సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1003వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చల్లని సంరక్షణ
2. శ్రీసాయి అనుగ్రహం
3. బాబాను వేడుకున్నంతనే దొరికిన మొబైల్

బాబా చల్లని సంరక్షణ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు కల్పన. నేను సాయిభక్తురాలిని. నా జీవితంలో అడుగడుగునా బాబా నాకు ఎంతో సహాయం చేసారు, చేస్తున్నారు. వాటిలో కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కృష్ణయ్యని పూజించి, సాయి నామజపం చేశాను. అలాగే నా ఆరోగ్యం బాగుండాలని, మా అబ్బాయికి మంచి దారి చూపించాలని నాకు తెలిసిన అంజనమ్మగారితో మూడుసార్లు బాబా భజన చేయించాను. ఆవిడ నన్ను 'సాయిఅమ్మ'గారి (సాయి ఉపాసకురాలు) వద్దకి తీసుకుని వెళ్లారు. నేను అమ్మతో నా కుడిభుజం వెనుకభాగం చాలా నొప్పిగా ఉందని చెబితే, అమ్మ విభూతి ఇచ్చారు. దాంతో నాకు భుజం నొప్పి పూర్తిగా తగ్గింది. తర్వాత ఒకసారి కడుపులో గ్యాస్ ఎక్కువైనందువల్ల నొప్పి వస్తుండేది. అది కూడా బాబా దయవల్ల 'సాయిఅమ్మ' ఇచ్చిన విభూతితో పూర్తిగా నయమైంది. తర్వాత ఒకసారి కుడి కన్ను నొప్పిగా ఉండి, ఏవీ చదవలేకపోయేదాన్ని. దాంతో బాబా పుస్తకాలు చదవలేనని చాలా బాధపడ్డాను. అప్పుడు బాబా, "శక్తిని ఇస్తాను" అని అన్నారు, అలాగే ఇచ్చారు. విభూతి రాయడం వలన నాకున్న కంటి సమస్య తగ్గింది. నాకు అరుగుదల తక్కువగా ఉండేది. అందువలన తిన్నది త్వరగా జీర్ణమయ్యేది కాదు. ఆ సమస్య కూడా బాబా దయవలన పరిష్కారమై నా జీర్ణవ్యవస్థ మెరుగుపడింది. 2021, ఏప్రిల్ నెలలో నా యూరినరీ బ్లాడర్‌లో గడ్డ ఉందని, ఆ గడ్డ క్యాన్సర్ గడ్డకి దగ్గరగా ఉందని అన్నారు. మావారు భయపడి బాబాను వేడుకున్నారు. బాబా దయవలన అది మామూలు గడ్డ అని నిర్ధారణ అయింది. ఒకసారి బాబా సన్నిధానంలో ఆయన దయవలన తగ్గిన నా ఆరోగ్య సమస్యల గురించి స్వర్ణగారు అనే ఆమె చెప్పమంటే, నలుగురిలో తడబడతానని భయంతో చెప్పలేకపోయాను. "బాబా! ఇన్ని రోజులూ తడబడతానని, కన్నీరు ఆగదని మీకు కృతజ్ఞత తెలుపలేకపోయాను. నన్ను క్షమించండి".


మావారు ఉద్యోగ విరమణ చేసినప్పుడు, ఇకపై ఆదాయం సరిగా ఉండదని భయపడ్డారు. బాబా మాపై దయతలచి ఉద్యోగ విరమణ చేశాక కూడా మాకు డబ్బులు సమకూర్చారు. బాబా ఆశీస్సులతో మా పిల్లలకి మంచి ఆదాయం, గుర్తింపు, మాకు సొంత ఇల్లు లభించాయి. 15 సంవత్సరాలకు పైగా సమస్యలలో ఉన్న ఒక ఇంటికి సంబంధించి బాబా దయవల్ల ఒక పరిష్కారం లభించి ఆ ఆస్తి అమ్మకి, అక్కకి, నాకు దక్కాలని తేలింది. ఇలా ఎన్నో విషయాలలో బాబా నాకు అండగా నిలిచారు, చేయలేని పనులను చేయించారు.


ఇంకో విషయం, 'సాయిఅమ్మ' ఇచ్చే విభూతి సాధారణంగా నెలపైన వస్తుంది. అలాంటిది ఈసారి విభూతి పరిమాణం పెరుగుతూ మూడు నెలలపైన వచ్చింది. ఇది బాబా లీలల్లో ఒక గొప్ప అద్భుతం.


"ధన్యవాదాలు బాబా. మమ్ము నడిపించే తల్లి, తండ్రి, అండదండ మీరే బాబా. మీ చల్లని నీడలోనే బ్రతుకుతున్న మేము ఎంతగా మీకు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే తండ్రి. మీ పాదాల చెంత మీ నామస్మరణ చేసుకుంటూ మా నలుగురి జీవితాలు తరించిపోవాలని కోరుకుంటున్నాను".


చివరిగా ఒక మాట: 'ఎవరైనా సరే బాబా నామస్మరణ చేయడం వలన ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతారన్నది నా అనుభవం. అందరూ ఇది ఆచరించవచ్చు. బావిలో నీరు తోడే కొలది ఎలా ఊరునో, బాబాను సేవించే కొలదీ వారి కృప లభిస్తుంది. తప్పక ఆయన ఆశీస్సులతో అనుకున్న అభీష్టం నెరవేరుతుంది. అందరికీ ఆయన ఆశీస్సులు లభించుగాక!'.


శ్రీసాయి అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు వీరాస్వామి. మాది వరంగల్ జిల్లాలోని లింగాల గ్రామం. బాబా ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 1996వ సంవత్సరంలో నేను బతుకుదెరువు నిమిత్తం బరోడా వెళ్ళేముందు, 'తిరుగు ప్రయాణంలో శిరిడీ దర్శించుకుని వద్దామ'ని మనసులో అనుకుని బయలుదేరాను. బరోడాలో పని ముగించుకుని రైల్లో మా ఊరికి తిరుగు ప్రయాణమయ్యాను. రైల్లో అనుకోకుండా నా కాలు తెగి రక్తం మడుగుకట్టింది. నేను గమనించేసరికి శిరిడీ వెళ్ళడానికి దిగాల్సిన స్టేషన్ దాటింది. అప్పుడు నేను, "బాబా! నేను తప్పు చేశాను. బరోడా వెళ్లి వచ్చేటప్పుడు నిన్ను దర్శించుకుంటాను అనుకుని మిమ్మల్ని దర్శించుకోలేదు. అందుకు తగిన శిక్ష వేసావా తండ్రి?" అని అనుకున్నాను. ఆ తరువాత వచ్చిన స్టేషన్‌లో దిగి వెనుతిరిగి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని మా గ్రామం వచ్చాను. నేను గ్రామం చేరుకున్నాక బాబా ఆశీస్సులతో మాకు పుత్రిక జన్మించింది. అమ్మాయికి 'సాయి సుధా' అని నామకరణం చేసుకున్నాము.


ఒకసారి నేను బైక్ మీద వేరే గ్రామానికి పనిమీద వెళుతున్నప్పుడు వెనుక నుండి ఒక కారు వచ్చి నన్ను గుద్దింది. ఆ ప్రమాదంలో నేను స్పృహ కోల్పోయాను. నన్ను హాస్పిటల్లో చేర్పించారు. 9 రోజులు కోమాలో ఉన్న నన్ను ఏ డాక్టరు చూసినా "ఇతను బ్రతకడ"ని చెప్తుండేవారు. అయితే బాబా దయవల్ల నేను సృహలోకి వచ్చాను. స్పృహలోకి అయితే వచ్చాను కానీ, నాలో చలనం లేదు. నేను బ్రతకనేమోనని భయంతో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ప్రతి నిమిషం, ప్రతిక్షణం సాయి నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. అలా వారం రోజులు గడిచేసరికి నాలో కదలిక వచ్చింది, మాట్లాడగలిగాను. డాక్టర్లు "ఇతనికి ప్రాణాపాయం తప్పింద"ని చెప్పారు. ఆ మరుసటిరోజు ఉదయం నేను మా గ్రామానికి వచ్చేసాను. ఇక ఆరోజు నుండి ప్రతిరోజూ బాబా నాకు కలలో కనిపించేవారు. ఒకరోజు కలలో బాబా జోలె పట్టుకుని వచ్చి, ఒక స్టూలు మీద ఆకుపచ్చని వస్త్రం పరిచి, "నీవు నాకు ఏమి ఇచ్చావు?" అని అడిగారు. అప్పుడు నేను, "నా దగ్గర ఐదు నాణాలు ఉన్నాయ"ని చెప్పి, ఆ 5 నాణాలను వస్త్రం యొక్క నాలుగు మూలల్లో ఒక్కొక్కటి ఉంచి, మధ్యలో ఒకటి ఉంచాను. బాబా ఆ ఐదు నాణాలను మూటకట్టుకుని అదృశ్యమయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బాబా కనిపిస్తూనే ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".


బాబాను వేడుకున్నంతనే దొరికిన మొబైల్


సాయిభక్తలందరికీ నమస్తే. నా పేరు మహేష్. 2021, నవంబర్ 20న మేము మా పొలంలోని వరి పంట తీద్దామని వెళ్ళాము. పనిలో నిమగ్నమై ఉండగా నా మొబైల్ ఫోన్ పొలంలో ఎక్కడో జారి పడిపోయింది. కాల్ చేస్తే, రింగ్ అవుతుందిగానీ, మాకు రింగ్ టోన్ వినిపించడం లేదు. నేను, నా స్నేహితులు కలిసి ఆ ప్రదేశమంతా చాలాసేపు వెతికినప్పటికీ ఫోన్ కనిపించలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! నా మొబైల్ ఫోన్ దొరికేలా దయచూపండి" అని బాబాని వేడుకున్నాను. ఆశ్చర్యంగా కొద్దిసేపట్లో మొబైల్ నా స్నేహితుడికి దొరికింది. అంతసేపు అంతలా మేము పొలమంతా వెతికినా దొరకని మొబైల్‌ను తమను వేడుకున్నంతనే కనపడేలా చేసిన బాబా కృపకు చాలా సంతోషమేసింది. "ధన్యవాదాలు సాయినాథా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo