సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1646వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ధన్వంతరి స్వరూపుడు శ్రీసాయి

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో సాయి చేసిన ఒక మరిచిపోలేని సహాయాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, మే 5న నేను కోవిడ్ మొదటి టీకా వేయించుకున్నాను. కొద్దిగా జ్వరం వచ్చిందికానీ, ఒక్క రోజులో కోలుకున్నాను. తర్వాత 15 రోజులకి మే 20న నాకు విపరీతంగా కళ్ళు తిరిగసాగాయి. అలా మూడు రోజులైన తగ్గక పోయేసరికి డాక్టర్ దగ్గరకి వెళ్తే ఎమ్మారై(MRI) తీయమని చెప్పారు. సరేనని ఎమ్మారై తీయిస్తే, సాయంత్రానికి రిపోర్టు వచ్చింది. డాక్టర్ చూసి నా మెదడులో ఏదో తెల్లటి పదార్థం ఉందన్నారు. అయితే అది దేనివల్ల వచ్చిందో ఎవరూ సరిగా చెప్పలేదు. కానీ ఆ డాక్టర్, "కోవిడ్ టీకా వల్ల కూడా అయుండొచ్చు" అన్నారు. ఆ సమయంలో కోవిడ్ గురించి అంతగా పరిశోధనలు జరగనందున కోవిడ్ వల్ల గాని, టీకా వల్ల గాని వచ్చే ఇబ్బందులు గురించి అంత అవగాహన లేదు. ఏదేమైనా నా మెదడులో కనిపించిన దానిని 'మల్టిపుల్ స్క్లెరిటిస్' అని అంటారు. దానివలన మన శరీరంలోని మెదడు నుండి కాళ్లకు, చేతులకు వెళ్లాల్సిన సిగ్నల్స్ ఆగిపోతాయి. అందువల్ల కాళ్ళుచేతులు పని చేయని స్థితికి వెళ్తాయి. అందుచేత డాక్టర్, "హైదరాబాద్ వెళ్లి, పెద్ద డాక్టర్లకు చూపించమ"ని చెప్పారు. దాంతో నేను హైదరాబాదు వెళ్ళాను. అక్కడ చాలా పరీక్షలు చేశారు. రిపోర్టులు అన్నీ నార్మల్‌గా వచ్చాయి. ఇంకో టెస్టు కోసం నా వెన్నుపూస నుండి సీరం తీసి, ఆ రిపోర్ట్ మాత్రం ఒక మూడు, నాలుగు రోజుల్లో ఇస్తామని చెప్పారు. ఆ రిపోర్టు వచ్చినప్పుడు నాకు ఆ జబ్బు ఉన్నట్లు వచ్చింది. కానీ అప్పటికి నా కాళ్లుచేతులు బాగానే ఉన్నాయి. పెద్ద డాక్టర్ చెప్పింది విన్నాక మా ఇంట్లో అందరికీ కాళ్లుచేతులు వణికాయి. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంకా ఆ సమయంలో బాబా మీద భారమేసి, "ఈ జబ్బు నుండి బయటపడేయండి బాబా. మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. తర్వాత మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు ఒకరు వచ్చి మా అందరికీ ధైర్యం చెప్పి, తనకి అన్నయ్య వరసైన ఒక డాక్టర్ అమెరికాలో ఉంటే, ఆయనకి నా రిపోర్టులు పంపారు. ఆ డాక్టర్ రిపోర్టులు చూసి, "భయపడనవరం లేదు. చాలామందికి ఇలానే ఉంటుంది" అని ధైర్యం చెప్పారు. కానీ రిపోర్టులు నార్మల్‌గా లేకపోవడం వలన నాకు భయం తగ్గలేదు. హైదరాబాద్ డాక్టర్ జబ్బు ఉందని, ఇంకో డాక్టరు ఇంకొకలా చెప్పడం వలన నాకు ఆందోళన ఎక్కువైంది. అదీకాక అప్పుడప్పుడు నా చేతుల్లో స్పర్శ తగ్గి మళ్ళీ నార్మల్ అవుతుండడం మొదలైంది. అందువల్ల మళ్ళీ దిగులు చెంది వేరొక డాక్టర్ దగ్గరకి వెళ్తే, ఆయన తన 40 ఏళ్ల అనుభవంతో "కంగారు పడొద్దు. అంతా మామూలుగానే ఉంటుంద"ని ధైర్యం చెప్పారు. తర్వాత మా ఊరు శంకరమఠంలో అమ్మవారి సేవ చేసే పంతులుగారు నా జాతకం చూసి అంతా బాగానే ఉందని నాకు ధైర్యం చెప్పారు. నేను బాబా మీద భారమేసి, "ఆ జబ్బు బారిన పడకుండా కాపాడమ"ని అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాను. అలా ఒక సంవత్సరం గడిచింది. నాకు ఆ జబ్బు ఉండి ఉంటే, ఆ సంవత్సరం లోపు నా కాళ్ళుచేతులు స్పర్శ కోల్పోయి పని చేయకుండా పోయేవి. కానీ నేను మామూలుగానే తిరగగలిగాను. బాబా అనుగ్రహంతో నా ఆరోగ్యం బాగైంది. ఇప్పటికీ ఆరోగ్యంగా తిరుగుతున్నాను. బాబా కృపవల్ల అదే సంవత్సరం నా పెళ్లి కూడా జరిగింది. ఆ కష్ట సమయంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. "ధన్యవాదాలు బాబా. ఇంత ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు నన్ను క్షమించండి. నాకు పునర్జన్మను, అలాగే మరొక మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు నేను ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాను".


2023, ఆగస్టులో నా నెలసరి ఆగి ప్రెగ్నెన్సీ టెస్టులో నేను గర్భవతినని నిర్ధారణ అయింది. సరిగ్గా ఆగస్టు 14కి ఆరు వారాలు పూర్తి అవుతుండటంతో ఒకసారి చూపించుకోవడానికని హాస్పిటల్‌కి వెళ్తే, డాక్టర్ స్కాన్ తీయమని చెప్పారు. అప్పుడు స్కాన్ తీయిస్తే, లోపల బేబీ తయారైనట్లు కనపడలేదు. ఒక వారం ఆగి మళ్ళీ స్కానింగ్ చేద్దామన్నారు డాక్టరు. తర్వాత రెండు రోజులకు నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. మా ఇంట్లోవాళ్ళు భయపడి మళ్లీ డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్తే, మళ్ళీ స్కానింగ్ చేయమని చెప్పారు. ఈసారి కూడా స్కానింగ్‌లో బిడ్డ కనబడలేదు. కానీ, "ఏదో ఒక ముద్దలా కనపడుతుంది. ఇది ఎక్టోపిక్ గర్భానికి సూచిక. ఒకవేళ అదే అయితే ఫెలోపియన్ ట్యూబ్‌‌లో బేబీ తయారై ఉండొచ్చు. ఆ కారణంగా ఫెలోపియన్ ట్యూబ్‌కి గాయం అయుంటే, ఫెలోపియన్ ట్యూబ్ తీసేయాలి" అని చెప్పారు. ఇదంతా ఆగస్టు 17, గురువారం ఉదయం జరిగింది. అదేరోజు మధ్యాహ్నం మేము ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరకి వెళ్తే, "90% ఎక్టోపిక్ గర్భ లక్షణాలు కనిపిస్తున్నాయి.  లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయుంటే ప్రాణానికే ప్రమాదం. వెంటనే లాప్రోస్కోపీ చేయాలి. లేకపోతే చాలా ప్రమాదం" అని చెప్పారు. నాకు చాలా భయమేసింది. మరుసటిరోజు ఉదయం డాక్టర్ సర్జరీకి ఏర్పాట్లు చేశారు. నేను బాబా మీద భారమేసి, "బాబా! నన్ను చిన్నప్పటినుండి కాపాడుకుంటూ వచ్చావు. ఇప్పుడు కూడా మీరే నాకు దిక్కు. ఫెలోపియన్ ట్యూబ్ తీసేయాల్సిన పరిస్థితి లేకుండా చూడు తండ్రీ. అలాగే భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి ఎటువంటి అడ్డు లేకుండా చూడు తండ్రీ" అని ప్రార్థించి సర్జరీకి వెళ్లాను. నాకు స్పృహ వచ్చాక మావారు, మా అమ్మ, నాన్న, అత్తగారు నన్ను పలకరించడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, "డాక్టర్ సర్జరీ చేయడానికి కెమెరా నీ శరీరంలోకి పంపాక అందరికీ ఆశ్చర్యం కలిగిందట. కారణం లోపల ఏమీ కనబడలేదట. 'ఫెలోపియన్ ట్యూబులు చాలా క్లీన్‌గా ఉన్నాయి మనం అనుకున్నట్లు ఏ సమస్యా లేదు. ఇది ఎక్టోపిక్ గర్భం కాదు. కానీ గర్భసంచి వెలుపల ఏదో చిన్న సమస్య ఉంది. దానికి సర్జరీ చేయాల'ని డాక్టరు చెప్పార"ని. ఎంతటి ఆశ్చర్యం! బాబా చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు లాప్రోస్కోపీ సర్జరీ జరిగి రెండున్నర వారాలు అయింది. ఇప్పుడు నేను కోలుకున్నాను. "ధన్యవాదాలు సాయి. మరో సర్జరీ లేకుండా నయమైపోయేటట్లు చూడు తండ్రీ".


సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo