- బాబా చేసిన సందేహనివృత్తి
నా పేరు శిల్పారెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. 2023, అక్టోబర్ నెల చివరిలో సూర్యగ్రహణం వచ్చింది కదా! అప్పుడు నాకు, మా వారికి, మా పాపకి దోషం ఉందని పంతుళ్ళందరూ చెప్పారు. బాబా భక్తులు అలాంటివేమీ నమ్మనవసరం లేదని నాకు తెలుసు. కానీ నా మనసులో ముగ్గురికి దోషం ఉందని ఏదో తెలియని భయం చాలా వుంది. అందువల్ల దోష నివారణార్థం బ్రాహ్మణుడికి దక్షిణ, దానం ఇవ్వాలనిపించింది. ఎంతైనా మనం మనుషులం కదా! సందేహాలు సహజం. నాకు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సందేహమొస్తే బాబాని అడగడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం దోష నివారణ గురించి కూడా బాబా ముందు చీటీలు వేసాను. అప్పుడు "బ్రాహ్మణుడికి దానం ఇవ్వమ"ని వచ్చింది. దాంతో నేను మినుములు, బియ్యము, వెండి రాహువు, చంద్రుడు, కొద్దిగా దక్షిణ తీసుకొని శివాలయంకి వెళ్లి దోష నివారణ పూజ చేయించి పంతులుకి దానం ఇచ్చాను. అప్పుడు నేను, "సాయిబాబా! నాకు తెలిసింది మీరే. ఈ పంతులు రూపంలో ఉన్నది కూడా నువ్వే. నేను మీకు ఇస్తున్నాను" అని అనుకుంటూ 'సర్వం శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు' అని పంతులుకి ఇచ్చాను. కానీ మనసులో ఏదో చింత. మరుసటిరోజు జరిగిన అద్భుతం చూడండి. ఆ రోజు 'సాయి మహారాజ్ సన్నిధి' టెలిగ్రామ్ గ్రూపులో 'శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - ఏడవభాగం' తాలూకు లింకు పెట్టారు. అందులో నానాసాహెబ్ చందోర్కర్ తన కుటుంబంతో శిరిడీలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తే, అతను బాబా అనుమతి తీసుకొని గ్రహణకాలంలో పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించడానికి కోపర్గాఁవ్ వెళ్తాడు. అక్కడ ఒక మహర్, "గ్రహణం విడిపోయేలోపు దానం చేయండి" అని అడిగితే నానాసాహెబ్ అతనికి నాలుగు అణాలు ఇస్తాడు. అదే సమయంలో మసీదులో బాబా తమ పక్కన కూర్చుని ఉన్న భక్తుడు నందూరామ్ మార్వాడికి రెండు అణాల నాణేలు రెండు చూపుతూ, "చూడు! ఈ నాలుగు అణాలు నానా నాకిచ్చాడు" అని అంటారు. ఆవిధంగా నానా ఇచ్చిన దక్షిణ తమకే ముట్టిందని బాబా తెలియజేస్తారు. నేను దోష నివారణార్థం దక్షిణ ఇచ్చిన మరోసటిరోజే నా సంశయం తీర్చడానికన్నట్లు పై లీల రావడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంతేకాదు, ఆ లీల ద్వారా నేను సమర్పించిన దక్షిణ సాయికి అందిందని, ఆయన స్వీకరంచారని గ్రహించాను. ఇక నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. అత్యంత అద్భుతమైన ఆనందమది.
మా ఇంటిపైన మూడో అంతస్తులో ఒక మర్రిచెట్టు, ఒక రావిచెట్టు చాలా పెద్దగా పెరిగాయి. ఎంత పెద్దగా అంటే ఒక రెండు, మూడు అంతస్తులంత ఎత్తుగా. అయితే అవి అంతలా పెరిగాయన్న మాటే కానీ, దృఢంగా ఉన్న మా ఇంటి గోడలకి ఏమీ కాలేదు. కాకపోతే వాటి వేర్లు కొద్దిగా లోపలికి వచ్చినట్టు కనిపించేవి. రావిచెట్టు, మర్రిచెట్టు అయినందున కొట్టడానికి నాకు మనసు రాలేదు. అందుచేత చాలా రోజులు వాటిని కొట్టడానికి సంకోచించాను. చివరికి మాత్రం ఏదైతే ఏముందని బాబా మీద భారమేసి ఆ చెట్లు కొట్టించి మొత్తం తీయించేసాను. కానీ నా మనసులో, 'మరిచెట్టు, రావిచెట్టు దేవతలకు ప్రతీకలు కదా! వాటిని తీయించడం వల్ల ఏమైనా జరుగుతుందా?' అన్న సంశయంతో చాలా భయంగా ఉండేది. అప్పుడు కూడా ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నా సంశయం తీరింది. ఆ ఛానెల్లో నాకు ఒక బాబా లీల కనపడింది. అదేమిటంటే, సాఠేవాడా నిర్మాణం జరుగుతున్నప్పుడు గురుస్థానంలో ఉన్న వేపచెట్టు కొమ్మల వలన నిర్మాణానికి అంతరాయం కలుగుతుంది. బాబా శిరిడీ వచ్చిన తొలినాళ్లలో ఆ చెట్టు నీడనే కూర్చుని ధ్యానం చేసుకున్నందున అందరూ ఆ చెట్టునెంతో పవిత్రమైనదిగా భావించేవారు. అందువల్ల అటువంటి చెట్టు కొమ్మలు నరికేందుకు ఎవరికీ ధైర్యం చాలక బాబా వద్దకు వెళితే, "నిర్మాణానికి అడ్డొచ్చే కొమ్మలను నరికివేయండి. మన గర్భంలో అడ్డం తిరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా?" అని బాబా అంటారు. కానీ ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో బాబానే స్వయంగా ఆ కొమ్మలను నరికివేశారు. ఆ లీల చదివిన తర్వాత నా సంశయం తొలగిపోయింది. అలా నేను పడుతున్న మనోవేదనను బాబా తీసేసారు. ఈ అనుభవాలే కాదు, నా జీవితంలో ఏ సమస్య వచ్చిన బాబా ప్రతిక్షణం నాతోనే ఉంటూ సదా నాకు సహాయం చేస్తున్నారు. "మీ యందు, మీ పాదాలందు అచంచలమైన భక్తి కలిగి ఉంటూ, నిరంతరం మీ నామస్మరణ చేస్తూ శ్రద్ధ-సబూరీలతో ప్రశాంతంగా ఉండే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, 'నాకు మరుజన్మ వద్దు. మిమ్మల్ని దూరం చేసే ఏ సంపద నేను ఆశించట్లేదు తండ్రీ' ".

