సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 377వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదకొండవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేను సాయిబాబాను పూజించటం మా అమ్మగారికి ఇష్టముండేదికాదు. రాత్రిపూట భోజనాలయ్యాక నేను, అన్నయ్య, అమ్మ కలసి కూర్చునేవాళ్ళం. ఆ సమయంలో నేను సాధు సత్పురుషుల చరిత్రలు చదువుతుంటే అమ్మ ప్రేమతో వింటూండేవారు. అయితే ఆవిడకు భక్తుల పేదరికపు జీవితం నచ్చేదికాదు. పేదరికం అనేది ఈశ్వరుడి కరుణకు లక్షణం కాదనీ, భక్తిమార్గంలో వ్యాకులత చెందుతూ పేదరికాన్ని కోరుకుంటూండటం కాక, తమ ఉద్యోగ ధర్మాన్నీ, కర్తవ్య నిర్వహణనూ చేస్తూ భగవంతుడి స్మరణ చేయాలని ఆవిడ భావించేది. ఒకసారి ఆమె నాతో, “నీ పూజలు వ్యర్థం. నీ మొహంలో ప్రతిఫలించే వర్చస్సు ఏమయిపోయిందో? నీ మొహం విచారంగా ఉంటోంది, నువ్వు ఖిన్నుడవైనట్లు కనిపిస్తున్నావు" అన్నారు. తరువాత ఆవిడ హాల్లో పెట్టిన శ్రీసాయిబాబా ఫోటోని తీసి దాచేసింది.

పైన చెప్పిన సంఘటన జరగకముందు నాన్నగారు ధంధుకా వెళ్ళి ఉన్నారు. అక్కడ బాగా జబ్బుపడటం వల్ల మోతా గ్రామం వెళ్ళి అక్కడ వారు పరమపదించారు. నాన్నగారి అస్వస్థత కారణంగా మా అమ్మగారు మోతా గ్రామం వెళ్ళి నాన్నగారి మరణానంతరం అక్కడే ఉండిపోయారు. మేము కూడా వైద్యగారి బంగళా ఖాళీ చేసి, రెండు గదుల అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టాం. కొద్దిరోజుల తరువాత అక్కడ ఉండటానికి మా పెద్దక్క, బావగారూ వచ్చారు. అక్కడ నాకు మంచి ఆధ్యాత్మికోన్నతి కలిగింది. నా నిత్యపూజలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీదాసగణు గారి నాలుగు అధ్యాయాల పఠనం ఉండేది. ఇంట్లో నాలాగా మరాఠీ అర్థం చేసుకొనేవారెవరూ లేరు. నా మరాఠీ కూడా అంతంత మాత్రమే. మా తమ్ముడు వైకుంఠ్‌కి నా మీద చాలా గౌరవం ఉండి, నేను చేసే పనులంటే అభిరుచి ఉండేది. శ్రీదాసగణుగారి నాలుగు అధ్యాయాల గురించి నేను ప్రశంసాపూర్వకంగా చెప్తే, అది గుజరాతీలో ఉంటే బాగుండుననుకొనేవాడు అతను. తన మనశ్శాంతి కోసం నా సలహాలను పాటించి, నా మాటలు ప్రేమపూర్వకంగా స్వీకరించేవాడు. అతను కోరుకున్నదాన్ని అతనికి ప్రసాదింపచేసే ఒక కావ్యాన్ని నేనతనికి ఇచ్చాను. దాని రెండో కాపీ నా వద్ద ఇప్పుడు లేదు. మా అక్క, తమ్ముళ్ళకోసం ఆరతులను గుజరాతీలోకి అనువదించాను. వైకుంఠ్ ప్రతిరోజూ ఈ పద్యానువాదాలను చదివేవాడు. వాడికి అవి కంఠస్తమైపోయాయి.

ఒకసారి బాబా నా స్వప్నంలో దర్శనమిచ్చారు. అందులో వారు తమ మహాసమాధికి సిద్ధమవుతున్నట్లు అనిపించింది. అందుకని నేను ఆదివారంనాడు వారి దర్శనం చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఒక శనివారంనాడు ముంబాయి నుండి బయలుదేరి శిరిడీ వెళ్ళాను. ఆరోజు సాయంత్రం నాలుగ్గంటలకి తిరిగి ప్రయాణానికి బాబా వద్ద అనుమతి తీసుకొనేటప్పుడు, “బాబా వెళ్ళిపోయాక ఈశ్వరుడి దర్శనం నాకు ఎవరు ప్రసాదిస్తార”నే విచారం నా మనస్సులో కలిగింది. అప్పుడు బాబా, "భగవంతుడే యజమాని. ఆయన అంతా మంచే చేస్తారు” అని మాత్రం అన్నారు. వారన్న ఆ మాటకి నేను పూర్తిగా సంతృప్తి చెందానని కాదు కానీ, నేనేం జవాబు చెప్పగలను? అందుకే మౌనంగా ఉండిపోయాను. బాబా నాకు ఊదీ ఇచ్చారు. అది తీసుకొని నేను బయలుదేరి మర్నాడు ఆఫీసులో హాజరయ్యాను.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo