సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1667వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబాది పర్ఫెక్ట్ ప్రణాళిక

"సాయిదేవా నమస్కారం". నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు మా తిరుపతి, అరుణాచలం యాత్రలో బాబా చేసిన సహాయం గురించి మీతో పంచుకుంటున్నాను. మావారు 2023, ఆగస్టు 18న తిరుపతిలో స్వామివారి కళ్యాణోత్సవానికి టికెట్ బుక్ చేశారు. ఆ తేదీకి దగ్గరలోనే నా నెలసరి సమయం ఉన్నందున నేను, 'ఆ సమయం వరకు చూద్దాం లే, బాబా దయ' అని అనుకున్నాను. ఆ కారణంగా మేము చివరి వరకు ట్రైన్ టికెట్లు బుక్ చేయలేదు. 2023, ఆగస్టు 13న మావారు, "మనం రేపు బయలుదేరి ముందుగా అరుణాచలం వెళ్ళి, తర్వాత తిరుపతి వద్దాం. రైలు టికెట్లు బుక్ చేసుకోలేదు కాబట్టి, మన కారులో వెళితే మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వెళ్లొచ్చు" అని అన్నారు. నెలసరి విషయంగా నాకు కాస్త టెన్షన్గా అనిపించింటప్పటికీ, 'సరే, బాబా మీద భారమేసి టాబ్లెట్లు వేసుకుందాం' అనుకోని ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఆగస్టు 14 సాయంత్రం బాబా దగ్గర, "పిల్లలతో 750 కిలోమీటర్ల ప్రయాణం నాయనా. నువ్వే మాతో ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లి, తీసుకు రావాలి" అని దణ్ణం పెట్టుకొని బయలుదేరాం. మధ్యలో నాకు ఆందోళనగా అనిపించి బాబా మెసేజ్ కోసం చూస్తే యూట్యూబ్‌లో "బిలీవ్ ఇన్ మై ప్లాన్(నా ప్రణాళికపట్ల నమ్మకముంచు)" అని వచ్చింది. ఇంకా బాబా చూసుకుంటారని నమ్మకంతో ఉండసాగాను. ఆ రాత్రి మధ్యదారిలో ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకొని, మరుసటిరోజు తెల్లారక స్నానాలు చేసి మళ్ళీ బయలుదేరాము. నాకు మాత్రం దిగులుగా ఉండి మేమెప్పుడూ వెళ్లే ఒక బాబా గుడిలోని బాబా గుర్తుకు రాసాగారు. మా పిల్లలు కూడా ఆ బాబాను గుర్తు చేసుకున్నారు. వాళ్ళు ఉదయం 9.30 సమయంలో "ఈరోజు ఎక్కడ బాబాని చూస్తాం?" అని దిగులుగా అన్నారు. కొద్దిసేపట్లో దూరంగా పెద్ద బాబా విగ్రహం కనిపించింది. అది నంద్యాల అనే ఊరు. శ్రీఅమ్ముల సాంబశివరావుగారు పెట్టిన 120 అడుగుల ముక్తి బాబా గుడి అది. మా కళ్ళను మేము నమ్మలేకపోయాము. ఆ మార్గంలో ఆ మందిరం ఉందన్న సంగతి మాకు తెలియదు. చాలా సంతోషంగా మందిరం లోపలికి  వెళ్లి ప్రదక్షిణ, పారాయణ చేశాము. ఆవిధంగా మా ప్రయాణంలో ముందుగా బాబా తమ దర్శనాన్ని మాకు అనుగ్రహించారు. పక్కనే కాశిరెడ్డినాయన గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఆపై చాలా సంతోషంగా ప్రయాణం సాగించాము. సాయంత్రానికి నాకు నెలసరి మొదలైంది. ఆరోజు ఉదయం టాబ్లెట్ వేసుకున్న కూడా ఆ సమస్య మొదలైంది. మేము అప్పటికి అరుణాచలానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఏం చేయాలో నాకు పాలుపోక, "ఎందుకు బాబా నాకు ఈ పరిస్థితి? ఇంకా ఏ గుడికీ వెళ్లలేం కదా! ఇది మీకు ముందే తెలిసి ఈరోజు మీ దర్శనం చేయించారా? అయినా ఇలా జరుగుతుందని మీకు తెలుసు కదా! ఇంటి దగ్గరే మమ్మిల్ని ఆపకపోయారా బాబా? ఇప్పుడిక ఇంటికి తిరిగి వెళ్ళాక తప్పదా? వెనక్కి వెళ్లాలన్నా గానీ 550 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. మా ఈ ప్రయాణమంతా వృదాయేనా బాబా? నేను ఎంతో పాపం చేశాను కావొచ్చు, అరుణాచలం వెళ్ళే అర్హత లేదు కావొచ్చు" అని ఒక గంటసేపు చాలా బాధపడ్డాను. మావారు, "ఏమీ కాదు. అంతా బాబా చూసుకుంటారు. అయినా నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. ఇంటికి వెళ్లిపోదామంటే వెళ్ళిపోదాం. నీ ఇష్టం" అన్నారు. నాకు ఏం చేయడానికైనా ఏమీ తోచలేదు. కాసేపు ఆలోచించి, 'సరే, నాకు దర్శనమైనా, కాకున్నా పిల్లలు, మావారు దర్శనం చేసుకుంటారు' అనుకొని కొద్దిగా ఊదీ నోట్లో వేసుకొని, బాబాకి చెప్పుకున్నాను. ఆ రాత్రికి అరుణాచలం చేరుకున్నాము. బాబా దయవల్ల 'సాయి' పేరుతో ఉన్న హొటల్లో మాకు రూమ్ దొరికింది. ఆ రాత్రి నేను బాబాని, "ఏదైనా మిరాకిల్ చేసి ఈ యాత్ర పూర్తి చేయించు తండ్రీ. అరుణాచలేశ్వరుని, అమ్మవారిని దర్శించుకొనే అవకాశం ఇవ్వమ"ని వేడుకున్నాను. అంతలో మళ్లీ నాకే అనిపించింది, 'నా పిచ్చి కాకపోతే ఏంటి? ఒకసారి వచ్చింది ఎలా మారుతుంది?' అని. అలా చాలాసేపు బాధపడ్డాక, 'సరే, బాబా ఏం చేయాలనుకుంటే, అదే చేయని' అని అనుకున్నాను. తర్వాత కాసేపటికి, 'టాబ్లెట్ వేసుకున్నాక ఇలా ఎందుకు జరుగుతుంద'ని గూగుల్లో చూడాలనిపించి సెర్చ్ చేస్తే, వేరే టాబ్లెట్ ఉంటుందని తెలిసింది. కానీ అప్పటికే అర్థరాత్రి అయింది. ఆ సమయంలో ఆ టాబ్లెట్ కొనడం కష్టం. అందువల్ల బాబాను వేడుకొని, ఊదీ తీసుకొని పడుకున్నాను. తెల్లారక చూస్తే, నాకు అంతా బాగానే ఉంది. నెలసరి ఛాయలే లేవు. నాకు నమ్మశక్యం కాలేదు. ఊదీయే పరమ ఔషదమని నా గట్టి నమ్మకం. అది మరల నిజం అయింది. నాకు చాలా ఆనందంగా అనిపించి బాబాకు ధన్యవాదాలు చెప్పుకొని తల స్నానం చేసుకున్నాను. తర్వాత బాబా అనుమతి తీసుకుందామని, 'దర్శనంకు వెళ్ళాలా, వద్దా' అని చీటీలు వేసాను. ఎందుకంటే, నా పరిస్థితి ఏంటో నేనే నమ్మలేకుండా ఉంది. బాబా సమాధానం, 'వెళ్ళమని' వచ్చింది. దాంతో సంతోషంగా రాత్రి చూసిన కొత్త టాబ్లెట్ వేసుకొని గుడికి వెళ్ళాను. బాబా ఆవిధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, అసలు మనుషులు ఎవరూ చేయలేని సాయం బాబా చేయగలరు. మనం నమ్మకంతో ఉండాలి అంతే.

మొదటిసారి వెళ్లినా కూడా అరుణాచలంలో చూడవలసినవన్నీ చూసాము. బాబా అడుగడుగున తమ దర్శనం మాకు అనుగ్రహించి మమ్మల్ని ధన్యులను చేశారు. టోపీ అమ్మ దర్శనం కూడా మాకు జరిగింది. అనంతరం చాలా సంతోషంగా తిరుపతి వెళ్ళడానికి బయలుదేరాము. దారిలో కాణిపాకం వెళ్తున్నప్పుడు కొద్దిగా వర్షం పడింది. బాబాను వేడుకోగానే వర్షం తగ్గింది. బాబా దయతో గణపతి దర్శనం బాగా జరిగింది. తర్వాత క్షేమముగా తిరుపతి చేరుకొని ఆ రాత్రి తిరుపతిలో బస చేసాము. కాలినడకన కొండెక్కే మ్రొక్కు ఉన్నందున మర్నాడు 17వ తేదీ ఉదయం కాలినడకన తిరుమల కొండెక్కాలని అనుకున్నాము. అయితే  పిల్లలు నడవగలరా అని నేను అనుకున్నాను. మరోపక్క మావారు, "12 గంటలలోపు కొండపైన రూమ్ కోసం మనం రిపోర్ట్ చేయాలి. లేకపోతే రూమ్ కాన్సల్ అవుతుంది" అన్నారు. బాబాకు, వెంకటేశ్వరస్వామికి, "ఏ ఇబ్బందీ లేకుండా మొక్కు తీర్చుకునేలా సహాయం చేయమ"ని వేడుకుని 9 గంటలకు శ్రీవారి మెట్టు మార్గంలో నడక మొదలుపెట్టాము. బాబా, వెంకటేశ్వరస్వామి దయవలన కేవలం రెండు గంటలలో కొండ ఎక్కగలిగాం. గతంలో రెండుసార్లు కొండ ఎక్కినపుడు నాకు మధ్యలో కొద్దిగా ఆయాసంగా అనిపించింది. కానీ ఈసారి పిల్లలతో ఇంత తేలికగా కొండ ఎక్కగలిగాం. నాకు కలలా అనిపించింది. నేను ముఖ్యంగా మా బాబు ఎలా నడుస్తాడు అనుకున్నాను. కానీ వాడే మా కంటే చలాకీగా మాకన్నా ముందు ఎక్కాడు. 12 గంటలలోపు రూమ్ కోసం రిపోర్ట్ చేసాము. ఇదంతా బాబా దయ తప్ప మరేమీ కాదని నాకు తెలుసు. బాబాని నమ్మక ముందు మన జీవితం, బాబాను నమ్మిన తర్వాత మన జీవితంలో తేడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. బాబా ఉన్నారు కదా, చూసుకుంటారనే నిశ్చింత ఉంటుంది. అయినా సరే మళ్ళీ మాయలో పడి చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడుతూనే ఉంటాం. మనుషులం కదా! 

ఆగస్టు 17 సాయంత్రం మెట్ల మార్గంలో ఇచ్చిన టోకెన్ మీద స్వామివారి దర్శనం చేసుకున్నాము. మర్నాడు కళ్యాణం, దర్శనం బాగా జరిగాయి. ఆరోజు సాయంత్రం కొండ దిగి తిరుపతికి వచ్చి తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దర్శనానంతరం మేము బయటకి వచ్చేసరికి రాత్రి అయింది. ఆ రాత్రి ఉండటానికి మాకు ఒక రూమ్ కావాలి, అలాగే ఫుడ్ కావాలి. మళ్ళీ బాబాని వేడుకున్నాను. బాబా దయతో తక్కువ ధరలో ఒక రూమ్ దొరికింది. అప్పటికి రాత్రి 11 దాటింది. అందరం ఆకలితో ఉన్నాము. ఫుడ్ కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళాం కానీ, ఫుడ్ దొరకలేదు. మావారు, "ఇక భోజనం దొరకదు" అన్నారు. అప్పుడు నేను, "బాబా! ఈరోజు మమ్మల్ని ఆకలితో ఉంచుతావా?" అని అన్నాను. సాయి అమ్మ బిడ్డలని ఆకలితో ఉండనివ్వరు కదా! 2 నిమిషాల్లో టిఫిన్ సెంటర్ కనిపించింది. వాళ్ళు వేడివేడిగా టిఫిన్స్ వేసి ఇస్తున్నారు. బాబాకు కృతజ్ఞతలు చెప్పి టిఫిన్ చేసాము. మరుసటిరోజు ఆగస్టు 19, ఉదయం గోవిందరాజస్వామి ఆలయం, కపిల తీర్థం చూసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. మధ్య  దారిలో ఒంటిమిట్ట రామాలయం దర్శించుకున్నాము. మాకు అసలు ఆ దారిలో ఒంటిమిట్ట ఉంటుందని తెలియదు. అక్కడ మాకు అన్నప్రసాదం లభించింది. అది కూడా బాబా దయనే. తర్వాత క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాము. ఇంటికి వచ్చి ప్రసాద వితరణ చేసాక నాకు నెలసరి వచ్చింది.  మేము దర్శించాలనుకున్నది అరుణాచలం, తిరుమల మాత్రమే. కానీ ఇన్ని దర్శనాలు బాబా దయవలనే జరిగాయి తప్పితే మరేమీ కాదు. ముందే "నా ప్రాణిళికలో నమ్మకముంచు" అని చెప్పారు కదా! ఆయన ప్రణాళిక అంత పర్ఫెక్ట్ అన్నమాట. "మీకు శతకోటి కృతజ్ఞతలు సాయిదేవా. ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సాయిదేవా. మీకు సాధ్యాసాధ్యాలు లేవు. మీ మీద భారమేసి ప్రశాంతంగా ఉండే స్థైర్యాన్ని మాకివ్వు బాబా. మీ బిడ్డలు ఎక్కడున్నా వారిని భవసాగరం దాటించు సాయి. ఈ అనుభవం పంచుకోవడానికి ఆలస్యం అయింది. దయచేసి క్షమించండి".

సర్వం దత్తసాయి కృప!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo