ఈ భాగంలో అనుభవం:
- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 29వ భాగం
నా పేరు సాయిబాబు. ఒకసారి బాబాని అడగకపోయినా మనసులో అనుకోగానే ఎలా నెరవేర్చారో చదవండి. నేను, నా భార్య ప్రతిరోజూ తులసిమాలతో బాబా నామాలు వెయ్యి చేస్తాం(మామూలుగా 'ఓం శ్రీసాయినాథాయ నమః' అనే నామం నేను మనసులో ఎప్పుడూ అనుకుంటేనే ఉంటాను). ఒకరోజు ఆ తులసిమాలని చూసి, 'ఈ 108 పూసలు ఒకే సైజులో ఉన్నాయి. వీటిని ఎలా తయారు చేస్తారు? ఒక్కొక్క పూసకు రంధ్రం చేసి ఇంత గుండ్రంగా ఎలా చేశారు?' అని వాటిని తయారుచేసే వారి పనితనం గురించి మనసులో మెచ్చుకున్నాను. ఇది బాబా విన్నట్లు ఉన్నారు. నామాలు అయ్యాక మొబైల్ ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేశానేగాని సెర్చ్ చేయలేదు. కానీ మొట్టమొదట 'బ్రాహ్మణులు తులసీమాలను ఎలా తయారుచేస్తారో?' చూపించే వీడియో వచ్చింది. మన ఆరాధ్యదైవమైన సాయినాథుడు మనసులో అనుకోగానే తగిన వీడియో చూపించారు. ఇంకోసారి కూడా అలాగే అనుగ్రహించారు బాబా.
రోజూ మా గేటు ముందు ముగ్గు మీద రెండు పెద్ద కుక్కలు, నాలుగు చిన్న కుక్కపిల్లలు పగలంతా నిద్రపోతుండేవి. తండ్రి కుక్క, తల్లి కుక్కని, పిల్లకుక్కల్ని ఎంతో జాగ్రత్తగా చూచుకోవడం చూచి నా భార్య చాలా ఆనందపడి రోజూ కుక్కపిల్లలకు పాలు, పెద్ద కుక్కలకు పాలన్నం పెట్టేది. అయితే, ‘కుక్కలు ముగ్గు మీద నిద్రపోవచ్చా?’ అనే సందేహం నాకొచ్చింది. ఒకరోజు అదే విషయం గురించి మనసులో బాబాని అడుగుతూ టీవీ ఆన్ చేసి భక్తి ఛానల్ పెట్టాను. వెంటనే ధర్మసందేహాలు కార్యక్రమం మొదలైంది. మొదటిగా ఒకరు, “గేటు ముందు పగలు కుక్కలు పడుకుని నిద్రపోతున్నాయి? మంచిదేనా?” అని అడిగారు. ఆ ప్రశ్నకు జవాబు, "చాలా మంచిది. కుక్కలు ఎర్రవైనా, తెల్లవైనా, నల్లనైనా ఏ రంగువైనా మీగేటు ముందుగానీ, వసారాలోగానీ సేద తీరుతుంటే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వాటికి మీరు ఆహారం పెట్టండి. మంచే జరుగుతుంది” అని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఎందుకంటే, ధర్మసందేహాలు కార్యక్రమంలో భక్తి గురించి, పూజల గురించి అడుగుతారు తప్ప ఇలాంటి ప్రశ్నలు అడగరు. అలా నా మనసులో వున్న ప్రశ్నకు సమాధానం తెలియజేశారు బాబా. ఇలా చాలాసార్లు జరిగింది.
ఒకసారి నా మనసులో ‘శ్రీకృష్ణ భగవానుని వలన ద్వారకకు, మధురకు ప్రాముఖ్యం వచ్చింది కదా! మరి ఉడిపికి ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది? అక్కడ భక్తులు కూడా కృష్ణుని ఆరాధిస్తున్నారు’ అని ఒక సందేహం వచ్చింది. మరుసటిరోజు నా మొబైల్లో యూట్యూబ్ ఆన్ చేయగానే అదే విషయం హెడ్డింగ్తో సహా కనిపించింది. నేను సెర్చ్ చేయకుండానే. దాంతో శ్రీకృష్ణుని వల్ల ఉడిపికి కూడా ప్రాధాన్యం ఎందుకు వచ్చిందో అన్న నా సందేహానికి సమాధానం దొరికింది.
ఒకసారి కొత్త సంవత్సర ఆరంభంలో నా భార్యకు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేటప్పుడు బాబా పార్వతీపరమేశ్వరుల దర్శనాన్ని ప్రసాదించారు. ఆ వైనాన్ని ఇప్పుడు చదవండి. బాబా దయవల్ల పౌర్ణమిరోజున నా భార్య గంటన్నరలో గిరి ప్రదక్షణ పూర్తిచేసి అరుణాచలేశ్వరున్ని దర్శించుకుంది. మర్నాడు ఉదయం తను రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సమాధి దర్శనం చేసుకొని, ప్రసాదము స్వీకరించి మళ్ళీ గిరిప్రదక్షిణ మొదలుపెట్టింది. అప్పుడు సమయం పదిగంటలైంది. చెప్పులు లేకుండా సాక్సులు వేసుకొని చేతిలో స్నానానంతరం విడిచిన తడిబట్టలున్న ఒక కవరు(కాస్త బరువుగానే ఉంది) పట్టుకొని ఒంటరిగా నడకసాగిస్తుంది. ముందురోజు పౌర్ణమి అయినందువల్ల ఆరోజే భక్తులందరూ ప్రదక్షిణ చేసారు. అందువల్ల రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక అరగంట నడక సాగించాక వెనుక అడుగుల శబ్ధం వినిపించడంతో నా భార్య వెనక్కి తిరిగి చూస్తే, ఎవరో భార్యాభర్తలు కన్పించారు. వాళ్ళు చిన్నగా నవ్వి "గిరిప్రదక్షిణా?" అని అడిగితే, “అవున”ని చెప్పింది నా భార్య. అతను నా భార్య చేతిలో బరువుగా వున్న బట్టల కవరు తీసుకొని "నువ్వు నడమ్మా. నేను ఈ కవరు తెస్తాను" అని అన్నాడు. “హమ్మయ్యా.. ఇక ఫ్రీగా నడవొచ్చు” అని అనుకుంది నా భార్య. ఆ భార్యాభర్తలిద్దరూ ఒకటో, అరా తప్ప పెద్దగా ఏమీ మాట్లాడుకోక మౌనంగా నడుస్తున్నారు. కొంతసేపటికి అతను, "నిన్న ఉదయం మీరు నా ఆటో ఎక్కారు" అని అన్నాడు. "అవును కదా!" అని నా భార్య అంది. అంతేకాదు, ముందురోజు చూసిన ఆటోడ్రైవరు అని గుర్తించాక బెరుకుపోయి ధైర్యం వచ్చింది నా భార్యాకి. మనసులో గిరిప్రదక్షిణకు తోడు వచ్చారు అనుకుని తన దృష్టి నామం చెప్పుకోవడం, ప్రదక్షిణ చేయటంలో పెట్టింది. కొంతదూరం నడిచాక బాబా మందిరం కనిపిస్తే నా భార్య వాళ్లతో, "నేను బాబాని దర్శించుకొని నమస్కరించి వస్తాను" అని అంది. వాళ్ళు "వెళ్ళిరండి. మేము ఇక్కడే వుంటాము" అని చెప్పారు. వేరే ఎవరైనా వేచి చూడక వెళ్ళిపోయేవారేమో కానీ వాళ్ళు నా భార్య వచ్చేవరకూ ఉండి తనతో కలిసి గిరిప్రదక్షిణ పూర్తిచేశారు. నా భార్య వాళ్ళని భోజనం చేద్దాం రండి అని పిలిస్తే వాళ్ళు 'ఇంకొకసారి చేస్తాము” అని చెప్పి వెళ్లిపోయారు. కొన్నిరోజుల తర్వాత ఒకరోజు రాత్రి నిద్రలో బాబా నా భార్యకి "అరుణాచల గిరిప్రదక్షణలో నీకు తోడు వచ్చింది సాక్షాత్తు ఆ శివపార్వతులే" అని చెప్పారు. నా భార్య ఎంతో సంతోషించింది. ‘ఈ విషయం ఆనాడే తెలుసుంటే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకుని, కళ్లారా, తనివితీరా చూసుకుని ఉండేదాన్ని కదా!' అని బాధ కూడా పడింది. మనుషులెవరూ కన్పించని రోడ్డు మీద కొత్తవాళ్లు కనిపిస్తే భయంగా ఉంటుంది. అందువల్ల ముందురోజు పరిచయమైన ఆటోడ్రైవరు, అతని భార్య రూపాలలో ఆ శివపార్వతులు వచ్చి నా భార్యకి తోడుగా ఉండి గిరిప్రదక్షిణ చేయించారు. ఇలాగే ఒకసారి కాశీలో కూడా జరిగింది. బాబా నా భార్యకు ఏ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ క్షేత్ర దైవంగా దర్శనభాగ్యం కల్పిస్తారు. “ధన్యవాదాలు బాబా”.

