- ప్రతి విషయంలో సహాయం చేస్తున్న బాబా
నా పేరు హాసిని. ఒకరోజు నేను నా ఫ్రెండ్తో చదువు గురించి చాట్ చేస్తుండగా ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదివరకే నా ఫోన్కి ఆ సమస్య ఉంది. అయితే అప్పుడు ఫోన్ స్టోరేజ్ నిండిపోవడం వల్ల హ్యాంగ్ అయి స్విచ్ ఆఫ్ అయ్యేది. కానీ ఈసారి సమస్య అది కాకపోయినప్పటికీ ఎందుచేతనో హఠాత్తుగా స్విచ్ ఆఫ్ అయింది. ఎంత ప్రయత్నించినా ఆన్ అవ్వలేదు. అప్పుడు ఈ బ్లాగులో చదివిన ఒక భక్తుని అనుభవం గుర్తు వచ్చింది. అదేమిటంటే, ఒక అంకుల్ తన ఫోను ఆన్ అవ్వకపోతే బాబా ఊదీ రాసానని, బాబా దయతో ఫోన్ పని చేసిందని. అందువల్ల నేను కూడా నా ఫోన్కి ఊదీ రాసాను. కానీ నా ఫోన్ ఆన్ అవ్వలేదు. అప్పుడు నేను, 'అంకుల్ ఫోన్ పని చేసింది, నా ఫోన్ ఎందుకు ఆన్ అవ్వలేదు' అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ ఆన్ చేసే ముందు, "బాబా! నా ఫోన్ ఆన్ అయ్యేలా చూడండి" అని వేడుకొని ఆన్ చేస్తే, వెంటనే ఫోన్ ఆన్ అయింది. అంతా బాబా చేసిన అద్భుతం.
2023, ఆగస్టులో మా కుటుంబమంతా కలిసి గిరిప్రదక్షిణ చేయాలని అరుణాచలం వెళ్ళాము. గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే, మొత్తం 14 కిలోమీటర్లు నడవాలి. అది కూడా చెప్పులు, సాక్సులు లేకుండా. మేము సాయంత్రం 5 గంటలకు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. అప్పుడు నేను ముందుగా బాబాని తలుచుకున్నాను. దారిలో ఉన్న 8 శివలింగాల దగ్గర మాకు విబూది ఇస్తే, నేను నుదుటన పెట్టుకొని, మిగిలింది నోట్లో వేసుకొని, "నాకు ఓపికనివ్వండి బాబా" అని అనుకుంటూ ముందుకుసాగాను. మధ్యలో ఓ చోట ప్రదక్షిణ కొనసాగించడానికి మాకు అస్సలు ఓపిక లేకుండా పోయింది. అప్పుడు నేను బాబానే తలుచుకొని, "బాబా! నాకు, నా కుటుంబానికి గిరి ప్రదక్షిణ పూర్తి చేసే ఓపికనివ్వండి" అని బాబాను బతిమాలుకున్నాను. తర్వాత కూడా బాబాని, అర్ధనారీశ్వరులను తలుచుకుంటూ నడకసాగించాను. బాబా దయవల్ల మంచిగా ప్రదక్షిణ పూర్తై రాత్రి 12 గంటలకు మా గదికి చేరుకున్నాము. అంత దూరం నడిచినందున కాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి మా వాళ్ళందరూ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకున్నారు. నేను మాత్రం వేసుకోలేదు. బాబా దయవల్ల మరుసటిరోజుకి నాకు ఎలాంటి నొప్పులు రాలేదు. సాధారణంగా నా కాళ్ళకి పగుళ్లు సమస్య ఉంది. చెప్పులు లేకుండా నడిస్తే ఖచ్చితంగా పగుళ్లు వచ్చి నొప్పి ఉంటుంది. అలాంటిది 14 కిలోమీటర్లు నడిచినా ఎక్కడా కాళ్లు పగలలేదు. అంతా బాబా దయ.
అరుణాచలంలో దైవ దర్శనానంతరం మేము కంచి వెళ్లి విష్ణుకంచి, శివకంచి దర్శించి తర్వాత వెల్లూరు వెళ్ళాము. అదేరోజు రాత్రి మేము తిరుపతిలో తిరుగు ప్రయాణానికి రైలు ఎక్కవలసి ఉంది. అయితే వెల్లూరు నుంచి తిరుపతి వెళ్లి రైలు అందుకోవడానికి చాలా తక్కువ సమయం వుండింది. బస్సువాళ్ళని అడిగితే తిరుపతి బస్టాండ్కి చేరుకునేసరికి రాత్రి 9:50 అవుతుందన్నారు. అక్కడినుండి మేము రైల్వేస్టేషన్కి వెళ్ళాలంటే మాతో పాటు ఉన్న పెద్దవాళ్ళు తొందరగా నడవలేరు కాబట్టి స్టేషన్కి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందువల్ల మాకు రైలు అందుతుందో, లేదో అని నాకు భయమేసి వెల్లూరులో బస్సు ఎక్కే ముందు, "బాబా! మేము ఎలాగైనా రైలు అందుకునేలా చూడండి. రైలు తప్పిపోతే అమ్మమ్మ, తాతయ్యలకు ఇబ్బందవుతుంది. కాబట్టి మీ దయతో బస్సు కాస్త ముందుగా చేరుకొని, రైలు తప్పిపోకుండా ఉండేలా దయ చూపండి" అని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత కూడా బాబాకి చెప్పుకుంటూనే ఉన్నాను. అయితే మధ్య దారిలో టిఫిన్ల కోసమని బస్సు ఆపారు. అప్పుడు మేము 'ఇంకా రైలు తప్పిపోయినట్లే!' అని అనుకున్నాము. కానీ బాబా దయవల్ల రైలుకి ఇంకా కొంచం సమయం ఉందనగా బస్సు తిరుపతి బస్సు స్టాండ్కి చేరుకుంది. మేము చకచకా బస్సు దిగి ఆటో ఎక్కాము. రైల్వేస్టేషన్కి చేరుకున్నాక మేము ఆటో అతనికి డబ్బులిచ్చి వెళ్లిపోతుంటే అతను, "అమ్మా! మీ బ్యాగులు తీసుకోండి" అని అన్నాడు. విషయమేమిటంటే, హడావిడిలో మేము మా బ్యాగులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. సాధారణంగా ఆటోవాళ్ళు డబ్బులిచ్చాక వెళ్లిపోతారుగాని మేము సామాను ఏమైనా మరిచిపోయామా అని చూడరు. బాబాయే మా బ్యాగులు పోకుండా సహాయం చేసారని అనుకున్నాను. ఇకపోతే, రైలు సమయానికంటే ముందే స్టేషన్కి చేరుకున్నాము. ఇదంతా బాబా దయ. లేకపోతే ఎంత ప్రయత్నించినా బస్సు డ్రైవర్ వేగంగా తీసుకొచ్చేవారు కాదు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే, బాబా తమ భక్తులని పస్తు ఉంచారు కదా! మేము ఎక్కాల్సిన రైలు రావడానికి కాస్త ఆలస్యమైంది. దాంతో మేము చక్కగా స్టేషన్ దగ్గర్లో టిఫిన్లు తీసుకొని ట్రైన్ ఎక్కాక తిన్నాము. అలా బాబా దయవల్ల మా అందరి అరుణాచల దర్శనం చాలా మంచిగా జరిగింది.
ఒకసారి నేను డబ్బులు ఎక్కడో పెట్టేసి మార్చిపోయాను. అలానే ఒక సరస్వతి కవచం తాలూకు జిరాక్స్ పేపర్ కూడా ఎక్కడో పెట్టి మార్చిపోయాను. "బాబా! ఆ రెండూ దొరికేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, 3 నిమిషాల్లో అవి దొరికాయి.
మా అమ్మకి టెన్షన్ ఎక్కువ. ఏ చిన్న విషయం జరిగినా ఊరికే టెన్షన్ చెంది నిరాశపడిపోతుంటారు. ఒకసారి రెండు రోజులైనా అమ్మ అలానే ఉంటే నేను 3వ రోజు, "బాబా! నేను ఊదీ అమ్మకి ఇస్తున్నాను. తనని నార్మల్ చేయండి" అని బాబాతో చెప్పుకొని ఊదీ నీళ్లలో కలిపి అమ్మకి ఇచ్చాను. బాబా దయవల్ల అమ్మ మరుసటిరోజుకి మామూలు అయింది. నిజానికి ఏదైనా కష్టమొస్తే ఊదీ వాడాలనిగాని, ఇంకేదైనా వాడాలనిగాని, అది చేయాలి, ఇది చేయాలి అని గానీ నాకు తెలీదు. ఈ బ్లాగ్ చదివాకే కష్టమొస్తే ఏం చేయాలో తెలిసి ఆవిధంగా చేస్తున్నాను. ఈ బ్లాగ్ వల్ల బాబాపై నాకు భక్తి, ప్రేమలు ఇంకా ఇంకా అధికమవుతున్నాయి. ఈ బ్లాగ్ లేకపోతే నేను ఏమైపోతానో నాకు తెలీదు. అంతా బాబా ఇచ్చిన అదృష్టం. "ధన్యవాదాలు బాబా".
ఒకరోజు నేను సాయినాన్నని, "నాన్నా! గురువారం లోపు శిరిడీలో మీరు చిలుక ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి నాకు దర్శనం ఇవ్వండి" అని అడిగాను. కానీ గురువారం వరకు నేను కోరుకున్న రంగు వస్త్రాల్లో బాబా దర్శనం ఇవ్వలేదు. నేను చాలా బాధపడ్డానుగాని తర్వాత. 'పోనీలే, నాలా చాలామంది భక్తులు బాబాని అడుగుతారు. ఆయన వాళ్ళు కోరుకున్న వస్త్రాల్లో దర్శనమిచ్చి వాళ్ళని కూడా సంతృప్తిపరచాలి కదా! అందుకే కుదరలేదేమో!' అని అనుకోని ఆ విషయం అక్కడితో మర్చిపోయాను. ఆ తర్వాత 2023, అక్టోబర్ 19, గురువారంనాడు ధూప్ హారతికి నేను కోరుకున్న చిలుక ఆకుపచ్చ రంగు వస్త్రాల్లో దర్శనం ఇచ్చారు బాబా. నేను చాలా సంతోషించి, ‘అడిగింది మనం మర్చిపోయినా బాబా ఎప్పటికీ మార్చిపోర'ని అనుకున్నాను.
గతంలో నేను పంచుకున్న ఒక అనుభవంలో మా ఇంటి దగ్గర పువ్వులు కోయడానికి ఎప్పుడు వెళ్లినా ఒక తాతగారు నన్ను తిట్టేవారని, అప్పుడు నేను ఆ తాత ఏదో ఒకటి అంటారన్న భయంతో పువ్వులు కోయడానికి వెళ్ళేటప్పుడు బాబాని తలుచుకుంటే ఆ తాత ఏమీ అనలేదని చెప్పాను. ఆ తర్వాత నేను ఆ తాత ఏమీ అనట్లేదని బాబాను తలుచుకోకుండా మామూలుగా పువ్వులు కోయడానికి వెళ్తే ఆ తాత నాపై అరిచారు. అప్పుడు నేను ఆ తాత తిట్టకుండా బాబానే రోజూ నాకు సహాయం చేస్తున్నారని గ్రహించాను. నిజంగా బాబా నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. ఒక సంవత్సరం నుంచి నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. అది నెరవేర్చండి ప్లీజ్ బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.


