1. సందర్భానుసారం బాబా చేసిన సహాయం
2. బాధను తీసేసి ఆనందంగా తిరిగి పంపిన బాబా
సందర్భానుసారం బాబా చేసిన సహాయం
నా పేరు కమలిని. మాది శ్రీకాకుళం. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు బాబాని, "నాకు బోర్డు పరీక్షలలో 575 మార్కులు రావాల"ని ఒక కోరిక అడుగుతుండేదాన్ని. పరీక్షలు వ్రాసాక ఫలితాలు రేపు విడుదల అవుతాయనగా ముందురోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు 532 మార్కులు వచ్చినట్లు కనిపించింది. మరుసటిరోజు నాకు అవే మార్కులు వచ్చాయి. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. కానీ బాబా దయవల్ల రీవెరిఫికేషన్లో నేను కోరుకున్న మార్కులు నాకు వచ్చాయి.
తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరంలో నాకు బాగానే మార్కులు వచ్చాయి. కానీ రెండవ సంవత్సరంలో నా మీద నాకు విశ్వాసం తక్కువగా ఉన్నందున 'నాకు జెఈఈ మైన్స్లో నాకు మంచి సీట్ వస్తుందా? నా తల్లిదండ్రులతో డొనేషన్ కట్టించకుండా నేను నా చదువు పూర్తి చేయగలనా?' అని అనిపించేది. అటువంటి సమయంలో జాతకాలను అస్సలు నమ్మని మా నాన్న నన్ను ఒక జ్యోతిష్యుని దగ్గరకు తీసుకెళ్లారు. బాబా భక్తుడైన ఆయన నాకు మార్గనిర్దేశం చేసారు. నా జాతకంలో ఉన్న దోషాలు తొలగడానికి ఆయన నాకు కొన్ని పరిహారాలు చెప్పారు. నేను వాటిని పాటించాను. తర్వాత బాబా దయవల్ల మా కళాశాలలో జరిగే పరీక్షలలో నాకు ఎప్పుడూ మొదటి స్థానం రావడంతో నాకు కాస్త నమ్మకం వచ్చింది. ఒక శనివారంనాడు నాకు వారాంతం పరీక్ష ఉందనగా మందురోజు నేను ఉపవాసం ఉన్నాను. అందువల్ల పొద్దున్నుంచి కొన్ని పళ్ళు మాత్రమే తిన్నాను. ఆరోజు మధ్యాహ్నం నేను ఇంటికెళ్లి మర్నాటి పరీక్షకోసం చదువుకుందామని కాలేజీలో హాఫ్ డే సెలవు తీసుకున్నాను. నేను కాలేజీ నుండి బయటకి వచ్చాక మా నాన్నకి నా బ్యాగు ఇవ్వబోతుంటే ఆయన, "నువ్వే వేసుకో(వీపుపై)" అనడంతో నేను వేసుకున్నాను. కానీ, 'పొద్దున్నుంచి నేనేమీ తినలేద'ని తెలిసి కూడా నాన్న నన్నే బ్యాగు మోయమని ఎందుకు అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. కొంతదూరం వెళ్ళాక నాకు కళ్ళు తిరిగి బండి మీద నుండి చాలా రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో పడిపోయాను. నాకు అస్సలు చలనం లేదు. కాసేపటికి స్పృహలోకి వచ్చి చూస్తే రోడ్డు మధ్యనున్నాను. ఏం జరిగిందో నాకు అస్సలు తెలీలేదు. మా నాన్న నేను వెనక్కి జారీ పడిపోయానని చెపితే విషయం అర్థమైంది. ఆ ఘటనలో నా వీపుపై ఉన్న బ్యాగు ముందుగా రోడ్డుకు ఆనడంతో నా తలకు గాయం కాలేదు. అలా కాకుంటే చాలా దారుణం జరిగేది. మా నాన్న బ్యాగు ఎందుకు తీసుకోనన్నారో నాకు అప్పుడు అర్థమైంది. సమయానికి బాబానే బ్యాగు తీసుకోకుండా ఉండేలా నాన్నకు ప్రేరణనిచ్చి నన్ను, నాన్నని కాపాడారని కూడా అర్థమైంది.
ఇంకా జెఈఈ పరీక్షకి కొన్ని రోజులు ఉందనగా మాకు మాక్ టెస్టులు నిర్వహించారు. అవి నేను బాగానే రాసాను. కానీ ఆ పరీక్షలు వ్రాసేటప్పుడు నాకు చాలా భయమేసేది. పరీక్ష అంటే భయపడేదాన్ని. కాళ్ళుచేతులు చెమటలు పట్టేవి. దాంతో నేను ఎక్కడ భయంతో పరీక్షలో ఏడుస్తానో అని మా అమ్మ చాలా భయపడింది. ఇక జెఈఈ పరీక్షల ముందురోజు నేను ఒక మాక్ టెస్ట్ ఆన్సర్ చేస్తుంటే అందులో చాలా ఈజీ బిట్ ఒకటి నాకు రాలేదు. అప్పుడు నేను, 'రేపు పరీక్షలో ఇలా జరుగుతుందేమో!' అని చాలా భయపడి ఏడ్చాను. అప్పుడు మా అమ్మ నాతో, "నువ్వు రేపు పడాల్సిన బాధని బాబా ఇప్పుడే నీకు ఇచ్చేసారు. నువ్వు రేపు పరీక్ష బాగా రాస్తావు" అని అంది. నేను అమ్మ ద్వారా బాబా నన్ను సమాధానపరిచారని అనుకున్నాను. పరీక్ష జరిగేరోజు పొద్దున్న నేను దేవుని దగ్గర దీపం పెడుతున్నప్పుడు అగరబత్తీ తగిలి మా ఇంట్లో ఉన్న బాబా విగ్రహంకి తొడిగి ఉన్న వస్త్రం కాలింది. అలా జరిగినందుకు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు అమ్మ, "బాబా నిన్ను బట్టలు కొని ఇవ్వమని అడుగుతున్నారు. బాబాకి కొత్త బట్టలు కొందాం" అని అంది. అమ్మ ద్వారా బాబానే అలా చెప్పారని నన్ను నేను సద్దిచెప్పుకున్నాను. తరువాత, "బాబా! నాతో రా, దగ్గరుండి నువ్వే నాతో పరీక్ష వ్రాయించు" అని చెప్పుకొని పరీక్షకి వెళ్ళాను. మాములుగా పరీక్షల్లో భయపడే నేను ఆరోజు అస్సలు భయపడకపోవడం విశేషం. కానీ అదే సమయంలో మా అమ్మ నేను మాములుగా పడే బాధకంటే రెండింతలు భయపడిందని మా నాన్న చెప్పారు. అప్పుడు నేను, 'బాబా నేను పడాల్సిన భయాన్ని మా అమ్మకి ఇచ్చి నాకు సహాయం చేసార'ని అనుకున్నాను. బాబా దయవల్ల నేను జెఈఈ మైన్స్ పరీక్ష బాగానే రాసాను. "ధన్యవాదాలు బాబా".
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
బాధను తీసేసి ఆనందంగా తిరిగి పంపిన బాబా
నా పేరు సరిత. సాయి కృపవల్ల కరోనా 2వ వేవ్కి ముందు 2021, జనవరిలో మేము శిరిడీ వెళ్ళాము. మేము ట్రైన్ ఎక్కాక 5 ఏళ్ల లోపు పిల్లల్ని మందిరంలోకి అనుమతించడం లేదని మాకు తెలిసింది. అప్పుడు మా పాపకి 3 సంవత్సరాలు. అందువల్ల తనకి బాబా దర్శనం కాలేదు. నేను చాలా బాధపడ్డాను. మరుసటిరోజు త్రయంబకేశ్వరం వెళ్లి కొన్ని ఆలయాలు సందర్శించి వచ్చాము. ఆ మరుసటిరోజు సాయంత్రం 5 గంటలకు మా తిరుగు ప్రయాణానికి ట్రైన్ ఉండగా ఆరోజు ఉదయం చావడి దగ్గర షాపింగ్ చేస్తూ సమాధి మందిరంకి దగ్గరగా వెళ్ళాం. ఆ సమయంలో నేను నా పాపకి బాబా దర్శనం కాలేదని చాలా బాధపడుతూ ఉండగా ఒక చోట కొంతమంది లైన్ కట్టి లోపలికి వెళ్తున్నారు. మేము అదేదో గుడి అనుకోని వెళ్లి ఆ లైన్లో నిల్చున్నాము. తీరా లోపలికి వెళ్తే దూరంగా సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఆది సాయిబాబా సమాధి మందిరమే. అలా బాబా నా పాపకి దర్శనం ఇచ్చారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఆనందంలో మేము తిరుగు ప్రయాణమయ్యాము. "ధన్యవాదాలు బాబా".

