1. ఇండియా ట్రిప్లో అవాంతరాలు తొలగించిన బాబా
2. నా పాపని నాకిచ్చిన బాబా
3. ఊదీతో తగ్గిన జ్వరం
ఇండియా ట్రిప్లో అవాంతరాలు తొలగించిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము 2022లో ఇండియా వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ అంతా బాబా దయవల్ల బాగా జరిగింది. అదే మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. మేము యు.ఎస్.ఏ వచ్చి ఆరు సంవత్సరాలైన తరువాత మొదటిసారి 2022, జూన్ 7న ఇండియా వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకి వెళ్ళాము. ఫ్లైట్ ఎక్కాక నేను మా పాస్ పోర్టులు చెక్ చేసుకుంటుంటే మా చిన్నమ్మాయి ఓసిఐ కార్డు కనపడలేదు. ఒకటికి రెండుసార్లు నా హ్యాండ్ బ్యాగులో వెతికినా దొరకలేదు. మావారు ఫ్లైట్ దిగి కిందకి వెళ్లి అదివరకు మేము కూర్చున్న లాంజ్లో కూడా ఆ కార్డు కోసం వెతికారు కానీ, దొరకలేదు. దాంతో ఫ్లైట్లో స్టాఫ్కి తెలియజేశాము. ఎందుకంటే, ఆ కార్డు లేకపోతే మా అమ్మాయి ఇండియా వెళ్ళడానికి కుదరదు. తను యు.ఎస్.ఏలో పుట్టినందున ఇండియా వెళ్ళాలంటే తనకి వీసా లేదా ఓసిఐ కార్డు తప్పనిసరిగా ఉండాలి. నేను నా భర్తతో, "ఆ కార్డు మీకు ఇచ్చాను. మీ దగ్గర ఉందేమో చూడండి" అని అడిగాను. అందుకాయన, "నా దగ్గర లేదు. ఇందాక చెకింగ్ అయ్యాక నేను నీకు ఇచ్చేసాను. నువ్వు మళ్ళీ నాకు ఇవ్వలేదు" అని అన్నారు. నేను నా మనసులో ఒకటే అనుకున్నాను: "బాబా! అంతా బాగా జరుగుతుందనుకుంటే ఈ టెన్షన్ ఏంటి తండ్రి నాకు? మీ దయవల్ల ఓసిఐ కార్డు దొరకాలి" అని. అంతలో ఫ్లైట్ స్టాఫ్, "చివరి అవకాశం. ఆ కార్డు ఉందేమో చూడండి. లేకపోతే మీరు ఫ్లైట్ దిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది" అని అన్నారు. ఆరేళ్ళ తర్వాత ఇండియా వెళ్తుంటే ఇలా జరిగినందుకు మేము చాలా టెన్షన్ పడుతుంటే రెండు నిమిషాల తర్వాత మా పెద్దమ్మాయి, "అందరి జాకెట్లలో చూడమ్మా, ఏమైనా ఉందేమో!" అని అంది. సరే అని అందరం మా జాకెట్లు చెక్ చేసుకుంటే నా భర్త జాకెట్లో ఆ కార్డు దొరికింది. "హమ్మయ్య.. అంతా బాబా దయ" అని అనుకుని క్షేమంగా ఇండియా చేరుకున్నాం.
ఇండియా వచ్చాక యూఎస్ఏ వీసాకోసం ఢిల్లీ వెళ్ళాము. మొదటిరోజు ఫింగర్ ప్రింట్స్ పని, రెండోరోజు వీసా అపాయింట్మెంట్ ఉండగా ఢిల్లీ చేరుకున్నాక మావారికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ఫింగర్ ప్రింట్స్కు వెళ్లడానికి మావారికి అస్సలు ఓపిక లేకుండా పోయింది. అప్పుడు నేను, "బాబా! మీ దయతో ఢిల్లీలో అంతా మంచిగా జరిగి మాకు వీసా వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత ఫింగర్ ప్రింట్ ఆఫీసుకు దగ్గరలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటే, అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని ఆఫీసుకి వెళ్ళాము. బాబా దయవల్ల పదినిమిషాల్లో పని సజావుగా పూర్తయింది. రెండోరోజు వీసా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేస్తున్నప్పుడు మా చిన్నపాప పాస్పోర్ట్ కనపడలేదు. అది బయట ఉన్న మా మరిది బ్యాగులో మర్చిపోయామన్న సంగతి గుర్తొచ్చి, దాన్ని తేవడానికి మావారు అనుమతి తీసుకుని బయకి వెళ్లారు. కానీ ఆయన వచ్చేలోగా మమ్మల్ని పిలిస్తే ఎలా అని మేము చాలా టెన్షన్ పడ్డాం. కానీ బాబా దయవల్ల మావారు వచ్చాకనే మమ్మల్ని పిలిచారు. బాబా ఆశీస్సులతో మాకు వీసా వచ్చింది. మేము క్షేమంగా తిరిగి యు.ఎస్.ఏ వచ్చాము. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే ఎప్పుడూ మా వెంటే ఉండి మమ్మల్ని కాపాడుతూ ఉండండి బాబా. మా అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. నేను ఇప్పట్లో మళ్ళీ ఇండియా వెళ్ళలేను. దయచేసి ఆమె ఆరోగ్యం బాగుండేలా చూడండి తండ్రి".
నా పాపని నాకిచ్చిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాణి. మాది శ్రీకాకుళం. నేను స్కూల్లో టీచరుగా పని చేస్తున్నాను. నేను ప్రతిరోజు ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటాను. గత కొద్దినెలలుగా నేను చాలా రకాలైన సమస్యలతో బాధపడుతున్నాను. వాటికి పరిష్కారం దొరకలేదుకానీ, వాటి నుండి ఉపశమనం లభించింది. పరిష్కారం చూపమని బాబాను వేడుకుంటున్నాను. ఇకపోతే, 2022, సెప్టెంబర్ 22న సంవత్సరం వయసున్న మా పాపకి జ్వరం వచ్చింది. అదే సమయంలో నాకు ప్రమోషన్ విషయంగా పరీక్షలు అవుతున్నాయి. ఒకవైపు పరీక్షలు, ఇంకోవైపు పాప ఆరోగ్యం, మరోవైపు మరికొన్ని సమస్యలు వీటన్నిటి మధ్య నేను నలిగిపోతూ బాబాను శరణుజొచ్చాను. ఆ తండ్రి దయవల్ల పరీక్షలు ఏదో విధంగా మంచిగా అయిపోయాయి. కానీ పాపకు జ్వరం తగ్గలేదు. పైగా చాలా సీరియస్ అయింది. అత్యవసర పరిస్థితుల్లో పాపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. పాపని మూడు రోజులు ఐసియులో ఉంచారు. తరువాత రెండురోజులు అంటే మొత్తం ఐదు రోజులు మేము హాస్పిటల్లో ఉన్నాం. అక్కడ రాత్రి, పగలు తేడా లేదు, నరకంలా అనిపించింది. నేను ఆ సమయమంతా, "బాబా! పాపకి ఏమీ అవ్వకూడదు. నేను పాపతో తిరిగి ఇంటికి వెళ్లాలి" అని బాబాను ప్రార్థిస్తూ, "పాపకి బ్లడ్ టెస్టులో డెంగ్యూ అని రాకూడద"ని బాబాను అడిగాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ బాగానే వచ్చాయి. 'లంగ్స్ ఇన్ఫెక్షన్' అని చెప్పి మందులిచ్చి డిశ్చార్జ్ చేశారు. "బాబా! నా పాపని నాకు ఇచ్చారు. ఇది చాలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి బాబా. అవి నా చేతిలో లేవు. మీ మీద నమ్మకంతో భారం మీద వేశాను తండ్రి. దయతో నాకు పరిష్కారం చూపమని వేడుకుంటున్నాను బాబా".
ఊదీతో తగ్గిన జ్వరం
నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు శిరీష. 2022, సెప్టెంబర్ నెలలో మా పాపకి జ్వరం వచ్చింది. వైద్యం చేస్తూ ఐదు రోజులు గడిచినా పాపకి కొంచం కూడా జ్వరం తగ్గలేదు. బ్లడ్ టెస్టు చేయిస్తే రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చాయి. మా ఇంట్లోవాళ్ళు దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు. అందువల్ల అదివరకు మా పాపకు జ్వరం వచ్చినప్పుడు ఊదీ నీళ్లలో కలిపి పాపకి తెలియకుండా తన చేత త్రాగించేదాన్ని. బాబా దయవల్ల జ్వరం తగ్గిపోయింది. అయితే ఈసారి ఊదీ ఇవ్వడం మర్చిపోయాను. ఐదో రోజు ఉదయం గుర్తొచ్చి, "బాబా! ఈరోజు ఊదీ నీళ్లలో కలిపి పాపకి చెప్పి మరీ తనకి ఇస్తాను. మీ దయతో తనకి జ్వరం తగ్గితే, తనకి మీపై, మీ ఊదీపై నమ్మకం కలుగుతుంది" అని బాబాతో చెప్పుకుని పాపకి ఊదీ నీళ్లు ఇచ్చి త్రాగమన్నాను. తను, "మమ్మీ! నువ్వు జ్వరం తగ్గేవరకు ఉండి, ఇప్పుడు ఈ నీళ్లు త్రాగించి దీనివల్ల జ్వరం తగ్గింది అంటావు" అని తాగింది. అంతే, మరుసటిరోజు నుండి పాపకి జ్వరం లేదు. "ధన్యవాదాలు బాబా". పాప తన మనసులో ఏం అనుకుంటుందో నాకు తెలియదుకాని, తనకి బాబాపై నమ్మకం కలిగించడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఆపై బాబా దయ అనుకుంటున్నాను.

