ఈ భాగంలో అనుభవం:
- బాబా ప్రసాదించిన రెండు అనుగ్రహాలు
నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్ఏలో నివాసముంటున్నాము. ముందుగా మాయలో పడి కొట్టుకుపోయే మనల్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునే సాయిబాబా చరణలకు నా వినయపూర్వక నమస్కారాలు. 2022, డిసెంబర్ 2 లేదా 3వ తేదీ ఉదయం, నేను 'ఆజ్ కా శిరిడీ సాయి సందేశ్' వింటుండగా అందులో, "నేను ఎల్లవేళలా మీతో ఉండాలని ఆశపడుతున్నావు కనుక నేను ఈరోజు ఏదో ఒక రూపంలో నీ ఆఫీసుకు వచ్చి నిన్ను కలుస్తాను" అని వచ్చింది. తరువాత నేను నా పనిలో నిమగ్నమై మధ్యలో ఒకసారి ఆ బాబా సందేశం గుర్తు చేసుకున్నాను. కానీ ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మరిచిపోయాను. సాయంత్రం ఆఫీసులో పని ముగియడానికి ముందు ఒకామె నన్ను కలవడానికి వచ్చింది. అప్పటికి ఒక సంవత్సర కాలంగా ఆమె నన్ను కలవలేదు. పని పూర్తిచేసాక ఆమె నాకు ఒక బహుమతి ఇచ్చి తెరిచి చూడమంది. తానిచ్చిన బ్యాగులో ఒక చిన్న నీలిరంగు ప్యాకెట్ ఉంది. అది తెరిచి చూస్తే అందులో శిరిడీ నుండి తెచ్చిన సాయిబాబా ఊదీ ఉంది. ఆమె సాయి భక్తురాలు కానందున ఆ ఊదీ తనకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి కలిగింది. ఇంతలో ఆమె, "మేము ఇటీవల ఒక ఇల్లు కొన్నాము. ఆ ఇంటిలో అదివరకు ఉన్న ఆ ఇంటి ఓనర్లు సాయిబాబా భక్తులు. వాళ్ళు ఈ ఊదీ మెయిల్ బాక్స్లో వదిలి వెళ్లిపోయారు. నువ్వు సాయిబాబాను సంపూర్ణంగా విశ్వసిస్తావని నాకు తెలుసు గనక ఈ ఊదీ నీకు ఇవ్వాలని తెచ్చాను" అని చెప్పింది. అది విని నేను ఉద్వేగానికి లోనై, ఎప్పటిలాగే బాబా తమ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తరువాత ఆరోజు ఉదయం బాబా నన్ను చూడటానికి ఆఫీసుకు వస్తానని చెప్పడం గురించి ఆమెతో చెపితే ఆమె ఆశ్చర్యపోయింది. సాయి భక్తులందరికీ నా విన్నపం, బాబా తమ మాటను నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన దివ్య సన్నిధిలో ఆశ్రయం పొంది మన తప్పులకు క్షమాపణ వేడుకుందాం.
యుఎస్ఏలో ఉంటున్న మేము నాలుగు సంవత్సరాల తర్వాత 2022, డిసెంబరులో ఇండియా రావడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. ఆ ట్రిప్లో మేము శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. అయితే దురదృష్టవశాత్తు నవంబర్ నెలలో మా ఇంటిలో అందరికీ కోవిడ్-19 వచ్చింది. నేను అయితే నేను నేనులా లేను. తలనొప్పి చాలా తీవ్రంగా ఉండటంతో సరిగ్గా పని చేసుకోలేకపోయేదాన్ని. అందువల్ల ఇండియా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, నేను ఇండియాకి వెళ్లి అక్కడ అనారోగ్యంతో ఉండదలుచుకోలేదు. వెంటనే నేను టికెట్ ఏజెంట్తో మా ప్రయాణాన్ని రద్దు చేయమని లేదా మరో తేదికి పోస్టుపోన్ చేయమని అభ్యర్థించాను. ఆ టిక్కెట్ ఏజెంట్ తేదీలో ఏదైనా మార్పు చేస్తే 2300 డాలర్లు చెల్లించాలని అన్నారు. అయినా నాకు వేరే దారిలేక మార్చమని చెప్పాను. తర్వాత నేను నిద్రపోతున్నప్పుడు కలలో ఒక పూజారి నల్లని శివలింగంపై చేయి వేసి, "శిరిడీకి రా, ఏమీ జరగదు" అని అన్నారు. నేను నిద్రలేచేసరికి తలనొప్పి చాలా స్వల్పంగా ఉంది. తరువాత నేను యూట్యూబ్లో “శిరిడీ రా. శాలువా సమర్పించు” అన్న సందేశం విన్నాను. అది విన్న నాకు, 'శాలువా పసుపురంగులో ఉన్నట్లు, దాన్ని పూజారి బాబాపై కప్పి, తిరిగి నాకు ఇచ్చినట్లు' భావన కలిగింది. ఆరోజు సాయంత్రానికి తలనొప్పి పూర్తిగా మాయమైంది. అలా ఆ కల తర్వాత నాకు మంచిగా, ఆరోగ్యంగా అనిపించడంతో నేను శిరిడీ వెళ్లాలనుకొని ట్రావెల్ ఏజెంట్కి కాల్ చేసాను. అదృష్టవశాత్తూ, టిక్కెట్లు ఇంకా రద్దు కాలేదు. ఇది 6వ తేదీ సాయంత్రం జరిగింది. నేను 8వ తేదీ మధ్యాహ్నానికి నేను నా పనులు ముగించుకుని నా కుటుంబంతో ఆ రాత్రి ఫ్లైట్ ఎక్కాను. అయితే కోవిడ్-19 కారణంగా శిరిడీలో శాలువులు, ప్రసాదాలు, పువ్వులు సమాధి మందిరంలోకి అనుమతించట్లేదని చెప్పారు. నాకు బాధగా అనిపించినప్పటికీ బాబా మాకు అద్భుతమైన ప్రశాంతమైన దర్శనాన్ని ప్రసాదించారు. తరువాత నేను యుఎస్లో మా ఇంటికి సమీపంలో ఉన్న బాబా మందిరంలోని బాబాకోసం ఒక శాలువా తీసుకున్నాను. మేము ఇండియా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ బాబా ఆలయానికి వెళ్ళాము. అక్కడి పూజారి నా దగ్గరకొచ్చి, "దీన్ని బాబాకు సమర్పించిన తర్వాత మీకోసం ఉంచాను" అని చెప్పి ఒక శాలువా నా భుజాలపై వేశారు. ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకొచ్చిన కల గురించిగాని, నేను బాబాకోసం ఒక శాలువా తెచ్చానని గానీ ఆ పూజారికి తెలియదు. మరి అతను నాకు శాలువా ఇచ్చారంటే మన ప్రియమైన బాబా అతనికి మార్గనిర్దేశం చేశారు. తద్వారా తాము శిరిడీలో మాత్రమే లేమని ఋజువు చేస్తూ ఆ శాలువా నాకిచ్చారు. నా భర్త నాతో, “బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన శిరిడీలోనే కాదు, తమ భక్తుల హృదయాలలో నివసిస్తుంటారు" అని అన్నారు. నిజం, నేను దానిని అనుభవించాను, అది బాబా అనుగ్రహంగా భావిస్తున్నాను. "అద్భుతమైన దర్శనం, అలాగే అందమైన శాలువా ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా. ఈ శాలువా మీరు నాకిచ్చిన బహుమతి. దయచేసి ఎల్లప్పుడూ నన్ను సరైన మార్గంలో నడిపించండి. మా అందరినీ ఆశీర్వదించండి".

