సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1770వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సాయిపై విశ్వాసం ఉంచుదాం - సాయి అద్భుతాలను అనుభవించడానికి ఓపికగా ఉందాం

నా పేరు గణేష్ మణికుమార్. బాబా నాకు అనేక అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి ఒక అతిపెద్ద అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నేను నా తల్లిదండ్రులకు ఒక్కడినే అబ్బాయిని. నాకు ఒక చెల్లలు వుంది. నేను బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి 2009లో ఐటీ ఫీల్డ్‌‌లో నా కెరీర్ ప్రారంభించాను. నేను బాగా పని చేస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం కేవలం 3 లేదా 4% పెంపుతో దాదాపు ఎనిమిది ఏళ్ళు నేను తక్కువ జీతాన్ని అందుకున్నాను. నాకొచ్చే తక్కువ జీతంతో బెంగుళూరులో నా అవసరాలు తీర్చుకుంటూ తమిళనాడులో ఉంటున్న నా తల్లిందండ్రుల అవసరాలకు డబ్బులు పంపడం నాకెంతో కష్టంగా ఉండేది. అందువలన 2015లో నాకు తగిన ఉద్యోగం కోసం జాబ్ పోర్టల్‌లలో దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూలకు హాజరవ్వమని నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను రాత్రీపగలూ ప్రిపేర్ అయి 15 టాప్ ఐటీ కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఆ కంపెనీలలో ఏ ఒకదానికి ఎంపికైనా నేను అప్పట్లో అందుకుంటున్న జీతానికి 30% జీతం అదనంగా ఆఫర్ చేసేవారు. కానీ, దురదృష్టవశాత్తు అన్నీ కంపెనీలు నన్ను తిరస్కరించాయి. ఆ విషయం నన్ను తీవ్ర నిరాశకు గురిచేయడంతో నేను ఇంటర్వ్యూలకు హాజరవ్వడం మానేశాను. ఆ సమయంలో సాయి నా గురించి పెద్ద ప్రణాళిక చేసారని అర్థంకాక 'ఇన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చేలా ఎందుకు ఆశీర్వదించలేద'ని సాయిని అడుగుతూ ఉండేవాడని. ఇంకా, "చాలా ఏళ్లుగా మా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడుతుంది. అందువల్ల నా కెరీర్‌లో మార్పు తీసుకొచ్చి, నాకు వచ్చే జీతాన్ని కాస్తైనా పెంచమ"ని ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. అలా ఒక సంవత్సరం గడిచింది.

2016, ఆగస్టులో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను నా మేనమామతో కలిసి మా ఇంటికి వెళ్తూ ఒకచోట కూర్చుని హుక్కా తాగుతున్న ఒక పెద్దాయనను చూశాను. అతను 1000 ట్యూబ్ లైట్ల కాంతితో మెరిసిపోయే తెల్లని కఫ్నీ ధరించి ఉన్నారు. నేను అతనిని దాటుకొని మా ఇంటికి చేరుకొని ఇంటిలో అడుగు పెట్టబోతుండగా అక్కడ కూర్చున్నది ఎవరో కాదు మన సాయిబాబా అని గ్రహించాను. వెంటనే మా మామయ్యను ఇంట్లోకి వెళ్ళమని, నేను సాయి దగ్గరకు అడుగులు వేసాను. నేను సాయి దగ్గరకి వెళ్లి, "ఇక్కడ ఎందుకు కూర్చున్నారు బాబా?" అని అడిగాను. సాయి లేచి నిలబడి, "నా మహాసమాధి రోజున నన్ను బాగా ప్రార్థించు" అని అన్నారు. "నేను మిమ్మల్ని తప్పకుండా ప్రార్థిస్తాను" అని ఆయన చేతులు పట్టుకుని మళ్లీమళ్లీ అదే మాట చెప్పాను. అప్పుడు సాయి, "నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను" అని పదేపదే చెప్పారు. "నేను మిమ్మల్ని ఇక వేచి ఉంచను. నేను ఇక్కడే మీతో ఉన్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి" అని ఆయన పాదాలను తాకాను. ఆయన, "నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి" అని నన్ను ఆశీర్వదించారు. అంతటితో కల ముగిసింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేచాక నాకు ఆ కల చాలా స్పష్టంగా గుర్తుకు వచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సాయి నా జీవితం బాగుండాలని నేను ఊహించిన దానికంటే గొప్పగా ప్లాన్ చేస్తున్నారని అనిపించింది. నేను ఆ కల నా కుటుంబంతో పంచుకున్నాను. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నేను కలలో బాబాకిచ్చిన మాటకు కట్టుబడి 2016, అక్టోబర్ 11, మంగళవారం, బాబా మహాసమాధి రోజున(విజయదశమి) బాబాను అందంగా అలంకరించి ఆరతి ఇచ్చి, సాయి సచ్చరిత్ర పఠించాను. ఇంకా రోడ్డు పక్కన నివసించే 10 మంది పేదలకు ఆహారం ఇచ్చాను.

20 రోజుల తర్వాత నవంబర్ నెల మొదటి వారంలో నాకు ఒక జాబ్ కన్సల్టెన్సీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు, "బెంగళూరులోని ఒక టాప్‌మోస్ట్ ఇంటర్నేషనల్ ఆయిల్ కంపెనీలో ఐటి ఉద్యోగం వేకెన్సీ ఉంద"ని చెప్పారు. నేను ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి నా అంగీకారం తెలిపాను. వాళ్ళు మొదట ఫోన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసారు.  నేను ఆ ఇంటర్వ్యూ బాగా చేశాను. కానీ ఒక వారం వరకు వాళ్ళ నుండి నాకు ఏ ఇన్ఫర్మేషన్ అందలేదు. ఒకట్రెండు రోజుల తర్వాత నేను బస్సులో నా ఆఫీసుకు వెళ్తుండగా 2016, నవంబర్ 19, 20 తేదీలలో 'శ్రీ శిరిడీ సాయిబాబా పాధుకలు'  బెంగుళూరుకు వస్తున్నట్లు పూర్తి వివరాలతో ఉన్న బ్యానర్లు చూసి, వాటిని చదివి చాలా సంతోషించాను. తర్వాత 2-3 రోజుల్లో, "మీరు ఫోన్ ఇంటర్వ్యూ క్లియర్ చేసారు. వారం తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూకోసం కంపెనీ కార్యాలయానికి రమ్మ"ని HR నుండి నాకు కాల్ వచ్చింది. అయితే, నేను సాయి మాత దివ్య పాదుకల దర్శనం చేసుకోకుండా ఇంటర్వ్యూకు హాజరు కాకూడదనుకున్నాను. అందువల్ల సాయి మాత దివ్య పాదుకల దర్శనం చేసుకున్న మరుసటిరోజుకి అంటే 2016, నవంబర్ 21, సోమవారంకి ఇంటర్వ్యూ వాయిదా వేయమ"ని HRని అభ్యర్థించాను. HR నా అభ్యర్థనను ఆమోదించారు.

2016, నవంబర్ 19, శనివారంనాడు సాయి మాత దివ్య పాదుకలను బెంగుళూరులోని 'శ్రీసాయి కోటి బాబా మందిర్'(ఇది అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉంది) నిర్మాణం మొదలు పెట్టె సందర్భంగా తీసుకొచ్చారు. నేను సాయిమాత పాదుకలు దర్శించుకొని, 'శ్రీసాయి కోటి బాబా మందిర్' శంకుస్థాపనకు హాజరయ్యే అవకాశం లభించినందుకు చాలా సంతోషించాను. ఆ రోజంతా నేను అక్కడ భజనలు వింటూ, ఆరతికి హాజరయ్యాను. నేను నా జీవితంలో మొదటిసారి సాయిబాబా పాదుకల దర్శనంతో పరమానందభరితుడనై బాబాను బాగా ప్రార్థించాను. నా ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు చివరిలో ఆ కార్యక్రమ నిర్వాహకులు మందిర ప్రారంభోత్సవ సందర్భంగా మరుసటిరోజు(నవంబర్ 20, 2016) ఉన్న ఒక కార్యక్రమం గురించి ప్రకటించారు. అదేమిటంటే, భక్తులు మొదట వెయ్యి రూపాయలు విరాళంగా ఇస్తే ఒక చిన్న బాబా విగ్రహం ఇస్తారు. అలా 101 భక్తలకు 101 బాబా విగ్రహాలు ఇస్తారు. భక్తులు బాబాను అభిషేకించాక వాటిని ఆలయంలో ప్రతిష్టిస్తారు. నేను చాలా సంతోషించి మరుసటిరోజు మళ్లీ అక్కడికి వెళ్లి కౌంటర్లో వెయ్యి రూపాయలు చెల్లించి, రశీదు తీసుకున్నాను. కార్యక్రమ నిర్వాహక బృందం నాకు ఒక చిన్న బాబా మూర్తిని, అభిషేకం చేయడానికి ఒక చిన్న సీసాతో గంగాజలం, కొన్ని గులాబీలు అందించారు. నేను మనసారా బాబాను అభిషేకించి, పూజ చేసి మరుసటిరోజు ఇంటర్వ్యూకోసం బాబాను బాగా ప్రార్థించాను. తర్వాత బాబాను ఆలయంలో ప్రతిష్టించడానికి కార్యక్రమ నిర్వాహక బృందానికి తిరిగి ఇచ్చాను.

మరుసటిరోజు 2016, నవంబర్ 21, సోమవారంనాడు నేను ముఖాముఖి ఇంటర్వ్యూకి హాజరై సాయిమాత ఆశీస్సులతో అన్ని ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పగలిగాను. ఇంటర్వ్యూ పూర్తైన తర్వాత నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. HR ఫలితాలు తర్వాత వెల్లడిస్తారని చెప్పి నన్ను వెళ్ళమంటే నేను వచ్చేసాను.

2016, నవంబర్ 22, మంగళవారం కంపెనీ నుండి నాకు ఫోన్ వచ్చింది. HR నన్ను అభినందించి, "మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి మీరు ఎంపికయ్యారు" అని చెప్పారు. తర్వాత ఆమె, "ప్రస్తుతం మీ జీతం ఎంత? కొత్త జీతం ఎంత కావాలని ఆశిస్తున్నారు" అని నన్ను అడిగింది. నేను ఆమెతో నా ప్రస్తుత జీతం(చాలా తక్కువ) చెప్పి "100% పెంచమ"ని అడిగాను. అందుకామె, "మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలము" అని చెప్పింది. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఆమె వాళ్ళు ఇవ్వబోయే CTC గురించి చెప్పి, దానికి ఆమోదం తెలుపమని నాకు ఇమెయిల్ పంపారు. అదేరోజు సాయంత్రం నేను నా అంగీకారం తెలుపుతూ రిటర్న్ మెయిల్ పంపాను. నేను వాళ్ళు నాకు ఆఫర్ చేసిన మొత్తాన్ని లెక్కించుకుంటే అది నేను అప్పటికి అందుకుంటున్న జీతం కంటే 200% ఎక్కువ ఉంది. నేను ఆనందాన్ని పట్టలేక నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించి, "ఇది సాయి అనుగ్రహమ"ని చెప్పారు. నేను ఆరోజు సాయంత్రం చాలా పొద్దుపోయాక ఇంటికి వెళ్లి సాయి చూపిన కరుణకు ఆనందంతో ఏడ్చాను. భావోద్వేగంతో నాకు ఆ రాత్రంతా నిద్రపట్టక నా ప్రియమైన సాయిబాబా పాటలు వింటూ గడిపాను. ఆ సమయంలో నాకు మన సాయితల్లి పెద్ద ప్రణాళికి నిజంగా అర్థమైంది. 

నేను 2016, డిసెంబర్ 23న ఆఫర్ లెటర్ అందుకొని సాయి ఆశీస్సులతో 2017, మార్చి 20న కొత్త కంపెనీలో చేరాను. మొదటిరోజు నాకు నా ఐడి కార్డు ఇస్తే, నేను దాన్ని తీసుకొని ధూప్ ఆరతి సమయానికి సాయి మందిరానికి వెళ్లి పూజారి చేతికి ఇచ్చాను. ఆయన నా ఐడి కార్డును సాయి పాదాల వద్ద ఉంచి, ఆరతి అయిపోయాక సాయి ఆశీస్సులతో నాకు తిరిగి ఇచ్చారు. అప్పటినుంచి నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. అంతా సాయి కృప. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మేము నా సోదరికి సరైన వరునికోసం వెతుకుతున్నాము. దయచేసి తనకి త్వరలో వివాహమయ్యేలా ఆశీర్వదించండి. అలాగే మా కుటుంబానికి ఒక సొంతిల్లు అనుగ్రహించండి". ప్రియమైన సాయిభక్తులారా, సాయిపై విశ్వాసం ఉంచుదాం, సాయి అద్భుతాలను అనుభవించడానికి ఓపికగా ఉందాం. సాయి పాదపద్మాలను పట్టుకోవడం ఒక్కటే శాంతి, ఆనందాలు పొందడానికి మార్గం.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo