ఈ భాగంలో అనుభవం:
- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 28వ భాగం
నా పేరు సాయిబాబు. గత 5 సంవత్సరాలుగా అంటే సుమారుగా 2018 నుండి మా ఇంటి ప్రహరీ గోడ మీదుగా ఒక వానరగుంపు రోజూ ఉదయం వెళ్లి, సాయంత్రం తిరిగి వాటి నివాస స్థానానికి వెళ్లిపోతుండేవి. అవి వచ్చినప్పుడు మేము మాకు తోచింది పెడితే, అవి తిని వెళ్ళిపోతుండేవి. ఆ గుంపులో ఒక కోతికి కళ్ళు సరిగ్గా కనిపించవు, లీలగా మాత్రమే కన్పిస్తాయి. అందువల్ల మిగతా కోతుల్లా తొందరగా నడవడం, దూకడం చేయలేక చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది ఆ కోతి. ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే ఆ వానర గుంపు మా ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు వెనుక నెమ్మదిగా వస్తున్న ఆ కళ్ళు కన్పించని కోతి మీద రెండు వీధి కుక్కలు అమాంతం పడి కరిచి గాయపరిచాయి. బాధతో ఆ కోతి పెద్దగా అరుస్తుంటే మిగతా కోతులు దూరం నుండి అరవసాగాయి. ఆ అరుపులకు మా ప్రక్కింటిలో వున్న స్టూడెంట్ కుర్రాళ్ళు వచ్చి రాళ్లతో కుక్కలను తరిమేసారు. ఆ అరుపులకు నేను బయటకి వెళ్లి చూస్తే బాగా గాయలై భయంతో వణికిపోతూ ఆ కోతి మా ఇంటి కాంపౌండులో కనిపించింది. మేము దానికి అలవాటు కాబట్టి మమ్మల్ని చూసి భయపడలేదు, మమ్మల్నీ భయపెట్టలేదు. అది నీరు పెడితే తాగలేదు, పండ్లు పెడితే తినలేదు. పడుకోటానికి ప్రయత్నిస్తుంది కానీ నొప్పివల్ల పడుకోలేకపోతోంది. చాలా రక్తం కారిపోతుంది. మేము ఆ కోతికి ఏమౌతుందోనని కంగారుపడ్డాము. కుక్కలు కరిచినందువల్ల ‘రాబిస్’ వస్తుందేమోనని బాధపడ్డాము. వెంటనే బెంగుళూరులో వున్న మా అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్పి, “దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టరు ఫోన్ నెంబరు సెర్చ్ చేసి మాకు మెసేజ్ పెట్టమ”ని చెప్పాము. తను వెంటనే మాకు దగ్గరలో ఉన్న ఒక డాక్టరు నెంబరు మాకు మెసేజ్ పెట్టింది. అయితే ఆ నెంబరుకి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందనా లేదు. ఇక లాభం లేదని, “ఆ కోతికి స్వస్థత చేకూర్చమ”ని బాబాను ప్రార్థించి ఒక చిన్న గ్లాసు నీళ్ళలో ఊదీ కలిపి ‘రక్షరక్ష సాయిరక్ష’ అని జపిస్తూ ఆ కోతిపై చల్లాము. అది కనీసం రెండడుగులు కూడా వేయలేక ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 వరకు మా కాంపౌండులోనే ఉంది. అప్పుడు అరటిపళ్ళు, టమాటాలు, కొంచెం అన్నం పెడితే తిని అరగంట తర్వాత మెల్లగా అడుగులు వేస్తూ గేటులో నుండి బయటకి వెళ్ళి మిగతా కోతుల గుంపులో కలిసింది. అది ఉదయం కంటే కొంచెం హుషారుగానే ఉండటంతో మేము ఊపిరి పీల్చుకొని బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అది బాబా ఊదీ మహత్యం.
ఒకసారి బెంగుళూరులో వున్న మా అమ్మాయి మాకు ఫోన్ చేసి, “గుంటూరు అరండాళ్ పేటలోని అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసంలో లక్ష గాజులతో అలంకారం చేశారు. తర్వాత నెలలో అంటే ఈనెలలో ఆ గాజులు, పసుపుకుంకుమ ప్యాకెట్లలో పెట్టి భక్తులకు అమ్మ ప్రసాదంగా ఇస్తున్నారు. మీరు వెళ్ళి గాజులు, ప్రసాదం తీసుకోండి” అని చెప్పింది. నేను 'సరే'నని ఒకరోజు బయల్దేరి ఆ దేవాలయానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి పూజారి, నలుగురు, ఐదుగురు స్త్రీలు ఉన్నారు. పూజారి ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారు. నాకు కూడా ఒక్క ప్యాకెట్ ఇచ్చారు. నేను మనసులో ఇంకో ప్యాకెట్టు మా అమ్మాయివాళ్ళకోసం ఇప్పించమని బాబాకి చెప్పుకొని పూజారిగారిని, "ఇంకో ప్యాకెట్ ఇస్తారా?” అని అడిగాను. ఆ పూజారి, “తీసుకోండి అమ్మవారి ప్రసాదం" అని ఇంకో ప్యాకెట్ ఇచ్చారు. అది చూసి మిగిలిన స్త్రీలు కూడా అడిగారు. కానీ వాళ్ళకి ఇవ్వలేదు.
2021వ సంవత్సరం, అక్టోబరు నెలలో వాతావరణ మార్పుల వల్ల ఊరిలో చాలామందికి జ్వరం, నీరసం, నోరు చేదు ఉంటుండేవి. నేను కూడా వాటి బారినపడ్డాను. ఒకరోజు సాయత్రం కొంచెం చలిగా అనిపించి రానూరానూ ఎక్కువై జ్వరం కూడా వచ్చింది. నిద్రపోయేముందు బాబా ఊదీ, కొంచెం పసుపు నోట్లో వేసుకున్నాను. ఉదయంకల్లా జ్వరం తగ్గింది. కానీ చాలా నీరసం, నోరు చేదు, కళ్ళుమంటలతో ఇరవైరోజులు అవస్తపడ్డాను. భోజనం చేయొద్దని అన్నందువల్ల పాలు, బ్రెడ్, ఇడ్లీ తప్ప ఏమీ తినేవాడిని కాదు. ఒకరోజు నా భార్య బాబా పుస్తకం చదువుతుంటే, "రేపు చారన్నం తిను. ఎల్లుండి భోజనం చేయి" అని వచ్చింది. వెంటనే ఆ విషయం నా భార్య నాకు చెప్పింది. నేను బాబా సూచించిన ప్రకారం భోజనం చేస్తుంటే క్రమంగా నా ఆరోగ్యం కుదుటపడింది. కృతజ్ఞతతో చేబ్రోలు బాబా మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. చూశారా! బాబా ఎలా సెలవిచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరిచారో.
2021, అక్టోబరు 24న ఉదయం 4-30 గంటలకు శిరిడీ ప్రత్యేక్ష ప్రసారంలో కాకడ హారతి, తర్వాత బాబాకి చేసే మంగళస్నానం చేస్తుండగా నా మనసులో, ‘బాబాకి స్నానం చన్నీళ్ళతో చేస్తున్నారా లేక వేడినీళ్లతో చేస్తున్నారా? ఒకవేళ వేడినీళ్ళతో అయితే, ఎంత వేడిగా పోస్తారు?’ అని అనుకున్నాను. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా అవి వేడి నీళ్ళని, అలాగే ఎంత వేడిగా ఉన్న నీళ్ళో కూడా బాబా చూపించారు. ఎలాగంటే, నేను నా మనసులో అలా అనుకోగానే ప్రత్యక్ష ప్రసారంలో బాబాకి మంగళస్నానం చేస్తున్న నలుగురు పూజారులలో ఒక పూజారి ప్రక్కన ఉన్న నీళ్ళ పాత్రలో ఉన్న నీటిని వేళ్ళతో తాకి గోరువెచ్చగా ఉన్నట్లు నా వైపు చూపించారు. మేము రోజూ హారతి చూస్తాము కానీ, అలా ఎప్పుడూ నీటిని వేళ్ళతో తాకడం నా కంటపడలేదు. బాబా మా మనసులోని సందేహాన్ని అలా తీర్చారు.
ఇంకోసారి బాబా మధ్యాహ్న హారతి చూస్తున్నప్పుడు నేను, నా భార్య, ‘ఇంత సుందరంగా అలంకరించిన బాబా మందిరంలో ఆయనకు ఇరువైపులా విసిరే చామరాలు మాత్రం అంత మకిలిగా ఉంటే ఎవరూ పట్టించుకోరేంటి?’ అని అనుకున్నాము. ఎందుకంటే, ఆ తెల్లని చామరాలు రంగు మారిపోయి బూడిద రంగులోకి వచ్చాయి. వాటిని మార్చి కొత్త చామరాలతో ఎప్పుడు విసురుతారా అని మేము 10 రోజులు ఎదురుచూసాం. అప్పుడు ఇక లాభం లేదనుకొని ఒక ఆదివారంనాడు నా భార్య, “బాబా! మందిరంలోని పూజారులు ఆ పాత చామరాలను గమనించడం లేదు. మీరైనా వారికి తెలియజెప్పి కొత్త చామరాలు ఏర్పాటు చేయించుకోండి తండ్రీ" అని బాబాకి విన్నవించుకుంది. మరుసటిరోజు సోమవారం మధ్యాహ్న హారతి అప్పుడు పాత చామరాల స్థానంలో బంగారు పిడితో తెల్లగా పొడవుగా మెరిసిపోతున్న కొత్త చామరాలతో వీచడం చూసి మేము ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాము. అడిగిందే తడువుగా బాబా నా భార్య విన్నపాన్ని నెరవేర్చారు. బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అయితే మంగళ, బుధవారాల్లో పాత చామరాలతోనే బాబాకి విసిరారు. సోమవారంనాడు కొత్త చామరాలను మాకోసమే బాబా చూపించారని అనుకున్నాము. తర్వాత గురు, శుక్రవారాల్లో కొత్త చామరాలు ఉపయోగించారు. ఆ మరుసటిరోజు నుండి మళ్ళీ పాతవే వాడారు. చూశారా! మనసులోని చిన్న కోరిక కూడా నెరవేర్చారు బాబా. ఆయన ఎక్కడ లేరు? మన మనసులోనే ఉన్నారనడానికి ఇది ఉదాహరణ కాదా!
శిరిడీలో హారతి అప్పుడు పూజారి రెండు పూలు బాబా సమాధి మీదకు విసురుతారు. ఒకసారి అలా విసిరినప్పుడు నేను మనసులో, ‘ఒక పుష్పం బాబా సమాధి మీద ఉన్న పెద్ద పూలమాలలో పడాలి’ అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అయినా నా మనసులో అనుకున్నది బాబా గ్రహించారు. మరుసటిరోజు పూజారి విసిరిన పుష్పం బాబా సమాధిపై ఉన్న పెద్ద పూలమాల మధ్యలో పడింది. ముందురోజే బాబా ఎందుకు నా కొరికి తీర్చలేదంటే నాలాంటి భక్తులు బాబాకు కోట్లలో ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేర్చాలి కదా. అందుకే ఒక్కోసారి కొంచమైనా సమయం పడుతుంది.

