సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 983వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి ఊరట
2. క్షేమంగా ప్రయాణాన్ని పూర్తి చేయించిన బాబా
3. స్మరణతో కష్టాన్ని తొలగించిన బాబా

బాబా కృపతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి ఊరట


నా పేరు సుమన్. సాయిబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. తలచినంతనే పలికే దైవం సాయినాథుడు. ఆయన నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, నవంబర్ నెల రెండవవారం ఆరంభంలో ఒకరోజు నా కాలు బెణికింది. దాంతో పాదం పైభాగంలో వాపు వచ్చి విపరీతంగా నొప్పి పెట్టసాగింది. నేను ఆ నొప్పి తట్టుకోలేక టాబ్లెట్స్ వేసుకున్నాను. అప్పటికి కాస్త బాగానే ఉన్నా రాత్రికి నొప్పి మళ్ళీ తీవ్రమైంది. అప్పుడు నేను బాధతో సాయి నామం తలుచుకుంటూ నొప్పి ఉన్న ప్రాంతంలో ఊదీ రాశాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి నొప్పి 50శాతం తగ్గింది. 2021, నవంబర్ 11నాటికి పూర్తిగా తగ్గిపోయింది. అంతా బాబా ఊదీ మహిమ. "ధన్యవాదాలు బాబా".


నాకు చాలాకాలంగా మలవిసర్జన చేసేటప్పుడు బ్లడ్ వచ్చే సమస్య ఉంది. ఎన్ని రకాల వైద్యం తీసుకున్నా, ఎన్ని మందులు వాడుతున్నా నయం కావడం లేదు. ఎన్నోసార్లు బాబాకి చెప్పుకుని, ఊదీ సేవిస్తున్నా కూడా సమస్య అలానే ఉంది. ఇలా ఉండగా 2021, నవంబర్ 6న మలం బాగా గట్టిగా అయ్యేసరికి నేను చాలా భయపడ్డాను. నేను భయపడినట్లే మలవిసర్జన చేయడం బాగా ఇబ్బంది అయ్యింది. నేను ఆ బాధతట్టుకోలేక హాస్పిటల్ కి ఫోన్ చేసి ఎనీమో చేయించుకోవడానికి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల హాస్పిటల్ కి వెళ్ళడానికి నేను బాగా భయపడిపోయాను. అప్పుడు గురువుగారి(బాబా) పాదతీర్థం త్రాగుతున్నట్లుగా భావించుకుని నీళ్ళు నిమిష నిమిషానికి త్రాగుతూ బాబాను బాగా ప్రార్థించాను. దాంతో సమస్య కాస్త పరిష్కారమైంది. "థాంక్యూ బాబా. బ్లడ్ అస్సలు రాకుండా మల విసర్జన అయ్యేలా అనుగ్రహించండి గురుదేవా".


క్షేమంగా ప్రయాణాన్ని పూర్తి చేయించిన బాబా


నా పేరు సత్య. సాయి బంధువులందరికీ నమస్కారం. ఈమధ్య జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, అక్టోబరులో మా కుటుంబమంతా(నేను, నా భార్య, కూతురు, కొడుకు) అత్యవసరంగా హైదరాబాదు వెళ్ళాల్సిన పని పడింది. బెంగుళూరు నుండి హైదరాబాద్ కి ట్రైన్ టికెట్లు అందుబాటులోనే ఉన్నప్పటికీ ఈ కరోనా సమయంలో ట్రైన్ లో వెళ్లడం సురక్షితం కాదనిపించి విమానంలో వెళ్దామనుకుంటే, హైదరాబాద్ వెళ్లి రావడానికి 50 వేల రూపాయలు ఖర్చవుతుంది. అందుచేత మా సొంత కారులో వెళ్ళొద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నేను ఎప్పుడూ 50, 60 కిలోమీటర్ల దూరానికి మించి కారు నడపలేదు. అలాంటిది 600 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. 2021, అక్టోబరు 20, ఉదయం 10 గంటల 15 నిమిషాలకు బాబాకి దణ్ణం పెట్టుకుని బెంగళూరులోని మా ఇంటి వద్ద మా ప్రయాణం మొదలుపెట్టాము. మేము అనంతపురం, కర్నూలు మీదుగా హైదరాబాదు వెళ్తుండగా కర్నూలు దాటినప్పటినుండి నా కళ్ళు మూతలు పడుతున్నట్లు అనిపించసాగాయి. అది నిద్రమత్తు కాదు. ప్రతి పది, పదిహేను నిమిషాలకి కారు అపి, కళ్ళు కడుక్కుని టీ తాగుతూ ప్రయాణం సాగించాము. కానీ నాకు కారులో దూరప్రయాణం చేసే అలవాటు లేనందున కొంచెం భయమేసింది. ఒక చోట కారు ఆపి, మరోసారి సాయికి నమస్కరించి, "తండ్రీ ఏ కష్టమూ లేకుండా క్షేమంగా మేము హైదరాబాద్ చేరుకునేలా, అలాగే తిరిగి వచ్చేలా చూడండి. నేను నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. పది గంటల ప్రయాణం కాస్త 12 గంటలు తీసుకున్నప్పటికీ ఎలాగైతేనేమి మేము క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాము. బాబా దయవల్ల  ఏ ప్రమాదాలు, ఆటంకాలులేక మా ప్రయాణం పూర్తయింది. తరువాత 2021, అక్టోబర్ 30, ఉదయం 5 గంటల 30 నిమిషాలకు హైదరాబాదులో బయలుదేరి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యాము. హైదరాబాద్ దాటిన తర్వాత సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసిన మీదట మళ్ళీ కళ్ళు మూతలు పడటం ప్రారంభమయ్యాయి. అక్కడక్కడా ఆగి కళ్ళు కడుక్కుని, టీ త్రాగి వర్షంలో మా ప్రయాణం సాగిస్తూ, "బాబా! మాకు ఏ కష్టం లేకుండా బెంగళూరు చేర్చు తండ్రి" అని ప్రార్థించాము. ఈసారి 15 గంటల సమయం పట్టింది. కానీ ఎటువంటి కష్టం  లేకుండా బాబా మమ్మల్ని క్షేమంగా ఇల్లు చేర్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


స్మరణతో కష్టాన్ని తొలగించిన బాబా


రాజాధిరాజాయ విద్మహే

యోగిరాజాయ ధీమహే

తన్నో సాయి ప్రచోదయాత్!!!


సాయిభక్తులకు నా ప్రణమాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఏ కష్టం వచ్చినా సాయిని తలుచుకుని ఆయనకు నమస్కరించుకుంటాను. 2021, అక్టోబర్ 30 రాత్రి 12 గంటలకు నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. నా గొంతులో ఏదో అడ్డం పడినట్లు, నాలుక చిమచిమలాడుతున్నట్లు, కాలివేళ్ళు కొద్దిగా తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండటంతో నాకు చాలా భయమేసి, నాకు ఏమన్నా అవుతుందేమోనని టెన్షన్ పడ్డాను. నేను బాత్రూంకి వెళ్లి వచ్చాక మావారు, "ఎందుకలా కంగారు పడతావు,ఒక్కోసారి అలా అవుతుంది, ఏమీ కాదులే పడుకో!" అని అన్నారు. అందుకు నేను, "మీరు పడుకోండి, నేనేమి మీకు డిస్టర్బ్ చేయలేదు కదా!" అన్నాను. తరువాత, "బాబా! నాకు నువ్వే దిక్కు తండ్రి. మీ దయవలన నాకొచ్చిన ఇబ్బంది తగ్గిపోతే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదట్లో చెప్పిన సాయిగాయిత్రి ఒక్కటి చదువుకుంటే(ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు) చాలావరకు మన సమస్యలు పోతాయని నేను చదివాను. ఆ విషయం గుర్తొచ్చి నేను సాయిచాలీసా, సాయిగాయిత్రి చదవసాగాను. నెమ్మదిగా నాలో భయం తగ్గుతూ నాకు వచ్చిన కష్టం తొలగిపోయింది. దాంతో నేను హాయిగా నిద్రపోయాను. ఇలా ఎన్నో సమస్యలను తీర్చి నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు బాబా.  నేను ఏదైనా విషయంగా టెన్షన్ పడుతున్నా, సమస్య వచ్చి సాయిని తలచుకున్నా 'నీకు ఏమీ కాదు' అని బాబా చూపిస్తారు. బాబా చూపిన ప్రేమను ఇలా వ్రాస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. "ధన్యవాదాలు బాబా. నేను మీకు మాటిచ్చినట్లు ఉదయం పని ఒత్తిడి వల్ల నా అనుభవాన్ని వ్రాయలేకపోయాను మన్నించండి బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo