1. నమ్మి కొలిచిన వారి ప్రతి కష్టాన్ని తొలగించే బాబా
2. బ్రహ్మ వ్రాతైనా తప్పుతుందిగాని, కలలో కూడా బాబా మాట పొల్లుపోదు
3. సాయికృపతో తగ్గిన గొంతునొప్పి
నమ్మి కొలిచిన వారి ప్రతి కష్టాన్ని తొలగించే బాబా
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రామసాయి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను భగవంతుని చాలా ఎక్కువగా నమ్ముతాను. దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం చేస్తుంటాను. అలాగే బాబా గుడికి వెళ్లడం. బాబా నాకు ఎప్పటినుండో తెలుసు. కానీ సంవత్సరం క్రితం నుండి బాబా గురించి ఇంకా బాగా తెలుసుకుని, ఆయనను పూజించడం మొదలుపెట్టాను. నేను రోజూ బాబా చరిత్రలోని ఒక అధ్యాయం చదువుతూ ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా బాబాకు చెప్పి చేయడం, వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ఇంకా బాబా నా జీవితానికి దారి చూపిస్తారని పూర్తిగా నమ్మి, నా జీవితాన్ని వారి పాదాలకు అర్పించాను. బాబా మాటకు, వారి ఊదీకి చాలా మహిమ ఉంది. బాబాను నమ్ముకుంటే, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇకపోతే నా అనుభవాల విషయానికి వస్తే...
అందరికీ వచ్చినట్లే నాకు కూడా కొన్ని ఆరోగ్యసమస్యలు వచ్చాయి. సంవత్సరం క్రితం నాకు చర్మంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలతో చర్మసమస్యలు మొదలయ్యాయి. ఆ కారణంగా చేతులు, కాళ్లు, ముఖంపై దద్దుర్లు వచ్చి దురద పెట్టేవి. ఆ దురదకి గోక్కుంటే నల్ల మచ్చలు ఏర్పడేవి. చాలా మందులు వాడినప్పటికీ ఏం ప్రయోజనం లేకపోయింది. ఆ విషయం నాకు తెలిసిన ఒక సాయి భక్తురాలితో చెప్తే ఆమె, "బాబాకి నమస్కరించుకుని రోజూ రాత్రి నిద్రపోయేముందు బాబా ఊదీ పెట్టుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగు, అలాగే నీకు ఇష్టమైన పదార్ధం తినొద్దు" అని అన్నారు. నేను అలానే చేశాను. బాబా నా సమస్యను చాలావరకు తగ్గించారు. ఇంకా పూర్తిగా తగ్గిస్తారని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. కర్మఫలమంటూ ఒకటి ఉంటుందని చెప్తారుగా బాబా. దాన్ని ఈవిధంగా అనుభవిస్తున్నాను. కానీ మీరు నా సమస్యను పూర్తిగా తగ్గిస్తారని నాకు పూర్తి నమ్మకముంది బాబా".
ఒకరోజు ఉదయం మా నాన్నగారు బజారుకి వెళ్లారు. అక్కడ కూరగాయలు తీసుకున్నాక జేబులోనుండి పర్సు తీసి డబ్బులిచ్చి, తిరిగి జేబులో పెట్టుకునేటప్పుడు అది జారి కిందపడిపోయింది. అది గమనించక నాన్న మామూలుగా ఇంటికి వచ్చేసారు. తరువాత నాన్న ఏదో షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ తన జేబులో పర్సు లేదని చూసుకున్నారు. ఆ పర్సులో సుమారు 20 వేల రూపాయలున్నందున నాన్న చాలా కంగారుపడి చాలా చోట్ల వెతుకుతూ అంతటా తిరిగారు. అప్పుడు నేను బాబాకి చెప్పుకుని, "బాబా! పర్సు దొరికేలా చేయి తండ్రి. 108 ప్రదక్షిణాలు చేస్తాను, నీకు కలకండ సమర్పించుకుంటాను. అలాగే ఈ అనుభవం తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల పర్సు దొరికింది. సంతోషంగా బాబాకి మొక్కు తీర్చుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు తండ్రి. మీరు నాకు తాత్కాలికమైన ఉద్యోగం ప్రసాదించారు. దయచేసి నాకు శాశ్వతమైన మార్గం చూపించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
బ్రహ్మ వ్రాతైనా తప్పుతుందిగాని, కలలో కూడా బాబా మాట పొల్లుపోదు
సాయిబంధువులందరికీ బాబా అనుగ్రహప్రాప్తిరస్తు. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. నేను నా చిన్నతనం నుండి బాబా భక్తురాలిని. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం మా బాబు కడుపులో ఉన్నప్పుడు అంటే 2005, జనవరిలో జరిగింది. నేను 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు నా కుటుంబ పరిస్థితుల వల్ల ప్రతిరోజూ బాబాను నాకు మగబిడ్డే పుట్టాలని కోరుకునేదాన్ని. ఒక గురువారంనాడు బాబాకి దీపం పెట్టి, ఎర్ర మందారపూలు నిండుగా అలంకరించి దణ్ణం పెట్టుకుని, "బాబా! నాకు బాబు పుడతాడు కదా, నాకు మాటివ్వు బాబా" అని ఆర్తిగా చేతులు చాచి ప్రార్థిస్తూ బాబానే చూస్తుండగా బాబా ఫొటోకి పెట్టిన మందారపువ్వు ఒకటి జారి కిందపడింది. నా ఆనందానికి హద్దులు లేవు. ఇంకా అంతే! నాకు ఖచ్చితంగా బాబే పుడతాడు అన్న నమ్మకంతో ఉండసాగాను. బ్రహ్మ వ్రాసిన వ్రాతైనా తప్పుతుందిగాని, బాబా మాట కలలో కూడా పొల్లుపోదని నా నమ్మకం. బాబా దయవలన మే 10వ తేదీన నాకు బాబు పుట్టాడు. బాబుకి సాయి అనే పేరు పెట్టుకున్నాను. ఇకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అప్పుడు నా వయస్సు 19 సంవత్సరాలు. అప్పటికి నాకు పూర్తిగా ఏమి తెలియదు. క్రమేణా బాబా నాకు అన్నీ తెలియజేశారు. ఆయన దయవల్ల చాలా పరిణితి వచ్చింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని సానుకూలంగా తీసుకుని మళ్ళీ బాబా పాదాలదగ్గరే వదిలేస్తున్నానుగాని, దేన్నీ మనసుకి తీసుకోడం లేదు. మా కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, "అక్కా! మాకోసం బాబాకి పూజ చేయమ"ని అడుగుతారు. నేను తప్పకుండా వాళ్ళకోసం పూజచేసి రోజూ బాబాకి గుర్తు చేస్తాను. ఆయన కృపవలన వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయటపడతారు. కృతజ్ఞతతో వాళ్ళు పదేపదే బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటారు. నా కోరిక ఒక్కటే... వసుధైక కుటుంబం అంటే పరివారమంతా బాబా భక్తితో నిండి ఉండాలి. అందరూ సన్మార్గంలో పయనిస్తూ బాబాకి నచ్చనట్లు ఉండండి. అదే మనల్ని ఆయనకి చేరువ చేస్తుంది. అదే మనం బాబాకు ఇచ్చే నిజమైన నివాళి.
సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయికృపతో తగ్గిన గొంతునొప్పి
నేను సాయిభక్తురాలిని. 2021, అక్టోబర్ 22న నాకు గొంతునొప్పి మొదలైంది. నాకు చిన్నప్పటినుంచి టాన్సిల్స్ సమస్య ఉన్నందువల్ల నాకెప్పుడు ఇబ్బంది కలిగినా దానికి సంబంధించిన టాబ్లెట్లు వాడుతూ ఉంటాను. ఇప్పుడు గొంతునొప్పి వచ్చినప్పుడు కూడా ఆ టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. అయితే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల నొప్పి తగ్గక తెల్లారి 5 గంటలు వరకూ నిద్రపోకుండా నేను చాలా ఇబ్బందిపడ్డాను. మరోసటిరోజు మరో టాబ్లెట్ వేసుకున్నాను గాని, కాస్త కూడా ఉపశమనం ఇవ్వలేదు. నొప్పిని తట్టుకోలేక నేను రోజూ పూజించే బాబా దగరికి వెళ్లి బోరున ఏడ్చేసి, "నొప్పి భరించలేనంతగా ఉంది, దయచేసి ఈ నొప్పిని తగ్గించండి బాబా" అని వేడుకున్నాను. బాబా కృపవలన మరుసటిరోజు ఉదయానికి ఆ నొప్పి నుండి నాకు చాలావరకు ఉపశమనం లభించింది. "ధన్యవాదాలు బాబా".
