భక్తితో ప్రార్థిస్తే కరుణించకుండా ఉంటారా బాబా?
నేను ఒక సాయి భక్తుడిని. మేము షోలాపూర్లో ఉంటున్నాము. మా అక్కవాళ్ళు ముంబాయిలో ఉంటున్నారు. తన అత్తగారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తరచూ ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారని తెలిసి, 'ఒకసారి వెళ్లి ఆమెను కలిసొస్తే బాగుంటుంద'ని మేము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము. అయితే ఆ టికెట్లు ట్రైన్ బయలుదేరే రోజు సాయంత్రం వరకు కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. మరి కొద్ది నిమిషాల్లో చార్ట్ ప్రిపేర్ అవుతుందనగా కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అది చలికాలం, పైగా రాత్రి ప్రయాణమైనందున చిన్నబాబుతో నేను, నా భార్య ప్రయాణమెలా చేస్తామని టెన్షన్ వేసింది. వెంటనే మన ఆపద్బాంధవుడైన శిరిడీ సాయినాథుని, "బాబా! టికెట్లు ఎలాగైనా కన్ఫర్మ్ అయి మా ప్రయాణం సాఫీగా సాగేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల టికెట్లు వెయిటింగ్ లిస్ట్ పోయి ఆర్ఏసిలోకి వచ్చాయి. ఆర్ఏసి అంటే ఒకే బెర్తు ఇద్దరికి ఇస్తారని అందరికీ తెలిసిందే కదా! ఆ ఒక్క బెర్త్ మీద నేను, నా భార్య చిన్నబాబుతో ఎలా సర్దుకోగలమనిపించి, "ట్రైన్ ఎక్కాక మరో సీటు సెట్ అయ్యేలా చేయండి బాబా" అని బాబాను కోరుకున్నాను. బాబా దయవల్ల ట్రైన్ ఎక్కిన 3 గంటల తరువాత మాకు మరో సీటు దొరికింది. దాంతో నేను, నా భార్య, మా బాబు క్షేమంగా ముంబాయి చేరుకున్నాం.
ఒకరోజు రాత్రి హఠాత్తుగా నా ఒళ్లంతా దురదలు పుట్టాయి. మొదట దోమ కాట్లేమో అనుకున్నాను. కానీ అలెర్జీ వల్ల అని మరుసటిరోజు ఉదయం తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్రపోయేముందు కూడా అలానే దురదలు మొదలై చేతులంతా ఎర్రగా దద్దుర్లు లేచాయి. అప్పుడు ఫుడ్ పాయిజన్ వల్ల అయ్యుండొచ్చు అనిపించింది. దాంతో భయమేసి బాబాని ప్రార్థించి, బాబా ఊదీ తీసుకొని దద్దుర్లు ఉన్న చోట పూసి, మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. తర్వాత నిద్రపోయేముందు, "ఉదయానికి ఈ బాధ తగ్గిపోయేలా చూడండి బాబా" అని బాబాని ప్రార్థించి పడుకున్నాను. బాబా దయతో ఉదయానికి దద్దుర్లు, దురద మటుమాయం అయ్యాయి. ఏ ఔషధానికి లేని శక్తి బాబా ఊదీకి ఉంది. అంతటి మహిమ, పవిత్రత ఊదీకి ఉన్నాయి. "ధన్యవాదాలు బాబా. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
మా బాబుకి సంవత్సరం ఐదు నెలల వయసున్నప్పుడు వ్యాక్సిన్ వేయించాక తనకి తొడ నొప్పి, జ్వరం వచ్చాయి. వ్యాక్సిన్ వేసిన నర్సు ఒక రోజులో జ్వరం, నొప్పి తగ్గిపోతాయిని చెప్పింది. కానీ రెండోరోజు రాత్రికి కూడా జ్వరం, తొడ నొప్పి తగ్గలేదు. అదీకాక బాబు నడవలేక ఏడవసాగాడు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి ఊదీ బాబు తొడకి రాసి, కొంచెం ఊదీ నోట్లో వేసి, “బాబా! మీ దయతో రేపటికి బాబుకి నయమై మంచిగా ఉండాలి" అని వేడుకున్నాను. బాబాని భక్తితో ప్రార్థిస్తే కరుణించకుండా ఉంటారా? మరుసటి రోజు ఉదయానికి అంతా సర్దుకుంది. బాబు నవ్వుతూ లేచాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. "ధన్యవాదాలు బాబా".
ఇంకోసారి బాబుకి జలుబు చేసి రాత్రి పడుకునే ముందు దగ్గు కూడా మొదలైంది. దగ్గు వల్ల బాబు 5, 6 సార్లు వాంతులు చేసుకున్నాడు. నిద్రొస్తున్నా దగ్గు వల్ల నిద్రపోలేక ఏడవసాగాడు. రెండు గంటలు చూశాక నేను బాబుకి బాబా ఊదీ పెట్టి, "బాబా! మీ దయవల్ల బాబుకి దగ్గు, వాంతులు తగ్గితే ముగ్గురికి అన్నదానం చేసి, మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని ప్రార్థించి బాబా మీద భారమేసాను. తర్వాత కొద్దిగా వేడినీళ్ళ బ్యాగుతో కాపడం పెట్టి బాబుని నిద్రపుచ్చాము. బాబా చూపిన అద్భుతం చూడండి. అప్పటివరకు దగ్గు, వాంతులతో సతమతమైన బాబు ఆ క్షణం నుండి చక్కగా నిద్రపోయాడు. బాబా లీలలను ఎంత వర్ణించినా తక్కువే. "ధన్యవాదాలు బాబా. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులకు ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
ఒకసారి నా భార్య అక్క, తన భర్త, అత్తగారు షోలాపూర్ చుట్టుపక్కలున్న తీర్థ క్షేత్రాల దర్శనార్థం షోలాపూర్లో ఉన్న మా ఇంటికి వచ్చి శుక్రవారం ఉదయం బయలుదేరి కొల్హాపూర్లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని, పండరీపురంలో ఉన్న పాండురంగ విఠలుని దర్శనం చేసుకొని రాత్రికి తిరిగి మా ఇంటికి చేరుకొని, శనివారం ఉదయం తుల్జాపూర్ భవానిమాత దర్శనం చేసుకుని మధ్యాహ్ననికి తిరిగి మా ఇల్లు చేరుకొని, ఇక అప్పటినుండి అంటే ఆరోజు మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యేవరకు షోలాపూర్లోని పలు ప్రదేశాలు చూస్తూ మాతో సమయం గడిపేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ నాకు శుక్ర, శనివారాల్లో డ్యూటీ ఉండడం వల్ల కొల్హాపూర్, పండరీపురం, తుల్జాపూర్ వెళ్ళడం సాధ్యంకాక మొదటి రెండు రోజులు వాళ్లతో గడపలేకపోయాను. కనీసం శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు వాళ్ళతో గడిపితే వాళ్ళు తృప్తి పడతారు, మేము కూడా వాళ్ళతో మాట పడకుండా ఉంటాము. కానీ నాది రైల్వేలో ఉద్యోగం, అది కూడా ఎమర్జెన్సీ సెక్షన్లో వర్క్. కాబట్టి ఏ సమయంలో నాకు కాల్ వచ్చినా నేను అన్ని పనులు పక్కన పెట్టి వెంటనే వెళ్లిపోవాలి. ఇలాంటి గందరగోళ స్థితిలో నాకు మొదట గుర్తుకు వచ్చింది బాబానే. ఆయన్ని, "బాబా! నువ్వే ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడాలి. ఆదివారం వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యేవరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసి మా కుటుంబ సమేతంగా షోలాపూర్లో ఉన్న శ్రీపద్మావతిదేవి సమేత శ్రీవేంకటేశ్వరుని, శ్రీసిద్దరామేశ్వరస్వామి, అలాగే ఆ మందిర ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల్ని దర్శించే భాగ్యం ప్రసాదించండి బాబా. అలాగే గ్రామదేవత జాతర, ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ చూసేలా చేయండి. మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించి, ఒకరికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబాకి చెప్పుకుంటే సాధ్యం కానిదంటూ ఉంటుందా? బాబా దయవల్ల శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు నాకు ఆఫీస్ నుండి కాల్ రాలేదు, ఎక్కడా డ్యూటీ వేయలేదు. కుటుంబమంతా చాలా ఆనందంగా గడిపాము. మేము, వచ్చిన బంధువులు అందరమూ సంతోషం. బాబా చేసిన మేలుకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. "బాబా! మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

