- ఏ ఆటంకం లేకుండా శిరిడీ, కొల్హాపూర్ దర్శనం చేయించిన బాబా
నా పేరు ప్రసన్న. నేను కడప వాస్తవ్యురాలిని. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. బాబా నాపై చూపుతున్న ప్రేమని అంత ఇంతని చెప్పలేను. నాకు ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రేమని కూడా మాటల్లో వర్ణించడం నాకు కష్టమనిపిస్తుంది. ఆయనే నా తండ్రి. తండ్రి అన్నందుకు నిజంగా తండ్రిలా నా భాద్యతలన్నీ చూసుకుంటున్నారు బాబా. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నాకు బాబాతో పరిచయముంది. ఒకరోజు మా ఎదురింటివాళ్ళు తమ ఇంట్లో బాబా పూజ ఉందని పిలిచారు. నాకు ఆ సమయంలో బాబా గురించి అసలేం తెలీదు. కానీ మా అమ్మ పూజకు వెళ్ళమంటే వెళ్లాను. అది కూడా అంత ఇంట్రెస్ట్గా ఏం వెళ్ళలేదు. అలా వెళ్లిన నేను పూజలో కూర్చోని బాబా చక్కటి ముఖారవిందాన్ని వీక్షిస్తుండగా అంతలో ఒకరు సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలు చదవడం మొదలుపెట్టారు. ఆ కధలను వింటుంటే నాలో ఏదో తెలియని ఆనందం కలిగి, 'బాబా ఎంత గొప్పవారు?' అనిపించింది. పూజ నుండి వచ్చాక అమ్మతో బాబా గురించి చెప్పాను. మెల్లగా అమ్మ బాబాని నమ్మడం ప్రారంభించింది. క్రమంగా మా ఇద్దరి నమ్మకం పెరుగుతూ ‘బాబా మమ్మల్ని ఎప్పుడు శిరిడీకి పిలుస్తారా?’ అని ఎదురుచూసాము. అలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు హఠాత్తుగా 'ఈ సంవత్సరం(2024) సంక్రాంతి సెలవలకి శిరిడీ వెళితే బాగుండు' అనుకున్నాను. కానీ మాకై మేము తెలుసుకొని అంత దూరం వెళ్ళలేము. మా మామయ్యవాళ్లే మమ్మల్ని తీసుకెళ్లాలి. అందువల్ల, "బాబా! నేను ఒక్కదాన్నే శిరిడీ రావాలనుకుంటే అయ్యే పని కాదు కదా. మా మావయ్యవాళ్ళు అనుకుంటేనే రాగలం" అని బాబాతో అనుకొని నా ఆలోచనను అక్కడితో వదిలేసాను. ఎందుకంటే, మా మావయ్యవాళ్ళు శిరిడీ వస్తారన్న నమ్మకం నాకు అప్పుడు లేదు. కానీ బాబా తన బిడ్డలని ఎప్పుడూ నిరాశపరచరు. ఆ రాత్రి నేను మా మామయ్యవాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటే మామయ్య తనంతట తానే, "ఈ సంక్రాంతికి శిరిడీ, కొల్హాపూర్ వెళదామని టిక్కెట్లు చూస్తున్నాం. నువ్వు కూడా చూడు. నీకు సెలవులు ఎప్పుడు కుదురుతాయో అప్పుడు చేసుకుందాం" అని అన్నారు. అది విన్న నా ఆనందానికి ఇంక అవధులు లేవు. నా తండ్రి తన బిడ్డ కోరికను వెంటనే ఎలా నెరవేరుస్తున్నారో అని అనుకున్నాను. తీరా టికెట్స్ బుక్ చేద్దామంటే, కడప నుంచి శిరిడీకి జనవరి 9న ఉన్న వీక్లీ ఎక్స్ప్రెస్లో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకొని, తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ దర్శనానికి వెళ్దామంటే రెండు చోట్లకు వెళ్ళడానికి టిక్కెట్లు సరిగా కుదరలేదు. ఆ మాట విని నాకు చాలా బాధేసి, "బాబా! టికెట్లు బుక్ అవ్వట్లేదు. నాకు భోజనం తినాలని లేదు" అని మధ్యాహ్నం భోజనం తినకుండా ఏడుస్తూ కూర్చున్నాను. కాసేపటికి నా మనసుకి, 'నేను ఇలా పస్తుంటే బాబాకి నచ్చదు. నేను ఇలా చేస్తే బాబా బాధపడతారు' అని అనిపించి బాబాని బాధపెట్టడం ఇష్టం లేక వెళ్లి భోజనం చేసి వచ్చాను. ఇంతలో మామయ్యవాళ్ళు పోనే చేసి, "అందరికీ టికెట్లు బుక్ చేసాం" అని చెప్పారు. ఇంకా నేను, అమ్మ 'జనవరి 9 ఎప్పుడొస్తుందా?' అని సంతోషంగా ఎదురుచూసాం. 'మొదటిసారి శిరిడీ వెళుతున్నాం. బాబాని చూస్తే, అంతే చాలు' అని ఎంతో ఆరాటంతో ఆరోజు కోసం నిరీక్షించాము. అలాగే జనవరి 5కి నా నెలసరి సమయం అయినందున బాబాని చూడగలనో, లేదో అన్న టెన్షన్ కూడా ఉండింది. ఒకరోజు బాబా గుడికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు ఎందుకో తెలీదుగాని, 'నేనైతే బాబాని చూడకుండా ఉండలేను. ఒకవేళ నెలసరి అయిన కూడా నేను బాబాని చూడకుండా ఉండలేక మందిరంకి వెళ్ళిపోతానేమో!' అని అన్నాను. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా బాబా నేను అలా అన్నందుకు నన్ను పరీక్షిస్తున్నారేమో అనిపించేది. చివరికి జనవరి 6, రాత్రి ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో నెలసరి సమయంలో శిరిడీలో దర్శనం చేసుకోవచ్చా, లేదా అన్న కొందరి భక్తుల సందేహాన్ని బాబా స్వయంగా తీర్చిన అనుభవాలను చదివాను. దాంతో నెలసరి సమయంలో బాబాను నిశ్చింతగా దర్శించుకోవచ్చని నిర్ధారణ అయి నా సందేహాలన్నీ తీరిపోయాయి. కానీ మరోవైపు నెలసరి ఎక్కడొస్తుందో, వస్తే అమ్మవారినైతే దర్శించుకోలేనుగా అని అనిపించింది. అందుచేత, "బాబా! ఏ సమస్య లేకుండా మీ దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించండి" అని అనుకొని నెలసరి ఆగడానికి టాబ్లెట్లు తెచ్చుకున్నాను. వాటివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, లేదో నాకు తెలీదుకాని నేను బాబాను, అమ్మవారిని చూడాలన్న ఆరాటంతో వేసుకోబోతున్నాను కాబట్టి వాళ్లే నన్ను రక్షిస్తారనే నమ్మకంతో వేసుకున్నాను.
మేము జనవరి 9న బయలుదేరి జనవరి 10న శిరిడీ చేరుకున్నాము. నేను బాబాను, "తండ్రీ! అమ్మ ఎవరినీ ఏది అడగదు. తను ఏ కష్టమొచ్చినా ఆదుకోమని మిమ్మల్నే అడుగుతుంది. మీరు తనకి చక్కటి దర్శనాన్ని ప్రసాదించి మీ కరుణను తనపై ప్రసరించండి" అని ప్రార్థించాను. బాబా దర్శనానికి మా అమ్మవాళ్ళు లైన్లో ముందు వెళ్ళారు. వాళ్ళకి బాబా చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. నేను అదే లైన్లో వెనుక వెళ్తుంటే మా మామయ్య వచ్చి, "చివరి లైన్లో వెళితే బాబాకి దగ్గరగా వెళ్లొచ్చు" అని చెప్పారు. సరేనని నేను ఆ లైన్లోకి వెళ్లాను. ఆ లైన్ బాబాని చూసాక నేరుగా బయిటికి వెళ్లిపోయేలా ఉన్నందున నేను కొన్ని క్షణాలే బాబాని చూడగలిగాను. అందుచేత సరిగా బాబా దర్శనం కాలేదని నాకు బాధగా అనిపించింది. మేము మా రూమ్కి వచ్చేసరికి రాత్రి ఒంటిగంట అయింది. అమ్మ పెద్దమ్మ, అత్తవాళ్ళతో పడుకుంటే నేను అక్కవాళ్ళతో వేరే గదిలో పడుకున్నాను. తెల్లారితే గురువారం. అమ్మవాళ్ళు పొద్దున్నే లేచి బాబా దర్శనానికి వెళుతూ మా గది తలుపు తట్టారు కానీ, మాకు వినిపించలేదు. నిద్రలేచాక గురువారంనాడు దర్శనానికి వెళ్ళలేకపోయానని నాకు చాలా బాధగా అనిపించి, "ఏంటి బాబా, నాకు మీ దర్శనం లేదా?" అని అనుకున్నాను. అంతలో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ వాట్సాప్ ఛానెల్లో "నువ్వు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు ఋణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి" అని బాబా మెసేజ్ వచ్చింది. అది చూశాక ఎలాగైనా వెళ్లి బాబాని దర్శించుకోవాలని అనుకున్నాను. అదే విషయం మా అమ్మతో చెప్పాను. కానీ పెదమ్మవాళ్ళు, మామయ్యవాళ్ళు నాసిక్ వెళ్ళాలి. ఇప్పుడు దర్శనానికి వెళితే టైం సరిపోదు అన్నారు. నేను, “ఏదేమైనా గాని బాబా దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎక్కడికీ రాను" అని చెప్పేసి నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాను. అమ్మ మావయ్యవాళ్ళతో, "మీరందరూ నాసిక్ వెళ్లిరండి. మేము బాబా దర్శనంకి వెళ్ళొస్తాము" అని చెప్పింది. ఇంకా పెద్దమ్మవాళ్ళు నా భాద చూడలేక బాబా దర్శనంకి వెళ్ళిరా అని చెప్పారు. ఈసారి దర్శనానికి మధ్య లైన్లో వెళ్లాను. ఆ లైన్లో నుంచి బాబాని చూస్తుంటే బాబా నా వైపే చూస్తున్నారనిపించింది. దర్శనం చాలా బాగా జరిగింది. నేను దణ్ణం పెట్టుకుంటూ బాబా దగ్గర ఉండగా మా బావవాళ్ళు దణ్ణం పెట్టుకొని వెనక్కి వెళ్తుంటే అక్కడున్న సెక్యూరిటీ అతను మా బావని ఆపి కొద్దిసేపు అక్కడ ఉండమని చెప్పారు. నేను మా బావవాళ్ల దగ్గరకి వెళ్ళాక ఆ సెక్యూరిటీ అతను బాబాకి సమర్పించిన స్వస్తిక్ గుర్తు ఉన్న ఒక వస్త్రాన్ని మాకు ఇచ్చారు. నేను అది బాబా దయ అని బావించాను.
తర్వాత మేము 4వ నెంబర్ గేటుకి ఎదురుగా బాబా కాంస్య విగ్రహం ఉన్న చోటకి పార్క్లోకి వెళ్తుంటే బాబా ఫోటో ఒకటి మా ముందు వచ్చి పడింది. అది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదుగాని అది నా తండ్రి నాపై చూపిన ప్రేమ, కరుణ. మేము బాబా విగ్రహాలు తీసుకున్నాం. వాటిని తీసుకొని దర్శనానికి వెళితే, సమాధికి తాకించి ఇస్తారని మొదటిసారి శిరిడీ వెళ్ళినందువల్ల మాకప్పుడు తెలీదు. తర్వాత సాయంత్రం ముఖదర్శనం చేసుకొనే సమయంలో విగ్రహాలను ఎవరికైనా ఇస్తే సమాధికి తాకించి ఇస్తారని చాలా ప్రయత్నం చేసాం కానీ, అక్కడ సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. ఇంతలోపు మా అమ్మ, "బాబా వస్తున్నారు" అని అంది. చూస్తే, ఎదురుగా బాబా పల్లకి వస్తుంది. ఉదయం సాయి తమ వచనం ద్వారా "నేను నీవద్దకు వస్తాను" అని చెప్పారు, అలానే నా తండ్రి వచ్చారు. మేము తీసుకున్న బాబా విగ్రహాలను ఆ పల్లకికి తాకించాను.
2024, జనవరి 11 సాయంత్రం మేము కొల్హాపూర్కి ప్రయాణమయ్యాము. అదృష్టంకొద్దీ జనవరి 12, శుక్రవారంనాడు మహాలక్ష్మి అమ్మవారి దర్శనభాగ్యం మాకు కలిగింది. అదేరోజు అమ్మవారి పల్లకి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. మరుసటిరోజు శనివారం ఉదయం మేము మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు సరిగ్గా అమ్మవారి దగ్గరకి వెళ్లేసరికి అమ్మవారిని నిజరూప దర్శనానికి సిద్దం చేసారు. అలా ఆ చల్లటి తల్లి నిజరూప దర్శనభాగ్యం కూడా మాకు లభించింది. అలా నా తండ్రి శిరిడీ, కొల్హాపూర్ రెండూ దర్శనాలు ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగేలా అనుగ్రహించారు. ఇలా బాబా ఎప్పుడూ మాతోనే ఉంటారని నా నమ్మకం.
ఒకసారి నా ఛార్జర్ పని చేయలేదు. అప్పుడు నేను, "బాబా! ఇది నాకు ఇప్పుడు ఎంతో అవసరం. ఇది పని చేసేలా చూడండి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. అంతలోనే నా ఛార్జర్ పనిచేసింది. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా బాబా ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. ఒక్క నా వెంటే కాదు, తమను నమ్మిన ప్రతి ఒక్కరి బాగోగులు ఆయన చూసుకుంటారు. మనం నిర్భయంగా ఉంటూ స్వచ్ఛమైన మనసుతో ఆయనను నమ్మితే చాలు. "ధన్యవాదాలు బాబా. మీరు నా ఉద్యోగ విషయాలలో నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చారు. అందుకు నా కృతఙ్ఞతలు. అలాగే నేను ఈ సంవత్సరం సాదించాలని అనుకున్నవన్నీ జరిగేలా చూడండి. అమ్మానాన్నకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మాలాగే ఎంతో మంది ‘మీరు ఉన్నారు, చూసుకుంటారు’ అన్న నమ్మకంతో మీ సహాయం కోసం చూస్తున్నారు. మా అందరికి మీరే దైర్యం, మీరే రక్ష, మీరే మా ఆధారం”.
.jpeg)
