1. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు
2. ఎనలేని దయచూపే సాయితండ్రి
బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు
నేను డా.సుచరిత. నేను సాయిభక్తురాలిని. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. అపారమైన విశ్వాసం, సహనం భక్తులను సరైన మార్గంలో నడిపిస్తాయి. నేను కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాలా తీవ్రమైనవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. "బాబా! ఈ అనుభవాన్ని వివరించడంలో ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి".
నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో మా అమ్మకి కరోనా వచ్చి తగ్గాక అమ్మ పరిస్థితి విషమించిందని, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకి డయాలసిస్ చేయాల్సి వచ్చిందని, ఆ క్రమంలో ఆమె ప్రాణానికి ముప్పు ఉందని డాక్టరు చెప్పారని పంచుకున్నాను. అయితే బాబా అనుగ్రహం వల్ల అమ్మకి సుమారు 60 సార్లు డయాలసిస్ చేసినప్పటికీ ఏ సమస్యా రాలేదు. అంతేకాదు ఆయన ఆశీస్సులతో ఆ సమస్య పరిష్కారమైంది కూడా. ఇది సుమారు 15 నెలల కిందటి మాట. తరువాత అప్పుడప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుండటం వలన అమ్మ ఇబ్బందిపడుతుంది. ఇలా ఉండగా 2022లో మా నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు ఘనంగా చేద్దామని నేను, మా అక్క, అన్నయ్య అనుకున్నాము. సరిగ్గా అదే సమయంలో 'అమ్మకి గుండె సంబంధిత సమస్య ఉందని, వెంటనే చికిత్స చేయించాలి, కానీ రిస్క్ ఎక్కువగా ఉంది' అని డాక్టరు అన్నారు. మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! నాన్న పుట్టినరోజు వేడుక బాగా జరగాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణించి కార్డియాలజిస్టు డాక్టరు, "తొందరేమీ లేదు, పుట్టినరోజు వేడుకయ్యాకే గుండె చికిత్స పెట్టకుందాం" అన్నారు. మేము ఎంతో సంతోషంగా వేడుక పనులు మొదలుపెట్టాము. అయితే పుట్టినరోజునాడు అంబులెన్సులో అమ్మని ఇంటికి తీసుకొస్తుంటే అమ్మ స్పృహ కోల్పోయింది. ఫస్ట్ ఎయిడ్ చేసారు. అప్పుడు నేను మనసులో బాబాను ప్రార్థించాక అమ్మ హుషారుగా అయింది. ఫంక్షన్ మేము కోరుకున్నట్టుగా బాగానే జరిగింది. అంతా బాబా దయ.
నేను చాలారోజుల క్రితం కాలినడకన తిరుమల కొండ ఎక్కుతానని మ్రొక్కుకున్నాను. ఐతే కోవిడ్ విజృంభన, ఆ తరువాత మా అమ్మనాన్నల ఆరోగ్యం బాగా లేకపోవడం, మరికొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నా తిరుపతి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. పైగా కోవిడ్ సమయంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల నేను, మా పిల్లలు చాలా బరువు పెరిగాము(బరువు పెరగడం వల్ల ఎన్ని సమస్యలో మన అందరికి తెలిసిందే). ఆ స్థితిలో నేను నడవగలనో, లేదో నా శరీరం సహకరిస్తుందో, లేదో అని చాలా భయపడాను. కానీ బాబా మా ఇంటిపైన జిమ్ పెట్టుకునేలా ఆలోచననిచ్చి నేను, మా బాబు బరువు తగ్గేందుకు సహాయం చేసారు. ఇక బాబా ఆశీస్సులతో నేను అలిపిరి నుంచి కాలినడకన కొండెక్కి నా మొక్కు తీర్చుకున్నాను. ధన్యవాదాలు బాబా.
మా పిల్లల పరీక్షకి ముందురోజు కరెంట్ పోయింది. దాంతో బాబు, నేను సరిగా రివిజన్ చేసుకోలేకపోతున్నానని బాధపడ్డాడు. అప్పుడు నేను బాబాని వేడుకోగానే కరెంట్ వచ్చింది.
మా పెద్దబాబు చాలా బాగా చదివేవాడు. కానీ యుక్తవయసు వచ్చాక తను ఎక్కువ సమయం తన ఫ్రెండ్స్ తో గడుపుతుండేవాడు. నేను ఆ ప్రభావం బాబు చదువుపై పడకూడదని బాబాని వేడుకోని తను పరీక్షకి వెళ్లేముందు తనకి బాబా ఊదీ పెట్టి పంపేదాన్ని. బాబా దయతో బాబుకి ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు వచ్చేలా అనుగ్రహించారు.
ఒకసారి మా బావ, పెళ్లికి కొనిపెట్టిన మా అక్క నగలు కనిపించకుండా పోయాయి. అక్క వాటికోసం ఇల్లంతా ఎంత వెతికినా కనిపించలేదు. ఇక ఆ నగలు పోయినట్లే అనుకున్నారు. అప్పుడు నేను, "బాబా! అక్క నగలు దొరికితే అన్నదానం చేస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత అక్కవాళ్ళు కొత్త ఇంటిలోకి మారారు. అప్పుడొక రోజు బాబా దయవల్ల ఆ నగలు మందుల డబ్బాలో దొరికాయి. ఇంకా బాబా ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా. నా అనుభవాలను ఆలస్యంగా పంచుకున్నందుకు మరియు మా తప్పులన్నింటికీ క్షమాపణ వేడుకుంటున్నాను బాబా. మళ్లీ మళ్లీ ఆ తప్పులు చేయను బాబా. మీ మీద భక్తివిశ్వాసాలు పెంపొందేలా మమ్మల్ని అనుగ్రహించి సన్మార్గంలో నడిపించండి బాబా. భక్తులందరినీ ఆశీర్వదించండి. మా సమస్యలకు ముగింపు ఇవ్వండి బాబా. దయచేసి ఎప్పుడూ మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టకండి"
శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
ఎనలేని దయచూపే సాయితండ్రి
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నేను సాయి భక్తురాలిని. నాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సాయి ఆనతితోనే జరుగుతుందని నా నమ్మకం. నా కుటుంబం మరియు నాకు సంబందించిన వారి మీద నా సాయితండ్రి ఎనలేని దయ చూపుతున్నారు. 2022, సెప్టెంబర్ నెల చివరిలో మా పాపకు జ్వరం వచ్చింది. మావారు ఇంగ్లీష్ మందులు వాడనివ్వరు. అందుచేత ఆయుర్వేద మందులు వాడతాము. అయితే మూడురోజులైనా తగ్గలేదు. ఇంకా నేను బాబాను శరణువేడి, "బాబా! మీరే నా పాపను కాపాడాలి. తనకి ఎలాగైనా జ్వరం తగ్గేలా అనుగ్రహించు తండ్రి" అని వేడుకున్నాను. ఆయన దయతో మరుసటిరోజుకి పాప జ్వరం అదుపులోకి వచ్చి ఒక్క వారంలో మామూలు అయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
ఈమధ్య తమ్ముడు ప్రసాద్ వాళ్ళ అన్నయ్యకు థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ అయింది. ఆ సమయంలో నేను 'బాబా దయవల్ల అతను క్షేమంగా ఇంటికి వస్తే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అతను హాస్పిటల్లో ఉన్న సమయంలో వాళ్ళ నలుగురు పిల్లల్ని మావారు స్కూల్లో దించారు. మావారు విసుక్కోకుండా బాధ్యతగా ఆ పని చేయాలని నేను బాబా దగ్గర చెప్పుకున్నాను. ఎందుకంటే, ఆ పిల్లలు చదివే స్కూలు, మా ఇద్దరు పిల్లలు చదివే స్కూలు ఒక్కటి కాదు. బాబా దయవల్ల మావారు ఎటువంటి ఇబ్బందిపడకుండా ఆ వారం రోజులు పిల్లల్ని వాళ్ళవాళ్ళ స్కూళ్లలో దింపి, తిరిగి తీసుకొచ్చారు. ఆ వారంలోనే ప్రసాద్ చిన్నకొడుకు మరియు అతని మేనకోడలు పుట్టినరోజులు వచ్చాయి. ప్రసాద్, తన అన్నయ్య హాస్పిటల్లో ఉన్నందున, ఆ పిల్లల చేత కేక్ కట్ చేయించాలని నా మనసుకి అనిపించింది. కానీ ఆ మాట మావారితో అంటే ఏమంటారో అని భయమేసి, "ఎలాగైనా నా కోరిక తీర్చమ"ని బాబాకి చెప్పుకున్నాను. ఆయన దయతో మావారికి పిల్లల పుట్టిన రోజుల గురించి తెలిసి తనంతటతానే, "వాళ్ళతో కేక్ కట్ చేయిద్దామా?" అని అన్నారు. అలా బాబా దయవల్ల పిల్లలిద్దరి పుట్టినరోజులు బాగా జరిగాయి. బాబు పుట్టినరోజునాడు మేము తమ్ముడు వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసాము. ఆరోజు చాలా సంతోషంగా గడిచింది. ఆ తరువాత ప్రసాద్ వాళ్ల అన్నయ్యను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. ఆరోజు మా సార్ తన పర్సనల్ పని వదులుకుని వాళ్ళను కారులో హైదరాబాద్ నుండి నల్గొండకి తీసుకొచ్చారు. వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చి 2022, అక్టోబర్ 7, శుక్రవారం ఆయన తిరిగి ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యారు. నేను కోరుకున్నట్లే అంతా జరిపించారు నా బాబా తండ్రి.
విజయదశమి రోజున మధ్యాహ్నం 2:15కి మేము నకిరేకల్లోని బాబా గుడికి వెళ్లి కొంచెంసేపు నామ సప్తాహంలో పాల్గొన్నాము. తరువాత బాబా దర్శనం చేసుకుందామంటే 'కిందనుండే చేసుకోవాలి. పైకి ఎక్కి బాబాని తాకడానికి లేదు. సాయంత్రం 4 తరువాత అయితే బాబాని తాకనిస్తాము' అని అన్నారు. అయితే అదేరోజు తమ్ముడు ప్రసాద్ వాళ్ళు మమ్మల్ని డిన్నర్కి పిలిచారు. గుడిలో ఎక్కువసేపు ఉంటే వాళ్ళింటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందేమోనని, "బాబా! ఎలాగైనా మీ దర్శనాన్ని అనుగ్రహించు తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల అందరూ వెళ్ళిపోయాక మమ్మల్ని పైకి ఎక్కనిచ్చి బాబాను తాకనిచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. తరువాత తమ్ముని వాళ్ళింటికి వెళ్లి డిన్నర్ చేసాం. మరుసటిరోజు వాళ్ళను మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి పిలిచాము. వాళ్ళు మొత్తం 12 మంది. మేము నలుగురం. అంటే మొత్తం 16 మందికి నేను భోజనాలు తయారు చేయాల్సి వచ్చింది. అంత మందికి వంట చేయటం నాకు అదే మొదటిసారి. అయినప్పటికీ బాబా దయవల్ల ఏ ఇబ్బందీ కలగలేదు. వాళ్ళు కొంచెం ఆలస్యంగా వచ్చారు. మావారికి కొంచం కోపం వచ్చింది కానీ బాబా దయవల్ల చాలా సంతోషంగా గడిపాము. అలా ఎప్పటినుండో ప్రసాద్ వాళ్ళ కుటుంబాన్ని లంచ్కి పిలవాలన్న నా కోరిక ఆ గురువారంనాడు నెరవేరింది. ఇలాగే ఎప్పుడూ మాపై దయ చూపాలని, ఇంకా ఎన్నో అనుభవాలు మీతో పంచుకోవాలని బాబాను కోరుకుంటున్నాను.

