సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 992వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ మన మీద ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి
2. కాలు కాలినా కొన్ని రోజులకే నడిచేలా అనుగ్రహించిన బాబా
3. కరోనా నుంచి కాపాడిన బాబా

బాబా దయ మన మీద ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి


ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః!!!


ఈ బ్లాగును ప్రసాదించిన సాయినాథునికి పాదాభివందనాలు. నా పేరు మల్లేశ్వరి. నేను ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. మేము వ్యవసాయం చేస్తాము. ఈమధ్య వర్షాలకు మా మిరప చేను బాగా పాడైంది. అది చాలదన్నట్లు ఒకరోజు రాత్రి మళ్లీ వర్షం మొదలైంది. వర్షం బాగా పడుతుండేసరికి నాకు భయమేసి, "సాయినాథా! ఈ వర్షానికి చేను ఇంకా పాడైపోతుంది. ఆ పొలంలో వర్షం పడకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని, ఆయననే తలుచుకుంటూ పడుకున్నాను. ఆ తండ్రి దయవల్ల అక్కడ వర్షం పడలేదు, ఇప్పుడు చేను బాగుంది.


ఇకపోతే ఈమధ్య మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తను ఇక్కడికి వచ్చేముందు అక్కడ కరోనా టెస్టు చేయించుకోవడం మొదలుకుని, అన్నీ సక్రమంగా జరిగి అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకుంటే,  సాయి బంధువులతో పంచుకుంటాను అనుకున్నాను. ఢిల్లీలో మా పాప పాస్పోర్ట్ స్టాపింగ్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడ స్టాంపింగ్ అవ్వలేదు. దాంతో తను ఏడుస్తూ కూర్చుంది. మావారు నాకు ఫోన్ చేసి, "అమ్మాయి ఏడుస్తుంది" అని చెప్పారు. అప్పుడు నేను సాయినాథుని తలుచుకుని, "తండ్రి సాయినాథా! అన్ని నువ్వే చూసుకుంటున్నావు కదా, నీ దయవల్లే అంతా సక్రమంగా అవుతుంది" అనుకుని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసాను. అందులో ఒక అబ్బాయి తన అమెరికా వీసా ఆమోదం గురించి పంచుకున్నారు. అది మా పాపకు పంపించి, "ఆ సాయి తండ్రి ఉన్నాడు. ఇబ్బంది లేదు" అని చెప్పాను. తర్వాత ఫేస్బుక్ చూస్తే అందులో, 'నీ ప్రయాణం సుఖమయం అవుతుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను' అని ఉంది. నేను మా పాపతో, "నీకు స్టాంపింగ్ అవుతుంది. బాబా చెప్తున్నారు' అని చెప్పాను. బాబా దయవలన మరుసటిరోజు పాస్పోర్ట్ పంపించండి అని మెయిల్ వచ్చింది. 'బాబా చూసుకుంటానని చెప్పారు కదా!' అదే జరిగింది అనుకున్నాము. తరువాత పాప క్షేమంగా ఇల్లు చేరుకుంది. అంతా బాబా కృప.


మేము(పెద్దలు, పిల్లలు కలిపి మొత్తం అరుగురం) విజయదశమి సందర్భంగా శిరిడీ వెళ్ళదలచి 2021, అక్టోబరు 13, 14, 15 తేదీలలో శిరిడీలో ఉండేలా ఆగస్టులో టికెట్లు బుక్ చేసుకున్నాం. తర్వాత శిరిడీలో భక్తుల దర్శనానికి అనుమతి లేదని తెలిసింది. దాంతో మావాళ్ళు టిక్కెట్లు రద్దు చేద్దామనుకున్న తరుణంలో మా ప్రయాణానికి 20 రోజుల ముందు 'అక్టోబర్ 7 నుండి దర్శనానికి భక్తులను అనుమతిస్తార'ని నాకు న్యూస్ వచ్చింది. ఆ విషయం నేను మా వాళ్ళతో చెప్పాను. కానీ, వాళ్ళు మాకెవరికీ ఆ న్యూస్ రాలేదు అన్నారు. నేను ఆ న్యూస్ మా వాళ్లకు చూపిద్దామంటే ఆ న్యూస్ మళ్ళీ నాకు కనిపించలేదు. దాంతో నాకు ఏం చేయాలో తోచలేదు. కానీ అక్టోబర్ మొదటివారంలో 7వ తేదీ నుండి శిరిడీలో భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాము. ఇంకా శిరిడీకి ప్రయాణమయ్యేరోజు మేము ట్రైన్ దగ్గరకి వెళ్తూనే ట్రైన్ కదిలింది. మేము కంగారుపడుతూ వడివడిగా నడుస్తున్నాము. అంతలో ట్రైన్ స్లో అయ్యింది. ఒక బోగీలో ఉన్న టిసి, "ఈ బోగిలోకి ఎక్కి మీ బోగికి వెళ్ళిపోండి" అన్నారు. బోగీలో కూర్చున్న వాళ్ళు, "ట్రైన్ మీకు అందేది కాదు. పిల్లలతో ఉన్నందున మిమ్మల్ని చూసి ట్రైన్ స్లో చేశారు" అని అన్నారు. ఎవరేమన్నా అది మన సాయినాథుని కృప. ఆయన దయ మన మీద ఉంటే అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. బాబా మహిమలు ఎంత చెప్పినా తరగవు. మన సమస్యలు చాలానే ఉంటాయి. అన్నీ ఆ తండ్రే చూసుకోవాలి. మరి కొన్ని అనుభవాలు మరోసారి పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు చాలా ఉంటాయి. దయచేసి నన్ను క్షమించండి బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


కాలు కాలినా కొన్ని రోజులకే నడిచేలా అనుగ్రహించిన బాబా


నా పేరు చందన. మాది హైదరాబాద్. నేను సాయిబాబా భక్తురాలిని అనడం కంటే బాబా బిడ్డనని చెప్పుకోవడం సమంజసం. నేను బాబాను తలుచుకోని క్షణం ఉండదు. బాబానే నా సర్వస్వం. బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 2021, మే 28, శనివారంనాడు ఉదయం నేను సాయిబాబా గుడిలో ఆంజనేయస్వామికి వడమాల వేయించి, తమలపాకుల పూజ చేయించి తిరిగి ఇంటికి వచ్చాను. మాకు ఇద్దరు మగపిల్లలు. పెద్దబాబుకి ఆరేళ్ళు, చిన్నబాబుకి సంవత్సరం వయస్సు. వాళ్ల స్నానానికి వేడినీళ్లు స్టవ్ మీద పెట్టి, నీళ్లు మరిగాక కిందకి దించి బకెట్లో పోస్తుండగా చెయ్యి జారి వేడినీళ్లు నా ఎడమకాలి మీద పడిపోయాయి. నీళ్లు పడుతూనే నా చర్మమంతా ఊడిపోయి ప్రాణం పోయినంత బాధ కలిగింది. వెంటనే నా తల్లిదండ్రులు కోల్గేట్ టూత్ పేస్ట్ నా కాలికి వ్రాసారు. అయినా నొప్పి తగ్గలేదు. మా బావ వచ్చి నొప్పికి ఇంజక్షన్ చేసాడు. మా బావ క్లోజ్ ఫ్రెండ్ ఒక డాక్టరు. వాళ్ళ హాస్పిటల్ కి వెళితే, వెంటనే నా కాలు క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసారు. డాక్టరు తెలిసిన అతను అయినందున ప్రతి రెండురోజులకి ఒకసారి సమయం చూసుకుని పాడైపోయిన నా కాలి చర్మం తొలగిస్తుండేవారు. ఒకరోజు అతను "అనెస్తీషియా ఇచ్చేవాళ్లని పిలిపించి చర్మం తీయిస్తాను. లేదా, మీరు కాస్త నొప్పిని ఓర్చుకుంటానంటే నేనే కత్తెరతో కట్ చేస్తాను" అన్నారు. అప్పుడు నేను బాబాతో, "ఎంత బాధైనా భరిస్తాను బాబా. కానీ డాక్టరు రూపంలో నాకు మీరే వైద్యం చెయ్యాలి" అని చెప్పుకున్నాను. నిజంగా బాబానే వచ్చి చర్మమంతా తొలగించారనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నుండి నేను లేచి నడవడానికి 20 రోజులు పట్టింది. ఆ సమయంలో అంత బాధను ఎలా సహించానో నాకు అస్సలు అర్ధం కావడం లేదు. ఈ విషయమిలా మీతో పంచుకుంటుంటే నా కళ్ళలో నీరు ఆగట్లేదు. ఎందుకంటే, నేను అనుభవించిన బాధ అలాంటిది మరి. కాలిన నా కాలు చూసిన వాళ్ళందరూ ఎంతో భయపడి, లేచి నడవడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నారు. కానీ బాబా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఎంత అద్భుతమంటే ఆయన నా కళ్ళ ముందు ఉన్నట్లే అనిపించేది. నాకు నొప్పికాని, బాధకాని తెలిసేవి కాదు. నేను ఈరోజు లేచి నడుస్తున్నానంటే అందుకు కారణం నా బాబా దయే. ఆయన ఏదో చాలా పెద్ద ప్రమాదం జరగకుండా ఈ చిన్న గాయంతో నన్ను రక్షించారు. "థాంక్యూ బాబా. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే బాబా. అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండే మీకు నేను ఇంతకన్నా ఇంకేమి ఇవ్వగలను బాబా. ఐ లవ్ యు బాబా. మీరే నా తల్లితండ్రి, గురువు, నేస్తం, దైవం, నా సర్వస్వము. మీ పాదాలకు సర్వస్య శరణాగతి వేడి శతకోటి సాష్టాంగ దండప్రణామాలు సమర్పించుకుంటున్నాను బాబా".


కరోనా నుంచి కాపాడిన బాబా


సాయిబంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ. నేను అన్నవరం నివాసిని. నేను వృత్తిరిత్యా డాక్టరుని. నేను క్రమం తప్పకుండా శ్రీసాయి స్తవనమంజరి నిత్య పారాయణ చేస్తాను. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నాకు కరోనా వచ్చి నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నేను అనుక్షణం సాయి నామస్మరణ, ఇటీవల ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలలో చెప్పబడ్డ, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రజపం చేశాను. ఇంకా నేను కరోనా మహమ్మారి నుండి బయటపడితే వెంటనే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను అని అనుకున్నాను. బాబా అనుగ్రహం వలన ఎనిమిది రోజులలోనే కరోనా తగ్గి నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా మహిమలు చాలా గొప్పవి. ఆయన తన భక్తులను అన్ని కష్టాలనుండి కాపాడుతారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo