1. సాయినాథునిపై నమ్మకముంచాక మెరుగుపడిన ఆరోగ్యం
2. యజమాని వల్ల ఇబ్బంది లేకుండా కాపాడిన బాబా
సాయినాథునిపై నమ్మకముంచాక మెరుగుపడిన ఆరోగ్యం
సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు మల్లిక. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయికి చిన్నప్పటినుండి ఆరోగ్యం బాగుండేది కాదు. ఎప్పుడూ కడుపునొప్పి అని బాధపడుతుండేవాడు. మేము చాలా హాస్పిటల్స్కి బాబుని తిప్పాము. డాక్టర్లు అందరూ, "ఆహారం అరగక కడుపునొప్పి వస్తుంది" అని గ్యాస్ టాబ్లెట్లు ఇచ్చారు. అవి వేస్తుంటే బాబు కడుపునొప్పి అనటం మానేశాడు. మేము కూడా పూర్తిగా తగ్గిందని మందులు వాడటం ఆపేసాం. తర్వాత బాబుకి 15 సంవత్సరాలప్పుడు టైఫాయిడ్ జ్వరమొచ్చి వాంతులు, విరోచనాలు అవ్వడం మొదలయ్యాయి. అప్పుడు బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసి, "బాబుని హైదరాబాద్ తీసుకెళ్లి చూపించమ"ని అన్నారు. దాంతో మేము బాబుని హైదరాబాదు తీసుకెళ్లి ఓమ్ని హాస్పిటల్లో జాయిన్ చేసాము. అక్కడ మళ్ళీ అన్ని టెస్టులు చేసారు. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. కానీ కోలోనో స్కోపీ చేస్తేగాని ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు. అప్పటికే బాబు చాలా నీరసించిపోయాడు. మేము ప్రార్థించని దేవుడు లేడు.
తర్వాత డాక్టరు కోలోనో స్కోపీ చేసి, "బాబు చిన్న ప్రేగులో, పెద్దప్రేగులో చాలా అల్సర్స్ ఉన్నాయి. జీవితాంతం మందులు వాడాలి, ఫుడ్ కంట్రోల్ ఉండాలి. లేదంటే ఇలాగే జ్వరం, వాంతులు, విరోచనాలు అవుతాయి. అప్పుడు బాబు నీరసించిపోయే ప్రమాదం ఉంది" అని చెప్పారు. ఈ విషయం 2017లో బయటపడింది. అప్పటినుండి మందులు వాడుతూ ఉన్నాము. 2023లో ఒకరోజు నేను ఫేస్బుక్లో సాయి భక్తుల అనుభవాలు చదివి, "బాబా! నా కొడుకు ఆరోగ్యం బాగుంటే, మీ అనుగ్రహం గురించి మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. హోమియో, ఆయుర్వేద చికిత్స ఇప్పిస్తూ బాబాను నమ్ముకొని సచ్చరిత్ర పారాయణ చేస్తూ, ఊదీ బాబు నుదుటన పెట్టి, కొంచెం నీటిలో వేసి ఇవ్వడం మొదలుపెట్టాను. సాయినాథుని దయవల్ల ఇప్పుడు బాబు కొంచెం తిని యాక్టివ్ అయ్యాడు. కానీ కడుపునిండా తినలేడు. ఒక్క పూట మాత్రమే భోజనం, రెండోపూట రెండు దోశలు మాత్రమే తింటాడు. ఇంతకుమునుపు పడుకొని ఉండేవాడు. దేని మీద తనకి ఆసక్తి ఉండేది కాదు. ఏదేమైనా ఇప్పుడు పర్వాలేదు. సన్నగా ఉన్నా యాక్టీవ్గా ఉంటున్నాడు. ఈమధ్యనే శిరిడీ వెళ్లొచ్చాము. సాయినాథుని దయవల్ల గురుస్తాన్ వద్ద మాకు మూడు వేపాకులు దొరికాయి. వాటిని ఆయన ప్రసాదంగా స్వీకరించాము. "ధన్యవాదాలు బాబా. కానీ ఇంకా బాబుకి అనారోగ్యం ఉంది. మా మా యందు కరుణ చూపించి నా బిడ్డను పూర్తి ఆరోగ్యవంతుడిని చేస్తావని ఆశిస్తున్నాను తండ్రీ".
జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
యజమాని వల్ల ఇబ్బంది లేకుండా కాపాడిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్ సాయి. నేను ఒక ఆక్వా కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాను. కంపెనీలో పనికి పెట్టే ఆడ కూలీలు ఏ కారణం చేతనైనా పనికి రాకపోతే, 'ఎందుకు రాలేదు? ఏమిట'ని వివరాలు కనుక్కోని మా ఇంచార్జుకు తెలియజేయడం నా పని. మా యజమాని చాలా కోపిష్టి అయినందున ఏ కారణం చేతనైనా పనివాళ్ళు తక్కువ వస్తే నాకు చాలా సమస్య అవుతుంది. 2023, ఆగస్టు 11న పనికి 150 మంది రావాల్సి ఉండగా 125 మంది మాత్రమే వచ్చారు. దాంతో మా యజమాని ఏమంటాడో, ఏమిటో అని నాకు చాలా భయమేసింది. అయినా 'సాయిబాబా ఉండగా మనకు భయమెందుకు?' అనుకుని, "బాబా! దయ చూపించి పది రోజులలో కూలీలు పెరిగేలా చేయి తండ్రీ. అంతవరకు నా యజమాని నన్ను ఏమీ అనకుండా కాపాడు తండ్రీ. నా యజమాని వల్ల నాకూ ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే, మీ అనుగ్రహం గురించి 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల కూలీలు పెరిగారు. నా యజమానితో నాకు ఏ ఇబ్బంది లేకుండా కాపాడారు సాయితండ్రి. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు సాయి. ఇలాగే మీ దయ చూపించి నేను మిమ్మల్ని కోరిన కోర్కెలు కూడా నెరవేరేలా చేయి తండ్రీ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి సాయి".

