1. సాయితండ్రి దయతో నాన్నకి ఆపరేషన్
2. కోరుకున్నట్లు చిన్న సమస్యతో బయటపడేసిన బాబా
సాయితండ్రి దయతో నాన్నకి ఆపరేషన్
అందరికీ నమస్కారం. నా పేరు మమత. మా నాన్నకి థైరాయిడ్ సమస్య ఉంది. అదేమిటంటే, థైరాయిడ్ పెద్దగా అయి నాన్న గొంతు వరకు వచ్చింది. అది పూర్తిగా గొంతును మూసివేస్తే నాన్న ఇంకా ఆహారం తినడానికి రాదు. అందువల్ల 2023, అక్టోబర్లో నేను నాన్నని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాళ్ళు కొన్ని టెస్టులు వ్రాసి, ఆ టెస్టులన్నీ చేయించి నవంబర్ 13న హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. మేము వాళ్ళు చెప్పిన విధంగా టెస్టులు అన్నీ చేయించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. హాస్పిటల్వాళ్ళు రోజూ టెస్టులు చేస్తూ ఐదు రోజులు గడిచాక, "ఇక్కడ బుధ, శనివారాల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తాము. వచ్చే రెండు వారాల్లో వేరే రోగులకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి. మేము ఫోన్ చేసి పిలుస్తాం" అన్నారు. దాంతో మేము ఇంటికి వచ్చేసాము. నేను అదే మొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లడమైనందువల్ల అక్కడ చికిత్స చేయడానికి అంత జాప్యం చేస్తారని నాకు తెలియదు. తర్వాత నవంబర్ 30న హాస్పిటల్వాళ్ళు ఫోన్ చేసి, “రేపు ఒకసారి హాస్పిటల్కి రండి” అని చెప్పారు. మరుసటిరోజు డిసెంబర్ 1న మేము మళ్ళీ హాస్పిటల్కి వెళితే, "వార్డులో ఉండండి వచ్చి కలుస్తాము" అన్నారు. కానీ సాయంత్రం వరకు ఎవరూ రాలేదు. అప్పుడు ఒక సార్ వచ్చి, "మీరు ఇక్కడే ఉండండి. ఇంటికి వెళ్లొద్దు" అన్నారు. నేను, 'ఈసారి ఆపరేషన్ చేస్తారేమో! అందుకే ఇంటికి పంపించట్లేదు' అనుకున్నాను. కానీ 15 రోజులవుతున్నా ఆపరేషన్ చేయలేదు. ఎప్పుడు అడిగినా హెచ్ఓడి సార్ అందుబాటులో లేరని అంటుండేవారు. మాకన్నా వెనుక వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ చేస్తూ నాన్నకి మాత్రం చేయట్లేదని మేము చాలా బాధపడ్డాం. అమ్మ నాన్నతో హాస్పిటల్లో ఉండేది. నాన్నకి హాస్పిటల్వాళ్ళు భోజనం పెట్టేవారు. అమ్మకి నేను రోజూ ఇంటి నుండి ఆహారం తీసుకొని వెళ్లేదాన్ని. కానీ వృద్ధులైన నా తల్లిదండ్రులకు హాస్పిటల్లో ఉండటం చాలా కష్టంగా ఉండేది. రోజూ హాస్పిటల్కి వెళ్లి, రావడానికి నాకు కూడా కష్టంగా ఉండేది. మేము ఇంత కష్టపడుతూ 15 రోజులున్నాక డాక్టర్, "వేరే రోగులు ఉన్నారు. ఇంకో రెండు వారాల వరకు మీకు ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఇంటికి వెళ్ళండి. మళ్ళీ కాల్ చేస్తాము" అన్నారు. దాంతో మేము మళ్ళీ ఇంటికి వచ్చాము. డిసెంబర్ 25న డాక్టర్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వమని, డిసెంబర్ 27, బుధవారంనాడు మాక్సిమం ఆపరేషన్ చేస్తామన్నారు. సరేనని మేము హాస్పిటల్కి వెళితే అమ్మ సంతకాలు తీసుకొని ఆపరేషన్కి అన్ని సిద్ధం చేసారు. తర్వాత అనస్థీషియా డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు నాన్న ఒకసారి దగ్గడంతో ఆయన నాన్నకి దగ్గు ఉందని రాశారు. దాంతో మరుసటిరోజు ఎక్స్రే తీశారు. ఆ రిపోర్టు చూసాక డాక్టరు, “పర్లేదు ఆపరేషన్ చేస్తాన”ని, నాన్నని మరుసటిరోజు ఆపరేషన్ కోసం సిద్ధం చేశారు. నేను ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి 10 గంటలకి అమ్మకి ఫోన్ చేస్తే, ఆపరేషన్ పోస్ట్ఫోన్ చేశారని చెప్పింది. రేపు ఆపరేషన్ జరుగుతుందన్న ఆనందంలో ఉన్న నాకు ఆ విషయం చెప్పేసరికి చాలా బాధేసింది. విషయమేమిటంటే, రాత్రి 10 గంటలకు ఇద్దరు డాక్టర్లు వచ్చి స్టెత్ పెట్టి గాలి పీల్చి, వదలమంటే, నాన్న నోటితో గాలి పీల్చి, వదలటం చేశారట, దాంతో ఏదో సమస్య ఉందని ఆపరేషన్ పోస్ట్ఫోన్ చేశారు. నేను, “రేపు బుధవారం ఆపరేషన్ జరిగితే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన”ని సాయితండ్రికి చెప్పుకున్నాను. అయితే ఆపరేషన్ జరగలేదు సరికదా! “మరుసటి బుధవారం అంటే జనవరి 3న కూడా అనస్తీసియా ఇచ్చేవాళ్ళు ఒకే అంటేనే ఆపరేషన్ చేస్తామమ్మా. లేకపోతే ఆ మరుసటి బుధవారం చేస్తాం” అన్నారు. నేను సాయితండ్రిని, "సాయీ! నాన్నకు 2024, జనవరి 3న ఆపరేషన్ జరిగితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. అలాగే శిరిడీ వస్తాన"ని మొక్కుకున్నాను. సాయితండ్రి దయవల్ల జనవరి 3న నాన్నకి ఆపరేషన్ జరిగింది. నేను 2021, డిసెంబర్లో మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పుడు ద్వారకామాయి దర్శించలేకపోయాను. అప్పటినుండి ద్వారకామాయి దర్శించలేదన్న బాధ నాలో ఉంది. చాలాసార్లు శిరిడీ వెళ్లాలనుకున్నాను కానీ, వెళ్లలేకపోయాను. ఆ కోరిక సాయితండ్రి ఈ విధంగా నెరవేర్చదలిచారేమో! "ప్రతిక్షణం నాకు, నా కుటుంబానికి తోడు-నీడగా ఉంటున్నందుకు థాంక్యూ సాయితండ్రీ. దయచేసి నేను ఎలాంటి మాయకు లోనుకాకుండా మంచిగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకునేలా సహాయం చేయి తండ్రీ".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
కోరుకున్నట్లు చిన్న సమస్యతో బయటపడేసిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సునీత. బాబా నా వెన్నంటి ఉండి తల్లిలా, తండ్రిలా నన్ను ముందుకు నడిపిస్తారు. ఒకరోజు నా తల అంతా తిరిగిపోతూ ఉంటే బీపీ డౌన్ అయిందనుకున్నాము. ఎంతకీ తలా తిరగడం తగ్గలేదు సరికదా రాత్రైనా అలాగే ఉంది. ఇక అప్పుడు ఇంకా ఇలానే ఉంటే ఏమవుతుందోనని హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఈసీజీ తీసి, తర్వాత సిటీ స్కాన్కి తీసుకెళ్లారు. అప్పుడు నేను, "తండ్రీ! ఎలాంటి అనారోగ్యం బయటపడకూడదు. ఏదైనా మామూలు సమస్య అని చెప్పి పంపించాలి" అని బాబాతో మొరపెట్టుకున్నాను బాబా దయవల్ల మరుసటిరోజు న్యూరో స్పెషలిస్టు 'వెర్టిగో' అని, "ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేద"ని చెప్పారు. నేను, "బాబా! నన్ను కాపాడావు" అని దణ్ణం పెట్టుకున్నాను. ఈవిధంగా బాబా నా ప్రతి విషయంలో ముందుకు నడుపుతారు. మనము విశ్వాసంతో మొరపెట్టుకుంటే ప్రతి చిన్న విషయాన్ని వింటారు బాబా. "ధన్యవాదాలు బాబా. ఈ జన్మకి నా ఈ జీవితం నీ పాదాల చెంతే తండ్రీ, అందరూ బాగుండాలి. అందులో మేమూ ఉండాలి. మీ కృపాకటాక్షాలు ఎప్పటికీ మీ భక్తులకు ఉండాలి".

