1. బాబా నాపై వర్షించిన అనుగ్రహం
2. దయామయుడైన సాయి నా ప్రార్థన విన్నారు
3. కృపతో ఏ ఇబ్బందీ లేకుండా అనుగ్రహించిన బాబా
బాబా నాపై వర్షించిన అనుగ్రహం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నా పేరు జ్యోతి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకసారి నా స్నేహితురాలు బాబా గుడికి వెళ్దామని నన్ను పిలిస్తే, మొదటిసారి తనతోపాటు బాబా గుడికి వెళ్ళాను. ఏదో స్నేహితురాలు పిలిచిందని వెళ్లానే తప్ప, అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలీదు. మరుసటిరోజు నా మొదటి సంవత్సరం మాథ్స్ ఎగ్జామ్. అసలు ఏ ప్రిపరేషన్ లేకున్నా అలాగే వెళ్లి పరీక్ష వ్రాసి వచ్చాను. ఎంత మాత్రమూ ఆ పరీక్ష పాస్ అవుతానని అనుకోని నేను, మంచి మార్కులతో పాసయ్యాను. అప్పుడు, 'ముందురోజు బాబా గుడికి వెళ్ళాను. బాబా కృపవలనే నేను ఈ పరీక్ష పాస్ అయ్యాన'ని నేను గ్రహించాను. అప్పటినుండి నేను బుద్ధి పుట్టినప్పుడల్లా బాబా గుడికి వెళ్తుండేదాన్ని. తర్వాత నేను ఎంసీఏ చేసి చివరి సంవత్సరం పరీక్షలు వ్రాసాక ఉద్యోగం చూసుకోవడం కోసం హైదరాబాదు వెళ్లి హాస్టల్లో చేరాను. అదే సమయంలో మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళి సంబంధాలు చూస్తుండేవారు. మా హాస్టల్ పక్కనే బాబా గుడి ఉండేది. స్నేహితులతో కలిసి వెళ్లి, బాబాకి దణ్ణం పెట్టుకుని వచ్చేదాన్ని. అప్పట్లో ఇప్పుడు బాబా మీద ఉన్నంత భక్తి ఉండేది కాదు. కేవలం గుర్తు వచ్చినప్పుడు బాబా దర్శనం చేసుకుని రావడం, అంతే. బాబా దయవలన నేను మంచి పర్సంటేజ్ తో ఎంసీఏ పాసయ్యాను, మంచి సంబంధం కూడా సెట్ అయింది. మొదటి శుభలేఖ బాబా పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకున్నాను. అలా బాబా ఆశీస్సులతో నా వైవాహిక జీవితం మొదలైంది. అయితే బాబాకి దూరమయ్యాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడొక స్నేహితురాలు 'సాయి లీలామృతం' పుస్తకం నాకిచ్చి, "మనసు పెట్టి దీన్ని చదువు" అని చెప్పింది. అదేరోజు ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. బాబా ఆశీస్సులతో తెలియకుండానే ఎంతో తేలికగా నాకు ఉద్యోగం వచ్చేసింది. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, మేము అమెరికాకి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, కానీ ఏ ఉద్యోగమూ రాలేదు. అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ సాయి లీలామృతం చదవడం మొదలుపెట్టాను. అంతే! నాకు తగినట్లు, కావాల్సిన విధంగా అనుకూలమైన సమయంతో నేను చేయగలిగిన ఉద్యోగం వచ్చింది. అది నేను అస్సలు ఊహించలేదు. నిజానికి జాబ్ చేసేవాళ్ళను చూసినప్పుడు అన్ని టెన్షన్స్ అవసరమా అని నాకు అనిపించేది. కానీ ఏంసిఏ చేసి ఖాళీగా ఉండటం బాధేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తే, బాబా నాకు ఎంత అద్భుతం చూపించారో చూడండి. ఆ రోజు నాకు చాలా సంతోషం కలిగింది. అలా ఎన్నోసార్లు బాబా మాకు సహాయం చేశారు. అయితే కొన్ని రోజుల నుండి నా ఆరోగ్య విషయంగా నేను టెన్షన్ పడుతున్నాను. బాబా దయవల్ల అంతా బాగుంటే మళ్ళీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. నాకు అన్నీ మీరే బాబా. చాలా టెన్షన్ పడుతున్నాను. దయచేసి నన్ను ఈ టెన్షన్స్ నుండి బయటపడేసి నా మనసు మంచిగా ఉండేటట్లు చూడండి బాబా".
దయామయుడైన సాయి నా ప్రార్థన విన్నారు
ముందుగా సాయి మహారాజ్కి ప్రణామాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. నా పేరు సరిత. ఇంతకు ముందు నా అనుభవంలో సాయి మమ్మల్ని వరదల నుండి ఎలా కాపాడారో పంచుకున్నాను. ఇప్పుడు నా రెండో అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకుంటున్నాను. 2021 దసరా సెలవులకి నేను, మా బాబు మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకున్నాం. అందుకు సన్నద్ధమవుతుండగా ముందురోజు రాత్రి హఠాత్తుగా నాకు గొంతునొప్పి మొదలైంది. అప్పుడు నేను, "బాబా! రేపు మా ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. సాయి మహిమ చూడండి. ఉదయం లేచేసరికి నొప్పి తగ్గిపోయింది. మా ప్రయాణం క్షేమంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా".
నేను ఇప్పుడు పంచుకోబోయేది చాలా గొప్ప లీల. మేము మా ఫ్లాట్ ఒకటి అమ్మకానికి పెట్టి ఏడేళ్లు అయ్యింది. అందరూ రావడం, చూసి వెళ్లడం తప్ప ఇంకేమీ జరిగేది కాదు. అలా ఉండగా 2021, అక్టోబరు నెలలో ఒకరు ఫ్లాట్ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. కానీ మాకు నమ్మకం కుదరక, 'ఎప్పటిలాగే వీళ్ళు కూడా చూసి వెళ్తారు' అనిపించి, "బాబా! వీళ్ళు మా ఫ్లాట్ కొంటే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. దయామయుడైన సాయి నా ప్రార్థన విన్నారు. చివరికి మా ఫ్లాట్ అమ్మగలిగాము. ఇది సాయి చేసిన అద్భుతమే. ఎందుకంటే, ఏడేళ్ల కాలంలో మేము ఎంతగానో ప్రయత్నించాం. ఒకానొక దశలో ఆశలు వదులుకున్నాము కూడా. అలాంటిది నా తండ్రి సాయినాథుని కృపతో ఫ్లాట్ అమ్మగలిగాము. "థాంక్యూ వెరీ మచ్ బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
కృపతో ఏ ఇబ్బందీ లేకుండా అనుగ్రహించిన బాబా
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు శ్రీకాంత్. ఈమధ్య నేను, నా భార్య గ్యాస్ట్రిక్ సంబంధిత నొప్పితో అనారోగ్యానికి గురి అయ్యాము. ఆ కారణంగా మూడురోజుల పాటు సరిగా నిద్ర కూడా పట్టక ఇద్దరమూ తీవ్రమైన ఇబ్బందికి లోనయ్యాము. దాంతో నేను కార్తీకపౌర్ణమి రోజు సద్గురు శ్రీ సాయినాథుని దర్శించి, "మా ఇద్దరికీ ఆరోగ్యపరమైన సమస్యలేమీ లేకుండా కాపాడండి బాబా" అని వేడుకుని, అదేరోజు సాయంత్రం మేము డాక్టరు దగ్గరకు వెళ్ళాము. ఆ సాయినాథుని కృపవల్ల డాక్టరు పరీక్షలు చేసి మాకు ఎలాంటి సమస్య లేదని, ఆ గ్యాస్ట్రిక్ నొప్పి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. అది వింటూనే నేను చాలా ఆనందపడి మనసులోనే ఆ సద్గురు సాయినాథునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నమ్ముకున్నవారికి నమ్మినంత ఆ సద్గురు సాయినాథుని కృపాకటాక్షాలు లభిస్తాయి. చివరిగా 'మా ఆరోగ్యాలు బాగుండాల'ని కోరుకుంటూ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటున్నాను.

