సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - ఏడవభాగం



బాబా ప్రేమ, శ్రద్ధ(పర్యవేక్షణ) మానవ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లే వారి శక్తులు మానవుని యొక్క స్థాయి, పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనలో ఎవరూ ఒకేసారి డజను మందిపై ఆసక్తి చూపడం, వారి వ్యవహారాలను చూసుకోవడం చేయలేరు. అయితే, బాబా కోట్లాది మంది భక్తులు ఏ ఏ (దూర)ప్రాంతాల్లో ఉన్న ఎల్లవేళలా వాళ్లపై తమ దృష్టినుంచి వాళ్ళ అవసరాలను చూసుకుంటున్నారు. బాబా ఒక సందర్భంలో "నేను 4000 మందితో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక అంటువ్యాధి చెలరేగింది. భయపడుతున్న ఆ 4000 మందితో నేను, 'మిమ్మల్ని చావనిచ్చే కంటే నేను చనిపోతాను. మిమ్మల్ని మాత్రం చావనివ్వను' అని హామీ ఇచ్చాను" అని అన్నారు. ఈ విధమైన సర్వమూ తెలుసుకునే శక్తిని, రక్షించే శక్తిని మాత్రమే దైవమని(సర్వశక్తి, సర్వజ్ఞత మరియు సర్వవ్యాపకత) అంటారు. వేరే ఏ ఇతర పదం అందుకు సరిపోదు. ఒకే సమయంలో ప్రాపంచిక, పారమార్థిక సహాయాన్ని పొందుతున్న నానా, 'బాబా దైవం తప్ప మరొకటి కాదని, ఉపనిషత్తులలో చెప్పబడ్డ ఆ దైవం(బ్రహ్మం) అస్పష్టంగా ఉండి, మూర్తి రూపాలలో ఆరాధించినప్పటికీ ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండదని, దైవం సాయిబాబా వంటి సద్గురు రూపాన్ని తీసుకోనంతవరకు దైవమొక గుర్తించలేని సుదూర లేదా అనుభవంలో అనుభూతి చెందలేని విషయం(వస్తువు)' అన్న చాలా బలమైన అభిప్రాయాన్ని పొందాడు. అంతేకాదు, తన పూర్వ పుణ్యమే తనకు తాను అత్యంత శక్తిశాలి, పరమ ప్రేమమూర్తి అయినా సాయిబాబాగా వ్యక్తమైందని భావించాడు. సరే ఇక అందరినీ ప్రేమిస్తూ, జాగ్రత్తగా చూసుకొనే బాబా ఎలా, ఏ ఇతర మార్గాల్లో నానా ప్రాపంచిక, ఆధ్యాత్మిక సంక్షేమాన్ని చూసుకున్నారో తెలుసుకొనేందుకు మనం మరింత పరిశీలన చేద్దాం.

ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబంతో శిరిడీలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవించింది. వాళ్ళు బాబా అనుమతి తీసుకొని గ్రహణకాలంలో పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించడానికి శిరిడీ నుండి కోపర్గాఁవ్ వెళ్ళారు. గ్రహణం ప్రారంభవుతూనే ఒక మహర్(మహారాష్ట్ర, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్ కులస్తులు), "గ్రహణం విడిపోయేలోపు దానం చేయండి(దే ధాన్ సుటే గ్రహణ) అని అరుస్తూ వచ్చాడు. నానాసాహెబ్ అతనికి నాలుగు అణాలు(రెండు అణాల నాణేలు రెండు) ఇచ్చాడు. అదే సమయంలో మసీదులో బాబా తమ పక్కన కూర్చుని ఉన్న భక్తుడు నందూరామ్ మార్వాడికి రెండు అణాల నాణేలు రెండు చూపుతూ, "చూడు! ఈ నాలుగు అణాలు నానా నాకిచ్చాడు" అని అన్నారు. తర్వాత నానాసాహెబ్ కోపర్గాఁవ్ నుండి శిరిడీకి తిరిగి వచ్చినప్పుడు నందూరామ్ మార్వాడి అతనిని, "గ్రహణ సమయంలో మీరు ఎంత దానం చేశారు?" అని అడిగాడు. నానా, "నేను ఒక మహర్‌కి నాలుగు అణాలు ఇచ్చాను" అని బదులిచ్చాడు. అప్పుడు నందూరామ్ మార్వాడి ఆశ్చర్యంతో ఆ నాణేలు బాబా ఇక్కడ నాకు చూపించారు అని చెప్పాడు. అది విని నానా కూడా ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ద్వారా నానాసాహెబ్‌‌కు, ఇంకా ఇతర భక్తులకు శిరిడీ మసీదులో కూర్చొని ఉన్న బాబా తమ భక్తుల సంక్షేమం కోసం వివిధ రూపాలు ధరించి పలు ప్రాంతాలకు ఎలా ప్రయాణిస్తారో అర్థమైంది.

1906లో నానాసాహెబ్ చందోర్కర్‌కి పండరిపురంకి బదిలీ అయింది. నందుర్‌బార్‌‌లో ఉత్తర్వులందుకున్న వెంటనే నానా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత అతను నందుర్‌బార్ వదిలి పండరిపురం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అయితే, 'భూ వైకుంఠంగా పిలవబడే పండరిపురంలో ఉంటూ విఠలుని దర్శించుకోకుండా ఎలా ఉండాలి? కానీ, అలా విఠలుని దర్శించుకుంటూ ఉంటే బాబా పట్ల భక్తిని కోల్పోతానేమో!' అనే సందేహం అతనిని సంఘర్షణకు గురిచేసింది. ఏదేమైనా శిరిడీయే అతని ప్రథమ పండరీపురం కనుక, కుటుంబంతో ముందు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించి, ప్రణామాలర్పించి, వారి ఆశీస్సులు తీసుకొని పండరిపురం వెళ్లాలనుకొని సామానంతా సర్దుకొని త్వరగా బండిలో కూర్చున్నాడు. అతను శిరిడీ వస్తున్నట్టు ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు, కబురు కూడా పంపలేదు. అందువల్ల అతను వస్తున్నట్లు శిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి. నానా నీంగావ్ గ్రామ శివారుకు వచ్చేసరికి శిరిడీలోని మశీదులో బాబా తమ వద్ద కూర్చొని ఉన్న మహాల్సాపతి, అప్పాశిండె, కాశీరాం మొదలగు భక్తులతో "పండరీపురం ద్వారాలు తెరుచుకున్నాయి. మనందరం కలిసి ఆనందంగా భజన చేద్దాం" అని


పండర్ పుర్లా జాయాచే జాయాచే| 

తే తిథేంచ్ మజలా రాహ్యాచే॥

తిథేంచ్ మజలా రాహ్యాచే|

ఘర్ తే మాఝ్యా రాయాచే॥


'పండరిపురానికి వెళ్ళాలి. నేను అక్కడ ఉండాలి. నేను అక్కడే ఉండాలి. అది నా ప్రభువు ధామం' అన్న భజన గీతాన్ని బాబా స్వయంగా పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరినాథుని ప్రేమలో లీనమైపోయారు. అంతలో నానాసాహెబ్ తన కుటుంబ సమేతంగా శిరిడీ చేరుకొని బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి, "పండరీపురం వచ్చి ఉండమ"ని విన్నవించుకున్నాడు. అతను అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరిపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియజేశారు. అది విని తన మదిలోని సందిగ్ధతకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపే భజన గీతాన్నే బాబా ఆలపించారని నానా ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆనందంతో గద్గదుడై బాబా చరణాలపై శిరసు ఉంచాడు. బాబా ఆశీర్వాదాన్ని, ఊదీ ప్రసాదాన్ని తీసుకొని  పండరిపురం వెళ్ళాడు. 

1906లో నానాసాహెబ్ తన భార్యతో కలిసి పండరీపురం నుండి శిరిడీ వెళ్ళాడు. అప్పుడొకరోజు నానాసాహెబ్ భార్య బాబా దర్శనానికి వెళ్లినప్పుడు బాబా, "రా ఆజీబాయి(అమ్మమ్మ)" అని ఆమెని స్వాగతించారు. బాబా మామూలుగా ఆమెను  'ఆయీ'(అమ్మ) అని పిలిచేవారు. ఆరోజు మాత్రమే అలా ప్రత్యేకించి పిలిచారు. ఆ కొత్త పిలుపుకు ఆమె మురిసిపోయింది. ఆమె తిరిగి తన బసకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తన భర్త నానాసాహెబ్‌తో చెప్పింది. వెంటనే అతను బాబా మాటలలోని ప్రాముఖ్యతను గ్రహించి, "ఖచ్చితంగా మన అమ్మాయి ద్వారక బిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది" అని అన్నాడు. అదే నిజమని మరుసటిరోజే ఆ దంపతులకు ఒక ఉత్తరం వచ్చింది. బాబా నానాసాహెబ్ భార్యను 'ఆజీబాయి' అని పిలిచిన అదే సమయంలో పండరీపురంలో ఉన్న నానాసాహెబ్ కూతురు ద్వారక ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

నానాసాహెబ్ సలహామేరకు అతని భార్య నియమబద్ధంగా నామజపం చేస్తుండేది. ఒకరోజు ఆమె బాబా వద్ద కూర్చొని ఉన్నప్పుడు బాబా ఆమెతో, "అమ్మా! నువ్వు చాలా ధాన్యాన్ని విసురుతున్నావు, కానీ, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు" అని అన్నారు. ఆమెకు బాబా మాటలలోని అంతరార్ధమేమిటో అర్థం కాలేదు. ఆమె తిరిగి తన బసకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తన భర్త నానాసాహెబ్‌తో చెప్పింది. అప్పుడు అతను, "బాబా చెప్పింది నిజమే. నువ్వు చాలా జపం చేస్తున్నావు కానీ, నీ మనసు వందలాది విషయాల వైపు మళ్ళుతుంది. జపంతోపాటు స్వరూపానుసంధానం కూడా అవసరం. బాబా ఈ సలహా కేవలం నీకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది" అని వివరించాడు.

1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు, “క్రిందపడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుంది” అని అన్నాడు. అప్పుడు బాబా, "నాకు అద్దాలు అక్కరలేదు. నా అద్దాల విలువ నలభై రూపాయలు" అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థాన్ని నానాసాహెబ్ తన కుమార్తె మైనతాయితో ఇలా వివరించారు: “ ‘అద్దం’ అంటే ‘ఆత్మసాక్షాత్కారము’ అని, ‘నలభై రూపాయలు’ అంటే ‘నలభై సంవత్సరాలు’ అని. అంటే ‘బాబాకు నలభై సంవత్సరాల క్రితం ఆత్మసాక్షాత్కారమైంది’ ”.


అన్ని జీవులలో నేను ఉన్నానని గుర్తుంచుకో


సద్గురువు నుండి నేర్చుకోవలసిన అత్యున్నత పాఠం ఏమిటంటే, ప్రత్యేకించి ఒక వ్యక్తిలో లేదా వస్తువులో భగవంతుడున్నాడని, ఆపై భగవంతుడు అన్నింటిలో ఉన్నాడని గ్రహించడం. అంటే మొదట తన స్వభావాన్ని, భగవంతుని స్వభావాన్ని తెలుసుకోవడం; పువ్వులతో పూజించే రూపాలు మాత్రమే భగవంతుడు కాకూడదు. ఒక సమయంలో ఒక చోట మాత్రమే ఉన్నాడని భావించేది దైవం కాకూడదు. 'ఈశ్వరుడిని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి ప్రతిదానిలో(అంతటా) ఈశ్వరుని సన్నిధిని అనుభూతి చెంది భయభక్తులు, పరమానందాన్ని అనుభవించాలి' అని భగవద్గీత చెబుతుంది. ఈ సత్యాన్ని గురుదేవులైన బాబా తమ ప్రియ భక్తులకు బోధించి అన్నిటా భగవంతుని సాక్షాత్కరింపజేసి భయభక్తులు, ప్రేమ మొదలైనవి కలిగి ఉండేలా చేయాలి. అయితే మానవ స్వభావాన్ని లోబరుచుకోవడం(జయించడం) చాలా కష్టం. బాబా భక్తులలో ఆధ్యాత్మికంగా నానా చాలా ముందున్నప్పటికీ బాబాతో తనకున్న సాన్నిహిత్యం వల్ల సహజంగానే అతనిలో దాస్యభక్తి కంటే సఖ్యభక్తి అభివృద్ధి చెందింది. చనువు అలక్ష్యం చేయకపోయినా కనీసం స్వాతంత్రానికి దారి తీస్తుంది. బాబా స్వభావాన్ని పరిశీలించిన మీదట అతని వినమ్రత, అణుకువ, భక్తి బలహీనపడటం ప్రారంభించాయి. బాబా అద్భుత శక్తులు, జ్ఞానం కారణంగా ఇతరులంతా ఆయనను భగవంతునిగా పరిగణించి ఆయనపట్ల భయభక్తులు కలిగి ఉండేవారు. పూజ, ఆరతి చేసే సమయాలలో అవి నిర్వహించే బాపూసాహెబ్ జోగ్‌, తర్వాత కాలంలో సద్గురువుగా ఎంతోమందితో కొలవబడ్డ ఉపాసని మహారాజ్‌లతో సహా వందలాది మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళ స్థాయి ఏదైనప్పటికీ లేచి నిలబడేవారు, ఎవరూ కూర్చుని ఉండేవారు కాదు. కానీ నానా మాత్రం ఆరతి జరిగేటప్పుడు కూడా బాబా పక్కన కూర్చుని ఉండేవాడు. పూజ పూర్తయ్యే సమయానికి మంచినీటి పాత్రను బాబా పెదవుల దగ్గర ఉంచి, ఆ నీటిని అందరికీ తీర్థంగా పంచేవారు, అందరూ త్రాగేవారు. కానీ నానా, దాసగణులు మాత్రం తీసుకునేవారు కాదు. సాన్నిహిత్యం వల్ల ఇటువంటి అనార్థాలున్నాయి. చనువు దాని ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతుంది. నానా విషయంలో జరిగిందదే. తీర్థం తీసుకోకపోవడం చిన్న విషయం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బాబా సన్నిధి, అది అయస్కాంత క్షేత్రం. పదేపదే బాబాను కలవడం వల్ల ఏర్పడిన సాన్నిహిత్యం నానాను ఆ అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని చాలావరకు కోల్పోయేలా చేసింది. అతను బాబాను నిరంతరం మసీదులో లేదా ప్రత్యేక ప్రదేశాలలో చూడటం వల్ల బాబాతో ప్రత్యేకించి మానవీయ బంధంతో లేదా స్నేహభావంతో ఉండాలని, విశ్వవ్యాప్తం చేయకూడదని నిర్బంధించుకున్నాడు. ఈ పరిస్థితిని అధిగమించడానికి బాబా ముందుగా తమలోని దైవత్వ అనుభూతి అతనికి మరింత ఎక్కువగా కలిగించి, తర్వాత తమ దైవత్వం తమ శరీరానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాణులలో అంతర్యామి లేదా ఆత్మగా విస్తరించి ఉందని తెలియజేయాల్సి వచ్చింది. ఆయన పలు సందర్భాల్లో, "నేను శిరిడీలో మాత్రమే లేను. చీములు మొదలైన అన్ని జీవులలో నేను ఉన్నాను" అని చెప్పారు. ఆ విషయం నానా బుద్ధికి అర్థమైనా హృదయస్తం కాలేదు. ఆధ్యాత్మిక పురోగతికి అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, బాబా నానా దానిని మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవాలని తలచారు.

1908లో నానాసాహెబ్ పండరిపురంలో పని చేస్తున్నప్పుడు తన కొడుకు బాపూరావ్‌ని తీసుకొని ఒకరోజు మధ్యాహ్నం 12-12.30 గంటల సమయంలో శిరిడీ చేరుకున్నాడు. అతను బాబా దర్శనానికి మశీదుకు వెళ్ళినప్పుడు బాబా అతని యోగక్షేమాలు విచారించిన మీదట, "నానా! ఈరోజు నాకు పూరన్ పోళీలు తినాలనుంది. 8 పూరణ్ పోళీలు తయారుచేయించి, నాకు నివేదించి ఆపై నువ్వు తిను" అని అన్నారు. అందుకు నానా, "బాబా! ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు దాటింది. పూరన్ పోళీలు సిద్ధం చేయడానికి బాగా ఆలస్యమైంది. అదీకాక నా కుటుంబంలోని స్త్రీలెవరూ లేరు. మరి నేను ఎవరిని పోళీలు సిద్ధం చేయమని అడగగలను? ఈ గ్రామంలో వంటచేసే ఆడమనిషిగాని, మగమనిషిగాని నాకు ఎక్కడ దొరుకుతారు?" అని అన్నాడు. బాబా, "వాటిని తయారు చేయడానికి అవసరమయ్యే సమయం గురించి నేను పట్టించుకోను. కానీ నువ్వు నాకు పూరన్ పోళీలు అందేలా చూడు" అని అన్నారు. నానా “కాస్త కనికరించమ”ని పదేపదే బాబాని వేడుకొని, "రేపు నైవేద్యానికి పూర్ణ పోళీలు తెస్తాన"ని హామీ ఇచ్చాడు. కానీ, బాబా తమ మనసు మార్చుకోవడానికి ఇష్టపడక "నాకిప్పుడే పూరన్ పోళీలు కావాలి" అని పట్టుబట్టారు. ఇక అప్పుడు నిస్సహాయస్థితిలో నానా, "సరే, నేను ఇప్పుడు వంటవాణ్ణి వెతకడానికి వెళ్తాను. ఎవరైనా దొరికితే కావాల్సిన సరుకులు కొంటాను. కానీ పోళీలు తయారు చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందనుకుంటున్నాను. అంటే, దాదాపు 4 గంటలవుతుంది. అలాంటి వేళకాని వేళ మీరు వాటిని ఎలా తింటారు?" అని అన్నాడు. బాబా, "ఏ సమయమైనా అవి నాకు కావాలి" అన్నారు. అప్పుడు నానా మసీదు నుండి బయటకు వచ్చి పూరన్ పోళీలు తయారు చేసే మనిషికోసం వెతికాడు. చివరికి ఒక స్త్రీ పోళీలు చేయడానికి ఒప్పుకోవడంతో నానా ఆమెతో, "ఒక పూరన్ పోళీకి ఒక రూపాయి చొప్పున ఇస్తాను. వెంటనే వాటిని తయారుచేసి ఇవ్వమ"ని చెప్పాడు. ఆమె వెంటనే పోళీలు తయారుచేసింది. నానా బాబా ఆదేశానుసారం ఎనిమిది పూరన్ పోళీలు ఒక పళ్లెంలో పెట్టి, మసీదుకి తీసుకెళ్ళి బాబా ముందుంచి, "ఆరగించండి బాబా" అని వేడుకున్నాడు. అతను ఆశ్చర్యపోయేలా బాబా, “మంచిది! నా వాటా పూరన్ పోళీ నేను తిన్నాను. ఇప్పుడు ఈ పళ్లెం తీసుకెళ్లి నువ్వు తిను" అని అన్నారు. అప్పుడు నానా, “బాబా! మీకోసం నేను అన్ని కష్టాలు పడి వంటకం సిద్ధం చేయించాను. మీరు కనీసం పళ్లెం కూడా ముట్టుకోకుండా, బదులుగా నన్ను తినమని అంటున్నారా? నన్ను అన్ని బాధలుపడేలా చేయడంలో ప్రయోజనం ఏమిటి? మీరు కనీసం చిన్న ముక్కైనా తినే వరకు నేను రవంత కూడా ముట్టుకోను” అని అన్నాడు. కానీ బాబా, "ఈ పళ్లెం తీసుకెళ్లి నువ్వు తిను" అని అన్నారు. అతను ఆయన తిననందున అక్కడినుండి పళ్లెం తీయడానికి నిరాకరించి, "కొంచెమైన తినండి బాబా" అని పట్టుబట్టాడు. బాబా, "నేను తిన్నాను. నువ్వు తిను" అని అన్నారు. అందుకు నానా, "ఎప్పుడు బాబా? తెచ్చిన ఎనిమిది పోళీలు అలాగే ఉన్నాయి" అని అడిగాడు. బాబా, "కొంతసేపటి క్రితమే తిన్నాను" అని బదులిచ్చారు. నానా విసుగు చెంది కోపంతో చావడికి వెళ్లిపోయాడు. కానీ వెళ్లేముందు షామాతో, "మీరు బాబా వద్ద ఉండండి. ఆయన పళ్లెంలోని పోళీలు కొంచమైనా తింటే నాకు తెలియజేయండి. అప్పుడే నేను తింటాను" అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లే షామా బాబా దగ్గర కూర్చున్నాడు.

తన బిడ్డ కోపంతో ఏమీ తినకపోతే సాయితల్లి హృదయం చలించకుండా ఉంటుందా? కాసేపటి తర్వాత బాబా, "నానా భోజనం చేశాడా" అని అడిగారు. దానికి షామా, "లేదు బాబా. మీరు అతను నివేదించిన పోళీలు కొంచమైనా తింటేనే అతను తింటాడు" అని అన్నాడు. బాబా నవ్వుతూ, "అరే షామా! అతను నాకోసం పళ్లెం సిద్ధం చేస్తున్నప్పుడే నేను ఈగ రూపంలో అతని నైవేద్యాన్ని స్వీకరించాను" అని అన్నారు. తర్వాత నానాను పిలిపించి, “నేను పోళీ తిన్నాను. ఇప్పుడు నువ్వు మొండిగా ఉండక మంచి పిల్లాడిలా ఆహారం తీసుకో" అని అన్నారు. అతను ఒప్పుకోక మరోసారి చావడికి వెళ్ళిపోయాడు. బాబా అతన్ని మళ్ళీ పిలిపించి, "తిను" అని చెప్పారు. అతను, "మీరు తింటే తప్ప నేను తినను" అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, "నానా! నాతో గడిపిన ఇన్ని సంవత్సరాల్లో నువ్వేమీ తెలుసుకోలేదా? నువ్వు చూసే ఈ నశ్వరమైన శరీరమేనా నేను? నేను ఈగ, చీమ లేదా మరేదైనా రూపంలో నాకు కావాల్సింది తింటాను" అని అన్నారు. "అది నాకు తెలుసుకానీ, ప్రత్యేక్ష అనుభవం లేదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లైతే, ఈ పోళీలను ప్రసాదంగా తీసుకుని తింటాన"ని నానా అన్నాడు. అప్పుడు బాబా తమ చేయి పైకెత్తి ఒక సైగ చేశారు. తద్వారా నానా హృదయంలో చాలా లోతుగా దాచుకున్న రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. దాంతో నానా తన హృదయాంతరాలలో ఉన్న రహస్యం బాబాకి ఎలా తెలిసిందని అనుకున్నాడు. దానికి సమాధానం: 'బాబా అంతర్యామి' లేదా 'అతని హృదయంలో కొలువువై ఉన్న అంతరాత్మ' అని మాత్రమే. బాబా అతని అంతర్యామి అయితే, ఆయన ఈగలు, చీమల అంతర్యామి కూడా అయుండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నానా సంతృప్తి చెంది పూర్ణ పోళీలు ప్రసాదంగా తీసుకోవడానికి అంగీకరించాడు. అప్పుడు బాబా అతనితో, "నేను చేసిన సంజ్ఞను నువ్వు చూసావు. నేను అన్ని జీవులలో ఉన్నానని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి" అని చెప్పారు. ఆ విధంగా బాబా అతనికి చాలా విలువైన పాఠాన్ని నేర్పించి ఆధ్యాత్మిక నిచ్చెన యొక్క చాలా ముఖ్యమైన మెట్టు పైకి తీసుకువెళ్లారు. అంటే భగవంతుని ఇంట్లో, గుడిలో పూజించే విగ్రహానికే పరిమితం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని రూపాల్లో ఉన్నాడని గ్రహించడం.

తరువాయి భాగం త్వరలో..


source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


 

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  8. jai sadguru sainath maharaj ki jai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo