వు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వను. నీకు ఆహారం కావాలంటే ఇచ్చిన దాన్ని తీసుకొని పో” అని అంది. ఆ బిచ్చగత్తె ఆమె మాట వినలేదు సరికదా అప్పటివరకు ఇచ్చిన వాటిని కూడా తీసుకోలేదు, అక్కడినుండి వెళ్ళలేదు కూడా. నానా భార్యకి ఓపిక నశించి తన భర్తను పిలిచింది. నానాసాహెబ్ వచ్చి విషయాన్ని తెలుసుకొని కాపలాదారుని పిలిచి, “ఆ బిచ్చగత్తె ఇచ్చిన దానితో తృప్తి చెందితే సరే, లేదంటే ఆమెను మెడపట్టి బయటకు నెట్టు” అని ఆదేశించాడు. అప్పుడు ఆ బిచ్చగత్తె, “అయ్యా, మీరు ఇవ్వకూడదనుకుంటే ఇవ్వకండి. కానీ నన్ను బయటకు నెట్టొద్దు, నేనే వెళ్తాను” అని ఒక్క భజ్నియ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. తర్వాత నానాసాహెబ్ సెలవులు ముగిసి తిరిగి తన విధులకు హాజరు కావడానికి వెళ్తూ దారిలో బాబాను దర్శించుకోవడానికి శిరిడీ వెళ్ళాడు. బాబా అతన్ని చూస్తూనే తన ముఖాన్ని మరో వైపు తిప్పుకున్నారు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నానాసాహెబ్ బాబా దగ్గరికి వెళ్లి, ఆయన పాదాల మీద పడి, “ఓ దేవా! నేను ఏమైనా తప్పు చేసుంటే దయచేసి చెప్పండి" అని వేడుకున్నాడు. బాబా, “నేను ఒక విషయాన్ని చెప్పాను, దాన్ని నువ్వు మర్చిపోయావు. నేను చెప్పినట్లు నడుచుకోని వారికి నేను ఏమి చెప్పాలి? అధికంగా భిక్ష కోరిన ఆ బిచ్చగత్తెను మెడపట్టి గెంటమని కాపలాదారుని ఆదేశించావు కదా! ఆమె మీకు ఏదైనా హాని చేసిందా, ఆమెను నెట్టడానికి? ఆమెకు ఇష్టమైతే ఇచ్చింది తీసుకుంటుంది లేకుంటే ఇంటి గుమ్మం ముందు కాసేపు కూర్చుని వెళ్లిపోతుంది. అందువలన మీకేమి నష్టం. ఆమె ఏమైనా మీ సంపదను లేదా గౌరవాన్ని దోచుకుంటుందా? కానీ నువ్వు ఆమె మాటలకు కోపం తెచ్చుకుని ఆమెను ఇంటి నుండి బయటకు నెట్టమని కాపలాదారుని ఆదేశించి నీ అధికారాన్ని ప్రదర్శించావు. నేను నీకు నేర్పించింది ఇదేనా?" అని అన్నారు. నానాకు తన తప్పేంటో అవగతమైంది. నిజమైన దానం అంటే ఏమిటో అర్థమైంది. ఇంకా 'సంరక్షించే దైవమైన బాబా అదృశ్యంగా నన్ను ప్రతిక్షణం గమనిస్తున్నారు. నాకు ఎదురు కాబోయే అరిషడ్వర్గాల ప్రలోభాలను, జరగబోయే చెడును ముందుగానే అంచనా వేస్తున్నారు. నేను వారి సూచనలను అమలు చేయడంలో మరింత జాగ్రత్తగా ఉండాలి' అని గుర్తించి పశ్చాత్తాపంతో, "ఇకపై ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయన"ని బాబాకి మాట ఇచ్చాడు. సాయిబాబా శిరిడీలోనే కూర్చొని ఉన్నప్పటికీ తమ భక్తులను ఎక్కడున్నా వాళ్ళని సంస్కరిస్తూ ఉంటారు.

నిజమైన దానం గురించి భగవద్గీత 17వ అధ్యాయం, 20వ శ్లోకంలో క్రింది విధంగా చెప్పబడింది.

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే।

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్।।

భావం: దానము చేయుట తన కర్తవ్యం అని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.

భిక్షకోసం వచ్చేవారిని ఏవగింపు కలిగించే వ్యక్తిగా, నీచమైన వ్యక్తిగా పరిగణించకూడదు. హిందూ మతం ప్రకారం బిక్ష చేసేవారు దైవంతో సమానం. నారాయణుడే ఆ రూపంలో వచ్చి తనని సేవించుకొనే అవకాశాన్ని మనకి కల్పిస్తున్నాడని భావించాలి. కాబట్టి దానం తగినంత గౌరవంతో చేయాలి.


మనస్సును సదా తమపై నిలుపుకునేందుకు బాబా సూచించిన సులభోపాయం

ఒకసారి నానాసాహెబ్ బాబా ఆలోచనలనే తన మనస్సునందు సదా నిలుపుకోవాలని భావించాడు. కానీ, ఆఫీసు మరియు కుటుంబ వ్యవహారాల వల్ల తాను అనుకున్నట్లు చేయడానికి అతనికి చాలా తక్కువ సమయం దొరికేది. అందుచేత అతను చాలా విచారగ్రస్తుడయ్యాడు. ఒకసారి అతను బాబా వద్ద కూర్చుని ఉన్నప్పుడు బాబా అతనితో, “నువ్వు రోజంతా నా ఆలోచనలనే కలిగి ఉండాలని ఆశ పడుతున్నావు - అవునా? అప్పుడు చిన్న చిన్న విషయాలలో నన్ను చూడటానికి ప్రయత్నించు” అని అన్నారు. కానీ నానా బాబా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించడంలో విఫలమయ్యాడు. అప్పుడు బాబా, "అరే నానా! నువ్వు ఒక కూరగాయను చూసినప్పుడు, అది నా సృష్టేనని తలచుకో. ఈ విధంగా నీ ముందుకొచ్చే ప్రతి విషయంలో నన్ను చూడు" అని అన్నారు. ఆ విధంగా బాబా అతనికి ఎంతో అద్భుతమూ, సులభమూ అయినా ఉపాయం సూచించారు.

source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


 

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



8 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om samara sadguru sainath maharaj ki jai🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. saibaba pl bless my son saimadava to overcome his all problems and pl bless him to stay with us only , not to leave any where sai baba.

    ReplyDelete
  6. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. ఓమ్ సాయి శ్రీ సాయి జై సాయి జయ జయ సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo