1. బాబా అనుగ్రహంతో కరోనా నుంచి కోలుకున్న కుటుంబం
2. సాయి ఎప్పుడూ మన తోడుగా ఉంటారు
3. బాబా దయతో తగ్గిన వెన్నునొప్పి
బాబా అనుగ్రహంతో కరోనా నుంచి కోలుకున్న కుటుంబం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ సాయినాథ్ మహారాజ్ చరణారవిందములకు శతకోటి నమస్కారాలు. సాయిభక్తులందరికీ నమస్కారం. బాబా తమ భక్తులకు ప్రసాదిస్తున్న విశేష అనుభవాలను ప్రచురిస్తున్న ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మనఃపూర్వక అభినందనలు. నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా బాబాకి మాటిచ్చినట్లు వెంటనే నా అనుభవాన్ని పంచుకోలేకపోయినందుకు బాబాకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో అంటే 2021, ఏప్రిల్ 30న మొదట నాకు దగ్గు మొదలైంది. మరుసటిరోజు సాయంత్రం వరకు నార్మల్ గానే ఉంది. ఆపై సమయం గడుస్తున్న కొలది తట్టుకోలేక కళ్ళు తెరవలేని స్థితికి చేరుకున్నాను. దాంతో మావారు, పిల్లలు చాలా భయపడిపోయారు. 2021, మే 2న అందరమూ కరోనా టెస్టు చేయించుకుంటే నాకు, మా పెద్దబాబుకి పాజిటివ్ వచ్చింది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టరును సంప్రదిస్తే, బాబుకి మందులు వ్రాసి, నా ఆరోగ్యరీత్యా నాకు కొన్ని టెస్టులు చేయించమన్నారు. నేను భయంతో బాబాను స్మరిస్తూ టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్లేసరికి సిటీ స్కాన్ చేయమన్న డాక్టరు డిజిటల్ ఎక్స్-రే తీయమన్నారు. అయితే బాబా దయవలన ఎక్స్-రే మొదలు అన్ని టెస్టులు నార్మల్ వచ్చాయి. కానీ ఆరోజు రాత్రి 11 గంటల నుండి విపరీతమైన దగ్గు రావడం మరియు శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది మొదలైంది. ఒంటిగంట వరకు నా పరిస్థితి అలాగే కొనసాగింది. ఇక అప్పుడు నేను బాబాను తలుచుకుని, 'ఓం నమో శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరించసాగాను. అలా స్మరిస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాను. బాబా దయవలన తెల్లవారేసరికి అంతా నార్మల్ అయి నా ఆరోగ్యం మెరుగుపడింది. తరువాత 2021, మే 8న మావారికి కాస్త తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. మరుసటిరోజు మావారు టెస్టు చేయించుకోవడానికి వెళితే, ఆరోజు ఎక్కడా టెస్టులు చేయలేదు. మావారు ఇంటికి తిరిగి వస్తూ ఇంటిముందు కాలుజారడం వలన బొటనవేలుకు పెద్ద దెబ్బ తగిలి 7 కుట్లుపడ్డాయి. అంతలో జ్వరం మొదలైంది. పెద్ద దెబ్బ కదా! ఆ నొప్పుల వలన జ్వరం వచ్చిందని మేము అశ్రద్ద చేసాము. కానీ మూడవరోజున మావారికి కరోనా పాజిటివ్ వచ్చింది. సిటీ స్కాన్ చేసి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ చేరింది అన్నారు. నేను భయపడి బాబాని తలుచుకుంటూ డాక్టరుకి ఫోన్ చేస్తి, "హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడమ"ని చెప్పారు. ఆ మాటలు విన్నాక నాకు కంగారు తగ్గింది. కానీ మావారు కోలుకునేసరికి 15 రోజులు పట్టింది. ఏదైతేనేమి బాబా మా కుటుంబాన్ని కరోనా నుండి కాపాడారు. "ధన్యవాదాలు బాబా! ఇలాగే మీ కరుణ, దయ, ప్రేమానురాగాలు ఎప్పుడూ మాపై చూపించండి తండ్రి. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించండి బాబా". నేను బాబాను మరో విషయం గురించి విన్నవించుకున్నాను. అది నెరవేరిన తరువాత మళ్ళీ ఈ బ్లాగులో పంచుకుంటాను.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సాయి ఎప్పుడూ మన తోడుగా ఉంటారు
ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నా పేరు హరిత. నేను సాయిభక్తురాలిని. సాయి ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. చాలా విషయాల్లో ఆయన నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. కొన్నిసార్లు బాధ కలిగించే సంఘటనలు జరిగినప్పటికీ ఆ బాధ నాకు తెలియకుండా ఉండేలా రక్షిస్తుంటారు బాబా. ప్రతిరోజూ ఉదయం నేను నిద్రలేవగానే ఈ బ్లాగును చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య మా అమ్మగారికి జ్వరం వచ్చినట్లు నాకు ఒక కల వచ్చింది. నేను నిద్రలేచిన వెంటనే అమ్మకి ఫోన్ చేసి నాకిలా కల వచ్చిందని చెపితే, "నిజమే నాకు రాత్రి నుండి జ్వరంగా ఉంది" అని అమ్మ చెప్పింది. అది విని ఆశ్చర్యపోయాను. అయితే అప్పటికే జ్వరంతో భాదపడుతున్న నాన్నకి 'వైరల్ ఫీవర్' అని చెప్పారు. అందువల్ల నాకు భయమేసి, "బాబా! తొందరగా అమ్మానాన్నలిద్దరికీ జ్వరం తగ్గేలా చూడు తండ్రి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవలన రెండురోజుల్లో వాళ్ళకి జ్వరం తగ్గి అంతా నార్మల్ అయ్యింది.
ఒకసారి చాలా అర్జెంట్ పని మీద మేము ఊరు వెళ్లాల్సి వచ్చింది. మేము బయలుదేరడమే ఆలస్యమనుకుంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు నేను, "బాబా! వాహనాలు చాలా దూరం వరకు ఆగిపోయాయి. దయచేసి తొందరగా ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్లు చూడండి" అని ప్రార్థించాను వెంటనే వాహనాలు కదలడం మొదలుపెట్టాయి. సాయి ఎప్పుడూ మన తోడుగా ఉంటారు. మనం తలుచుకున్నా, లేకున్నా ఎప్పుడూ మన వెంట ఉంటూ ముందుకు నడిపిస్తారు. ఆయన సంరక్షణలో మనమంతా క్షేమంగా ఉంటాము. "థాంక్యూ బాబా. ఎప్పుడూ ఇలాగే మీ రక్షణను అనుగ్రహించు తండ్రి. అనుభవాలు పంచుకోవడం ఆలస్యమై ఉంటే క్షమించండి బాబా". నా జీవితంలో అతి పెద్ద సమస్య ఒకటి ఉంది. బాబా ఆశీస్సులతో అది తొందరగా పరిష్కారమైతే ఈ బ్లాగులో పంచుకోవాలని ఆశిస్తున్నాను.
బాబా దయతో తగ్గిన వెన్నునొప్పి
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు వెంకట్రావు. మాది హైదరాబాద్. నాకు 2021, అక్టోబర్ నెల మధ్యలో వెన్నునొప్పి మొదలై పదిహేను రోజులపాటు బాధపడ్డాను. అదే సమయంలో అంటే అక్టోబర్ 24న మేము శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుని ఉన్నాము. అయితే, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం వలన శిరిడీ ప్రయాణం చేయలేమేమో అనుకున్నాము. కానీ ప్రయాణం ముందురోజు నేను డాక్టరు వద్దకు వెళ్లి, మందులు తీసుకుని ప్రయాణమయ్యాము. శిరిడీలో ఉన్న ఆ రెండురోజుల్లో నాకు నొప్పి అసలు రాలేదు. మందుల వలన నొప్పి తగ్గింది అనుకున్నాను. అయితే శిరిడీ నుంచి రాగానే మందులు వాడుతున్నా మళ్ళీ బాగా నొప్పి రాసాగింది. అప్పుడు నేను బాబా నామం చెప్పుకుని, "నొప్పి తగ్గితే, రాబోయే గురువారంనాడు నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించాను. ఆశ్చర్యంగా ఆరోజు సాయంత్రం నుంచి నొప్పి తగ్గింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
