సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1678వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భాధలను నివారణ చేసే సాయి
2. అబద్ధానికి తగిన పాఠం నేర్పి తమపట్ల నమ్మకాన్ని పెంచిన బాబా
3. బాబా కరుణ

భాధలను నివారణ చేసే సాయి

బాబాకి, బాబా భక్తులకు నా నమస్కారాలు. నా పేరు లక్శ్మీ. మాది అనకాపల్లి. 2023, ఉగాది పండగ తరువాత నెలసరి సమస్యతో నేను పది రోజులు చాలా బాధపడ్డాను. అప్పటికీ ఇబ్బందిగా ఉండటం వల్ల నేను హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరుని సంప్రదించాను. ఆమె కొన్ని టెస్టులు చేసింది. అయినప్పటికీ సమస్య ఏమిటో తెలియకపోవడంతో స్కానింగ్ చేయించింది. ఆ రిపోర్టు చూసి, "కిడ్నిలో 1.7 సెం.మీ. రాయి ఉంది. అది నీటితో కరగదు. అదీకాక  గైనిక్ ఇబ్బంది కూడా ఉంది. గర్భసంచికి ఒక టెస్టు చేయాలి. ఆ రిపోర్ట్ ఐదు రోజులలో వస్తుంది" అని చెప్పింది. అది విని నేను చాలా భయపడ్డాను. తర్వాత ఐదు రోజులలో రిపోర్ట్ వచ్చింది. డాక్టరు, "సెల్స్‌లో తేడా వుంది. గర్బసంచి తీసేయాలి. ముందు కిడ్నిలో రాయి ఆపరేషన్ అయినా చేయించుకోండి" అని చెపితే, కిడ్ని ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ఆపరేషన్ చేసిన హాస్పిటల్లో నా రిపోర్టులు చూపిస్తే, అక్కడి డాక్టర్లు కూడా "గర్బసంచి ఆపరేషన్ చేయించుకోవాలి" అన్నారు. తరువాత 2023, ఆగస్టులో నేను మా బంధువైన డా.బెనర్జీని సంప్రదిస్తే, "గతంలో టెస్టు చేసి ఆరు నెలలు అయ్యింది. కాబట్టి మళ్ళీ ఒకసారి టెస్టు చేయిస్తే ఏం చేయాలన్నది తెలుస్తుంది" అన్నారు. దాంతో నేను సెప్టెంబర్ 9వ తారీఖున గర్భసంచి టెస్ట్ చేయించుకొని, "తండ్రీ! ఎన్నో బాధల నుంచి ఒడ్డుకు చేర్చావు. ఈ గండాన్ని కూడా గట్టేక్కించు" అని బాబాను పదేపదే వేడుకున్నాను. సెప్టెంబర్ 16వ తేదీన రిపోర్టు వచ్చిందని ఫోన్ వస్తే, 'ఏ వార్త వినాల్సి వస్తుందో' అని విపరీతంగా భయపడ్డాను. అయితే హాస్పిటల్‌కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని, డాక్టర్‌కి చూసిస్తే, "రిపోర్ట్ బాగుంది. గర్బసంచి తీసేయాల్సిన పని లేదు" అన్నారు. బాబా దయ మన మీద ఉందనడానికి ఆ మాట చాలదా! అది విని నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నా సాయికి ఎన్ని వేల కోట్ల నమస్కారాలు చెప్పినా తక్కువే. "ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు సాయి.."


అబద్ధానికి తగిన పాఠం నేర్పి తమపట్ల నమ్మకాన్ని పెంచిన బాబా

సాయినాథ్ మహరాజ్ కి జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. సాయి బంధువులందరికీ నమస్కారం. నేను నా అనుభవం మీ అందరితో పంచుకోవడానికి ఈ బ్లాగును ఒక మాధ్యమంగా ఎంచుకున్నాను. 2007లో నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తుండేదాన్ని. అప్పుడొకసారి మా ఆడపడుచువాళ్ళు శిరిడీ ప్రయాణం పెట్టుకొని, "మీరు కూడా వస్తారా?" అని మమ్మల్ని అడిగారు. నేను మా వారితో, "నాకు ఆఫీసులో పని వుంది. నేను రాను" అని చెప్పాను. మావారు సరేనని, "మేము రామ"ని తన అక్కతో చెప్పారు. దాంతో వాళ్ళ మటుకు వాళ్ళు శిరిడీ వెళ్లారు. వాళ్ళు ఏ సమయంలో అయితే శిరిడీకి ప్రయాణం మొదలుపెట్టారో సరిగ్గా అదే సమయంలో నా కంటిలో నలుసు పడి నా కళ్ళకు చాలా ఇబ్బంది అయింది. దాంతో నేను హాస్పిటల్‌కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొన్నాను. వాళ్ళు శిరిడీ నుండి తిరిగి వచ్చేవరకు నేను నా ఆఫీసుకి వెళ్ళలేకపోయాను. అప్పుడు నేను, 'బాబా సత్యం. నాకు పనిలేకపోయినా పని ఉందని అబద్ధం చెప్పినందుకు ఆయన నాకు తగిని పాఠం నేర్పారు' అని అనుకొని అప్పటినుండి బాబాని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తర్వాత నేను మా కుటుంబంతో శిరిడీ వెళ్ళాను. అప్పుడు ఆస్త్మా పేషంట్‌నైనా నేను మందులు తీసుకోకుండా వెళ్లిపోయాను. కానీ బాబా దయవల్ల ప్రయాణంలో గానీ, శిరిడీలో గానీ ఆయాసంతో నేను అస్సలు ఇబ్బంది పడలేదు. నాకే ఏ బాధ కలగలేదు. బాబాని దర్శించుకొని ఆనందంగా తిరిగి వచ్చాను. బాబాని నమ్ముకుంటే ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోతుంది. ఖచ్చితంగా బాబాని నమ్మండి, మన వెంటే ఉంటారు. "బాబా! 4 సంవత్సరాల మా మనవడికి మాటలు సరిగా రావడం లేదు. నేను మిమ్మల్ని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. పిల్లలందరిలా మాట్లాడేలా మా మనవడిని ఆశీర్వదించి మా అబ్బాయి జీవితాన్ని ఆనందమయం చేయండి బాబా".


బాబా కరుణ

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు నాగజ్యోతి. నేను చిన్నప్పటినుండి సాయిభక్తురాలిని. నాకు ఏ కష్టమొచ్చినా నేను సాయితోనే చెప్పుకుంటాను. వెంటనే సాయి దాన్ని తీరుస్తారు. 2023, జూన్ నెలలో మా పెద్దనాన్నకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వారం రోజులపాటు వస్తూ, పోతూ ఉండేది. దాంతో హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ బ్లడ్ మరియు యూరిన్ టెస్టులు తీసుకొని రమ్మన్నారు. అయితే నీళ్లు, కొబ్బరినీళ్లు ఇలా ఎన్ని తాగినా సాయంత్రం వరకు పెదనాన్నకి మూత్ర విసర్జన కాలేదు. అలా ఉండగా సాయంత్రానికి ఆయనకి మతిస్థిమితం కూడా లేకుండా పోయింది. మా అందరికీ చాలా భయమేసింది. నేను, "బాబా! పెదనాన్నకి ఏమీ అవ్వకూడదు. ఆయన నార్మల్ అవ్వాల"ని పదేపదే బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయం డాక్టరు పెద్దనాన్న వెన్నుపూస వద్ద నీరు తీసి టెస్టుకి పంపారు. సాయంత్రం వరకు రిపోర్ట్ రాలేదు. అప్పటివరకు పెదనాన్న పరిస్థితి అలానే ఉంది. నేను బాబాని, "రిపోర్ట్ నార్మల్‌గా రావాలి. పెదనాన్న త్వరగా కోలుకోవాల"ని వేడుకున్నాను. అప్పుడు రిపోర్ట్ వచ్చింది. రిపోర్టులో ఇన్ఫెక్షన్ మెదడు వరకు పోయింది అని వచ్చింది. అయితే డాక్టర్, "ఇన్ఫెక్షన్‌కి మందులు వాడితే సరిపోతుంది. ఆయన నార్మల్ అవుతార"ని చెప్పారు. అది విని అందరం కాస్త ఉపశమం పొందాము. ఒక పదిహేను రోజులకి పెదనాన్న పూర్తిగా నయమై ఇంటికి వచ్చారు. "చాలా కృతజ్ఞతలు బాబా. మీ దయవలన పెదనాన్న ఇంటికి నార్మల్‌‌గా వచ్చారు. ఇలానే మీ కరుణ ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండేలా చూడు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo