- మొక్కు తీర్చుకోవడంలో బాబా అనుగ్రహం
2020లో మా అక్క, బావల మధ్య గొడవలు జరిగి అక్క మా ఇంటికి వచ్చేసింది. ఆ సమస్యతో పోరాడుతున్న సమయంలో ఒకరోజు నేను, మా అక్క, మా తల్లిదండ్రులు కలిసి వెంకయ్యస్వామి దర్శనం కోసం గొలగమూడి వెళ్లాము. అక్కడ నేను ఆవేదనతో, "మా అక్క జీవితం నిలబెట్టమ"ని స్వామిని వేడుకున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టులో వెంకయ్యస్వామి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. నేను అక్క, బావ కలిస్తే వచ్చే ఏడాది జరిగే స్వామి ఆరాధన ఉత్సవాల సమయంలో 3 రోజులు స్వామి సేవ చేస్తానని అనుకున్నాను. నా దృష్టిలో వెంకయ్యస్వామి, సాయినాథుడు వేరు కాదు. ఆ స్వామి రూపంలో ఉండే సాయినాథుడు నా కోరికను ఒక్క నెల లోపల తీర్చారు. గొడవలేమీ లేకుండానే అక్క, బావ కలిసారు. నా కోరిక ఫలించింది. దాంతో నేను వచ్చే ఏడాది ఆరాధన సమయంలో నా మొక్కు తీర్చుకుందాం అని అనుకున్నాను. అయితే 2021లో కోవిడ్ కారణంగా ఆరాధన ఉత్సవాలు జరగలేదు. 2022లోనైనా మొక్కు తీర్చుకుందామంటే సరిగ్గా ఆ సమయానికి అడ్డాలు వచ్చి పడ్డాయి. ప్రతిసారీ ఇలా జరుగుతుందేంటని నాకు చాలా భయమేసింది, బాధ కలిగింది. 2023లో ఎలాగైనా నా మొక్కు తేర్చుకోవాలని దృఢ సంకల్పం చేసుకొని నా మొక్కు తీరేదాకా 'ఓం నారాయణ ఆదినారాయణ' నామాన్ని వ్రాసి ప్రతినెలా స్వామి ధునికి సమర్పించాలని అనుకున్నాను. అది నెరవేరేలా, అలాగే సేవ చేసుకునే అవకాశమివ్వమని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నిజానికి నాకు అక్కడ ఎలా సేవ చేయాలి? ఎవరిని అడగాలి? అసలు చేయనిస్తారో, లేదో కూడా తెలియదు. వాటి గురించి గొలగమూడి వెళ్లిన ప్రతిసారీ అక్కడివాళ్లను అడిగేదాన్ని. వాళ్లు ఆఫీసులో కనుక్కొండి అనేవాళ్లు. ఆఫీసులో అడిగితే ఒకసారి చేయడనికి లేదని, లేదంటే ప్రసాదాలయంలో అడగండని చెప్తూ ఉండేవారు. ఇలా ఎవరూ నాకు సరైన సమాచారం ఇవ్వలేదు. చివరికి ఆరాధన సమయం దగ్గరికి వచ్చేసింది. నాకు ఈసారి కూడా మొక్కు తీరదని భయమేసి, "ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా మొక్కు తీర్చుకోగలగాలి బాబా. అదే జరిగితే మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. రేపు ఆరాధన అనగా ముందురోజు వరకూ ఏ సేవ చేయాలి, ఎవరిని అడగాలి అన్న విషయంలో నాకు స్పష్టత రాలేదు. అయినా బాబా మీద భారమేసి మా నాన్నతో గొలగమూడికి బయలుదేరి 'సేవ చేసే అవకాశం దొరికినా, దొరకకపోయినా ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండాల'ని అనుకున్నాను. ముందుగా నేను, నాన్న స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. నాన్నకి అక్కడ పనిచేసే అధికారి ఒకరు తెలుసు. ఆయన్ని అడుగుతానని నాన్న అన్నారు. కానీ ఆ సమయంలో ఉత్సవం జరుగుతుంది. జనం బాగా ఉన్నారు. అందువల్ల ఆ ఆఫీసర్ దగ్గరకి పోవడం కష్టమైంది. కాసేపటికి బాబా, స్వామి దయవల్ల ఆ అధికారి జనాన్ని దాటుకొని పక్కన ఉన్న ఒక షాపు దగ్గరకి వచ్చి నిలబడ్డాడు. నాన్న వెళ్లి ఆయన్ని పలకరించి సేవ చేసుకోవాలన్న నా మొక్కు గురించి చెప్పి, "అవకాశం ఇవ్వమ"ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకొని చేసుకోమన్నారు. కానీ ఏ సేవ చేయాలో చెప్పలేదు. తర్వాత మా నాన్నకి తెలిసినవాళ్ళు 'ఉభయం'(దేవాలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవ, ప్రత్యేక ఉత్సవాల్లో అయ్యే ఖర్చును భరించే వారిని ఉభయ కర్తలని వారు సమర్పించే ధన, వస్తు, ప్రసాద, పూజా సామాగ్రిని ఉభయం అని అంటారు) చేస్తుంటే, వాళ్లలో బాగా తెలిసిన ఆయనతో నాన్న నా మొక్కు గురించి చెప్పి,.ఆఫీసర్ అనుమతి ఇచ్చారని కూడా చెప్పి నన్ను ఆయనకి అప్పజెప్పి వెళ్ళిపోయారు. కాసేపు తర్వాత ఆయన నన్ను తీసుకెళ్లి మందిరంలో ఉండే పనివాళ్లతో చెప్పి, నన్ను అక్కడ ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. నేను అక్కడే నిలబడి, అక్కడ ఉన్న ఒక వ్యక్తిని, "ఎదైనా పని ఉంటే చెప్పండి. సేవ చేయడానికి వచ్చాను" అని అన్నాను. అతను మొదట అనుమానంగా చూసాడు. అప్పుడు నేను పలానా అధికారి దగ్గర అనుమతి తీసుకున్నానని చెప్పాను. అతను సరేనని క్యూ కంట్రోల్ చేయమని చెప్పాడు. దాంతో ఒక పక్క సేవ చేసే అవకాశం దొరికిందని సంతోషం, ఇంకోపక్క ఇదివరకు ఎప్పుడు ఇలాంటి సేవ చేయలేదన్న బెరుకుతో మద్యలో నిల్చుని క్యూ కంట్రోల్ చేయడంలో నిమగ్నమయ్యాను. ఆ సాయినాథుడు నాకోసం ఒక అద్భుతం చేసారు. నేను అక్కడ భయంభయంగా నిలబడి ఉండగా నా పక్కకు వచ్చి ఒక ఆవిడ నిలబడింది. ఆవిడ ఎవరో కాదు, నా చిన్నప్పుడు మా ఎదురింట్లో ఉండే ఆంటీ. ఆంటీని చూడగానే నాకు భయం, బెరుకు పోయి భలే ఉత్సాహం వచ్చింది. తనని పలకరించగా తను కూడా సేవ చేయడానికి వచ్చారని తెలిసింది. తనకు వాలంటీర్ పాస్(రెగ్యులర్ గా సేవ చేసేవాళ్ళకి ఇచ్చే పాస్) ఉంది. నేను తనతో నా మొక్కు గురించి చెప్పి, "మూడు రోజులు నాతో సేవ చేయించండి" అని అడిగాను. ఆంటీ ఎంతో సంతోషించి తను చేసే అన్నీ సేవలకి నన్ను తీసుకుపోతానని చెప్పింది. సేవ చేయాలని మొక్కుకొని ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక ఇబ్బందిపడ్డ నాకు బాబా ఆవిధమైన ఏర్పాటు చేసినందుకు పులకించిపోయాను. ఆ మూడు రోజులూ ఆంటీ నన్ను నిమిషం కూడా వదలకుండా తనతోనే ఉంచుకొని అవకాశం ఉన్న సేవలన్నీ నాతో చేయించింది. అలాగే ఇంకో విషయం, మందిరంలోని పూజారి ఆంటీతో "ఆ అమ్మాయి కొత్త అమ్మాయిలా ఉంది. మీరు దగ్గర ఉండి భోజనానికి తీసుకువెళ్లండి" అని చెప్పాడు. అది పూజారి చెప్పినట్టుగా నాకు అనిపించలేదు, వెంకయ్యస్వామి రూపంలో సాయినాథుడే చెప్పినట్టు అనిపించింది. ఆ బాబా దయవల్ల నా శక్త్యానుసారం 3 రోజులు సేవ చేసుకొని మొక్కు తీర్చుకున్నాను. నా మొక్కు తీరినందుకు నేను పొందిన సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.
ఇంకో రెండు అనుభవాలు చెప్పి ముగిస్తాను. నా మేనత్తకి చిన్న వయసులోనే షుగర్ వచ్చింది. దానివల్ల తను తరచూ అనారోగ్యం పాలవుతుంటుంది. తనకి నాలుగు ఆపరేషన్లు కూడా జరిగాయి. అలాంటి తను ఈమద్య జ్వరం, జలుబు, ఆయాసంలతో మళ్ళీ అనారోగ్యం పాలైంది. నాకు చాలా బాధేసి "బాబా! అత్తకి వెంటనే తగ్గిపోతే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో అత్తకి జ్వరం, జలుబు, ఆయసం తగ్గాయి. "ధన్యవాదాలు బాబా. అత్త ఆరోగ్యం నిలకడగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ".
అత్తకి బాగలేని సమయంలోనే నాకు కూడా జలబు చేసింది. ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. జలుబు వల్ల ఆఫీసులో ఒక పని సరిగ్గా చేయలేకపోయాను. దానివల్ల ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చాలా భయపడ్డాను. ఒక రాత్రి అయితే పని భయం, జలుబు వల్ల విసుగు వచ్చి అస్సలు నిద్రపోలేకపోయాను. అప్పుడు మా నాన్న డాక్టర్ని అడిగి ఒక టాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. ఆ టాబ్లెట్తో కూడా నాకు తగ్గుతుందనిపించక టాబ్లెట్ వేసుకునే ముందు దేవుడు గదిలోకి వెళ్లి, టాబ్లెట్ బాబా పాదాల దగ్గర పెట్టి, కొంచెం ఊదీ పెట్టుకొని, "బాబా! ఈ టాబ్లెట్తో జలుబు తగ్గాలి" అని ప్రార్థించి టాబ్లెట్ వేసుకున్నాను. బాబా కృపతో పక్క రోజుకి జలుబు కాస్త తగ్గింది. ఆ పక్కరోజుకి పూర్తిగా తగ్గిపోయింది. ఆఫీసులో నేను సరిగ్గా చేయలేకపోయిన పని వల్ల కూడా ఏ ఇబ్బంది రాలేదు. ఇలా అనుక్షణం నాతో ఉండి నా ప్రతి ప్రార్థనని వింటున్న ఆ సాయినాథునికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాకు సదా ఆయన స్మరణ కలిగిలే దీవించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
శుభం భవతు !!!!

